-
మూగబోయిన మధుర స్వరం
* మూగబోయిన మధుర స్వరం * ప్రముఖ గాయకుడు రామకృష్ణ కన్నుమూత హైదరాబాద్ : ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు విస్సంరాజు రామకృష్ణ(68) కన్నుమూశారు. కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న రామకృష్ణ జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విస్సంరాజు రంగశాయి-రత్నం దంపతులకు 1947 ఆగస్టు 20న విజయనగరంలో రామకృష్ణ జన్మించారు. ప్రఖ్యాత సినీ నేపథ్యగాయని సుశీల.. రామకృష్ణకు పినతల్లి. ఆయన నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలో మెలకువలు నేర్చుకున్నారు. అలనాటి అగ్రహీరోలందరికీ గాత్రం అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. భక్తి గీతాల ఆలాపనలో తనదైన ముద్రవేసి శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన విశిష్ట గాయకుడు ఆయన. సుమారు 200 చిత్రాల్లో అయిదువేలకు పైగా పాటలను పాడారు. రామకృష్ణ మృతితో సంగీత ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఆయన పార్థివ దేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, నటుడు తనికెళ్ల భరణి, ఎస్పీ.శైలజ, సునీత తదితర గాయకులు, దర్శకులు విచ్చేసి రామకృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన అంత్యక్రియలు పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో జరిగాయి. రామకృష్ణ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తపరిచారు. పార్క్హయత్ హోటల్లో జరిగిన సంతాప సభకు రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి, నటీమణులు జమున, జయసుధ, జయప్రద, జీవిత రాజశేఖర్, నటుడు సుమన్, దర్శకుడు కోదండరామిరెడ్డి,సురేష్బాబు తదితరులు హాజరై సంతాపం వ్యక్తంచేశారు. కొద్దిసేపు పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. రామకృష్ణ మృతి పట్ల కేసీఆర్ సంతాపం ప్రముఖ గాయకుడు విస్సంరాజు రామకృష్ణ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దాదాపు 200 చిత్రాల్లో 5 వేలకు పైగా పాటలు ఆలపిం చిన రామకృష్ణ.. తన మధుర గానంతో ఎంతో మంది అభిమానులను సంపాదించారని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సినీ, భక్తిరస గీతాలే కాకుండా తెలంగాణ ఉద్యమ పాటలు కూడా ఆలపించిన రామకృష్ణ.. రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారని సీఎం కొనియాడారు. రామకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి అలనాటి ప్రముఖ గాయకుడు విస్సంరాజు రామకృష్ణ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సినిమాలు, ప్రైవేటు ఆల్బమ్లలో 5 వేలకు పైగా పాటలు పాడిన రామకృష్ణ మృతి చలనచిత్ర రంగానికే కాకుండా యావత్ సంగీత ప్రపంచానికే తీరని లోటుగా పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైఎస్ జగన్ సంతాపం ప్రముఖ సినీ గాయకుడు వి.రామకృష్ణ మృతికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. సినిమా పాటల ఆలాపనలో ఆయన ఎన్నో మైలురాళ్లు అధిగమించారని, ఆయన లేని లోటు పూడ్చ లేనిదని జగన్ పేర్కొన్నారు. రామకృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
భవసాగరం ఈదుకుంటూ...పడవెళ్లిపోయింది!
జీవనదిలా... పాట సాగుతుంది..! జీవితమన్న పడవ పల్లవుల అలల్లో... చరణాల హోరుల్లో... లేస్తూ పడుతూ... దారిన నిలబడిన శ్రోతల హృదయాలలో తీగలు మీటుతూ... మంత్రముగ్ధులను చేస్తూ... ప్రయాణానికి ఆమంత్రిస్తూ... సాగిపోయింది. పాట జీవనదిలా చిరస్థాయిగా మిగిలిపోయింది... అపురూప మధు‘రామకృష్ణ’ స్వరమాధుర్యం తీపి జ్ఞాపకంగా మనసును ఒకసారి గిలిగింతలు పెడుతూ, మరోసారి తన్మయత్వానికి గురిచేస్తూ... ఇంకొకసారి తాత్వికంగా నిలదీస్తూ మిగిలిపోయింది. స్వరప్రసాదంగా చిరస్థాయిగా నిలిచిపోయింది. విజయనగరంలో పుట్టి పెరిగిన విస్సంరాజు రామకృష్ణకు బాల్యంలోనే స్వరానుబంధం ఏర్పడింది. విస్సంరాజు రంగశాయి, రత్నం దంపతులకు 1947 ఆగస్టు 20న జన్మించారాయన. రామకృష్ణ తల్లి సుప్రసిద్ధ వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు శిష్యురాలు. ఇంట్లోనూ ఆమె సంగీత సాధన సాగించేవారు. ఆమె ప్రభావంతోనే రామకృష్ణకు బాల్యం నుంచి సంగీతంపై ఆసక్తి, అనురక్తి ఏర్పడ్డాయి. రామకృష్ణ మాతామహులు పులిపాక ముకుందరావు ప్రముఖ వైణికులు. సంగీత కుటుంబంలో పుట్టిపెరిగిన రామకృష్ణ తన పదిహేనో ఏట కర్ణాటక సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి వద్ద స్వరాభ్యాసం చేశారు. తండ్రి రంగశాయి మైన్స్ అండ్ జియా లజీ శాఖ డెరైక్టర్. ఆయన ఉద్యోగ రీత్యా వారి కుటుంబం హైదరాబాద్లో ఉండేది. ‘యువవాణి’ ద్వారా రామకృష్ణ రేడియోశ్రోతలకు పరిచయమ య్యారు. చిత్తరంజన్ స్వరకల్పనలో లలిత గీతాలు ఆలపించారు. అవకాశమిచ్చిన అక్కినేని చదువు పూర్తయ్యాక పాటలపై పూర్తిస్థాయిలో దృష్టిపెడదామని భావించిన రామకృష్ణకు అనూహ్యంగా అక్కినేని నాగేశ్వరరావు తొలి సినీ అవకాశం ఇచ్చారు. సారథి స్టూడియోలో ఒక డాక్యుమెంటరీ కోసం పాడుతుండగా, అక్కడే ఉన్న అక్కినేని రికార్డింగ్ పూర్తవుతూనే రామకృష్ణను అభినందించారు. తాను హీరోగా నటించే ‘విచిత్రబంధం’ చిత్రంలో పాడా ల్సిందిగా కోరారు. అప్పటికి బీఎస్సీ పరీక్షలకు మరో రెండు నెలలే గడువు ఉండటంతో, పరీక్షలు పూర్తయ్యాక పాడతానన్నారు రామకృష్ణ. అప్పటి వరకు నిరీక్షించి మరీ అక్కినేని ‘విచిత్రబంధం’ (1972)లో రామకృష్ణతో పాడించారు. ఆ చిత్రంలో సుశీలతో కలసి పాడిన ‘వయసే ఒక పూల తోట’, ‘చిక్కావు చేతిలో చిలకమ్మా’ పాటలు ఉర్రూత లూపాయి. ఆ తరువాత ‘భక్త తుకారాం’, ‘ధనమా? దైవమా?’, ‘అందాల రాముడు’, ‘శారద’, ‘భక్త కన్నప్ప’, ‘తాత -మనవడు’, ‘మహాకవి క్షేత్రయ్య’, ‘దానవీరశూర కర్ణ’, ‘కురుక్షేత్రం’, ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ వంటి పలుచిత్రాల్లో రామకృష్ణ పాటలు హిట్టు. ఘంటసాల ప్రోత్సాహం రామకృష్ణ చిన్నప్పటి నుంచి ఘంటసాలను విపరీతంగా అభిమానించేవారు. ఆయన బాణీనే ప్రామాణికంగా భావించేవారు. ‘తాత- మనవడు’లో ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం..’ పాట రికార్డింగ్ అప్పుడు ఆ పాట విన్న ఘంటసాల ‘నా అంతటి గాయకుడివి కావాలి’ అని రామకృష్ణను ఆశీర్వదించారు. అంతేకాదు, తన ఆరోగ్యం క్షీణించి, పాడలేని పరిస్థితుల్లో నిర్మాతలకు చెప్పి మరీ, రామకృష్ణ చేత చాలా పాటలు పాడించారు. ‘అల్లూరి సీతారామ రాజు’లో ‘తెలుగువీర లేవరా..’ పాట తొలి సగం పాడిన తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో, ఆ పాట మిగిలిన సగాన్ని రామ కృష్ణ చేత ఘంటసాలే పాడించారు. ‘భక్త తుకారాం’ శతదినోత్సవంలో ‘కరుణామయా దేవా’ రికార్డు వినిపిస్తుండగా రామకృష్ణ పక్కనే కూర్చున్న ఘంటసాల ‘ఈ పాట నేను పాడిందా నువ్వు పాడిందా?’ అని అడిగారు. ‘ఘంటసాల ప్రశంసకి మించి అవార్డ లేదు’ అని రామ కృష్ణ వినమ్రంగా చెప్పేవారు. ఇవాళ్టికీ రామకృష్ణ పేరు చెప్పగానే జనసామాన్యంలో ఎన్టీఆర్ ‘దానవీరశూర కర్ణ’లోని తిరుపతి వేంకట కవుల ప్రసిద్ధ రాయబారం పద్యాలు, ‘వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’లోని పాటలు, తత్త్వాలు, కాలజ్ఞానం గుర్తుకొస్తాయి. గ్రామ్ఫోన్ రికార్డుల దశ నుంచి క్యాసెట్ల దశ మీదుగా ఇవాళ్టి సీడీ, పెన్డ్రైవ్లలో ఎమ్పీ3 దశ దాకా ఆ పాటలు, పద్యాలు, తత్త్వాల సేల్స్ సూపర్హిట్టే. వినమరుగైన ప్రాభవం ఘంటసాల మాస్టారి చివరి రోజుల్లో 1970వ దశకంలో సినీ రంగ ప్రవేశం చేసిన రామకృష్ణ, మాస్టారి మరణం తరువాత కొంతకాలం వరకు తన హవా సాగించారు. అప్పట్లో రామకృష్ణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గళాలు పోటాపోటీగా తెలుగు సినీగీతాల శ్రోతలకు వినిపించేవి. అయితే, 1977 తరువాత ఎస్పీబీ తిరుగులేని గాయకుడిగా స్థిరపడడంతో, రామకృష్ణ గాన ప్రాభవం క్రమంగా తగ్గింది. తరువాతి రోజుల్లో ఆయన ప్రధానంగా ప్రైవేట్ కచ్చేరీలు, ప్రైవేట్ ఆల్బమ్లలో పాటల మీద దృష్టి పెట్టారు. ‘వెంగ మాంబ’ లాంటి కొన్ని సినిమాల్లో, కొన్ని టీవీ సీరియళ్ళలో కొన్ని పాత్రలు పోషించి, తన నటనాభిలాషను తీర్చు కున్నారు. నాగార్జున - కృష్ణవంశీల ‘నిన్నే పెళ్ళాడతా’ (1996), ‘సీతక్క’ (1997) లాంటి సినిమాల్లో అడపా దడపా ఆయన గొంతు వినిపించింది. కొన్నేళ్ళ క్రితం ‘హైటెక్ స్టూడెంట్స్’లోనూ గళం విప్పిన రామకృష్ణ చివరిసారిగా గుమ్మడి నటించిన ‘జగద్గురు శ్రీకాశీనాయని చరిత్ర’ (2007)లో పాడారు. ఆ సినిమాలో గురుచరణ్ రాసిన ‘ఈ క్షేత్రకథాగానం...’ ఆయన చివరి సినీ గీతం. తెలంగాణ ఉద్యమవేళ అంద్శైరచన ‘జయ జయహే తెలంగాణ జననీ...’ గీతాన్ని రామకృష్ణ పాడారు. ఉద్యమ కారులకు ఊపునిచ్చిన ఆ పాటే ప్రత్యేక రాష్ట్రసాధన తర్వాత తెలంగాణ రాష్ట్రగీతమై, ఇప్పటికీ ఆ గొంతులో వినిపిస్తోంది. రామకృష్ణ ‘‘పాడిన సినీ గీతాలు 400లోపుంటాయి. ఆ పాటలు, పద్యాలన్నీ సేకరించాం. అవి కాక వందల ప్రైవేట్ గీతాలుంటాయి. ఆయన పాడిన సినీ గీతాలు, పద్యాల సమగ్ర సమాచారంతో ఈ ఆగస్టులో ఆయన పుట్టినరోజుకు పుస్తకం తీసుకొస్తున్నాం. ఈ లోగానే ఈ దుర్ఘటన జరిగింది’’ అని రాజమండ్రికి చెందిన సినీగీత సేకర్త గోలి సాయిబాబు తెలిపారు. భక్తి, రక్తి, జీవన తాత్త్విక గీతాలు మూడూ పాడి, ఘంటసాలను తలపించిన రామకృష్ణ ఓ పాటలో అన్నట్లు... ‘‘పడవెళ్ళిపోయింది.’’ తీపిగుర్తుగా పాట మిగిలిపోయింది. ► పాటల పూదోటలో... కొన్ని మల్లెలు... ► వయసే ఒక పూలతోట - ‘విచిత్ర బంధం’ (1972) ► చిక్కావు చేతిలో చిలకమ్మా - ‘విచిత్ర బంధం’ (1972) ► అనుబంధం ఆత్మీయత.. అంతా ఒక బూటకం - ‘తాత-మనవడు’ (1972) ► ఒసే వయ్యారీ రంగీ... వగలమారి బుంగీ - ‘పల్లెటూరి బావ’ (1973) ►శారదా నను చేరగా - ‘శారద’ (1973) ► పాండురంగనామం పరమపుణ్యధామం - ‘భక్త తుకారాం’ (1973) ► రాముడేమన్నాడోయ్ - ‘అందాల రాముడు’ (1973) ► ఎదగడానికెందుకురా తొందరా - ‘అందాల రాముడు’ (1973) ► కృష్ణవేణి తెలుగింటి విరిబోణి - ‘కృష్ణవేణి’ (1974) ► అందాలు కనువిందు చేస్తుంటే - ‘కన్నవారి కలలు’ (1974) ► నాయుడోళ్ల ఇంటికాడ నల్లతుమ్మ చెట్టు కింద - ’అందరూ దొంగలే’ (1974) ► మనసు లేని దేవుడు - ‘ప్రేమలు-పెళ్లిళ్లు’ (1974) ► తెలుగు వీర లేవరా - ‘అల్లూరి సీతారామరాజు’ (1974) ► ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు - ‘ముత్యాల ముగ్గు’ (1975) ► శివ శివ శంకరా... భక్తవశంకర! - ‘భక్త కన్నప్ప’ (1976) ► మనసు లేని బ్రతుకొక నరకం - ‘సెక్రటరీ’ (1976) ► నా పక్కన చోటున్నది ఒక్కరికే- ‘సెక్రటరీ’ (1976) ► జాబిల్లి పిలిచేను - ‘మహాకవి క్షేత్రయ్య’ (1976) ►విఠలా! పాండురంగ విఠలా - ‘చక్రధారి’ (1977) ►నా జీవన సంధ్యా సమయంలో - ‘అమర దీపం’ (1977) ► ఎవరికి ఎవరు... చివరికి ఎవరు - ‘దేవదాసు మళ్లీ పుట్టాడు’ (1978) ► పువ్వుల కన్నా పున్నమి వెన్నెల కన్నా - ‘కరుణామయుడు’ (1978) ► ఆశయాల పందిరిలో అనురాగం సందడిలో - ‘యువతరం కదిలింది’ (1980) ► వినరా వినరా - ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రప్వామి చరిత్ర (1984) ► నందామయా గరుడ నందామయా - ‘శ్రీమద్విరాట్ పోతులూరి ► వీరబ్రహ్మేంద్రప్వామి చరిత్ర (1984) అది కొడుక్కైనా దక్కాలనుకున్నాడు! ఘంటసాల గారినే గురువుగా భావించి, ఆ పాటలే వేదికలపై పాడుతూ వచ్చిన రామకృష్ణ గొంతు ఆయనకు చాలా దగ్గరగా ఉండేది. ఘంటసాల గారు గతిం చాక, జనం అలాంటి మంచి వాయిస్ను రామకృష్ణలో చూసుకున్నారు. తొలి రోజుల్లో పరిశ్రమ ప్రోత్సహించింది. అతని గొంతు విని, సంగీత దర్శకుడు రమేశ్నాయుడు మా ‘తాత మనవడు’కు ‘అనుబంధం ఆత్మీయత’ పాడించారు. తర్వాత ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ సహా నా సినిమాలు చాలా వాటిలో పాడాడు. కొన్ని కారణాల వల్ల పరిశ్రమలో అతనికి చిన్న గ్యాప్ వచ్చి, నెమ్మదించాడు. అతను ఫ్రాంక్గా మాట్లాడేవాడు. నిర్మాత లను డబ్బు కోసం డిమాండ్ చేసేవాడు కాదు. తనకు రాని పేరు కొడుక్కైనా దక్కాలని సంగీతం నేర్పించాడు. - దాసరి నారాయణరావు, దర్శకుడు అంకితభావానికి అది గుర్తు! రామకృష్ణది మంచి గొంతు. మా సిని మాలు ‘కృష్ణవేణి’, ‘అమర దీపం’లో రామకృష్ణతో పాటలు పాడించా. అవి ఇవాళ్టికీ పాపులరే. కానీ, చిత్రంగా పెద్దగా అవకాశాలెందుకో రాలేదు. ఆ తరువాత ‘భక్త కన్నప్ప’లో కిరాతార్జునీయ గీతం తప్ప, అన్నీ పాడించా. అందులో ‘ఆకాశం దించాల’ లాంటి పాటలన్నీ పెద్ద హిట్టు. అందుకే, ఎప్పుడూ ‘నాకు మీరు లైఫ్ ఇచ్చారు’ అంటూ, కృతజ్ఞత చూపేవాడు. ‘తాండ్ర పాపారాయుడు’ (1986)లో మంచి దమ్ముతో పాడాల్సిన పద్యానికి పిలిస్తే, చాలా రిహార్సల్స్ చేసి, తృప్తిగా వచ్చేవరకు పాడాడు. అది ఆయన అంకితభావానికి నిదర్శనం. వ్యక్తిగతంగా మంచి మనిషి.’ - కృష్ణంరాజు, నటుడు ఆయన, ఈయన చెరిసగం పాడారు! రామకృష్ణ గారు మరణించారన్న సంగతి ఇందాక టీవీలో చూసి షాక్ అయ్యా. ఒక మంచి గాయకుడిగా, మంచి మనిషిగా ఆయన తెలుసు. చూసి, చాలా రోజులైంది. అనారోగ్యం గురించి తెలి యదు. తక్కువ పాటలే పాడినా, కెరీర్లో చాలా హిట్లున్న గాయకుడు ఆయన. మా ‘అల్లూరి సీతారామరాజు’లోని ‘తెలుగు వీర లేవరా’ పాటను ఘంటసాల పాడితే, అందులో చివర వచ్చే ‘స్వాతంత్య్ర వీరుడా స్వరాజ్యభానుడా...’ అనే బిట్ను రామకృష్ణ గానం చేశారు. ఘంటసాల అనారోగ్యంతో ఆ బిట్ పూర్తి చేయలేక, తానే స్వయంగా రామకృష్ణ గారిని పిలిచి మరీ ఆ పాట పూర్తి చేయించారు. ఇవాళ్టికీ ఆ పాట అందరి నోటా నిలిచింది. ఘంట సాలను తలపించే రామకృష్ణ గొంతు మూగపోయినందుకు బాధగా ఉంది. - విజయనిర్మల, నటి - దర్శకురాలు తనమీద తానే జోక్స్ వేసుకునేవారు! రామకృష్ణ గారు చాలా సరదా అయిన మనిషి. ప్రముఖ సినీ సంగీత దర్శకులు రాజ్ - కోటి గార్లు ముందుగా ‘రుద్రాక్ష మాల’ అనే క్యాసెట్కి సంగీతం చేశారు. అప్పుడు నేను, రామకృష్ణ గారు కలసి పాడడం జరిగింది. ఆ తరువాత ఎన్నో వేదికలపై కలసి పాడాం. ఎన్నో కచ్చేరీలు కలసి చేశాం. బయట చాలామందికి తెలియని గొప్ప కోణం ఏమిటంటే, ఆయన ఎప్పుడూ సరదాగా, ఏవో జోక్స్ వేస్తూనే ఉంటారు. ముఖ్యంగా తన మీద తానే జోక్స్ వేసుకొనేవారు. ఆయన పోయారనే వార్త హైదరాబాద్లో షూటింగ్కి వచ్చిన నాకు షాకింగ్ న్యూస్. స్వయంగా వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించా. ఇవాళ ఆయన మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. - ఎస్పీ శైలజ, సినీ గాయని వాళ్లది సంగీత కుటుంబం రామకృష్ణ కుటుంబమంతా నాకు బాగా తెలుసు. రామకృష్ణే కాదు, అతని చెల్లెలు బి.ఎ. లక్ష్మి, తమ్ముడు వాసుదేవ్ మంచి సింగర్స్. 1960ల చివర్లో ‘హైదరాబాద్ ఫిల్మ్ టాలెంట్స్ గిల్డ్’ అనే ఆర్కెస్ట్రాతో సినీ, లలిత గీతాల కచ్చేరీలు ఇక్కడ చేసేవాళ్ళం. చదువుకొనే రోజుల్లోనే రేడియోలో, ఆ ఆర్కెస్ట్రాలో నా దగ్గర రామకృష్ణ పాడేవాడు. అప్పట్లో ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్కి పాడడానికి చాన్స్ వస్తే, నాకు కుదరక సారథీ స్టూడియోకు అతణ్ణి పంపా. అక్కడ అతని గొంతు విని, దైవికంగా ఏయన్నార్ ఫస్ట్ సినిమా ఛాన్సిచ్చారు. నా వల్లే ఆ ఛాన్స్ వచ్చిం దంటూ, ఆ సంగతి ఎప్పుడూ అందరికీ చెబుతుండేవాడు. అన్నీ బాగా పలికే, మంచి గాత్రం అతనిది. ఘంటసాలను తలపిస్తూ చాలా సినీగీతాలు పాడాడు. - ఎం. చిత్తరంజన్, లలిత సంగీతజ్ఞుడు
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement