-
పాండురాజు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 7 అంబాలిక వ్యాసుడి విరూపాన్ని చూసి బెదిరిపోయి పాలిపోయినట్టయింది గనకనే పాలిపోయిన తెల్లని ఒంటితో పుట్టిన కొడుక్కి ‘పాండు’ (అంటే, తెల్లవాడు) అని పేరుపెట్టారు. రెండోవాడైనా, అన్న ధృతరాష్ట్రుడి గుడ్డితనం కారణంగా పాండుడే రాజయ్యాడు. క్షాత్ర విద్యలన్నీ క్షుణ్ణంగా నేర్చుకొన్నాడు. స్వయంవరంలో కుంతిని పెళ్లి చేసుకొన్నాడు. భీష్ముడు మద్రరాజైన శల్యుడి దగ్గరికి వెళ్లి, అతని చెల్లెలు మాద్రిని తెచ్చి, పాండుకి రెండో భార్యగా చేశాడు. ఒక నెలపాటు ఉన్నాడో లేదో పాండురాజు దిగ్విజయానికి వెళ్లాడు. తిరిగి వచ్చిన తరువాత భార్యలిద్దరితోనూ వనవిహారం చేస్తూ ఉండేవాడు. ఓ రోజున వేటతమకంలో కామక్రీడలో ఉన్న జింకల్ని బాణాలతో కొట్టాడు. అవి నేలకొరిగాయి. రామాయణంలో కువకువలాడుతూ కామమోహితాలై ఉన్న క్రౌంచపక్షుల జంటలో ఒకదాన్ని వేటగాడు కొట్టినట్టుగా ఇక్కడ కూడా కామమోహితాలై ఉన్న జింకల మీద పాండురాజు ప్రహారం చేశాడు. ఆ జింకలు నిజానికి మృగాలు కావు; మృగ రూపంలో ఉన్న మునిదంపతులు. కిందముడనే ఆ ముని మహాతపస్సంపన్నుడు గనక మానుష రూపంలో భార్యతో సంభోగించడానికి కొద్దిగా సిగ్గువేసింది. అందుకనే మృగరూపాన్ని ధరించారు దంపతులిద్దరూను. జంతువులు మైథున క్రియలో ఉన్నప్పుడు ఎంతటి క్రూరుడైన వేటగాడైనా చంపడానికి తటపటాయిస్తాడు. కానీ బుద్ధిమంతుడే అయినా పాండురాజు ప్రారబ్ధానికి లోబడి ప్రాణాంతకమైన బాణాల్ని వేశాడు. కిందముడు చనిపోతూ ‘నువ్వు కూడా స్త్రీ సుఖానికి ఉపక్రమిస్తే చచ్చిపోతావు’ అని శపించాడు. పాండురాజుకి వైరాగ్యం పుట్టుకొచ్చింది. సన్యాసిగా ఉందామని పెళ్లాలను రాజధానికి వెళ్లిపోమన్నాడు. కానీ వాళ్లు కూడా అతనితో పాటే ఉంటామనడంతో వానప్రస్థుడిగా ఆ వనంలోనే తపస్సూ ధ్యానమూ చేసుకొంటూ ఉండిపోయాడు. ఆభరణాలనూ ఖరీదైన బట్టల్నీ అక్కడున్న బ్రాహ్మణులకు ఇచ్చేశాడు. ‘పాండురాజు వానప్రస్థాశ్రమం తీసుకొన్నాడ’న్న వార్తనూ, రాజధనాన్నీ... హస్తినాపురానికి చేరవేయమని సేవకులందర్నీ పంపించేశాడు. ఆ తర్వాత ఆ వనం నుంచి గంధ మాదన పర్వతం మీదుగా శతశృంగ పర్వతానికి చేరుకొని అక్కడి తాపసులతో కలసి తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. కొంతకాలంలోనే తపస్సు తీవ్రంగా చేసి బ్రహ్మర్షులతో సమానుడయ్యాడు. ఓసారి అక్కడి మహర్షులందరూ బ్రహ్మలోకంలో జరగబోతూన్న దేవ రుషి పితృ మహాత్ముల సభను చూడడానికి బయలుదేరారు. ‘నేనూ వస్తాన’ంటూ పాండురాజు కుంతీమాద్రులతో సహా కొండల ఎగుడుదిగుడు దారుల మీదుగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. కొంతదూరం వెళ్లిన తరువాత ‘ఇక ఈ పైన గాలీ, సిద్ధులైన మహర్షులూ మాత్రమే వెళ్లగలరు. ఈ కోమలులు ఈ దారుల్లోని బాధల్ని సహించలేరు. అందుచేత మీరు ఇక పైన రాకండి’ అని మహర్షులన్నారు. ‘అవును, సంతానం లేనివాళ్లకు స్వర్గద్వారం తెరచి ఉండదు. ప్రతి మనిషికీ నాలుగు రుణాలుంటాయి. పూర్వీకుల విజ్ఞానమూ సంస్కారాలే ఇప్పటి మనిషికి వెలుగును చూపిస్తూ ఉంటాయి. కనుక, ఆ పూర్వీకుల, అంటే, పితృదేవతల రుణం తీర్చుకోవాలి. వాళ్ల వర్ధంతుల నాడు వాళ్లు మనకిచ్చిన సంస్కారాలను నెమరు వేసుకోవాలి; సంతానాన్ని పొంది, ఆ సంస్కారాల్ని కింది తరాలవాళ్లకు చేరవేస్తూ సంప్రదాయ పరంపరను అవిచ్ఛిన్నంగా సాగేలాగ చూడాలి. దేవతలనుంచి ఆ వికాసాన్ని పుణికిపుచ్చుకోవడానికి అంతస్సులో ప్రాణయజ్ఞం ద్వారా లోపలున్న దివ్యశక్తులకు ప్రాణశక్తితో సంతర్పణ చేస్తూ ఉండాలి. అదే దేవతల రుణాన్ని తీర్చుకొనే తీరు. రుషులు మనను ఉద్ధరించి వికసింపజేసే శాస్త్రాలనూ మంత్రాలనూ ప్రసాదించారు. వాటిని స్వాధ్యాయం ద్వారానూ, అంటే, వినడమూ తలపోయడమూ తదేకంగా అదే ధ్యాసలో ఉండటం ద్వారానూ, తపస్సు ద్వారానూ అనుభవంలోకి తెచ్చుకోవడమే రుషిరుణం తీర్చుకోవడమంటే. తోటి మనుషుల ఆర్తినీ ఆకలినీ తీర్చడమే మనకు వర్తమాన కాలంలోని మనుషుల రుణం తీర్చుకోవడానికి మార్గం. ఈ నాలుగింటిలోనూ ప్రాణయజ్ఞమూ తపస్సూ ప్రజాపాలనా అనేవాటితో నాకు మూడు రుణాలు తీరాయి గానీ, సంతానం ద్వారా పూర్వీకుల సంస్కారాల్ని విస్తరింపజేసే రుణం మాత్రం తీరలేదు. ఏవిధంగానైతే మా నాన్నగారి క్షేత్రరూపమైన మా అమ్మకు వ్యాసమహర్షి ద్వారా నేను పుట్టానో, అదేవిధంగా నా ఈ కుంతీమాద్రిరూప క్షేత్రాల్లో ఉత్తమ పురుషుల ద్వారా సంతానం కలిగే అవకాశముందేమో గదా అనిపిస్తూ ఉంటుంది’ అని పాండురాజంటే దానికి జవాబుగా ఆ రుషులు ‘నీకు దేవతలతో సాటి అయిన సంతానం కలుగుతుంది. సంతానం లేదు లేదు అని విలపించడం గాదు నువ్వు చేయవలసినది, ఏదైతే నీకు కలగాలో దాన్ని ఫలింపజేయడానికి గాఢమైన ప్రయత్నం చేయాలి’ అని చెప్పి వాళ్లు ముందుకు సాగిపోయారు. పాండురాజు ఇక ఆ ప్రయత్నానికి శ్రీకారం చుట్టడానికి కుంతితో ఏకాంతంలో ఆ విషయాన్ని కదిపాడు: ‘ఏ మహానుభావుడి ద్వారానైనా నాకు సంతానం కలిగేలాగ నువ్వు చేయాలి కుంతీ!’ అని చేతులెత్తి నమస్కరిస్తూ ప్రార్థించాడు. అప్పుడు కుంతి తనకు కుంతిభోజుడింట్లో ఉన్నప్పుడు దూర్వాస మహర్షి ఇచ్చిన వరం వల్ల ఏ దేవతనైనా పిలవగల శక్తి అబ్బిందని చెప్పింది. ‘అలా అయితే, ఆయా దేవతల ద్వారా పుత్రుల్ని పొందవచ్చు గదా’ అని పాండురాజు అందుకొన్నాడు. ‘అంచేత, ఈ రోజునే ఆ ప్రయత్నాన్ని చెయ్యి కుంతీ! ముందస్తుగా ధర్మదేవతను పిలు. ధర్ముడి వల్ల కలిగే పుత్రుడి మనస్సు ఎప్పుడూ అధర్మం దిక్కుగా వంగదు. అతను కురువంశీయుల్లో కల్లా గొప్ప ధర్మాత్ముడవుతాడు’. కుంతి ధర్ముణ్ని సంతానం కోసమని ఆహ్వానించింది. మంత్ర బలంతో యోగ మూర్తి రూపంలో ధర్ముడు వచ్చి కుంతికి పుత్రుణ్ని ప్రసాదించాడు. ఆకాశవాణి అతనికి యుధిష్ఠిరుడని పేరుపెట్టింది. ఆ మీద పాండురాజు ‘క్షత్రియులకు బలమే ముఖ్యం గనక నువ్వు మహాబలుడైన వాయుదేవుణ్ని ఆహ్వానించి అతి బలవంతుడైన పుత్రుణ్ని కను’ అని కుంతిని కోరాడు. వాయువు వల్ల ఆవిధంగా భీముడు పుట్టాడు. సరిగ్గా భీముడు పుట్టినరోజునే అక్కడ గాంధారికి దుర్యోధనుడు పుట్టాడు. గాంధారిలోంచి ఊడిపడిన మాంసపిండాన్ని విడదీసి రెండేళ్లు జాగర్తగా పెంచగా, దుర్యోధనుడూ దుశ్శాసనుడూ మొదలైన వందమంది కొడుకులూ దుస్సల అనే కుతురూ పుట్టారు. ఇక్కడ కుంతికి దివ్యశక్తుల వల్ల ఏడాది ఏడాదికీ వరుసగా పిల్లలు పుట్టారు. ఆ మీద దేవతలకు రాజైన ఇంద్రుణ్ని తపస్సుతో సంతోషపెట్టి, మానుషుల్నీ అమానుషుల్నీ కూడా యుద్ధంలో ఎదిరించి నాశనం చేయగలిగే మహావీరుణ్ని పొందాలని పాండురాజు కోరుకొన్నాడు. ఇంద్రుడు ప్రసన్నుడయ్యాడు. కుంతి ఇంద్రుణ్ని పిలిచింది; అర్జునుడు పుట్టాడు; ఆకాశంలో దుందుభులు మోగాయి. పాండురాజుకు పుత్ర ప్రలోభం పెరిగిపోయింది. అయితే అది ధర్మవిరుద్ధం కాబట్టి కుంతి ఇక వద్దంటూ వారించింది. సవతికి సంతానం కలగ్గానే మాద్రికి సంతాపం కలిగింది. మొగుడితో ‘నేను స్వయంగా సవతిని అడగలేను. మీరు కుంతికి చెప్పి ఆ మంత్రం ద్వారా నాక్కూడా పిల్లలు కలిగేలాగ చేస్తే నా సంతాపం తీరడమే గాక మీ క్కూడా హితం జరుగుతుంది’ అంది. కుంతి తన మంత్రాన్ని మాద్రి ద్వారా ఫలింపజేసింది. నకుల సహదేవులు పుట్టారు. అందగాళ్లైన తన ఐదుగురు కొడుకుల్నీ చూసుకొంటూ ఆ పర్వతం మీద ప్రసన్నంగా నివసిస్తూ ఉన్నాడు పాండురాజు. ఓసారి వసంత రుతువులో వనమంతా పూలతో విరబూసి సర్వభూతాలకూ సమ్మోహనంగా తయారైంది. పిల్లల్ని చూసుకొంటూన్న కుంతి... పాండురాజు, మాద్రీ కలిసి వనంలో సంచారానికి వెళ్లడాన్ని గమనించలేదు. మాద్రిని చూస్తూ ఉంటే, పరిసరాల మహాత్మ్యం వల్ల, వనంలో దావాగ్ని పుట్టి పెరిగినట్టు, పాండురాజులో కామాగ్ని ఒక్కసారిగా భగ్గుమంది. కిందముడు పెట్టిన శాపం గుర్తుకు రాలేదు. మాద్రి ‘వద్దు వద్దు’ అంటున్నా వినకుండా, ఇక తన జీవితం అంతమైపోవాలన్నట్టుగా, మన్మథుడికి వశీభూతుడై బలవంతంగా ఆవిణ్ని వాటేసుకొన్నాడు. అంతే, అతను నిర్జీవుడైపోయాడు. మాద్రి, తన వల్లనే ఈ అఘాయిత్యం జరిగిందని, అతనితో పాటే చితిలో కాలిపోయింది. పిల్లలు తండ్రిలేని పిల్లలైపోయారు. అక్కడి రుషులు కుంతినీ పిల్లల్నీ హస్తినాపురానికి తీసుకువచ్చి ధృతరాష్ట్రుడికి అప్పగించారు. పాండురాజు చనిపోగానే అతని ప్రభావం అంతటితో ముగిసిపోలేదు. అతనివల్లనే మహాభారత యుద్ధానికి బీజం కూడా పడింది. భూలోకానికి బయలుదేరుతూన్న నారదుణ్ని ఖాండవ ప్రస్థంలో ఉన్న యుధిష్ఠిరుడికి ఓ మాట చెప్పమని ప్రార్థించాడు: ‘నువ్వు నీ తమ్ముళ్ల సాయంతో రాజులందర్నీ జయించగల సమర్థుడివి. దిగ్విజయుడివై నువ్వు రాజసూయ యాగాన్ని చేశావంటే ఇక్కడ ఈ ఇంద్రసభలో మహదానందంగా చాలాకాలం ఉండగలుగుతాను’ అని. నారదుడు ఈ మాట చెబుతూ ‘ఈ యాగంలో చాలా విఘ్నాలు వచ్చే అవకాశం ఉంది. అంతేగాదు. భూమ్మీద పెద్ద ప్రపంచ యుద్ధం జరిగి క్షత్రియులు చాలామంది నాశనమైపోతారు కూడాను. ఈ దృష్ట్యా నువ్వు ఆలోచించి ఏది క్షేమమో ఆ పనిని చెయ్యి. జాగర్తగా ఉంటూ తెలివీ బలమూ కృషీ శ్రమలతో పనుల్ని చేసే నాలుగు రకాల ప్రజల సంరక్షణమూ ఎలా జరుగుతుందో అలాగ చెయ్యి’ అని చెప్పి చక్కాపోయాడు. నాన్నగారికి స్వర్గ సౌఖ్యం కలకాలమూ ఉండేలాగ చేయడం కోసం యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేయటానికి పూనుకోవలసి వచ్చింది. అంటే, యుద్ధానికి తెరతీయవలసి వచ్చింది. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు -
ధృతరాష్ట్రుడు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 5 రాష్ట్రమంటే ప్రాంతమూ దేశమూ అనే అర్థాలే వాడుకలో ఉన్నాయి. అయితే, దీనికి ఉపద్రవమూ ఉత్పాతమూ ఎప్పుడొస్తుందో తెలియకుండా మీదికి విరుచుకొనిపడే విపరీతమైన కష్టమూ అనే అర్థం కూడా ఉంది. అటువంటి ఉపద్రవాన్ని ధరించి పోషించేవాడు మన ధృతరాష్ట్రుడు. అతను రాష్ట్రాన్ని తన పట్టులో ఉంచుకొని పోషించాలని చూస్తూ ఉండేవాడు. కానీ అతను పుట్టుగుడ్డి. పుట్టుగుడ్డివాడు రాజ్యాన్ని ఏవిధంగా పరిపాలించగలడు? దాన్ని తన పట్టులో ఎలాగ ఉంచుకోగలడు? ‘చక్షుర్వై సత్యం’ అని అంటారు: కంటితో చూసినదే సత్యం. కళ్లులేని కబోదికి, ఇక సత్యమనేది ఏవిధంగా అవుపిస్తుంది? అందుకనే పెద్దవాడైనా సరే, ఇతన్ని కాదని, అంబాలిక కొడుకైన పాండురాజునే రాజుగా చేశారు. పాండురాజు విలువిద్యలో మేటిగాడు; ధృతరాష్ట్రుడేమో పదివేల ఏనుగుల బలమున్నవాడు; విదురుడు, యముడి అవతారం గనక, మహాధర్మిష్ఠుడు. పాండురాజు పెళ్లైన ఒక మాసానికే దిగ్విజయానికి వెళ్లి, రాజ్యాన్ని బాగా పెంపొందించాడు; సుస్థిరంగా కూడా చేశాడు. అయినా, ఇలాగ గుడ్డితనం ‘సాకు’తో తన పెద్దరికాన్ని పక్కుకు పెట్టారని, పైకి గంభీరంగా ఉన్నా, ధృతరాష్ట్రుడికి మొదటి నుంచీ లోపల పీకుడే. తనకు కళ్లు లేకపోతే లేకపోనీ, భార్యకైనా ఉంటే ఒక పక్షంగా బాగానే ఉండేది. కానీ, గాంధారి తనను పుట్టుగుడ్డి అయిన ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లిచేస్తారని వినగానే మగాడిలో తప్పుల్ని చూడకూడదన్న కృతనిశ్చయంతో ఆమె తన నిక్షేపమైన కళ్లకు బట్టను పట్టీగా కట్టుకొంది. మొగుడు పుడుతూనే గుడ్డివాడైతే, పెళ్లాం తెచ్చిపెట్టుకొన్న గుడ్డితనం కలదైంది. ఈ రెండు గుడ్డితనాలూ కలిసి కన్న వందమంది పిల్లలూ మరోరకం గుడ్డివాళ్లయ్యారు. వాళ్లల్లో పెద్దవాడికి అసూయ అనే గుడ్డితనం. రెండోవాడికి మన్నూమిన్నూ కానని కావరమనే గుడ్డితనం. పెద్దాడు దుర్యోధనుడు పుడుతూనే గాడిదల ఓండ్రింపు లాంటి కర్ణకఠోరమైన ధ్వనిచేశాడు; అప్పుడు దిక్కులు కాలిపోతాయా అన్నట్టు వడగాలులు వీచాయి. ఇదంతా చూసి ధృతరాష్ట్రుడు ‘యుధిష్ఠరుడు మన కులంలో పెద్దబ్బాయి. అంచేత అతనికి రాజ్యం దక్కుతుంది. సరే. ఇదుగో ఈ దుర్యోధనుడు తరువాత పుట్టాడు. వీడు నా పెద్దకొడుకు గదా! వీడు కూడా రాజవుతాడా కాడా?’ అని భీష్ముడూ విదురుడూ మొదలైనవాళ్లను అడిగాడు. ఆ మాట అడగ్గానే క్రూరజంతువులు గర్జించాయి; నక్కలు అమంగళంగా ఊళలు వేశాయి. అప్పుడు విదురుడు ‘చూస్తున్నావుగా అన్నయ్యా ఈ అపశకునాలు! వీడు కులాంతకుడవుతాడు. వీణ్ని విడిచిపెడితే శాంతిగా ఉంటుంది రాజ్యం. వీణ్ని రక్షిస్తే మాత్రం చాలా ఉపద్రవమే వచ్చిపడుతుంది. ఈ ఒక్కణ్నీ వదిలిపెట్టి, కులానికే గాదు, జగత్తుకి కూడా క్షేమాన్ని కలిగించు. కులం మంచికోసం ఒకణ్ని (దుర్మార్గుణ్ని) విడిచిపెట్టాలి; గ్రామం మంచికోసం కులజంజాటాన్ని వదలాలి; జనపదం హితంకోసం గ్రామమనే సంకుచితత్వాన్ని విడిచిపెట్టాలి; విస్తారమైన సుఖం కోసం భూమి అనే ఇంతపాటి పరిధిని విడిచిపెట్టాలి’ అన్నాడు. పుత్రుడి మీది మోహం కొద్దీ విదురుడు చెప్పిన మంచి మాటల్ని పెడచెవిని పెట్టాడు ధృతరాష్ట్రుడు. పాండురాజు జింకల రూపంలో ఉన్న మునిదంపతుల్ని బాణం వేసి చంపడంతో శాపగ్రస్తుడై కామక్రీడకు దూరంగా ఉండవలసిన దగ్గర్నుంచీ వనంలోనే తపస్సు చేసుకొంటూ ఉండేవాడు. అప్పణ్నించీ రాజ్యాన్ని ధృతరాష్ట్రుడే పరిపాలిస్తున్నాడు. దూర్వాసుడు కుంతికిచ్చిన వరం సాయంతో కుంతికీ మాద్రికీ యుధిష్ఠరుడూ భీముడూ అర్జునుడూ నకులుడూ సహదేవుడూ పుట్టారు. ఓ రోజున మాద్రితోబాటు వనంలోకి షికారుకు వెళ్లిన పాండురాజుకు పట్టరాని కామం ఆవహించింది. వద్దన్నా వినకుండా మాద్రిని కావలించుకోబోయాడు. అంతే, అతను చనిపోయాడు. ‘నా వల్లనే పోయాడు గనక, నేనూ ఆయనతో బాటే వెళ్లిపోతాను’ అని మాద్రి అతని చితిలోనే కాలిపోయింది. కుంతినీ చిన్నపిల్లల్ని ఐదుగుర్నీ వెంటబెట్టుకొని, వనంలోని రుషులు హస్తినాపురానికి వచ్చి, జరిగింది చెప్పి, వాళ్లను విడిచిపెట్టి వెళ్లారు. కుర్రాళ్లు పెద్దవాళ్లవుతున్నారు. చదువులూ సంస్కారాలూ ఆయుధ విద్యలూ అబ్బాయి. అన్నిట్లోనూ పాండవులదే పైచేయిగా ఉండేది. ధర్మరాజు పెద్దవాడు గనక అతన్ని యువరాజుగా చేశాడు ధృతరాష్ట్రుడు. పౌరులందరూ ధృతరాష్ట్రుణ్ని, భీష్ముణ్ని కూడా కాదని, ధర్మరాజునే రాజుగా కోరుకోడాన్ని చూసి దుర్యోధనుడు విలవిల్లాడిపోయాడు. ‘ఈ రాజ్యం పాండురాజుది గనక, అతని పిల్లలకే చెందుతుంది. ఇక మేమూ మా పిల్లలూ రాజ్యానికెప్పుడూ దూరంగా ఉండవలసిందేనా? ఎప్పుడూ ఇతరులు వేసే కూడు తినవలసినవాళ్లమేనా? నీకే గనక మొదట రాజ్యం వచ్చి ఉంటే, మాకీ దుర్దశ ఉండేది కాదు’ అని తండ్రి ఎదుట తన బాధ వెళ్లగక్కాడు. పాండవుల్ని వారణావతమనే ఊరుకి పంపించడానికి ప్రయత్నం చేసి, ప్రజలందరూ తన అధీనంలోకి వచ్చిన తరవాత, తిరిగి వాళ్లు వచ్చేలాగ చేద్దామని ఒక ప్రణాళికను తయారుచేశాడు. అంతకుముందు కణికుడనే మంత్రి, శత్రువులు బలవంతులైతే ఉపాయంతో వాళ్లను బలహీనులుగా జేసి చంపాలనీనూ త్వరగా మట్టుబెట్టాలంటే వాళ్ల ఇంటిని తగలబెట్టాలనీనూ ధృతరాష్ట్రుడికి ఉపదేశించాడు. దీనితోనే లక్కింటి పథకానికి బీజం పడింది. నమ్మకస్తులైన మంత్రుల చేత వారణావతం ‘ఏం అందమైన నగరమండీ!’ అని పాండవుల ముందు పొగిడించాడు ధృతరాష్ట్రుడు. వాళ్లు వెళ్లడానికి సుముఖంగా ఉన్నారన్నప్పుడు ‘మీరు వారణావతం వెళ్దామనుకొంటున్నారుగా! శుభం. వెళ్లిరండి’ అని అడక్కుండానే పచ్చజెండా ఊపేశాడు. ధర్మరాజుకు ధృతరాష్ట్రుడి మనస్సు తెలియకపోలేదు కానీ పెద్దవాడి మాటకు ఎదురు ఎలాగ చెప్పగలడు? వారణావతానికి పాండవులు వెళ్తూంటే, నిర్భయులైన కొంతమంది ‘రాజు పాండవుల్నీ తన పుత్రుల్నీ సమంగా చూడటం లేదు. ధర్మాన్ని పట్టించుకోవడం లేదు. ఇంత అధర్మాన్ని భీష్ముడెలాగ ఒప్పుకొంటున్నాడో’ అని బాహాటంగానే అన్నప్పటికీ ధృతరాష్ట్రుడికి చీమకుట్టినట్టుగా కూడా లేదు. లక్క ఇంటిలో కాలిపోయారని తెలిసినప్పుడు మొసలి కన్నీళ్లు కార్చి స్నానాలు కూడా చేశాడు ధృతరాష్ట్రుడు. ద్రౌపదితో వివాహమైన తరవాత, ఇక ఈ తగాదాల్లేకుండా అర్ధరాజ్యమిచ్చేస్తానని చెప్పి పాండవుల్ని ఖాండవ ప్రస్థానికి పంపాడు. భీముడూ అర్జునుడూ నకులుడూ సహదేవుడూ నాలుగు దిక్కుల్నీ జయించుకొని వచ్చి ధర్మరాజు రాజసూయయాగం చేయడానికి అనువు కల్పించారు. అక్కడికి వెళ్లిన దుర్యోధనుడికి ధర్మరాజుకున్న సిరిని చూసి కన్నుకుట్టింది. తిండి సయించడం మానేసింది; కృశించుకొనిపోయాడు. ‘ఏమిటిలా నీరసించుకొనిపోతున్నావు?’ అని అడిగాడు తండ్రి. ‘పాండవులసిరి అంతా నన్నుజేరితేనే నాకు కంటినిండా నిద్రపడుతుంది నాన్నా! శకుని మామయ్య వాళ్లతో కపట జూదమాడి ఆ సిరిని నాకు అప్పగిస్తానంటున్నాడు. నువ్వు ఊ అంటే చాలు!’ అని పెద్ద పుత్రరత్నం గునిశాడు. ‘వాళ్ల ధనమూ నీదేగదరా! బాహువుల్లాటి వాళ్లను తెగ్గొట్టుకోకు. ద్వేషాన్ని పెట్టుకోకు’ అని నెత్తీనోరూ మొత్తుకొని చెప్పినా వినలేదు. ‘సరే, విదురుడితో మాట్లాడి నిశ్చయిద్దాంలే’ అనగానే... ‘అయినట్టే! విదురుడు బాబాయి దీన్ని పడనివ్వడు. అప్పుడింక నాకు చావే శరణ్యం’ అన్నాడు. ఎంత పుత్రమోహం ఉన్నా, విదురుణ్ని అడక్కుండా ఒక్కపనీ చేయలేడు ధృతరాష్ట్రుడు. ‘జూదం వల్ల కొడుకుల మధ్య భేదం రాకుండా చూడు అన్నయ్యా!’ అన్న విదురుడికి ‘అహ, ఇది వట్టి సుహృద్ద్యూతం మాత్రమే. అయినా నేనూ ద్రోణుడూ భీష్ముడూ నువ్వూ ఉండగా అన్యాయం ఎందుకు జరుగుతుంది?’ అని సన్నాయి నొక్కులు నొక్కుతూ పాండవుల్ని పిలిపించాడు. జూదం జరుగుతుంటే మాటిమాటికీ ‘ఇప్పుడేం గెలిచారు, ఇప్పుడేం గెలిచారు?’ అని అడుగుతూనే ఉన్నాడు. తన గుడ్డిముఖంలో తాండవిస్తూన్న ఆనందాన్నిదాచుకోలేకపోయాడు. కోడలికి అవమానం జరిగిపోయిన తరవాతనే, పెద్దలందరూ ఏమీ అనకుండా ఉండటం కోసం, ఆమెకు వరాలనిచ్చి పాండవుల దాస్యాన్ని తీర్చాడు. ‘ఇంతా సాధించిన తరవాత ముసిలోడు అంతా పాడుచేసేశాడు’ అని దుశ్శాసనుడు మెటికలు విరిచాడు. మళ్లీ జూదానికి పిలిపించమని దుర్యోధనుడు మంకుపట్టు పట్టాడు. అప్పుడు తల్లి గాంధారి కూడా ‘నీ అదుపులో వాడు ఉండనంటే, కులానికి చిచ్చులాంటివాణ్ని వదిలిపెట్టెయ్’ అని చెప్పింది. ‘కులం అంతమైపోతే పోనీ నేను మాత్రం దుర్యోధనుణ్ని ఆపలేను’ అని ధృతరాష్ట్రుడు చేతులెత్తేశాడు. ‘పద్నాలుగో ఏడాది తిరిగివచ్చినప్పుడు, వాళ్ల రాజ్యం వాళ్లకు ఇవ్వకపోతే భీమార్జునులు నిశ్శేషంగా అందర్నీ చంపేస్తారు. అందుకని అహితం చేస్తూన్న నీ కొడుకును విడిచిపెట్టు’ అని విదురుడు అనేసరికి కోపాన్ని పట్టలేక ‘నిజమే, పాండవులూ నా పుత్రులే. కానీ, దుర్యోధనుడేమో నా శరీరం నుంచి పుట్టాడు. నా దేహాన్ని నేనెలాగ వదిలిపెట్టాలి? నీకెప్పుడూ పాండవులంటేనే ఇష్టం. నీ ఇష్టమొచ్చిన చోటికి వెళ్లవచ్చు’ అని ధృతరాష్ట్రుడు నోరుజారాడు. విదురుడు వెళ్లిన మీదట, తాను చేసిన తప్పు స్పృహకు వచ్చి, వెంటనే సారథి సంజయుణ్ని పంపి, అతన్ని తిరిగి వచ్చేలా చేసుకొన్నాడు. యుద్ధం వచ్చి పడబోతోందన్న దగ్గర్నుంచీ నిద్ర కరువైపోయింది. విదురుడూ సనత్సుజాతుడూ ఎంతమంది చెప్పినా ఊరట కలగలేదు. సంజయుడు యుద్ధ విషయాలను చెబుతూంటే కుమిలి కుమిలిపోయాడు. శ్రీకృష్ణుడు చెప్పిన గీతను విన్నా కోపం ఏమాత్రమూ తగ్గలేదు. వందమంది పిల్లల్నీ చంపినవాడు భీముడు గనక అతన్ని తన కౌగిలిలో చంపేద్దామని అనుకొన్నాడు. శ్రీకృష్ణుడు ఇనుప విగ్రహాన్ని ధృతరాష్ట్ర కౌగిలిలోకి పంపాడు. మొదటినుంచి చివరిదాకా ధృతరాష్ట్రుడిది ఒకటే తీరు: పుత్రమోహంతో అజాగ్రత్తగా వ్యవహరించడం. ‘అజాగ్రత్తే మృత్యువు’ అని ఎంతమంది చెప్పినా తెలుసుకోలేక పోయాడు. మనిషి మనస్సు కూడా ఇలాగే అజాగ్రత్తగా ప్రవర్తిస్తూ శరీర రాష్ట్రానికి ‘రాష్ట్రాన్ని’ అంటే ఉపద్రవాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement