వైద్యుడి నియామకం ఎప్పుడో
సేవలందక ఆర్టీసీ కార్మికుల అవస్థ l
నెల రోజులుగా నాలుగు డిపోల కార్మికుల ఇబ్బంది
కాకినాడ సిటీ :
జిల్లా కేంద్రంలోని కాకినాడ ఆర్టీసీ డిపో వైద్యశాలకు వైద్యుని నియామకం ఎప్పుడు జరుగుతుందా, వైద్య సేవలుఎప్పుడు అందుతాయా అని కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఆస్పత్రిలో మందుబిళ్లలు, సిబ్బంది ఉన్నా నెల రోజులుగా వైద్యుడు లేకపోవడంతో సం స్థ ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. జ్వరంతో వచ్చిన వారికి కనీసం పేరాసిటమాల్ టాబ్లెట్ ఇవ్వడానికి కూడా సిబ్బంది వెనుకంజ వేసే పరిస్థితి ఉంది. కాకినాడతో పాటు తుని, ఏలేశ్వరం, రామచంద్రాపురం డిపోలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు, పదవీవిరమణ పొందిన వారందరూ కాకినాడ కేంద్రంగా డిపోలో ఉన్న ఈ ఆస్పత్రి నుంచే వైద్యసేవలు పొందాల్సి ఉంది. ఈ నాలుగు డిపోల్లోనూ పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు కాకినాడలో 650, తునిలో 350, ఏలేశ్వరంలో 300, రామచంద్రాపురంలో 320 మంది ఉండగా వీరి కుటుంబసభ్యులను కలిపితే 5వేలకు పైబడి ఉంటారు. అలాగే పదవీవిరమణ పొంది ఆస్పత్రి సేవలు పొందుతున్న 5 వందల మంది కార్మికుల కుటుంబ సభ్యులు 2వేల వరకు ఉన్నారు. ఇంత మందీ ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య వస్తే గత్యంతరం లేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పూర్తి స్థాయిలో వైద్యుడిని నియమించే విషయంలో సంస్థ యాజమాన్యం అవలంబిస్తున్న వైఖరిపై కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
రెండేళ్లలో ఐదుగురు..
సంస్థకు చెందిన పూర్తి స్థ్ధాయి వైద్యుడు 2013లో పదవీవిరమణ చేశారు. అప్పటి నుంచి యాజమాన్యం సంస్థ పరంగా పూర్తిస్థాయి వైద్యుడిని నియమించకుండా కాంట్రాక్ట్ పద్ధతిన వైద్యులను నియమిస్తూ వచ్చింది. కాని కాంట్రాక్ట్ పద్ధతిపై నియమితులైన వైద్యులు నెలలు తప్ప ఎక్కువకాలం పనిచేయలేదు. ఈ రెండేళ్ల కాలంలో ఐదుగురు వైద్యులు మారారు. నెల రోజుల క్రితమే ఒకరు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇప్పటికైనా సంస్థయాజమాన్యం పూర్తి స్థాయి వైద్యుడిని నియమించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
డాక్టర్ పోస్టును భర్తీ చేయాలి
కాకినాడ ఆర్టీసీ డిపోలోని ఆస్పత్రికి నెల రోజులుగా వైద్యుడు లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇక్కట్ల పాలౌతున్నారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కాంట్రాక్టు పద్ధతిన కాకుండా సంస్థ పరంగా డాక్టర్ పోస్టును భర్తీ చేయాలి.
పీఎల్ రాజు, ఎంప్లాయీస్ యూనియ¯ŒS డిపో కార్యదర్శి, కాకినాడ
ఇబ్బందులు వాస్తవమే
ఆస్పత్రిలో వైద్యుడు లేకపోవడంతో సేవలు అందక కార్మికులు ఇబ్బంది పడుతున్నది నిజమే. మరో వైద్యుడి నియామకానికి సంస్థ ఉన్నతాధికారులు ఇటీవల ఇంటర్యూలు నిర్వహించారు. త్వరలోనే వైద్యుని నియామకం జరుగుతుంది. టీవీఎస్ సుధాకర్, డిపో మేనేజర్, కాకినాడ