-
విమానం కంటే స్పీడ్గా వెళ్లే రైలు.. కథ కంచికే..
శబ్దవేగంతో దూసుకెళ్లే విమానాల గురించి మనం వినే ఉంటాం. మరి అంతవేగంగా వెళ్లగలిగే ఫ్లైట్ని రూపొందించిన శాస్త్రవేత్తలు..అలాంటి ఓ బస్సునో రైలునో ఎందుకు సృష్టించలేకపోతున్నారో ఎప్పుడైనా అనుమానం కలిగిందా? మన చుట్టూ ఉన్న గాలే అందుకు కారణం. వేగంగా వెళ్లే ఏ వస్తువునైనా అది అడ్డుకుంటుంది. ఆ ఘర్షణలో అగ్గిరాజుకుంటుంది. అందుకే విమానాలు కూడా భూవాతావరణంలో తక్కువ వేగంతో వెళతాయి. ఆకాశంలోకి అంటే శూన్యంలోకి వెళ్లాకే వేగం పుంజుకుంటాయి. ‘మరి అదే శూన్యాన్ని నేలపైనా సృష్టించగలిగితే..? అందుకోసం ఓ పెద్ద ట్యూబుని ఏర్పాటుచేస్తే... అందులో ప్రయాణం సాగితే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్కి! ఈ కొత్త ఆలోచనకి అతను పేటెంట్ తీసుకోలేదు. దీనిపైన ఎవరైనా ప్రయోగాలు చేయొచ్చంటూ ప్రకటించాడు. దాంతో వర్జిన్ హైపర్లూప్, జెలెరస్ వంటి పదికిపైగా సంస్థలు దీని తయారీలో తలమునకలయ్యాయి. ఇందుకోసం వేలకోట్లు ఖర్చుపెడుతున్నాయి. తాజాగా చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్న హైపర్లూప్ స్టార్టప్ల్లో ప్రధాన స్టార్టప్గా ఉన్న వర్జిన్ హైపర్లూప్ దాని కార్యకలాపాలు మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 31లోపు రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలోని వర్జిన్ గ్రూప్నకు చెందిన ఈ ప్రాజెక్ట్ను నిలిస్తేస్తున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఎలాన్మస్క్కు 2013లో హైపర్లూప్ అనే ఆలోచన వచ్చినప్పటి నుంచి 2014లో ‘హైపర్లూప్ వన్’ స్టార్టప్ను స్థాపించి వందల కోట్లును ఖర్చు చేశారు. టెక్నికల్ డెమోలు, టెస్ట్ ట్రాక్లు మినహా ప్రాజెక్ట్లో ఎలాంటి పురోగతి లేదని తెలిసింది. అయితే తాజాగా సంస్థ తన ఆపరేషన్స్ను నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో టెక్నాలజీ రంగంలో కొంత ఆందోళన మొదలైనట్లు సమాచారం. హైపర్లూప్ వన్ 2014లో ప్రారంభించిన తర్వాత బ్రాన్సన్ 2017లో అందులో పెట్టుబడి పెట్టారు. దాంతో అప్పటి నుంచి వర్జిన్ హైపర్లూప్ వన్ అనే పేరుతో దీన్ని పిలుస్తున్నారు. కానీ 2018లో జమాల్ ఖషోగ్గి హత్య తర్వాత బ్రాన్సన్ సౌదీ అరేబియాను తీవ్రంగా విమర్శించారు. దాంతో సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైపర్లూప్ ప్రాజెక్ట్పై ప్రభావం పడంది. ఫలితంగా బ్రాన్సన్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఇదీ చదవండి: ఇకపై ఆధార్కు పాస్పోర్ట్ తరహా వెరిఫికేషన్.. కానీ.. అనంతరం దుబాయ్ పోర్ట్ ఆపరేటర్ డీపీ వరల్డ్ హైపర్లూప్ వన్ స్టార్టప్లో మెజారిటీ వాటా కలిగి ఉండడంతో కంపెనీకు సంబంధించి పూర్తి నియంత్రణ దాని చేతిలోకి వెళ్లిపోయింది. 2022 ప్రారంభంలో ఆ సంస్థ హైపర్లూప్ వన్లోని సగానికిపైగా సిబ్బందిని తొలగించింది. దాంతోపాటు డీపీ వరల్డ్ కార్గోసేవలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తోంది. ఫలితంగా హైపర్లూప్ వన్ మేధో సంపత్తి ముగిసిపోతోందని టెక్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ స్టార్టప్కు చెందిన కొన్ని ఆస్తులను సైతం డీపీ వరల్డ్ విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
90 నిమిషాల్లో ఢిల్లీ టూ ముంబై
ప్రపంచంలో ఇప్పుడందరి దృష్టి హైపర్ లూప్ ట్రాన్స్పోర్ట్ మోడ్ మీద ఉంది. ప్రఖ్యాత కంపెనీలు నిరంతరం హైపర్ లూప్ ప్రయాణం అభివృద్ధిలో పడ్డాయి. వర్జిన్ గ్రూప్ హైపర్ లూప్ రైలు అభివృద్ది పనులను చక చక చేపడుతుంది. 2014 నుంచి ఇప్పటి వరకు ఇంకా ట్రయల్ దశలో ఉంది. ఈ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో సంచలనం క్రియేట్ చేసే అవకాశం ఉంది. హైస్పీడ్ రైల్ కంటే మూడు రెట్లు వేగంగా, సాదారణ రైలు కంటే పది రెట్లు వేగంగా ప్రయాణించనుంది. హైపర్ లూప్ గరిష్ఠ వేగం గంటకు 1000 కిలోమీటర్లు. ఈ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ కొత్త టెక్నాలజీ వాణిజ్య జెట్లకు ప్రయాణ సమయం పరంగా పోటీని ఇవ్వగలదని హైపర్ లూప్ పేర్కొంది. హైపర్ లూప్ పోర్టల్ లోని రూట్ ఎస్టిమేటర్ లో పేర్కొన్న విధంగా ఢిల్లీ నుంచి ముంబైకి 1153 కిలోమీటర్ల దూరంలో ఉన్న దూరాన్ని 1 గంట 22 నిమిషాల్లో కవర్ చేయవచ్చని పేర్కొంది. హైపర్ లూప్ అనేది ఓ ప్రత్యేక నిర్మాణం. బాహ్యంగా అంటే రైలు మార్గంపై గానీ.. రైలుకు వెలుపల గానీ ఎటువంటి గాలి అసలుండదు. ఈ హైపర్ లూప్ వాక్యూం రూపంలో ఉన్న గొట్టాలలో ప్రయాణిస్తుంది. (చదవండి: పీఎంజేడీవై ఖాతాదారులకు తీపికబురు) దీని కారణంగా దాని మీద ఏరోడైనమిక్ ప్రభావం ఉండదు. అంటే ఏ విధమైన బాహ్యపరమైన ఒత్తిడి రైలుపై గానీ..దాని వేగంపై గానీ ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీలో రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుందనేది ఓ సిద్ధాంతం. వర్జిన్ హైపర్ లూప్ పాడ్స్ వేగాన్ని పెంచడానికి అయస్కాంత లెవిటేషన్, ప్రొపల్షన్ టెక్నాలజీని మరింత ఉపయోగిస్తాయి. వర్జిన్ హైపర్ లూప్ వ్యవస్థ వల్ల ప్రయాణం సురక్షితంగా జరుగుతుంది. -
ఆనంద్.. మంచి కాఫీలాంటి శాటిలైట్
తన 50 ఏళ్ల చరిత్రలో ‘ఇస్రో’ తొలిసారిగా మన ప్రైవేట్ సంస్థల శాటిలైట్లను నింగిలోకి పంపనుంది. ఈ నెల 28న పీఎస్ఎల్వీ–సి51 ద్వారా పంపే ఈ శాటిలైట్లలో బెంగళూరు స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ ‘పిక్సెల్’ రూపొందించిన ‘ఆనంద్’ ఒకటి. పాతికేళ్లు కూడా నిండని ఎవ్యాస్ అహ్మద్, క్షితిజ్ ఖండేల్వాల్లు ఈ కంపెనీ రథసారథులు. ‘పిక్సెల్’ విజయప్రస్థానం... చిన్నప్పుడు ఆకాశం అంటే అంతులేని ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు. చిక్కమగళూరు(కర్నాటక) అబ్బాయి ఎవ్యాస్ అహ్మద్ కూడా అంతే. ఆ ఆసక్తి తాను చదువుకున్న బిట్స్ పిలాని(రాజస్థాన్) వరకు కొనసాగింది. బిట్స్ పిలానిలో ‘హైపర్లూప్ ఇండియా’ ప్రాజెక్ట్ వ్యవస్థాపక సభ్యులో అహ్మద్ కూడా ఒకరు. ‘హైపర్లూప్ ఇండియా’తో తన కలలకు శాస్త్రీయ పునాది ఏర్పడింది. వేరు వేరు క్యాంపస్లలో నుంచి వచ్చిన విద్యార్థులతో పరిచయం, పరిజ్ఞానం పెంచుకునే ప్రయత్నాలు జరిగాయి. టెక్ దిగ్గజం ఎలాన్ మాస్క్కు చెందిన ‘స్పేస్ఎక్స్’ స్పాన్సర్ చేసే ‘హైపర్లూప్ పోడ్ కాంపిటీషన్’లో ప్రపంచం నలుమూలల నుంచి స్టూడెంట్స్, నాన్ స్టూడెంట్స్ టీమ్లు పాల్గొంటాయి. ఈ పోటీలో పాల్గొనడాన్ని ప్రతిష్ఠాత్మక విషయంగా భావిస్తాయి. హైపర్లూప్ కాన్సెప్ట్ ప్రకారం సబ్స్కేల్ ప్రోటోటైప్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ నిర్మించడం, డిజైన్ చేయడం ఈ పోటీ ముఖ్య ఉద్దేశం. ‘హైపర్లూప్ ఛాలెంజ్’లో బిట్స్ పిలాని టీమ్కు పాల్గొనే అవకాశం వచ్చింది. కాలిఫోర్నియాలోని ‘స్పేస్ఎక్స్’ ప్రధానకార్యాలయంలో తమదైన హైపర్లూప్ టెక్నాలజీ(అత్యంగా వేగంగా ఒక మైలు దూరం వ్యాక్యూమ్ ట్యూబ్లో ప్రయాణం చేసే సాంకేతిక జ్ఞానం) డెమో ఇచ్చారు. ఫైనల్ వరకు వెళ్లారు. ఈ పోటీ పుణ్యమా అని టెక్స్టార్ ఎలాన్ మాస్క్ను కలుసుకునే అవకాశం వచ్చింది. ‘మాస్క్తో మాట్లాడడం ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. నా కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలనే పట్టుదల పెరిగింది’ అంటాడు ఆరోజుని గుర్తు చేసుకుంటూ 22 సంవత్సరాల అహ్మద్. హైపర్లూప్ కాంపిటీషన్లో పాల్గోవడం వల్ల తన పరిమిత అవగాహనలోని ఖాళీలకు జవాబులు దొరికాయి. ఆ తరువాత ‘ఏఐ ఎక్స్ప్రైజ్ కాంపిటీషన్’లో పాల్గొన్నాడు. సాంకేతిక అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పోటీలు నిర్వహించే ఈ సంస్థను 1994లో కాలిఫోర్నియాలో స్థాపించారు. జెమ్స్ కామెరూన్, లారీపేజ్లాంటి ప్రముఖులు ఈ సంస్థకు ట్రస్టీలుగా ఉన్నారు. ‘ఎక్స్ప్రైజ్’లో పాల్గొన్న సందర్భంలోనే అహ్మద్కు ‘శాటిలైట్ ఇమేజరీ’ గురించి ఆలోచన వచ్చింది. రిమోట్ లొకేషన్లలో, పైప్ల నుంచి గ్యాస్ లీకేజిలను గుర్తించడానికి ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా గనులలో అక్రమ తవ్వకాలను గుర్తించడానికి, వ్యవసాయానికి సంబంధించిన ట్రెండ్స్ గురించి తెలుసుకోవడానికి, విత్తడానికి సరిౖయెన సమయాన్ని ఎంచుకోవడానికి...ఒకటి రెండు అని ఏమిటి! చాలా రకాలుగా శాటిలైట్ ఇమేజరీలను వాడుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నుంచి పుట్టిందే స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ పిక్సెల్. బిట్స్పిలానిలో తనతో పాటు చదువుకున్న క్షితిజ్ ఖండెల్వాల్తో కలిసి 2019లో బెంగళూరులో ‘పిక్సెల్’ స్టార్టప్ ప్రారంభించాడు అహ్మద్. అయితే నిధుల సమస్య పెద్ద సవాలుగా మారింది. వీరు ఎంత సీరియస్గా తమ ప్రాజెక్ట్ గురించి వివరించినా అందరూ తేలిగ్గా తీసుకునేవారు. దీనికి కారణం వారి వయసు. నిధుల సమస్యను అధిగమించడానికి రాజస్థాన్ గవర్నమెంట్, ఇతరుల కోసం కొన్ని ప్రాజెక్ట్లు చేశారు. కొద్ది కాలం తరువాత ‘పిక్సెల్’ ప్రాజెక్ట్ గురించి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. తొలిరోజుల్లో పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించని ‘పిక్సెల్’ టీమ్ ఇండస్ తరువాత ఇండియన్ స్పేస్ స్టార్టప్లలో హైయెస్ట్ ఫండింగ్లో ఉంది. తాము అత్యున్నత ప్రమాణాలతో జెనరేట్ చేసే ఇమేజరీ డాటా యూఎస్ నుంచి యూరప్ వరకు వినియోగదారులకు అనేకరకాలుగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు ‘పిక్సెల్’ సీయివో,సీటీవో అహ్మద్, క్షితిజ్లు. మూడు రోజుల తరువాత పిక్సెల్ వారి ‘ఆనంద్’ ఆకాశంలోకి దూసుకెళ్లబోతుంది. వెళుతూ వెళుతూ ఒక గట్టి నమ్మకాన్ని ఇచ్చివెళుతుంది. పట్టుదల ఉంటే కన్న కలలు సాకారమవుతాయి. జీవితాన్ని ఆనందంతో నింపుతాయి. -
హైపర్లూప్.. గంటకు 1,200 కి.మీ. వేగంతో దూసుకెళ్లేలా..
ఢిల్లీలో ఉంటూ.. ముంబైలో ఉద్యోగం చేయొచ్చా? కుదురుతుంది కాకపోతే జీతం లక్షల్లో, కోట్లలో ఉండాలి.. వేలకు వేలు పోసి విమానాల్లో ప్రయాణించాలి.. అయితే అంత అవసరం లేదంటోంది హైపర్లూప్! గంటకు 1,200 కిలోమీటర్ల వేగంతో.. గొట్టాల్లో దూసుకెళ్లేలా చేయగలిగేదే హైపర్లూప్ ఈ రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. కారుకు అయ్యే ఖర్చుతోనే దూర ప్రయాణాలు చేయొచ్చని చెబుతోంది.. దేశంలో హైపర్లూప్ కార్యకలాపాలు, ప్రత్యేకతలపై సంస్థ భారతీయ వ్యవహారాల డైరెక్టర్ నౌషాద్ ఊమర్ ‘సాక్షి’కి ఇచ్చిన వివరాలు.. సాక్షి: భారత్లో ఎక్కడెక్కడ హైపర్లూప్ వ్యవస్థలు ఏర్పాటు అవుతాయి? నౌషాద్: భారత్లో ముంబై–పుణే మధ్య హైపర్లూప్ ఏర్పాటు కానుంది. ఈ రెండు మహా నగరాల మధ్య ఉన్న 200 కిలో మీటర్ల దూరాన్ని అరగంట కంటే తక్కువ సమయంలో ప్రయాణించొచ్చు. కారులో వెళ్తే.. 3.50 గంటలు పడుతుంది. కరోనా కారణంగా ప్రాజెక్టు పురోగతి కొంత మందగించినా ప్రస్తుతం మళ్లీ పట్టాలెక్కనుంది. కర్ణాటకలోని బెంగళూరు కేంద్రం నుంచి అక్కడి విమానాశ్రయానికి 10 నిమిషాల్లోనే చేరుకునేలా హైపర్లూప్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల నివేదిక సిద్ధం చేస్తున్నాం. పలు మార్గాలను పరిశీలిస్తున్నాం. 2019 డిసెంబర్లో పంజాబ్ ప్రభుత్వ రవాణా శాఖతో హైపర్లూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తర భారతదేశంలో తగిన హైపర్లూప్ మార్గాల అన్వేషణ కొనసాగిస్తాం. ఇతర రాష్ట్రాలతో చర్చలు జరిపి దేశం మొత్తం హైపర్లూప్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం. సాక్షి: ముంబై–పుణే మార్గం గురించి చెప్పండి? నౌషాద్: రెండు దశల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ముందుగా 11 కిలోమీటర్ల పొడవైన హైపర్లూప్ మార్గాన్ని నిర్మిస్తాం. హైపర్లూప్ పూర్తిగా సురక్షితమైందని ఈ ట్రాక్ ద్వారా నిరూపించి, ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాత రెండో దశలో మిగిలిన మార్గం నిర్మాణాన్ని చేపడతాం. ఈ ప్రాజెక్టు కారణంగా మహారాష్ట్రకు సుమారు రూ.3,600 కోట్ల పెట్టుబడులు వస్తాయి. హైపర్లూప్ నిర్మాణానికి అవసరమైన హైటెక్ ఫ్యాక్టరీ కొత్త ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా స్థానిక తయారీ రంగానికి ఊతమిస్తుంది. ప్రాజెక్టు రెండో దశ మొదలు కాగానే మహారాష్ట్రకు వచ్చే పెట్టుబడులు రూ.72,000 కోట్లకు చేరతాయి. మొత్తమ్మీద 18 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా హైపర్లూప్ సేఫ్టీ సర్టిఫికెట్ను 2025 కల్లా సాధించగలమని మా నమ్మకం. వాణిజ్యస్థాయిలో హైపర్లూప్ తొలి మార్గం 2030 నాటికి మొదలవుతుంది. ముంబై–పుణే మార్గంలో ఏడాదికి 20 కోట్ల మంది ప్రయాణించేందుకు హైపర్లూప్ వీలు కల్పిస్తుంది. ఈ మార్గం పూర్తయితే ఏడాదికి 15 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నివారించవచ్చు. బస్సు, రైలు, విమానాల మాదిరిగా హైపర్లూప్ టైమ్ టేబుల్ ప్రకారం నడవదు. ప్రయాణికులు ఎప్పుడు వస్తే అప్పుడే స్టార్ట్ అవుతుంది. సాక్షి: హైపర్లూప్ ప్రత్యేకతలేంటి? నౌషాద్: ఇది పూర్తిగా విద్యుచ్ఛక్తితో పనిచేసే రవాణా వ్యవస్థ. రైలు కంటే 4 రెట్లు, హైస్పీడ్ రైలు కంటే 50%, విమాన ప్రయాణం కంటే 10 రెట్లు ఎక్కువ ఇంధన సామర్థ్యంతో పని చేస్తుంది. హైపర్లూప్ మలుపులు విమానం మాదిరిగానే ఉంటాయి. గాలి లేని గొట్టంలో ప్రయాణిస్తుంది కాబట్టి మలుపులు తిరిగేందుకు చాలా తక్కువ స్థలం సరిపోతుంది. 6 రెట్లు ఎక్కువున్న ఎత్తులను రైలుతో పోలిస్తే హైపర్లూప్ సులువుగా అధిగమించగలదు. సాక్షి: హైపర్లూప్ ప్రయాణం ఖరీదైన వ్యవహారమా? నౌషాద్: కానే కాదు. టికెట్ ధరలు భరించలేనంతగా ఉంటే ఎవరూ హైపర్లూప్ ఎక్కరని తెలుసు. సామాన్యులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు హైపర్లూప్ ఉపయోగపడుతుందని నమ్ముతున్నాం. చిన్న నగరాల్లో నివసించేవారు రోజూ ముంబైలాంటి నగరాలకు వెళ్లి పనిచేసేందుకు ఇది పనికొస్తుంది. మార్గాన్ని బట్టి టికెట్ ధర ఎంతన్నది చెప్పడం కష్టమే. కానీ ఇటీవలే అమెరికాలోని మిస్సోరిలో హైపర్లూప్ ద్వారా వెళ్లిన దూరం.. కారులో వెళ్తే అయ్యే పెట్రోల్ ఖర్చు కన్నా తక్కువగా ఉంటుందని తేలింది. – సాక్షి, హైదరాబాద్ -
23 నిమిషాల్లో ముంబై టు పుణె
ముంబై: ముంబై–పుణె మధ్య నిర్మించనున్న హైపర్లూప్ను ప్రభుత్వ మౌలిక వసతి ప్రాజెక్టుగా ప్రకటించే ప్రతిపాదనకు మహారాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. భూమిపై నిర్మించే ఓ గొట్టంలో అత్యంత వేగంతో ప్రయాణించేందుకు ఈ హైపర్లూప్ ను నిర్మించాలని ప్రణాళిక ఉంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి పుణెలోకి వాకాడ్ వరకు నిర్మించే ఈ హైపర్లూప్ అందుబాటులోకి వస్తే, ముంబై–పుణె మధ్య 117.5 కి.మీ. దూరాన్ని కేవలం 23 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. రూ.70 వేల కోట్ల వ్యయంతో, రెండు దశల్లో ఈ ప్రాజెక్టును పుణె మహానగరాభివృద్ధి సంస్థ చేపడుతోంది. తొలి దశలో పుణె మహానగర పరిధిలోనే 11.8 కిలోమీటర్లపాటు హైపర్లూప్ను రూ. 5 వేల కోట్ల వ్యయంతో నిర్మించి, ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారు. అంతా సవ్యంగా ఉంటే రెండో దశలో మిగతా దూరం మొత్తం హైపర్లూప్ను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు సత్వరంగా లభించడం కోసం దీనిని ప్రభుత్వ మౌలిక వసతి ప్రాజెక్టుగా ప్రభుత్వం తాజాగా గుర్తించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
వర్ష బీభత్సం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
తప్పక చదవండి
Advertisement