-
రూపాయికే కార్పొరేట్ వైద్యం.. డాక్టర్ హర్షవర్ధన్ గొప్ప మనసు
ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నాననే భావనతో.. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన హర్షవర్ధన్ ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థోపెడిక్ ఖమ్మంలో పూర్తి చేశారు. కొంతకాలం ఖమ్మంలో పనిచేసిన ఆయన తరువాత ఇల్లెందులో సొంత క్లినిక్ పెట్టారు. ఈలోగా ఇల్లెందు వైద్యశాలను వైద్య విధాన పరిషత్లోకి మార్చుతూ అప్గ్రేడ్ చేశారు. హర్షవర్ధన్కు ఆ ఆస్పత్రిలో సర్జన్గా ఉద్యోగం వచ్చింది. ఆయన సతీమణి తేజస్వి కూడా ఆ ఆస్పత్రిలో ఈఎన్టీ విభాగంలో డాక్టర్గా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం... ఖాళీ సమయంలో ప్రైవేట్ ఆస్పత్రి. సంపాదన బాగానే ఉన్నా ప్రజలకు ఏం చేయలేకపోతున్నామనే అంతర్మథనం మొదలైంది. పుచ్చలపల్లి సోదరుడే స్ఫూర్తి.. నెల్లూరులో పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు డాక్టర్ పి.రామచంద్రారెడ్డి పీపుల్స్ పాలీ క్లినిక్ పేరిట రూ.10 ఫీజుతో వైద్యం అందించేవారు. నెల్లూరుకే చెందిన హర్షవర్ధన్... రామచంద్రారెడ్డి స్ఫూర్తితో ఏదైనా చేయాలనుకున్నారు. ఇల్లెందు ఆంబజార్లో పెట్టిన సొంత క్లినిక్లో రూపాయి ఫీజుకే వైద్యం అందించడం ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు పూర్తయ్యాక, సాయంత్రం క్లినిక్లో సేవలందిస్తున్నారు. ఆపరేషన్లు తప్పనిసరి అనుకున్నవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఖమ్మంలో శస్త్రచికిత్స కూడా చేస్తున్నారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు 35 మందికి ఆపరేషన్లు చేశారు. ఇందులో మోకాలు, తుంటి, కీళ్ల మార్పిడి వంటి ఆపరేషన్లు.. మోకాళ్లు, అరికాళ్ల నొప్పులు, నడుము, మెడనొప్పి, కాళ్ల తిమ్మిర్లు వంటి అనేక సమస్యలకు అత్యాధునిక పద్ధతిలో వైద్యమందించారు. మోకాలు చిప్ప మార్పిడి చేశారు.. నడవడం ఇబ్బందిగా ఉండడంతో ఓ డాక్టర్ వద్ద పరీక్ష చేయించుకున్నా. మోకాలు చిప్ప అరిగిపోయిందని, మార్చాలంటే సుమారు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో ఇల్లెందులో ప్రజా వైద్యం అందిస్తున్న హర్షవర్ధన్ను సంప్రదించాను. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మోకాలి మార్పిడి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు హాయిగా నడవగలుగుతున్నా. – వి.బాయమ్మ, మామిడిగూడెం, ఇల్లెందు మండలం పేదలను ఆదుకోవాలని..డాక్టర్ జి.హర్షవర్ధన్, ఆర్థోపెడిక్ సర్జన్ ప్రస్తుత వైద్యం అత్యంత ఖరీదైంది. సామాన్యులను అందకుండాపోతోంది. అందుకే వారిని ఆదుకునేందుకు రూపాయి ఫీజుతో వైద్యం చేస్తున్నా. ప్రభుత్వ వైద్యులుగా నాకు, నా భార్యకు వచ్చే వేతనం మా కుటుంబానికి సరిపోతుంది. అందుకే క్లినిక్లో నామమాత్ర ఫీజుతో వైద్యం చేస్తున్నా. -
ప్రపంచంలో 20 కోట్ల మందికి ఆ వ్యాధి.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పే
సాక్షి, హైదరాబాద్: కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు శరీరంలో రహస్యంగా పొంచి ఉండి ఊహించని రీతిలో అకస్మాత్తుగా బయటపడతాయి. ఆ కోవకు చెందినదే ఈ ఆస్టియోపోరోసిస్ (బోలు ఎముకల వ్యాధి). ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మందికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచంలో యాభై ఏళ్లు పైబడిన ముగ్గురు మహిళల్లో ఒకరు, ఐదుగురు పురుషుల్లో ఒకరికి తమ జీవితకాలంలో ఆస్టియోపోరోసిస్ వ్యాధి వల్ల ఎముకలు విరిగే ప్రమాదం ఉంటుందని ప్రముఖ ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ దశరథరామారెడ్డి అంటున్నారు. గురువారం (అక్టోబర్ 20) ప్రపంచ ఆస్టియోపోరోసిస్ డే సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... ఆస్టియోపోరోసిస్ అంటే? ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి ఎముకలు వాటి ఖనిజ సాంద్రతను కోల్పోయి, పెళుసుబారిపోవడం వల్ల ఏర్పడుతుంది. ఈ వ్యాధి ఎముకలను బలహీనపరిచి అవి విరిగిపోయేలా చేస్తుంది. తుంటి ఎముకలు, పక్క టెముకలు, మణికట్టు ఇంకా వెన్నెముక వంటి ఎముకలు విరిగే (ఫ్రాక్చర్) అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ వ్యాధిని కారణాలను బట్టి వర్గీకరించవచ్చు. ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అనేది సహజమైన వయస్సు సంబంధిత మార్పుల వల్ల ఎముకల సాంద్రత తగ్గి వస్తుంది. సెకండరీ ఆస్టియోపోరోసిస్ కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులవల్ల లేదా మందుల వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి లక్షణాలేంటంటే... సాధారణంగా ప్రారంభ దశల్లో ఈ వ్యాధి వస్తే ప్రత్యేకంగా లక్షణాలేవీ కనిపించవు. వ్యాధి క్రమంగా తీవ్రమై ఎముకలు విరిగినప్పుడు మాత్రమే గుర్తించగలం. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే... వీపు కింది భాగంలో నొప్పి వస్తుంది. పరిస్థితి తీవ్రమైనప్పుడు ఎత్తు తగ్గిపోవడం, వెన్నెముక విరగడం వల్ల శరీరం ముందుకు వంగిపోవడం, శరీర భంగిమల్లో మార్పు, శ్వాస ఆడకపోవడం జరుగుతుంది. పరిస్థితి చాలా తీవ్రంగా మారినప్పుడు బలమైన తుమ్ము లేదా దగ్గు వల్ల కూడా ఎముకలు విరుగుతాయి. వ్యాధి నిర్ధారణ ఎలా చేయగలమంటే? డీఎక్స్ఏ అనే రేడియేషన్ ఎక్స్–రే స్కాన్ ద్వారా తుంటి, ఇంకా వెన్నెముక ఎముకల సాంద్రతను, ఎముకలలోని ఖనిజాల సాంద్రతను కొలవడానికి వీలవుతుంది. ఈ పరీక్షతో వ్యాధిని నిర్ధారించడానికి, ఫ్రాక్చర్ ప్రమాదాన్ని అంచనా వేయడానికి అత్యంత కచ్చితమైన మార్గం. ఇతర వ్యాధులు కూడా ఉన్నట్లయితే రక్తం, మూత్ర పరీక్షలు కూడా అవసరం కావచ్చు. ప్రమాద కారకాలేంటి? ఆస్టియోపోరోసిస్ వ్యాధి ఆడా, మగా ఎవరికైనా రావచ్చు. అయితే ప్రమాదం వయస్సుతో పాటు పెరుగుతుంది. స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ వారిని ‘బోన్ లాస్’నుండి కాపాడుతుంది. 50 ఏళ్లు పైబడిన మహిళల్లో (లేదా ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో) ఈస్ట్రోజెన్ లేకపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ వ్యాధి వచ్చే ప్రమాదం పురుషుల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం, విటమిన్ డీ ఇంకా ఇతర విటమిన్లు, ఖనిజాల కొరతతో కూడిన ఆహారం తీసుకోవడం, సరైన శారీరక బరువును సరిగా నిర్వహించకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. జీవనశైలిలో మార్పులు అవసరం కొన్ని జీవనశైలి మార్పులను చేసుకోవాలి. ప్రతి రోజూ వ్యాయామం చేయడం, క్యాల్షియం, విటమిన్ డి వంటి విటమిన్లతో కూడిన ఆహరం ద్వారా లేక మందుల ద్వారా తీసుకోవడం వంటివి చేయాలి. అవసరమైతే కొన్నిసార్లు ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాల్సి రావచ్చు. పురుషుల్లో టెస్టోస్టెరాన్ థెరపీ ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడవచ్చు. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఇవ్వడం ద్వారా ఎముకల సాంద్రత తగ్గడం వల్ల కలిగే నష్టాన్ని ఆపొచ్చు. కేవలం ఆర్థోపెడిక్ సర్జన్ సూచించినట్లయితేనే హార్మోన్ థెరపీ తీసుకోవాలి. -
DOCTOR G : మగ గైనకాలజిస్ట్ తిప్పలు
ఇష్టం లేని పోస్టింగులు ఉద్యోగులకు ఉన్నట్టే ఇష్టం లేని డిపార్ట్మెంట్లు డాక్టర్లకు ఉంటాయి. కొందరు న్యూరో వద్దనుకుంటారు. కొందరు పిడియాట్రిషియన్ కావడాన్ని బోర్ ఫీలవుతారు. కొందరికి చర్మవ్యాధుల డాక్టర్ అవాలని అస్సలు ఉండదు. కాని వద్దనుకున్న సీటే వస్తే? ఆయుష్మాన్ ఖురానాకి గైనకాలజీలో సీటు వస్తుంది. కాని అతను చేయాలనుకున్నది ఆర్థోపెడిక్స్. గైనకాలజీ అంటే స్త్రీల ప్రపంచం. పేషంట్లకు ఇబ్బంది. ఈ డాక్టరుకు బెరుకు. ఈ సమస్యను స్క్రీన్ మీద నవ్వులు పూయించడానికి అదే సమయంలో డాక్టర్ల గొప్పతనం చాటడానికి త్వరలో వస్తోంది ‘డాక్టర్ జి’. దీనికి అనురాగ్ కశ్యప్ చెల్లెలు అనుభూతి కశ్యప్ దర్శకురాలు కావడం మరో విశేషం. ‘పేషెంట్లు మహిళా గైనకాలజిస్టునే ప్రిఫర్ చేస్తారు’ అంటాడు గైనకాలజీలో పి.జి. చేస్తున్న ఆయుష్మాన్. ‘ఈ ఆడ, మగ తేడా ఏంటి? డాక్టర్ డాక్టరే ఎవరైనా’ అంటుంది సీనియర్ మహిళా గైనకాలజిస్ట్ షేఫాలి షా. ‘పేషెంట్లు అలా అనుకోరు కదా’ అంటాడు. ‘ముందు నువ్వు అనుకో. నీ ఆలోచన మార్చుకో. నువ్వో గైనకాలజిస్టువి. నీలోని మేల్ టచ్ను వదులుకో’ అంటుందామె కోపంగా. గైనకాలజీ విభాగంలో మహిళా పేషెంట్లకు చికిత్స చేయాలంటే మగవాడైన తను ‘మగ స్పర్శ’ను ఎలా వదులుకోవాలి అనే తిప్పలు వచ్చి పడతాయి ఆయుష్మాన్కి. అతను హీరోగా నటిస్తున్న ‘డాక్టర్ జి’ ట్రైలర్లోని సంభాషణ ఇది. ఈ సినిమా రెండు వారాల్లో విడుదల కానుంది. డాక్టర్ల మీద చాలా సినిమాలు వచ్చాయి గతంలో. ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్.’ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చింది. చాలా రోజుల క్రితమే రాజేష్ ఖన్నా ‘ఆనంద్’లో అమితాబ్ పోషించిన డాక్టర్ పాత్ర చాలా ముఖ్యం. ఇంకా ‘డాక్టర్ కోట్నిస్ కీ అమర్ కహానీ’, ‘దిల్ ఏక్ మందిర్’, ‘ఏక్ డాక్టర్ కీ మౌత్’... ఇవన్నీ డాక్టర్ ప్రొఫెషన్ను గొప్పగా చూపించాయి. ఇప్పుడు విడుదల కానున్న ‘డాక్టర్ జి’ కూడా ఈ రంగంలోని సాధకబాధకాలను చర్చించనుంది. అయితే కొంత సరదాగా. అది కూడా మగ గైనకాలజిస్ట్ సమస్యను తీసుకుంది. గైనకాలజీ అనగానే గర్భానికి సంబంధించిన విషయాలు, కాన్పులు, గర్భాశయ చికిత్సలు ఉంటాయి. పేషెంట్లు అనివార్యంగా స్త్రీలు కనుక డాక్టర్లు కూడా స్త్రీలే అయితే పరీక్షించడంలో ఇబ్బందులు ఉండవు. గుండె డాక్టరు, ఊపిరితిత్తుల డాక్టరు, ఈఎన్టి డాక్టరు మగవాడైనా పర్వాలేదు కాని మహిళా పేషెంట్లకు మగ గైనకాలజిస్టు అయితే ఇబ్బంది పడతారు. వారి కంటే ఎక్కువ ఇబ్బంది ఈ సినిమాలో ఆయుష్మాన్ పడనున్నాడు. కాని శరీరం ఎప్పుడైతే ‘రోగగ్రస్తం’ అవుతుందో ‘చికిత్స కు అవసరమైన స్థితికి’ చేరుకుంటుందో అప్పుడు ఆ శరీరం ‘స్త్రీదా’, ‘పురుషుడిదా’ అనే తేడా లేకుండా పోతుంది. పేషెంట్ కూడా ఆ సమయంలో తన ప్రాణం దక్కితే చాలు– వైద్యం ఎవరు చేసినా పర్వాలేదు అనే స్థితికి వెళుతుంది/వెళతాడు. ఇక్కడ కూడా ఒక అత్యవసర కాన్పు సమయంలో పేషెంట్ డాక్టర్ ఎవరనేది చూడదు. కాన్పు జరిగితే చాలనే అనుకుంటుంది. కాని ఆయుష్మాన్ ఖురానా తనలోని ఆ ఇబ్బందిని పోగొట్టుకుని శరీరాన్ని శరీరంలా చూసే స్థితికి చేరుకోవడమే ఈ కథ. ‘త్రీ ఇడియెట్స్’లో ఇండియన్ స్క్రీన్ మీద ఇంతకుముందు కనిపించని సన్నివేశం ఉంటుంది. అది క్లయిమాక్స్లో కొంతమంది ఐఐటి విద్యార్థులు కలిసి కాన్పు కష్టమైన తమ డీన్ కుమార్తెకు పురుడు పోయడం. ఈ సన్నివేశం తీయడం కత్తి సాము మీద నడవడం లాంటిది. ఆ సమయంలో అక్కడ ఉన్నది స్త్రీ కాదు... ఆ కుర్రవాళ్లు పురుషులు కాదు. ఆమె పేషెంట్... వాళ్లు ఆమెకు సాయం చేస్తున్న మనుషులు... అలా చూపించగలగడంలో దర్శకుడు పెద్ద సక్సెస్ సాధిస్తాడు. అందుకే ఆమిర్ ఖాన్ కాన్పు కావాల్సిన స్త్రీ నుంచి బిడ్డ తల బయటకు వచ్చిందో లేదో లోపల తొంగి చూసి చెక్ చేయడం అసభ్యంగా ఉండదు. ఆ సందర్భంలో ప్రేక్షకులతో సహా అందరూ తాము స్త్రీలో పురుషులో అనే సంగతి మరచి మానవులుగా మారతారు. వైద్యంలో వైద్యులు ఇదే సాధన చేస్తారు. ‘డాక్టర్ జి’లో సీనియర్ గైనకాలజిస్ట్గా పని చేసిన షెఫాలీ షా పాత్ర ముఖ్యం. ఈ పాత్రే పి.జి. చేస్తున్న ఆయుష్మాన్ ఖురానాకు వైద్యం నేర్పిస్తుంది. స్త్రీ దేహ సమస్యలను మనిషిగా అర్థం చేసుకోవడంలో సాయం చేస్తుంది. హీరోయిన్గా రకుల్ ప్రీత్ కనిపిస్తుంది. కథలో ఆమె కూడా మెడిసిన్లో పి.జి. చేసే స్టూడెంటే. మగవాళ్లు దర్శకులుగా ఉంటే ఇలాంటి సినిమాలు స్త్రీల దృష్టికోణం తప్పే అవకాశం ఉంది. కాని ఈ సినిమాకు దర్శకత్వం వహించింది అనుభూతి కశ్యప్. ఈమె అనురాగ్ కశ్యప్, అభినవ్ కాశ్యప్ (దబంగ్ దర్శకుడు)ల సోదరి. ‘డాక్టర్ జి తీయడానికి చాలారోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. మొత్తం మీద తీయగలిగాను’ అంటుందామె. మేనేజ్మెంట్ రంగంలో 8 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన అనుభూతి కశ్యప్ చివరకు తాను పని చేయాల్సింది సినిమాల్లోనే అని గ్రహించి మంచి ఉద్యోగాన్ని వదిలేసి అనురాగ్ కశ్యప్ తీస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’కు అసిస్టెంట్ డైరెక్టర్గా చేరింది. ఆ తర్వాత వెబ్ సిరీస్ తీసింది. ‘డాక్టర్ జి’ ఆమె తొలి పెద్ద సినిమా అని చెప్పవచ్చు. మగ డాక్టర్ దగ్గర చూపించుకోవడం నామోషీ అని భావించే మహిళా పేషెంట్లు, మహిళా పేషెంట్ల విషయంలో కంఫర్ట్ ఫీలవని మగ డాక్టర్లు ఈ సినిమాను ఎలా వ్యాఖ్యానిస్తారో చూడాలి. మగవాళ్లు దర్శకులుగా ఉంటే ఇలాంటి సినిమాలు స్త్రీల దృష్టికోణం తప్పే అవకాశం ఉంది. కాని ఈ సినిమాకు దర్శకత్వం వహించింది అనుభూతి కశ్యప్. ఈమె అనురాగ్ కశ్యప్, అభినవ్ కాశ్యప్ (దబంగ్ దర్శకుడు)ల సోదరి. ‘డాక్టర్ జి తీయడానికి చాలారోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. మొత్తం మీద తీయగలిగాను’ అంటుందామె. -
నారాయణ హృదయాలయ విస్తరణ
న్యూఢిల్లీ: హెల్త్కేర్ సేవల కంపెనీ నారాయణ హృదయాలయ బెంగళూరులోని ఆర్థోపెడిక్ ఆసుపత్రిని కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 200 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. వ్యాపార బదిలీకి వీలుగా శివ అండ్ శివ ఆర్థోపెడిక్ హాస్పిటల్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. తద్వారా స్లంప్ సేల్ పద్ధతిలో ఆర్థోపెడిక్ ట్రౌమా ఆసుపత్రిని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఆసుపత్రికి సంబంధించిన అన్నిరకాల ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు, లైసెన్సులు, కాంట్రాక్టులు బదిలీకానున్నట్లు వివరించింది. స్పార్‡్ష గ్రూప్ హాస్పిటల్స్కు చెందిన సంస్థ 100 పడకల సామర్థ్యంతో దశాబ్దకాలానికిపైగా ఆర్థోపెడిక్ సర్వీసులను అందిస్తోంది. గతేడాది ఈ యూనిట్ రూ. 49 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఈ వార్తల నేపథ్యంలో నారాయణ హృదయాలయ షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 707 వద్ద ముగిసింది. -
ఆర్థోపెడిక్ అంతా ఆరోగ్యశ్రీలో
సాక్షి, హైదరాబాద్: అన్నిరకాల ఆర్థోపెడిక్ చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయని వైద్యారోగ్య మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రైవేట్కు పోటీ గా ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్ వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రుల అభివృద్ధి కోసం ఆరోగ్యశ్రీ కింద నిధులను విడుదల చేశామని, ఈ నిధులను స్థానిక సూపరింటెండెంట్లు వాడుకొని ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్రభుత్వ, ప్రైవేటు ఆర్థోపెడిక్ వైద్యులతో మంత్రి ఆదివారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో అందిస్తున్న ఆర్థోపెడిక్ సేవలపై సమీక్షించారు. ఈ విభాగంలో ప్రజలకు మెరు గైన వైద్య సేవలందించేందుకు అవసరమైన వైద్య విధానాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని ఆస్పత్రులకు తగినంత బడ్జెట్ ఇచ్చామని, పేద ప్రజలకు మరింత మెరుగైన ఆర్థోపెడిక్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో చేయలేనివే హైదరాబాద్కు రిఫర్ చేయాలి ‘మోకాలి చిప్ప మార్పిడి సర్జరీకి అన్ని వసతులను ప్రభుత్వాస్పత్రుల్లో సమకూర్చాం. రాష్ట్రవ్యాప్తంగా 56 సీఆర్మ్ మెషీన్లు ఏర్పాటు చేశాం. మోకాలి చిప్ప మార్పిడి సర్జరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగేలా చూడాలి. దీనివల్ల పేదలకు ఆర్థిక భారం తప్పుతుంది’అని మంత్రి అన్నారు. సూపరింటెండెంట్లు ఆర్థోపెడిక్ వైద్యులకు సహకారం అందించాలని కోరారు. ‘జిల్లా ఆస్పత్రులను బలోపేతం చేశాం. అధునాతన వైద్య పరికరాలు సమకూర్చాం. జిల్లాల్లో అందించలేని చికిత్సలనే హైదరాబాద్కు రిఫర్ చేయాలి’అని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. బడ్జెట్లో వైద్య పరికరాలకు రూ. 500 కోట్లు, సర్జికల్కు రూ. 200 కోట్లు, వైద్య పరీక్షలకు రూ. 300 కోట్లు, మందులకు రూ. 500 కోట్లు, ఆస్పత్రుల అభివృద్ధికి రూ. 1,250 కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ వైద్య సేవలు అందించే వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లకు, ఇతర సిబ్బందికి అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. అందరూ మరింత కష్టపడి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రణాళికతో ముందుకెళ్తే మరింత ప్రయోజనం: గురువారెడ్డి తమ ఆస్పత్రుల్లో ప్రణాళికాబద్ధమైన విధానం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందికి చికిత్స అందించగలుగుతున్నామని, ఇదే పద్ధతిని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాటిస్తే ఎక్కువ మందికి ప్రయోజనం జరుగుతుందని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు గురువారెడ్డి అన్నారు. ప్రభుత్వానికి ఏ సమయంలోనైనా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వైద్యులు అంకితభావంతో పేషెంట్ల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తే మరింత మందికి సేవలు అందించడం సాధ్యమవుతుందని మరో ఆర్థోపెడిక్ వైద్యుడు అఖిల్ దాడి అన్నారు. కొత్త చికిత్స విధానాలపై పరిశోధనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, దీని వల్ల వైద్యులకు ఆసక్తి పెరుగుతుందని డాక్టర్ నితిన్ చెప్పారు. సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఈ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement