-
వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులకు భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో ఉన్న యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు మినిమమ్ టైం స్కేల్ (ఎంటీఎస్) అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. కె.హేమచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరంలేదని, దీనిపై మంత్రుల బృందం చర్చిస్తోందని తెలిపారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం ఆయనతోపాటు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) సతీష్చంద్ర మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం 2019 ఎన్నికల వేళ ఇచ్చిన జీఓ–24లోని అంశాల్లో నెలకొన్న గందరగోళంతోనే వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులకు ఎంటీఎస్ అమలులో జాప్యం జరుగుతోందని హేమచంద్రారెడ్డి వివరించారు. కాంట్రాక్టు అధ్యాపకులను మభ్యపెట్టేందుకే ఆ సర్కారు జీఓ 24ను ఇచ్చిందన్నారు. అంతేకాక.. ‘గత ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కాంట్రాక్టు అధ్యాపకుల గురించి అస్సలు పట్టించుకోలేదు. 2015 సవరించిన పే స్కేల్స్ ప్రకారం కాంట్రాక్టు అధ్యాపకులకు ఎంటీఎస్ ఇవ్వాలని జీఓలో పేర్కొనడంవల్లే వారికి దాని అమలులో ఆటంకం ఏర్పడింది. వర్సిటీ అధ్యాపకులకు రాష్ట్ర రివైజ్డ్ పే స్కేళ్లు వర్తించవు. వారికి యూజీసీ రివైజ్డ్ పే స్కేళ్లు వర్తిస్తాయి. అయినా.. నాటి ప్రభుత్వం అవేవీ పట్టించుకోకుండా జీఓ ఇచ్చింది’.. అని హేమచంద్రారెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో.. కాంట్రాక్టు అధ్యాపకులకు ఎంటీఎస్ ఎలా వర్తింపజేయాలనే దానిపై ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుత ప్రభుత్వం జీఓ–40 తీసుకొచ్చిందన్నారు. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఎంటీఎస్ సక్రమంగా అమలుచేస్తున్నప్పటికీ యూనివర్సిటీ స్థాయిలో అమలుచేయడం లేదంటూ వస్తున్న వార్తలలో వాస్తవంలేదని ఆయన కొట్టిపారేశారు. గతంలో యూనివర్సిటీల్లో జరిగిన నియామకాల్లో ఒక క్రమపద్ధతి పాటించకపోవడంవల్లే ఇప్పుడు సమస్యలు తలెత్తున్నాయన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, ఆర్థికశాఖ అనుమతిలేకుండా నియామకాలు చేశారని.. కనీసం నోటిఫికేషన్ ఇవ్వడం, రిజర్వేషన్లను, రోస్టర్ పాయింట్లను పాటించడం వంటి నిబంధనలు పట్టించుకోలేదన్నారు. ఇక రాష్ట్రంలోని 16 యూనివర్సిటీల్లో ప్రస్తుతం 2,100 కాంట్రాక్టు అధ్యాపకులు ప్రస్తుతం పనిచేస్తున్నారని.. వీరిలో నిబంధనల ప్రకారం నియమితులైన వారెంతమంది? నోటిఫికేషన్ లేకుండా నియమితులైన వారెంతమంది అన్నదానిపై వర్సిటీల్లో స్పష్టతలేకపోవడం ఎంటీఎస్ అమలుకు ఆటంకంగా ఉందన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు అధ్యాపకుల నియామకాలు నిబంధనల ప్రకారం జరుగుతున్నాయని, వర్సిటీల్లో అలా జరగకపోవడంవల్ల ఇబ్బంది అవుతోందని హేమచంద్రారెడ్డి వివరించారు. ‘అయినప్పటికీ కొన్ని వర్సిటీల్లో కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాలు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదికవి నన్నయ్య, జేఎన్టీయూ (కాకినాడ), జేఎన్టీయూ (అనంతపురం), శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీల్లో కాంట్రాక్టు అధ్యాపకులకు ఇప్పటికే 40వేల వరకూ వేతనాలు పెంచాం. అన్నిచోట్ల ఒకే విధంగా వేతనం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన తెలిపారు. కేసులతోనే ఎంటీఎస్ అమలులో సమస్యలు ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర మాట్లాడుతూ.. కనీస టైం స్కేల్ అమలు విషయంలో కొన్ని వర్సిటీల్లోని కొంతమంది ఉద్యోగులు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోందన్నారు. ఇటీవల ఎయిడెడ్ కాలేజీల్లోని ఎయిడెడ్ సిబ్బందిని వర్సిటీల్లో నియమించడం ద్వారా వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులను తొలగిస్తారంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని సూచించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఏ ఒక్క కాంటాక్టు అధ్యాపకుడినీ, ఉద్యోగినీ ప్రభుత్వం తొలగించబోదని ఆయన స్పష్టంచేశారు. ఎయిడెడ్ అధ్యాపకులు 700–800 మంది ఉన్నారని, వారిలో 300 మంది మాత్రమే యూనివర్సిటీలకు అర్హత కలిగి ఉన్నారని తెలిపారు. వారిని నియమించినా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించబోమన్నారు. వచ్చే ఏడాది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం ఇక ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ప్రకారం.. వచ్చే ఏడాది ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వం 2000 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేయనుందని సతీష్చంద్ర వెల్లడించారు. వర్సిటీ కాంట్రాకు అధ్యాపకులకు ఇది మంచి అవకాశమన్నారు. ఏపీపీఎస్సీ రాతపరీక్ష ద్వారా ఈ నియామకాలు జరుగుతాయని చెప్పారు. నిజానికి.. కాంట్రాక్టు అధ్యాపకులను, ఉద్యోగులను రెగ్యులర్ చేసే అధికారం రాష్ట్రాలకులేదని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పులిచ్చిందని ఆయన చెప్పారు. అంతేకాక.. 1994లో తెచ్చిన చట్టం ప్రకారం కూడా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే అవకాశంలేదన్నారు. గతంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరిగేది కాదని.. ప్రస్తుత ప్రభుత్వం వారికి అనేక రకాలుగా మేలు చేస్తోందని సతీష్చంద్ర వివరించారు. అప్పట్లో ఏజెన్సీల ద్వారా జరిగే నియామకాల్లో అవినీతి జరిగేదని, జీతాలు కూడా కోతపెట్టేవారని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం అవుట్ సోర్సింగ్కు కార్పొరేషన్ను (ఆప్కాస్) ఏర్పాటుచేసి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐతో కూడిన వేతనాలను సమయానికి ఇస్తోందన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధ్యత ప్రభుత్వానిదేనని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని సతీష్చంద్ర భరోసా ఇచ్చారు. -
ప్రభుత్వం అనుమతిస్తేనే బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలు ప్రభుత్వం ఆమోదిస్తేనే చేపడతామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఇంటర్ విద్యా కమిషనరేట్లో బోర్డు విద్యా కమిషనర్ అశోక్ మాట్లాడారు. అలాగే విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. లెక్చరర్ల సాధారణ బదిలీల కారణంగా ఇబ్బందిపడ్డ 292 మందికి బదిలీలు నిర్వహించామని, మిగతా వారూ బదిలీలు కావాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాశామని.. ప్రభు త్వ నిర్ణయం వెలువడాల్సి ఉందని చెప్పారు. గతే డాది ఇంటర్ ఫస్టియర్లో 94 వేలమంది చేరగా.. ఈసారి ఇప్పటివరకు92 వేల మంది వరకు చేరినట్లు తెలిపారు. ప్రవేశాల్లో విద్యార్థులు సంఖ్య తగ్గలేదని వెల్లడించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1.81 లక్షలమంది విద్యార్థులకు ఆగస్టు 15నాటికి మధ్యాహ్న భోజనం అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్య లు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భోజనం తీసుకురావడం, వడ్డించడం, విద్యార్థులు తిన్నాక శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలను మొత్తంగా గంటలో పూర్తిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 3న అక్షయపాత్ర ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం ఉందని, ఏయే వంటలను ఏ రోజుల్లో అందించాలన్న దానిపై స్పష్టత వస్తుందని వివరించారు. దరఖాస్తు చేసుకుంది 20 హాస్టళ్లే.. జూనియర్ కాలేజీల్లో హాస్టళ్లను నిర్వహిస్తున్న 600 కాలేజీల్లో ఇప్పటివరకు 20 కాలేజీలు మాత్రమే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయని అశోక్ తెలిపారు. హాస్టల్ నిర్వహిస్తున్న ప్రతి కాలేజీ దరఖాస్తు చేసుకొని అనుమతి తీసుకోవాల్సిందేనని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు 63 కాలేజీలు ఫైర్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా లేవని, అవన్నీ ఆయా కాలేజీలను మరో భవనాల్లోకి మార్చుకోవాల్సిందేనని చెప్పారు. జూనియర్ కాలేజీల్లో ఆన్లైన్ ప్రవేశాలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ఆదేశాలిస్తే వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామని వెల్లడించారు. ఆగస్టు నుంచి జేఈఈ, నీట్ శిక్షణ.. రాష్ట్రంలోని కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు వచ్చే నెల నుంచి జేఈఈ, నీట్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అశోక్ పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఒక జూనియర్ కాలేజీని ఎంపిక చేసి, అందులో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇంటర్ ఫస్టియర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను (జేఈఈకి 50 మంది లేదా 30 మంది, నీట్కు 50 మంది లేదా 30 మంది) ఎంపిక చేసి శిక్షణ ప్రారంభిస్తామని చెప్పారు. వారికి అక్కడే నివాస వసతి కల్పించనున్నట్లు వెల్లడించారు. -
ఉండేనా..? ఊడేనా..?
ఇన్నాళ్లూ వారు చాలీచాలని వేతనాలతోనే పనిచేశారు. ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఎన్నాళ్లకైనా ప్రభుత్వం స్పందించకపోతుందా..? తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరణ కాకపోతాయా..? అని ఎదురుచూశారు. రెగ్యులర్ సంగతి దేవుడెరుగు.. అసలు వారి ఉద్యోగాలకే ఎసరు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది శాతవాహన యూనివర్సిటీతోపాటు.. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు జేఎన్టీ యూ, పెద్దపల్లి జిల్లా మంథనిలోని జేఎన్టీయూ వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు శరాఘాతంలా మారింది. – శాతవాహనయూనివర్సిటీ శాతవాహనయూనివర్సిటీ: ప్రభుత్వం జీతం పెంచిందని సంబరపడాలా..? త్వరలో నోటిఫికేషన్ వస్తే ఉద్యోగాలకే ఎసరు వస్తుందా..? అని బాధపడాలా తెలియని సందిగ్ధంలో శాతవాహన, కొండగట్టు, మం థని జేఎన్టీయూ యూనివర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకులు మగ్గిపోతున్నారు. తెలంగాణ ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 11 యూనివర్సిటీల్లో పనిచేసే ఒప్పంద అధ్యాపకుకు వేతనాలు 75 శాతం పెంచుతూ ఈనెల 18న విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వీరితోపాటు తాత్కాలిక (పార్ట్టైం) అధ్యాపకులకూ వేతనాలు పెంచారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీల్లో 1,061 పోస్టులు భర్తీచేయడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ పక్రియకు ఇన్నిరోజులు రిజర్వేషన్ ఎలా ఉండాలో అనే దానిపై కసరత్తు చేసి.. చివరకు పాత పద్ధతిలోనే యూనివర్సిటీల వారీగా రోస్టర్/రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం వర్సిటీలకు స్పష్టం చేసింది. దీంతో అన్ని వర్సిటీలతోపాటు శాతవాహనలో ఖాళీగా ఉన్న 40 పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. సంబంధిత నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ వస్తే ఇందులో ఎంతమంది ఉ ద్యోగాలు ఉంటాయో..? ఎన్ని ఊడుతాయో..? తెలియని అ యోమయ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం జీతాలు పెంచిందని సంబరపడేలోపే నోటిఫికేషన్ రూపంలో తమ ఉద్యోగాలకే ఎసరురాబోతోందని పలువురు కాంట్రాక్టు అధ్యాపకులు కలవరపడుతున్నారు. యూనివర్సిటీలు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ పక్రియ జరిగిన తర్వాత ప్రస్తుతం ఉన్న కాంట్రా క్టు, పార్ట్టైం అధ్యాపకుల్లో కొంతమందైనా తమ ఉద్యోగాలకు దూరంకావాల్సిందేనని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. 75 శాతం పెరిగిన వేతనాలు యూనివర్సిటీలో కాంట్రాక్టు, పార్ట్టైం అధ్యాపకుల వేతనాలు 75 శాతం పెరిగాయి. దీని ప్రకారం నెట్, స్లెట్, పీహెచ్డీ లేని వారికి ప్రస్తుతం రూ.21,600 చెల్లిస్తుండగా తాజాగా రూ.37,800 పెరుగనుంది. ఆయా విద్యార్హతలున్న అధ్యాపకులకు ఇప్పుడు రూ.24,840 ఇస్తుండగా అది రూ.43,470కు చేరుకుంది. దీనికి తోడు ఏడాది సర్వీస్కు 3 శాతం చొప్పున అదనంగా చెల్లింపులు చేస్తారు. తాత్కాలిక అధ్యాపకులకు ప్రస్తుతం బోధనకు గంటకు రూ.475, ప్రయోగ పరీక్షలకు రూ.220 చెల్లిస్తున్నారు. ఇక నుండి పీహెచ్డీ/నెట్/స్లెట్ లేనివారికి గంట బోధనకు రూ. 600, ప్రయోగాలకు రూ.300 చెల్లిసారు. ఈ అర్హతలున్నవారికి బోధనకు రూ.700, ప్రయోగాలకు రూ.350 చెల్లిస్తారు. ప్రభుత్వం తీసుకున్న జీతాల పెంపు నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 1553 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 560 తాత్కాలిక అధ్యాపకులు లబ్ధిపొందనున్నారు. శాతవాహనలో 45 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 16 మంది పార్ట్టైం అధ్యాపకులు లబ్ధి పొందనున్నారు. శాతవాహనలో 40 పోస్టుల భర్తీ శాతవాహనలోని వివిధ విభాగాల్లో 40 పోస్టులు భర్తీకానున్నాయి. ఇందులో 9 మంది ప్రొఫెసర్, 16అసోసియేట్ ప్రొఫెసర్, 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో డిపార్ట్మెంట్ల వారీగా ఫార్మసీలో 3 ప్రొఫెసర్, 4 అసోసియేట్ ప్రొఫెసర్, 11 అసిస్టెంట్ ప్రొఫెసర్, కెమిస్ట్రీలో 2 అసోసియేట్ ప్రొఫెసర్, ఫిజిక్స్లో ఒక ప్రొఫెసర్, 3 అసో సియేట్ ప్రొఫెసర్, ఉర్దూలో ఒక ప్రొఫెసర్, 2 అసోసియేట్ ప్రొఫెసర్, సోషియాలజీలో ఒక ప్రొఫెసర్, 2 అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎకనామిక్స్లో 1 ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, కామర్స్లో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్, బిజినెస్ మేనేజ్మెంట్లో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ కానున్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ శాతవాహన నుంచి త్వరలోనే రానుందని యూనివర్సిటీ అ«ధికారుల ద్వారా తెలిసింది. యూనివర్సిటీ చేపట్టనున్న భర్తీలో ఎంతమంది రెగ్యులర్ ఉద్యోగాలు సాధిస్తారో..? మరెంత మంది తమ కాంట్రాక్టు ఉద్యోగాలు కోల్పోతారో చూడాల్సిందే. క్రమబద్ధీకరించేలా చూడాలి ప్రభుత్వం జీతాలు పెంచడం హర్షణీయం. ఏళ్ల తరబడి ఉ ద్యమాలు చేస్తే జీతాలు పెంచారు. తక్కువ జీతంతో ఇన్నా ళ్లు ఇబ్బందులు పడుతూ నెట్టుకొచ్చాం. ఈ పరిస్థితుల్లో నోటిఫికేషన్ వస్తే మా పరిస్థితి ఏంటీ..? ఇందులో ఎంతమంది రెగ్యులర్ నోటిఫికేషన్లో లబ్ధిపొందుతారో..? ఎంతమందికి నష్టం జరుగుతుందో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పంద అధ్యాపకులకు సర్వీస్ రాటిఫికేషన్ ఇచ్చి.. క్రమబ ద్ధీకరణ చేసేలా ముందుకెళ్లాలి. పెంచిన జీతాలను గతేడాది నవంబర్ నుంచి అమలుచేయాలి. – పెంచాల శ్రీనివాస్, శాతవాహన కాంట్రాక్టు అధ్యాపక సంఘం అధ్యక్షుడు -
75 శాతం పెంపునకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు/ ఔట్సోర్సింగ్ అధ్యాపకుల వేతనాలను 75 శాతం పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. వన్టైమ్ బెనిఫిట్ కింద ఈ మొత్తాన్ని పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంట్రాక్టుల అధ్యాపకుల వేతనాల పెంపు, రెగ్యులర్ నియామకాల నిబంధనలపై వైస్ చాన్స్లర్ల కమిటీ చేసిన సిఫారసులకు ఆమోదం తెలి పింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేర కు నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆమోదం లభించగానే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇక ఏటా 3 శాతం ప్రస్తుతం వర్సిటీల్లో 2 కేటగిరీల కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. నెట్/సెట్/పీహెచ్డీ/ఎంటెక్ వంటి ఉన్నత అర్హతలు ఉన్నవారు ఒక కేటగిరీకాగా.. ఈ అర్హతలు లేనివారు మరో కేటగిరీగా ఉన్నారు. ఉన్నత అర్హతలు లేని వారికి నెలకు రూ.21,600 వేతనం ఇస్తుండగా... ఆయా అర్హతలున్న వారికి రూ. 24,840 చెల్లిస్తున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఈ వేతనాలు 75 శాతం పెరుగుతాయి. దీనితోపాటు ఏటా 3 శాతం చొప్పున వేతనాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన నెట్/సెట్/పీహెచ్డీ/ఎంటెక్ అర్హతలు లేనివారి వేతనం రూ.21,600 నుంచి 75 శాతం పెంపుతో రూ.37,800కి పెరుగుతుంది. దీనికి మొదటి ఏడాది 3 శాతం పెంపు కలుపుకొని.. ఇక నుంచి వారికి రూ.38,930 వేతనంగా అందనుంది. ఇక ఆయా అర్హతలున్న వారి వేతనం రూ.24,840 నుంచి రూ.43,470కి పెరుగుతుంది. దీనికి తొలిఏడాది 3 శాతం పెంపు కలపగా... ఇకనుంచి నెలకు రూ.44,770 వేతనంగా అందుతుంది. అలా ఇప్పటి నుంచి వచ్చే 35 ఏళ్ల వరకు వారికి చెల్లించే వేతనాల వివరాలను వీసీల కమిటీ లెక్కగట్టి ప్రభుత్వానికి అందజేసింది. దాని ప్రకారం 35 ఏళ్ల తర్వాత ఆయా అర్హతలు లేనివారి వేతనం రూ.77,350కు, అర్హతలున్న వారి వేతనం రూ. 88,970కు చేరుతుంది. పోస్టుల భర్తీ నిబంధనలకు ఓకే.. వర్సిటీల్లో 1,061 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన నిబంధనలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో రెగ్యులర్ పోస్టుల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ పోస్టుల భర్తీలో ఇప్పటివరకు కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ పద్దతిన పనిచేసిన వారికి, వారి అనుభవాన్ని బట్టి అదనపు పాయింట్లు (నియామకాల్లో వెయిటేజీ) లభించనున్నాయి. ఇక 1:10 రేషియోలో ఇంటర్వ్యూల విధానానికి కూడా ప్రభుత్వం ఓకే చెప్పినట్లు తెలిసింది. -
కాంట్రాక్టు అధ్యాపకులతో చెలగాటమా ?
♦ ప్రభుత్వంపై మండిపడిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ♦ వివిధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా గుంటూరు ఎడ్యుకేషన్ : కాంట్రాక్టు అధ్యాపకుల జీవితాలతో ప్రభుత్వానికి చెలగాటం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం లక్ష్మీపురంలోని ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ‘కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాల కన్నీటి ఘోష’ పేరుతో నిర్వహించిన రాష్ట్రస్థాయి ధర్నాలో ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. అశోక్బాబు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు రాము సూర్యారావు, వై. శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని హమీ ఇచ్చిన చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్రెడ్డి నెరవేరుస్తారు అధికారంలోకి రాగానే కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన హామీ నెరవేర్చుతారని అప్పిరెడ్డి చెప్పారు. ప్రభుత్వ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీజే గాంధీ మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్ను అమలు పరిచే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులను ఉద్యోగాల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. బాబురెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి సర్వీసు రూల్స్ ద్వారా జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి పొందినప్పటికీ అధ్యాపక నియామకాలకు ఉపాధ్యాయులు ఏనాడూ వ్యతిరేకం కాదని చెప్పారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఉంది: కేఎస్ లక్ష్మణరావు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ పెట్టిందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేశు మాట్లాడుతూ నిత్యం విలువలు వల్లించే చంద్రబాబు అతి పెద్ధ మోసకారి అని విమర్శించారు. ధర్నాలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె. శ్రీనివాస యాదవ్, కోశాధికారి హరినాథ రెడ్డి, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బాజిత్ బాషా, కార్యదర్శి రాంబాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుబ్బారావు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బి. లక్ష్మణరావు, ఎస్ఎఫ్ఐ గరల్స్ వింగ్ జిల్లా కన్వీనర్ జ్యోతి తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement