-
హరియాణా మత ఘర్షణల కేసులపై కమిటీ: సుప్రీం
న్యూఢిల్లీ: సమాజంలో వివిధ వర్గాల మధ్య సామరస్యం, పరస్పర మర్యాదపూర్వక ప్రవర్తన అత్యంత అవసరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విద్వేషపూరిత ప్రసంగాల్ని ఎవరూ అంగీకరించరని పేర్కొంది. హరియాణాలో ఆరుగురు ప్రాణాలను బలిగొన్న మత ఘర్షణలకు సంబంధించి రిజిస్టర్ అయిన కేసుల విచారణకు రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఒక కమిటీ వేయాలని సుప్రీం కోర్టు ప్రతిపాదించింది. హరియాణా సహా వివిధ రాష్ట్రాల్లో ఒక మతం వారిని చంపేయాలంటూ చేసిన విద్వేష పూరిత ప్రసంగాల వల్ల హింస చెలరేగుతోందన్న ఆరోపణలతో దాఖలైన పిటి:షన్లను శుక్రవారం సుప్రీం విచారణ చేపట్టింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టిలతో కూడిన డివిజన్ బెంచ్ ఆగస్టు 18లోగా కమిటీ ఏర్పాటుపై కోర్టుకు సమాచారం ఇవ్వాలని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం. నటరాజ్ను ఆదేశించింది. సమాజంలో వివిధ వర్గాల మధ్య సమరస్యపూర్వక వాతావరణం ఉండాలని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. -
Haryana communal violence: బలగాల్ని దింపండి
న్యూఢిల్లీ: దేశ రాజధాని సమీపంలోని హరియాణాలో మత ఘర్షణలు నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా చూడాలని పోలీసులకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. హరియాణాలో మత ఘర్షణలకు నిరసనగా వీహెచ్పీ, బజరంగ్దళ్ ఢిల్లీలో తలపెట్టిన ర్యాలీలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టీల సుప్రీంకోర్టు ధర్మాసనం పైవిధంగా ఆదేశాలిచ్చింది. నూహ్ జిల్లాలో జలై 31వ తేదీన వీహెచ్పీ ర్యాలీని అడ్డుకునేందుకు వేరే వర్గం వారు రాళ్లు రువ్వడంతో రాష్ట్రంలో చెలరేగిన మత ఘర్షణల్లో ఇప్పటిదాకా ఆరుగురు చనిపోయారు. ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో వీహెచ్పీ ర్యాలీల్లో విద్వేష ప్రసంగాలు జరక్కుండా కట్టడిచేయాలని పాలనా యంత్రాంగానికి సుప్రీంకోర్టు సూచించింది. సున్నితమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసి పర్యవేక్షించాలని, సంబంధిత సీసీటీవీ ఫుటేజీ, వీడియో రికార్డింగ్లను భద్రపరచాలని ఆదేశించింది. ‘ ఢిల్లీని ఆనుకుని ఉన్న హరియాణా, యూపీ ప్రాంతాల్లోనూ ర్యాలీలు జరగొచ్చు. అవసరమైతే అదనపు పోలీసు, పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపండి. ఎలాంటి ఆస్తి నష్టం, హింస జరగకుండా చూడండి. ఏ మతానికి వ్యతిరేకంగానైనా విద్వేష ప్రసంగాలు జరక్కుండా అడ్డుకట్టవేయండి’ అని కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్, హరియాణా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం ఆదేశించింది. ఈ ఉత్తర్వులు పాలనాయంత్రాగాలకు త్వరగా అందేలా చూడాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సూచించింది. ‘విద్వేష ప్రసంగాలు చేసినపుడు ఫిర్యాదు కోసం వేచిచూడకుండా వెంటనే క్రిమినల్ కేసు నమోదుచేయాలని గత ఏడాది అక్టోబర్ 21న ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడూ యథాతథంగా అమలుచేయండి’ అని కోర్టు గుర్తుచేసింది. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిరంతరం యంత్రాంగాలతో సంప్రదించాలని కేంద్రానికి సూచించింది. పలుచోట్ల ర్యాలీలు ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో 23 భారీ ర్యాలీలు చేపడతామన్న వీహెచ్పీ, బజరంగ్దళ్ పిలుపుమేరకు బుధవారం ఢిల్లీలో పలుచోట్ల ర్యాలీలు జరిగాయి. ట్రాఫిక్ స్తంభించింది. సున్నిత ప్రాంతాల్లో పోలీసులు భద్రతను పెంచారు. నిర్మాణ్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద బజరంగ్దళ్ శ్రేణులు హనుమాన్ చాలీసా పఠించారు. వికాస్మార్గ్ ప్రాంతం ముట్టడికి ప్రయత్నించిన వారిని పోలీసులు చెదరగొట్టారు. 116 అరెస్టులు: ఖట్టర్ రాష్ట్రంలో మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటిదాకా 41 ఎఫ్ఐఆర్లు నమోదుచేసి 116 మందిని అరెస్ట్చేశామని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణస్థితికి చేరుకుందన్నారు. లోతైన దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని హరియణా సర్కార్ ఏర్పాటుచేసేపనిలో ఉంది. -
Hate Speech: విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలకు దేశ లౌకిక వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే సామర్థ్యం ఉంటుందని వ్యాఖ్యానించింది. అందుకే విద్వేష ప్రసంగాల విషయంలో ఫిర్యాదులు అందకపోయినా కేసు నమోదు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకు సంబంధించి 2022లో ఇచ్చిన ఆదేశాల పరిధిని పెంచింది. అలాగే విద్వేష ప్రసంగాలపై కేసు నమోదు చేయకుండా ఆలస్యం చేస్తే కోర్టు ధిక్కరణ చర్యగా పరిగణించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కులం, మతం, వర్గంతో సంబంధం లేదని, చట్టాన్ని అతిక్రమించి ఎవరు విద్వేష ప్రసంగాలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. విద్వేషప్రసంగాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని 2022 అక్టోబర్లో ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఈ ఆదేశాలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది. చదవండి: ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. వారిదే నిర్ణయం -
సమాజాన్ని చీలుస్తున్నాయి
న్యూఢిల్లీ: వార్తల ప్రసారంలో పలు చానళ్ల తీరును ఆక్షేపిస్తూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బాధ్యతారాహిత్యంతో అవి సమాజాన్ని చీలుస్తున్నాయంటూ ఆగ్రహించింది. విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేసేలా చూడటంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. విద్వేష ప్రసంగాలు సమాజం పాలిట పెను బెడదగా పరిణమించాయంటూ ఈ సందర్భంగా మండిపడింది. వీటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకట్ట వేయాల్సిందేనని స్పష్టం చేసింది. బాధ్యతారాహిత ప్రసారాలతో సమాజంలో సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించే చానళ్లపై చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘‘మనకు కావాల్సింది సంతులనంతో కూడిన స్వేచ్ఛాయుతమైన మీడియా. కానీ హెచ్చు టీఆర్పీ రేటింగులు సాధించడమే ఈ రోజుల్లో వార్తల కవరేజీకి పరమావధిగా మారింది. అందుకోసం చానళ్లు తమలో తాము పోటీ పడుతూ ప్రతిదాన్నీ సంచలనాత్మంగా మారుస్తున్నాయి. చాలాసార్లు టీవీల్లో లైవ్ చర్చల్లో యాంకర్లు తామే సమస్యలో భాగంగా మారిపోతున్నారు. ప్యానల్లోని వ్యక్తులు మాట్లాడుతుండగానే ఇష్టారాజ్యంగా మ్యూట్ చేస్తున్నారు. వారికి తమ వాదన విన్పించే అవకాశమే ఇవ్వడం లేదు. టీవీ దృశ్య మాద్యమం కావడంతో పత్రికల కంటే చాలా శక్తిమంతమైనది. వీక్షకులను ఎంతో ప్రభావితం చేయగలుగుతుంది. దురదృష్టవశాత్తూ ప్రేక్షకుల్లో చాలామంది పరిణతి ఉన్నవాళ్లు కాదు. టీవీలు చూపించే దృశ్యాలను చూసి రెచ్చిపోకుండా ఉండటం కష్టం. ఈ నేపథ్యంలో పత్రికలకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాదిరిగా టీవీ ప్రసారాల విషయంలో ఎలాంటి నియంత్రణ వ్యవస్థా లేకపోవడం శోచనీయం’’ అంటూ జస్టిస్ జోసెఫ్ ఆందోళన వెలిబుచ్చారు. విద్వేష వ్యాఖ్యల వ్యాప్తి ద్వారా సమస్యలో భాగంగా మారుతున్న టీవీ న్యూస్ యాంకర్లను ప్రసారం నుంచి ఎందుకు తప్పించకూడదని ప్రశ్నించారు. చానళ్లు తీర్పరులుగా మారి విచారణ కూడా జరుపుతున్నాయంటూ ఆక్షేపించారు. ‘‘ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాయి. అతనింకా విచారణ ఎదుర్కొంటున్నాడు. ప్రతివారికీ పరువు ప్రతిష్టలుంటాయి’’ అన్నారు. పోలీసును పొడిచేసినా పట్టించుకోరా! ఢిల్లీలో ఇటీవల ఒక పోలీసు అధికారిని చైన్స్నాచర్ పట్టపగలు అందరి ముందే పొడిచేసినా ఎవరూ పట్టించుకోలేదని ఒక్కరూ అడ్డుకోలేదని జస్టిస్ నాగరత్న ఆవేదన వెలిబుచ్చారు. ‘‘కానీ చానళ్లలో, బయటా మాత్రం ఎవరు ఏమైనా మాట్లాడే పరిస్థితి నెలకొంది. వార్తా చానళ్లు వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా మన దేశంలో వాటిపై ఇప్పటికీ ఎలాంటి నియంత్రణలూ లేవు. భావ ప్రకటన స్వేచ్ఛ గొప్ప బాధ్యతతో కూడుకుని ఉంటుంది. టీవీ చానళ్లు విద్వేష ప్రసంగాల వ్యాప్తికి పాల్పడి కార్యక్రమాల నియమావళిని ఉల్లంఘిస్తే వాటి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవచ్చు’’ అని స్పష్టం చేశారు. ఒకరిపై అలాంటి చర్యలు తీసుకుంటేనే మిగతా వాళ్లంతా దారికొస్తారని జస్టిస్ జోసెఫ్ అభిప్రాయపడ్డారు. గత ఏడాది కాలంలో ఇలాంటి వేలాది ఫిర్యాదులొచ్చాయని, సదరు చానళ్లపై చర్యలు కూడా తీసుకున్నామని న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛ చాలా సున్నితమైన అంశమని ధర్మాసనం పేర్కొంది. దానికి భంగం కలగని రీతిలో చానళ్ల కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. ఈ సమస్య ఇప్పటికే కేంద్రం దృష్టిలో ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ బదులిచ్చారు. విద్వేష ప్రసంగాలకు చెక్ పెట్టేందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కు సవరణలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. సమస్యగా మారొద్దు ‘‘ప్రత్యక్ష ప్రసారాల్లో చర్చలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత యాంకర్దే. యాంకరే సరిగా వ్యవహరించకపోతే భిన్నాభిప్రాయాలను అనుమతించరు. అవతలి వక్తను మ్యూట్ చేయడమో, వారిని అసలు ప్రశ్నలే అడగకపోవడమో చేస్తారు. ఇది పక్షపాతమే. ఇలాంటి సందర్భాల్లో యాంకర్లపై ఎన్నిసార్లు చర్యలు తీసుకున్నారు? సమాజంపై ఎంతో ప్రభావం చూపగల అత్యంత బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నామని మీడియాలోని వ్యక్తులు అర్థం చేసుకోవాలి. సమస్యలో భాగంగా మారి మనసుకు ఏది తోస్తే అది మాట్లాడొద్దు’’ అంటూ ధర్మాసనం హితవు పలికింది. -
తగ్గేదేలే: మస్క్ కొత్త పాలసీ, అలా చేస్తే అంతే!
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విటర్ టేకోవర్ తరువాత వరల్డ్ బిలియనీర్ ఎలాన్ మస్క్ కొత్త పాలసీ విధానాన్ని ప్రకటించారు. కంటెంట్ మోడరేషన్ ప్రణాళికలను వెల్లడించారు. ట్విటర్ పోస్ట్లకు భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది కానీ నెగెటివ్ పోస్టులకు మాత్రం రీచ్ ఉండదని తేల్చి చెప్పారు. విద్వేష పూరిత కంటెంట్ ఉన్న పోస్టులను తాము ప్రోత్సహించమని స్పష్టం చేశారు. (గుడ్న్యూస్,తొలిసారి ట్విటర్లో...మస్క్ క్లారిటీ!) ఫ్రీడం ఆఫ్ స్పీచ్, బట్ నాట్ రీచ్: కొత్త పాలసీ తాజా పాలసీ అప్డేట్లో విద్వేషపూరిత ట్వీట్లు డీబూస్ట్, డీమోనిటైజ్ చేస్తామని మస్క్ తెలిపారు. నెగెటివ్, హేట్ పోస్ట్లను ప్రమోట్ చేయమని, వాటిని మోనిటైజ్ పరిధిలోకి రావని స్పస్టం చేశారు. అలాంటి పోస్టులపై యూజర్లకు ఎలాంటి రెవెన్యూ ఉండబోదని తేల్చారు. అంతేకాదు అడ్వర్టయిజ్మెంట్లను కూడా నియంత్రిస్తామన్నారు. నెగెటివిటీని విస్తరింపజేసే పోస్టులను గుర్తించడానికి ప్రత్యేక వ్యవస్థ ఉందని కూడా మస్క్ పేర్కొన్నారు. యూజర్లు అలాంటి ట్వీట్లను ప్రత్యేకంగా వెతికితే తప్ప దొరకవు అని వెల్లడించారు. New Twitter policy is freedom of speech, but not freedom of reach. Negative/hate tweets will be max deboosted & demonetized, so no ads or other revenue to Twitter. You won’t find the tweet unless you specifically seek it out, which is no different from rest of Internet. — Elon Musk (@elonmusk) November 18, 2022 మరోవైపు గతంలో ట్విటర్లో బ్యాన్ చేసిన కొన్ని ఖాతాలను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు మస్క్. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ట్విటర్ అకౌంట్ను పునరుద్ధరించాలా? వద్దా? అనే విషయంపై పోల్ పెట్టారు. అయితే ట్రంప్ ఖాతాపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ప్రకటించడం గమనార్హం. Kathie Griffin, Jorden Peterson & Babylon Bee have been reinstated. Trump decision has not yet been made. — Elon Musk (@elonmusk) November 18, 2022 అలాగే వర్క్ ఫ్రం హోం రద్దుతోపాటు, ఎక్కువ పనిగంటలు పనిచేసేందుకు సిద్ధపడతారా, రాజీనామా చేస్తారా అంటూ మస్క్ అల్టిమేటానికి సమాధానంగా తాజాగా 1200 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. సాఫ్ట్వేర్ కోడ్ రాసే ఉద్యోగులు ఎవరైనా మధ్యాహ్నం శాన్ఫ్రాన్సిస్కోలోని కార్యాలయంలోని 10వ అంతస్తులో తనను కలవాలని మస్క్ శుక్రవారం ట్విటర్ సిబ్బందికి మెయిల్ పంపారు. (ఉద్యోగుల ఝలక్, ఆఫీసుల మూత: మస్క్ షాకింగ్ రియాక్షన్) కాగా 44 బిలియన్ డాలర్ల ట్విటర్ డీల్ తరువాత సంచలన నిర్ణయాలతో అటు ఉద్యోగులను, ఇటు టెక్ వర్గాలను గందరగోళానికి గురిచేస్తూ విమర్శలు పాలవు తున్నా, మస్క్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ట్విటర్ పునరుద్ధరణ పేరుతో ఇప్పటికే వేలాది ఉద్యోగులను తొలగించడంపై అమెరికా కోర్టులో కేసులు కూడా నమోదైనాయి. అంతేకాదు మస్క్ అనాలోచిత నిర్ణయాలతో ట్విటర్ మూత పడనుందనే అంచనాలు వెల్లువెత్తాయి. అయితే ఆదివారం జరగనున్న వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లైవ్ కవరేజీ, కమెంటరీని ఎంజాయ్ చేయమంటూ ప్రకటించి ఈ ఊహాగానాలకు చెక్ పెట్టారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement