-
గోదావరిలో మళ్లీ జలకళ!
సాక్షి, హైదరాబాద్/బాల్కొండ/కడెం/కాళేశ్వరం: రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో గోదావరి నది మళ్లీ జలకళ సంతరించుకుంది. ఎగువన శ్రీరాంసాగర్ నుంచి నది పొడవునా ప్రవాహాలు పెరిగాయి. సోమవారం రాత్రికి ఎగువన శ్రీరాంసాగర్లోకి 50 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 16 గేట్లు ఎత్తి సుమారు అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తిస్థాయిలో 90 టీఎంసీలకు చేరింది. ఇక కడెం ప్రాజెక్టుకు వరద 36,560 క్యూసెక్కులకు పెరిగింది. నాలుగు గేట్లను ఎత్తి 56,429 క్యూస్కెకుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 6.5 టీఎంసీలు నిల్వ ఉంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 35,300 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 46,221 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్షి్మ) బ్యారేజీ నుంచి 1,66,970 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజీ నుంచి 1,32,480 క్యూసెక్కులు, దుమ్ముగూడెం వద్ద సీతమ్మసాగర్ బ్యారేజీ నుంచి 81,108 క్యూసెక్కులను వదులుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అన్నారం సరస్వతి బ్యారేజీకి సోమవారం రాత్రి గోదావరి ఎగువనుంచి వరద పోటెత్తడంతో 66 గేట్లకు 45 గేట్లు ఎత్తారు. లక్ష క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ఇంజనీరింగ్ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఆ నీరంతా కాళేశ్వరం వైపు తరలివస్తోంది. బేసిన్ పరిధిలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి గోదావరిలో వరద మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కృష్ణాలో కానరాని ప్రవాహాలు పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతుండటంతో కృష్ణా నదిలో ఎక్కడా పెద్దగా ప్రవాహాలు కానరావడం లేదు. సోమవారం ఆల్మట్టి డ్యామ్లోకి కేవలం 5,086 క్యూసెక్కుల ప్రవాహమే నమోదైంది. అక్కడ విద్యుదుత్పత్తి ద్వారా వదులుతున్న 14 వేల క్యూసెక్కులు దిగువన నారాయణపూర్లోకి చేరుతున్నాయి. రాష్ట్రంలోని జూరాలకు కేవలం 420 క్యూసెక్కులే వరద ఉంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రకు కూడా కేవలం 559 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యామ్కు ఎలాంటి వరద రావడం లేదు. స్థానిక వర్షాలతో నాగార్జునసాగర్కు 11,424 క్యూసెక్కులు, మూసీ ప్రవాహంతో పులిచింతలకు 5,546 క్యూసెక్కులు చేరుతున్నాయి. -
‘కడెం’ కష్టమే.. ప్రాజెక్టు నిర్వహణపై చేతులెత్తేసిన నీటిపారుదలశాఖ
సాక్షి, హైదరాబాద్: కడెం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ చేతులెత్తేసింది. నిర్వహణతో నెట్టుకురాలేమని, తరచూ సమస్యలు ఉత్పన్నం అవుతాయని, గేట్లు మొరాయిస్తూనే ఉంటాయని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నుంచి దిగువకు 3.82 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యం ఉన్నా, గతేడాది జూలై 13న రికార్డు స్థాయిలో 5,09,025 క్యూసెక్కుల వరద పోటెత్తడంతో ప్రాజెక్టు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంది. ప్రాజెక్టు ఎత్తు 700 అడుగులు కాగా అప్పట్లో ప్రాజెక్టుపై నుంచి 706 అడుగుల ఎత్తులో వరద ప్రవహించింది. గతనెల చివరి వారంలో భారీ వర్షాలు కురవడంతో కడెం ప్రాజెక్టుపై నుంచి 702 అడుగుల ఎత్తులో వరద పారింది. గేట్ల మొరాయింపుతోనే సమస్య గేట్లు మొరాయించడంతో వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు పంపించడం సాధ్యం కావడం లేదు. టాప్సీల్ గేట్ల కారణంగా వీటి నిర్వహణ సమస్యాత్మకంగా మారింది. గతేడాది వచ్చిన వరదలకు 4 గేట్లు మొరాయించడంతో వచ్చిన వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదలడం సాధ్యం కాలేదు. మళ్లీ ఆ గేట్లకు మరమ్మతులు చేసి పునరుద్ధరించారు. గత నెలలో వ చ్చి న వరదల సమయలోనూ మరో 4 గేట్లు మొరాయించడంతో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు గేట్లకు అప్పటికప్పుడు మరమ్మతులు చేసి పైకి ఎత్తగలిగారు. మరో గేటుకు తర్వాత మరమ్మతులు పూర్తి చేశారు. చివరి గేటుకు మరమ్మతులు సాధ్యం కాలేదు. గేట్ల విడి భాగాలు లభించడం లేదు. ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తయారు చేయించుకోవాలనుకున్నా, వీటి డిజైన్లు, డ్రాయింగ్స్ అందుబాటులో లేవు. కడెం ప్రాజెక్టు 18 గేట్లను పైకి ఎత్తడానికి కనీసం 2 గంటల సమయం పడుతుంది. అయితే కడెం నదిపరీవాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలతో గంట వ్యవధిలో కడెం ప్రాజెక్టుకు గత నెలలో 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది. మూడు చోట్ల పగుళ్లు.. ప్రాజెక్టు గేట్ల మధ్య పిల్లర్ తరహాలో ఉంటే కట్టడాన్ని పీయర్స్ అంటారు. కడెం ప్రాజెక్టుకు సంబంధించి మూడు పీయర్స్కు అర్ధ అంగుళం నుంచి అంగుళం నిడివితో పగుళ్లు వచ్చాయి. వీటికి సిమెంట్ మిశ్రమంతో మూసి గ్రౌటింగ్తో తాత్కాలిక మరమ్మతులు చేశారు. భవిష్యత్లో ప్రాజెక్టుకు భారీ వరదలు వస్తే పగుళ్లు వచ్చిన పీయర్స్ ఉధృతిని తట్టుకోవడం కష్టమేనని, అకస్మాత్తుగా కొట్టుకుపోతే దిగువన ఉన్న గ్రామాలు నీటమునిగే ప్రమాదముందని నీటిపారుదలశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కుఫ్తీ కడితే పెద్దగా ప్రయోజనం ఉండదు.. ఎగువ పరీవాహక ప్రాంతంలో కుఫ్తీ డ్యాం నిర్మిస్తే కడెం ప్రాజెక్టుపై వరద ఉధృతి తగ్గుతుందని గతంలో నీటిపారుదల శాఖ భావించింది. అయితే కుఫ్తీ ప్రాజెక్టు నిర్మాణంతో కడెంపై పెద్దగా వరద ఒత్తిడి తగ్గదని, ఎగువ నుంచి వచ్చే వరదను ముందస్తుగా అంచనా వేసేందుకు అవసరమైన సమయం మాత్రం లభిస్తుందని తాజాగా నీటిపారుదలశాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. ఆధునీకరణ ప్రతిపాదనలు ఇలా.. కొత్తగా రేడియల్ గేట్లు ఏర్పాటు చేయాలి. అదనంగా 1.5 లక్షల నుంచి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేలా డిజైన్ చేయాలి. అదనపు గేట్లు, కొత్త స్పిల్వే నిర్మించాలి. గతేడాది డ్యామ్ సేఫ్టీ అండ్ రిçహాబిలేషన్ ప్రోగ్రామ్(డీఎస్ఆర్పీ) కింద నిపుణులతో అధ్యయనం చేయించినా ఇదే సూచనలు చేసినట్టు సమాచారం. -
అయ్యో.. పాపం.. నలుగురిని బలిగొన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్
కడెం(ఖానాపూర్): నిర్లక్ష్యపు డ్రైవింగ్ నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. బాధిత కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. బిడ్డను చూసేందుకు వెళ్తున్న ఓ తండ్రిని, ఇతర పనుల నిమిత్తం వెళ్తున్న మరో ముగ్గురు మహిళలను అన్యాయంగా పొట్టనబెట్టుకుంది ఆటో రూపంలో వచ్చిన రహదారి ప్రమాదం. హృదయ విదారకమైన ఈ ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడెం నుంచి ఎనిమిది మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆటో చిన్నబెల్లాల్ వైపు వెళ్తుండగా పెద్ద బెల్లాల్ సబ్స్టేషన్ మూలమలుపు వద్ద అదుపుతప్పి కల్వర్టుపై నుంచి కింద పడింది. పది అడుగుల పై నుంచి ఆటో కింద పడడంతో పెద్దబెల్లాల్ గ్రామానికి చెందిన చీమల శాంత(45), లింగాపూర్ పంచాయతీ పరిధి మల్లన్నపేట్ గ్రామానికి చెందిన బోడ మల్లయ్య(60), కన్నాపూర్ పంచాయతీ పరిధి చిన్నక్యాంప్ గ్రామానికి చెందిన కొండ్ర శంకరవ్వ(48) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన దస్తురాబాద్ మండలం గొడిసెర్యాలకు చెందిన శ్రీరాముల లక్ష్మి(60) నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న అక్షయ్, కోల శ్రీనుతోపాటు డ్రైవర్, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిర్మల్, జగిత్యాల ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలాన్ని ఖానాపూర్ సీఐ ఆజయ్బాబు, ఎస్సై రాజు పరిశీలించారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని, ఘటనపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మల్లయ్య తన బిడ్డను చూసేందుకు చిన్నబెల్లాల్ వెళ్తున్నాడు. చీమల శాంత, కొండ్ర శంకరవ్వ బొర్నపల్లికి, శ్రీమంతుల లక్ష్మి జగిత్యాల వైపు పని నిమిత్తం వెళ్తున్నారు. లక్ష్మికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. శాంతకు నలుగురు కూతుళ్లు, భర్త ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే.. నిబంధనల ప్రకారం నలుగురు మాత్రమే ప్రయాణించాల్సిన ఆటోలో ఎనిమిది మంది ప్రయాణికులతో వెళ్తున్నారు. మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్తో పాటు, బెల్లాల్ గ్రామానికి చెందిన అతడి స్నేహితుడు పలుమార్లు రన్నింగ్లోనే ఆటో స్టీరింగ్ను మార్చుకుంటూ అతి వేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే ఈ ఆటోను నడిపిస్తున్న ఇద్దరు యువకులు మైనర్లేనని స్థానికులు పేర్కొన్నారు. ఊపిరాడక మరణించారా? మూలమలుపు వద్ద రహదారికి కొద్దిపాటి ఎత్తులో ఉన్న కల్వర్టు రక్షణ గోడను ఎక్కి సుమారు పది అడుగులో లోతులో ఆటో పడిపోయింది. పక్కనే ఉన్న చెరువు నుంచి పొలాలకు సాగునీటిని అందించే ఈ కాలువగుండా కొద్దిపాటి నీరు ప్రవహిస్తోంది. క్షతగాత్రులు ఆటో కింద పడిపోగా బురద నీటిలో కురుకుపోవడం వల్ల శ్వాస అందక మృతిచెంది ఉండవచ్చని అంబులెన్స్ సిబ్బంది పేర్కొన్నారు. మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు ప్రమాదంలో మృతిచెందిన నలుగురి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘నాన్న.. నన్ను చూసేందుకు వచ్చినవా.. ఏమైంది నాన్న.. లే నాన్న.. నీ బిడ్డ వచ్చింది సూడు నాన్న..’ అంటూ బోడ మల్లయ్య కూతురు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ‘బిడ్డా..మమ్ములను విడిచిపెట్టి పోయినవా.. నీ బిడ్డలు కూడా గుర్తు రాలేదా.. వాళ్లకు ఏం జెప్పినవ్..’ అంటూ కొండ్ర శంకరవ్వ తల్లి రోదించింది. -
Telangana: చికెన్ తిని ఊరంతా అస్వస్థత...
కడెం: కలుషిత ఆహారం తిని ఊరంతా అస్వస్థతకు గురైన సంఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం రానిగూడలో చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ పరిధిలోని మొర్రిపేట్ గ్రామంలో దండారీ వేడుకల్లో భాగంగా ఈనెల 6న ఊరంతా కలిసి ఒక చోట సహపంక్తి భోజనాలు చేశారు. మరుసటి రోజు నుంచి ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనలతో ఊరంతా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకుని 61 మందికి చికిత్స అందజేశారు. ప్రస్తుతం అందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఆహారంలో తీసుకున్న చికెన్తోనే అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. -
కడెం డివిజన్లో పులి సంచారంపై అప్రమత్తం
సాక్షి, జన్నారం(ఖానాపూర్): కడెం డివిజన్లోని పాడ్వాపూర్ బీట్ ప్రాంతంలో పులి సంచారం నేపథ్యంలో కవ్వాల్ టైగర్జోన్ పరిధిలోని జన్నారం అటవీ డివిజన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. పాడ్వాపూర్ బీట్ పరిధిలోని గంగాపూర్ ప్రాంతం, ఇస్లాంపూర్ అడవి నుంచి కవ్వాల్ సెక్షన్లో పులి పర్యటించే అవకాశం ఉంది. దీంతో ఆదివారం ఇందన్పల్లి రేంజ్ అధికారి శ్రీనివాసరావు అధ్వర్యంలో అధికారులు కవ్వాల్ టైగర్జోన్ పరిధిలోని కవ్వాల్ సెక్షన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పులి అడుగులు, ఇతర గుర్తింపులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. అటవీ ప్రాంతంలో రహదారులు, వాగులు, ఇతర ప్రాంతాల్లో అధికారులు పులి అడుగుల కోసం అన్వేషించారు. ఎక్కడా అడుగులు కనిపించలేదు. గంగాపూర్ మీదుగా కవ్వాల్కు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఎలాంటి అలజడి లేకుండా, పశువులు రాకుండా జాగ్రత్తలు వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పులి కవ్వాల్ సెక్షన్లో ప్రవేశిస్తే ఇక్కడి సౌకర్యాల దృష్ట్యా తిరిగి వెళ్లే పరిస్థితి ఉండదనే ఆశాభావం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కవ్వాల్ అభయారణ్యాన్ని 2012 జనవరి 10న కేంద్ర ప్రభుత్వం టైగర్జోన్గా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి అసెంబ్లీ స్పీకర్ మనోహర్ కవ్వాల్ అభయారణ్యంలో పర్యటించి ఆయన చేసిన సూచన మేరకు 49వ టైగర్జోన్గా ఏర్పాటు చేశారు. టైగర్జోన్ ఏర్పాటు నుంచి పులి రాక కోసం అధికారులు అన్నిరాకాలుగా ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు. మూడేళ్ల క్రితం కొన్ని రోజులు రాకపోకలు కొనసాగించింది. ఈ క్రమంలో హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు, అటవీశాఖ అధికారులు పులికి రక్షణ కల్పించారు. కొంత అలజడి వల్ల వచ్చిన పులి మూడు సంవత్సరాలుగా కనిపించకుండా పోయింది. ఎట్టకేలకు ఈ నెల 15 న కడెం రేంజ్ పరిధిలోని పాడ్వాపూర్ బీట్, గంగాపూర్ పరిధిలో బేస్క్యాంపు సిబ్బందికి పులి కనిపించింది. వారు అప్రమత్తమై ఉన్నత అధికారులకు తెలియజేయడంతో కెమరాలు అమర్చడం వల్ల పులి కెమెరాకు చిక్కింది. దీంతో అధికారుల అనుమానం నిజమైంది. అడుగుల సేకరణలో సిబ్బంది కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఇటీవలే పెద్ద పులి కనిపించడంతో అధికారులు వాటి సంఖ్యను క్షేత్రస్థాయిలో గుర్తించేందుకు ఆదివారం అడుగుల సేకరణ నిర్వహించారు. శనివారం కడెం ఆటవీ రేంజ్ ఫరిధిలోని పాండ్వపూర్, బీట్ల ఫరిధిలో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లో పెద్ద పులి కనిపించడంతో అంతకుముందు దాని పాదలు గుర్తించిన అధికారులు వాటి సంఖ్యను గుర్తించేందుకు ఆదివారం అడుగుల సేకరణ పనిలో ఉన్నారు. కడెం రేంజ్ ఫరిధిలోని పాండ్వపూర్ బీట్లతోపాటు ఇతర బీట్లలో వాటి అనవాళ్లు ఉన్నాయా అనే కోణంలో పరిశీలించారు. అధికారులు బృందాలుగా ఏర్పడి వాటిని గుర్తించే పనిలో ఉన్నారు. ఆదివారం హైదరాబాద్ అటవీ శిక్షణ ఎఫ్ఆర్ఓలు శిక్షణకు రావడంతో ఈ ప్రాం తం, జంతువుల వివరాలను అటవీ అధికారులు తెలియజేశారు. ఎఫ్ఆర్వో రమేశ్ రాథోడ్, ఎఫ్ఎస్ఓలు ప్రభాకర్, మమత పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement