-
వసుంధర రాజే x సచిన్
‘‘ఆమెకేం మహారాణి. రాజ కుటుంబీకుల వంశం నుంచి వచ్చారు. అందుకే అంత ఆధిపత్య ధోరణి. పరిపాలనలోనూ నియంతృత్వ పోకడలు. ఎవరికీ అందుబాటులో ఉండరు. ప్రజా సమస్యలు అసలే పట్టవు’’ ఇవీ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజెపై వినిపిస్తున్న విమర్శలు. ఆమె ఒంటెత్తు పోకడలు, పార్టీ నేతలకూ అందుబాటులో ఉండకపోవడం, ఎవరినీ లెక్క చేయకపోవడం వంటివి వసుంధరా రాజె పరిపాలనపై తీవ్ర వ్యతిరేకతను పెంచా యి. వచ్చే ఎన్నికల్లో ఆమె సీఎం కాకూడదని ఏకంగా 48% మంది కోరుకుంటున్నారని వివిధ సర్వేల్లో తేలింది. సొంత పార్టీలోనూ ఆమె వ్యవహార శైలి మింగుడుపడనివారు సీఎం అభ్యర్థిని మార్చాలంటూ స్వరం పెంచారు. కానీ బీజేపీ అధిష్టానం ఆ సాహసం చేయలేకపోయింది. దానికీ కొన్ని కారణాలున్నాయి. రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంతో వసుంధరా రాజెకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. కుల సమీకరణలతో రాజకీయ వ్యూహాలను రచించడంలో ఆమెది అందెవేసిన చెయ్యి. 120 మంది వరకు ఎమ్మెల్యేలు ఆమె కనుసన్నల్లోనే ఉన్నారు. పార్టీలో అంతర్గతంగా శత్రువులు ఉన్నప్పటికీ వారిలో చీలికలు తేవడంలో ఆమెకు ఆమే సాటని నిరూపించుకున్నారు. అందుకే తనకు ఎదురైన రాజకీయ సంక్షోభాల నుంచి చాలా తేలిగ్గా బయటపడ్డారు. దీంతోపాటు ప్రజల్లో కాస్తో కూస్తో చరిష్మా కలిగిన నేతలు బీజేపీకి కరువయ్యారు. ఓం మాథుర్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వంటి నేతలు ఉన్నప్పటికీ వారు అందరికీ ఆమోదయోగ్యమైన నేతలు కారు. ఆరెస్సెస్ ఆశీస్సులు కూడా ఆమెకే ఉండడంతో బీజేపీ అధిష్టానానికి మరో మార్గం లేకపోయింది. ఎన్నికల వ్యూహాలు ‘‘నేను రాజ్పుట్ల కూతురిని, జాట్ల కోడలని, గుజ్జార్ల వియ్యపురాలిని’’ ఇదీ ఎన్నికల సభల్లో వసుంధరా రాజె సాగిస్తున్న ప్రచారం. తన కోడలు నిహారికా సింగ్.. గుజ్జార్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అన్ని కులాల వారికి చెందిన వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తమకు మద్దతుని చ్చిన రాజ్పుట్లు, గుజ్జార్లు దూరమవడంతో ఆమె ప్రతిచోటా భావోద్వేగాలతోనే వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. 40 రోజుల పాటు సాగే రాజస్థాన్ గౌరవ యాత్ర ప్రారంభించి గ్రామ గ్రామానికి వెళుతున్నారు. తాను ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్షగా భావిస్తూ వాటి గురించే పదే పదే ప్రస్తావిస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను మించి పార్టీలో కేడర్ వ్యతిరేకతే కలవరపెడుతూ ఉండడంతో జనసంవాద్ పేరుతో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. జాట్లకు దగ్గరయ్యే వ్యూహంలో భాగంగా కీలకమైన ప్రభుత్వ పదవుల్లో జాట్ అధికారుల్ని నియమించారు. హిందూ కార్డుని బయటకు తీసి ముస్లిం పేర్లుగా ధ్వనిస్తున్న గ్రామాల పేర్లకి హిందూ పేర్లు పెడుతున్నారు. వ్యక్తిగత జీవితం మధ్యప్రదేశ్లో గ్వాలియర్కు చెందిన రాజమాత విజయరాజె సింధియా, జివాజీరావు సింధి యా దంపతుల నాలుగో సంతానమే వసుంధరా రాజె. ముంబైలో 1953, మార్చి 8న జన్మించారు. సోఫియా కాలేజీ నుంచి డిగ్రీ పట్టా తీసుకున్నారు. 1972లో ధోల్పూర్కు చెందిన హేమంత్సింగ్ను వివాహం చేసుకున్నారు. ఏడాది తర్వాత విభేదాలతో భర్త నుంచి విడిపోయారు. వారికి దుష్యంత్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడు. అభిరుచులు.. వసుంధరా రాజె పుస్తకాల పురుగు. చిన్నతనం నుంచి పుస్తకం కనిపిస్తే చాలు ఆసాంతం చదివేదాకా నిద్రపోయేవారు కాదు. ఇప్పటికీ రాత్రి పడుకునే ముందు కాసేపు పుస్తకం చదువుతారు. ఆమె అభిమాన రచయిత్రి హిలరీ మాంటెల్. వందల పుస్తకాలు ఆమె లైబ్రరీలో ఉన్నాయి. పెంపుడు జంతువులన్నా ఆమెకు వల్లమాలిన ప్రేమ. కుక్కల్ని పెంచుతారు. గుర్రాలంటే కూడా ఎంతో ఇష్టం. క్రీడలకి ఆమె పెద్ద ఫ్యాన్. అన్ని రకాల ఆటల్ని ఫాలో అవుతారు. క్రికెట్ అంటే వల్లమాలిన అభిమానం. టీమిండియా గెలిచిన ప్రతీసారి అభినందనలు తెలుపుతూ ట్వీట్లు పెడతారు. మొక్కల పెంపకం కూడా రాజెకి ఎంతో ఇష్టమైన అంశం. ఖాళీ సమయం దొరికితే పెరటి తోటలో చెట్ల మధ్యే గడుపుతారు. రాజకీయ ప్రస్థానం తల్లి విజయరాజె ప్రోద్బలంతోనే 1984లో రాజె రాజకీయాల్లో అడుగుపెట్టారు. బీజేపీ తీర్థం తీసుకున్న రెండేళ్లలోనే బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్య క్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత ధోల్పూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989లో తొలిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు. అప్పటినుంచి వరుసగా నాలుగుసార్లు ఎంపీగా విజయం సాధించారు. కేంద్ర విదేశాంగ సహాయమంత్రిగా కూడా పనిచేశారు. 2003 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజస్థాన్లో పరివర్తన యాత్ర చేపట్టి ప్రజలకి దగ్గరయ్యారు. ఆమె నేతృత్వంలో 120 సీట్లతో పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత 2008 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాజె ప్రాభవాన్ని కోల్పోలేదు. మంచి పరిపాలనా దక్షురాలిగా పేరు తెచ్చుకున్న వసుంధరా రాజె ఈసారి మాత్రం ఎవరికీ అందుబాటులో ఉండక చేజేతులారా తన ఇమేజ్ని డ్యామేజ్ చేసుకున్నారు. ‘‘స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్’’ ఇదీ కాంగ్రెస్ యువనేత సచిన్ పైలెట్ విధానం. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్ని చూసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన సచిన్ పైలెట్.. పార్టీ పటిష్టతలో తనదైన పాత్ర పోషించారు. ఒకప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగడానికి కూడా భయపడే నియోజకవర్గాల్లో.. గెలుపు మాదే అన్న ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పారు. పార్టీ కార్యకర్తలతో నిరంతరం టచ్లో ఉంటూ వారు చురుగ్గా పనిచేసేలా చర్యలు చేపట్టారు. గత ఫిబ్రవరి ఉపఎన్నికల సమయంలో గ్రామగ్రామాన పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితుల్ని ఆకళింపు చేసుకున్నారు. అల్వార్, అజ్మీర్ లోక్సభ స్థానాలు, మండల్గఢ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయడం వెనుక సచిన్ కీలక పాత్ర పోషించారు. దీంతో సచిన్ సీఎం అభ్యర్థి రేసులో ముందుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ చట్టం సవరణ సమయంలో నూ, పెట్రో ధరలు పెరిగేటప్పుడు జరిగే నిరసనల్లో నూ ముందుండి విజయవంతంగా నడిపించారు. అనుకూల అంశాలు - ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు - కుల సమీకరణలకి అనుగుణంగా రాజకీయ వ్యూహరచన - భామాషా ఆరోగ్య బీమా పథకం, రాజశ్రీ యోజన వంటి పథకాలతో మహిళల నుంచి మద్దతు ప్రతికూల అంశాలు - ఎవరికీ అందుబాటులో ఉండరన్న చెడ్డపేరు - నియంతృత్వ పోకడలు - రాజ్పుట్లు, గుజ్జార్లు వంటి బలమైన సామాజిక వర్గాలను దూరం చేసుకోవడం ఎన్నికల వ్యూహాలు.. ఎన్నికల ప్రచారం అంటే మాటలు కోటలు దాటేస్తాయి. తిట్లు, శాపనార్థాలు చివరికి బూతులు కూడా మన నేతలు మాట్లాడడం సర్వసాధారణమై పోయింది. సచిన్ దీనికి భిన్నం. పాజిటివ్ క్యాంపెయిన్ ఆయన విధానం. మంచి మాటకారి. ఏ అంశం మీదనైనా ధారాళంగా, స్పష్టంగా మాట్లాడతారు. ప్రభుత్వ వైఫల్యాలను గణాంకాలతో సహా విడమరిచి చెబుతూనే, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతున్నారు. నియోజకవర్గాలవారీగా మేనిఫెస్టోలు రూపకల్పన చేస్తూ ప్రజాసమస్యలే ప్రధాన ఎన్నికల అస్త్రంగా చేసుకున్నారు. రైతు సమస్యలు, నిరుద్యోగం గురించి ఎన్నికల ర్యాలీల్లో ప్రస్తావిస్తున్నారు. ఈసారి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు 65 లక్షలకుపైగా ఉన్నారు. దీంతో వారి ఓట్లను ఆకర్షించే వ్యూహాలు పన్నుతున్నారు. నిధుల కొరత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కోసం క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫాం ఏర్పాటు చేశారు. గుజ్జార్ సామాజిక వర్గానికి చెందిన పైలెట్ వారి ఓటు బ్యాంకుని కాంగ్రెస్ వైపు తిరిగి మళ్లించడంలో కీలకపాత్ర పోషించారు. బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్న రాజ్పుట్లను తనవైపు తిప్పుకుంటున్నారు. అయితే జనాకర్షణ అంశంలో ఇంకా వెనుకబడే ఉన్నారు. వివిధ సంస్థల సర్వేల్లో 11% మంది మాత్రమే సచిన్ పైలెట్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు వెల్లడైంది. రాజకీయ ప్రస్థానం.. కాంగ్రెస్ దివంగత నాయకుడు రాజేష్ పైలెట్ కుమారుడు సచిన్ పైలెట్. ఉత్తరప్రదేశ్లో సహరణ్పూర్లో 1977 సెప్టెంబర్ 7న జన్మించారు. డబుల్ ఎంబీఏ చేశారు. ఒక కోర్సు అమెరికాలో చదివారు. 2004లో రాజస్థాన్ అజ్మీర్ నుంచి లోక్సభకు తొలిసారి ఎన్నికయ్యారు. దేశంలోనే అతి పిన్న వయసులో అంటే 26 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 2009లోనూ విజయం సాధించారు. యూపీఏ–2లో కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్లు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్గా నియమితులయ్యారు. గ్రామీణాభివృద్ధిపై పైలెట్కు ఆసక్తి ఎక్కువ. వ్యక్తిగత జీవితం.. రాజకీయాల్లోకి రాక ముందు బీబీసీ ఢిల్లీ బ్యూరో లో జర్నలిస్టుగా సేవలందించారు. ఆ తర్వాత జన రల్ మోటార్స్లో కూడా çకొంతకాలం పనిచేశారు. అమెరికాలో చదువుకునే సమయంలోనే జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కుమార్తె సారా అబ్దుల్లాతో ప్రేమలో పడ్డారు. అయితే వారి వివా హానికి ఫరూక్, ఒమర్ అంగీకరించలేదు. పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగానే వాళ్లు 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరన్, వెహాన్.. ఇద్దరు కుమారులు. తర్వాత కాలంలో అబ్దుల్లా కుటుంబం పైలెట్తో రాజీకొచ్చింది. తన తండ్రి రాజేశ్ పైలెట్ కోరిక మేరకు కేంద్ర మంత్రి అయ్యాక సరిహద్దు రక్షక దళంలో చేరారు. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కోవడానికి సిటిజెన్ అలయెన్స్ను ఏర్పాటు చేశారు. తన తండ్రి స్మృతిలో ‘రాజేశ్ పైలెట్: ఇన్ స్పిరిట్ ఫరెవర్’ అనే పుస్తకాన్ని సోదరి సారికా పైలెట్తో కలిసి రచించారు. అశోక్ గెహ్లాట్ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మరో నాయకుడు అశోక్ గెహ్లాట్ సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. 1998 నుంచి 2003 వరకు, తిరిగి 2008 నుంచి 2013 వరకు రాజస్థాన్ సీఎంగా ఉన్నారు. పరిపాలనలోనూ తనదైన ముద్ర వేశారు క్లీన్ ఇమేజ్ ఆయన సొంతం. ప్రజలకి అందుబాటులో ఉంటారని పేరు సంపాదించారు. 2013 ఎన్నికల సమయానికే మోదీ వేవ్లో రాజస్థాన్లో బీజేపీ నెగ్గింది తప్ప గెహ్లాట్ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. ఇప్పటికీ 35% మంది ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నారని సర్వేల్లో తేలింది. రాహుల్ గాంధీ ఆలయాల సందర్శన, హిందూత్వ కార్డు తీయడం వెనుక వ్యూహకర్త గెహ్లాటే. లోక్సభ ఎన్నికల్లో వ్యూహాలు రచించడానికి గెహ్లాట్ సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకే పైలెట్నే ముందుంచి అసెంబ్లీ ఎన్నికల్ని నడిపిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సీఎం అభ్యర్థి రేసులో గెహ్లాట్తో పాటు సీపీ జోషి పేరు కూడా వినిపిస్తోంది కానీ పార్టీ గెలిస్తే ఆయన్ను సీఎంని చేసే అవకాశాలు చాలా తక్కువ. అయితే ప్రచారంలోనూ, టికెట్ల పంపిణీలోనూ జోషికి కాంగ్రెస్ హైకమాండ్ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మూక హత్యలపై సీఎం సంచలన వ్యాఖ్యలు
జైపూర్ : మూక దాడులు రాజస్తాన్కే పరిమితం కాదని, ప్రపంచమంతటా ఈ ధోరణి ఉందని రాజస్తాన్ సీఎం వసుంధరా రాజె పేర్కొన్నారు. ఈనెల 20న అల్వార్లో గోరక్షకులుగా చెప్పుకునే మూక దాడిలో రక్బర్ ఖాన్ మరణించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘ఇలాంటి ఘటనలు రాజస్తాన్లోనే కాదు ప్రపంచమంతటా జరుగుతున్నవే. రాజస్తాన్లో మాత్రమే జరుగుతున్నవి కాద’ని ఓ న్యూస్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు. రక్బర్ ఖాన్ హత్యోదంతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించడం ద్వారా కఠినంగా వ్యవహరించామన్నారు. అల్వార్ మూకహత్యలో బాధితుడిని ఆస్పత్రికి తరలించడంలో జాప్యం చేసిన ఏసీపీ మోహన్ సింగ్ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆవును తరలిస్తున్నాడనే అనుమానంతో రక్బర్ ఖాన్ (29)ను అల్వార్లో కొందరు దారుణంగా కొట్టిచంపిన సంగతి తెలిసిందే. కాగా, రక్బర్ ఖాన్ చేతులు, కాళ్ల ఎముకలు ఫ్రాక్చర్ అయినట్టు, మృతుడి శరీరంపై 12 గాయాలున్నట్టు రక్బర్ ఖాన్ పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించింది. -
హనుమంతరావు మృతికి పలువురి సంతాపం
సాక్షి, హైదరాబాద్: సాగునీటి రంగ నిపుణుడు, రిటైర్డ్ ఈఎన్సీ టి.హనుమంతరావు మృతిపై రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజస్తాన్ లో నీటి వనరుల అభివృద్ధికి హనుమంతరావు అందించిన సేవలు మరువ లేనివని వసుంధర కొనియాడారు. చిన్న నీటిపారుదల రంగంలో హనుమంతరావు ప్రయో గాలు ప్రామాణికంగా ఉన్నట్టు మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. తెలంగాణలో గుర్తింపుపొందిన ఇంజనీర్లలో హనుమంతరావు ఒకరని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. హనుమంతరావు అంత్యక్రియలు మంగళవారం జరుగనున్నాయి. హనుమంతరావు మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంతాపం తెలిపారు. నీటిపారుదల శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి, చతుర్విద జల ప్రకియను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఆయన రూపొందించిన టెక్నాలజీని పలు దేశాల్లో, మన దేశంలోని వివిధ రాష్ట్రాలు ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో వ్యవసాయాన్ని సాగిస్తున్నారని నివాళులర్పించారు. ఐక్యరాజ్యసమితికి సలహాదారుగా వ్యవహరించడంతోపాటు ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్ దేశాల్లో పలు సాగునీటి ప్రాజెక్టుల అమల్లో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. శ్రీరాం వెదిరె సంతాపం సాక్షి, న్యూఢిల్లీ: నీటి పారుదల రంగ నిపుణులు టి.హనుమంతరావు మృతికి కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ సహా దేశవ్యాప్తంగా నీటి పారుదల రంగానికి సేవలందించి హనుమంతరావు మార్గదర్శిగా నిలిచారని ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
అవును.. ఆ సంతకం నాదే: వసుంధర రాజె
మోదీ గేట్ కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె కొంత మేర ఇరుక్కున్నట్లు కనిపిస్తోంది. లలిత్ మోదీ ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుకు మద్దతుగా బయటపడిన డాక్యుమెంట్లో సంతకం తనదేనని ఆమె తన పార్టీ అగ్రనేతల వద్ద అంగీకరించినట్లు తాజాగా తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు ఆమెతో రాజీనామా చేయించే ఆలోచనలో మాత్రం బీజేపీ వర్గాలు కనిపించడంలేదు. ఆ లేఖను తాను వ్యక్తిగత హోదాలో ఇచ్చాను తప్ప.. రాజస్థాన్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా కాదని చెప్పేలా చూస్తున్నారని సమాచారం. లలిత్ మోదీ ఇమ్మిగ్రేషన్ దరఖాస్తును ఆమోదించాలంటూ వసుంధర రాజె ఒక పత్రం మీద సంతకం చేశారని.. నాలుగేళ్ల క్రితం నాటి ఆ పత్రాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ బుధవారం రాత్రి బయటపెట్టిన విషయం తెలిసిందే. ఏడు పేజీల ఆ డాక్యుమెంటును పార్టీ అగ్రనేతలు క్షుణ్ణంగా పరిశీలించారని, రాజెతో వాళ్లు టచ్లోనే ఉన్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎల్ కుంభకోణం బయటపడిన తర్వాత విచారణ నుంచి తప్పించుకునేందుకు లలిత్ మోదీ లండన్ పారిపోయిన విషయం తెలిసిందే. ఆయనకు వీసా ఇప్పించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ సహకరించారని, రాజస్థాన్ సీఎం వసుంధర రాజె కూడా మద్దతుగా నిలిచారంటూ కాంగ్రెస్ 'మోదీగేట్' కుంభకోణాన్ని ప్రస్తావిస్తోంది. సుష్మ భర్త, కుమార్తె కూడా లలిత్ మోదీ తరఫున న్యాయవాదులుగా వ్యవహరించారు. -
ఎక్కడ చెడింది?
‘మోదీగేట్’లో వసుంధర రాజే పేరు తెరపైకి రావడం వెనుక కథ! ‘మోదీగేట్’లో రాజస్తాన్ సీఎం వసుంధర రాజే పేరు హఠాత్తుగా తెరపైకి రావడం వెనుక పెద్ద కథే ఉంది. లలిత్ మోదీ బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ పొందేందుకు మాట సాయం చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేరే మొదట తెరపైకి వచ్చింది. కానీ హఠాత్తుగా రాజే, ఆమె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ల పేర్లు, లలిత్తో వారి సాన్నిహిత్యం పతాక శీర్షికలకెక్కాయి. ‘మోదీగేట్’లో రాజే పాత్రను వెల్లడి చేసింది స్వయంగా లలితే. బీసీసీఐలో లలిత్ ప్రస్థానానికి సంపూర్ణ సాయం చేసింది రాజేనే. ఆమె మద్దతుతోనే.. రాజస్తాన్ క్రికెట్ సంఘం నుంచి ప్రారంభించి, బీసీసీఐని శాసించే స్థాయికి లలిత్ ఎదిగారు. ఐపీఎల్ ఆయన బ్రెయిన్ చైల్డే. ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్ కూడా లలితే. ఐపీఎల్తో తారస్థాయికి చేరి.. అదే ఐపీఎల్లో అవకతవకలకు పాల్పడి అధఃపాతాళానికి చేరాడు. - సెంట్రల్ డెస్క్ లలిత్ వెనుక రాజే.. 2005లో జరిగిన రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ) అధ్యక్ష ఎన్నికల్లో అప్పటివరకు ఎవరికీ అంతగా తెలియని లలిత్ మోదీ.. అప్పటికే 40 ఏళ్లుగా రాజస్తాన్ క్రికెట్ను శాసిస్తున్న రుంగ్తా కుటుంబానికి చెందిన కిషోర్ రుంగ్తాను ఓడించాడు. లలిత్ విజయం వెనుక, తెరవెనుక కృషి అంతా అప్పుడు కూడా సీఎంగా ఉన్న రాజేదే. రాజస్తాన్లోని అన్ని జిల్లా క్రికెట్ సంఘాలు, వ్యక్తిగత సభ్యులు అంతా రుంగ్తా కుటుంబానికి విశ్వాసపాత్రులే. దాంతో సీఎంగా అధికారాన్ని ఉపయోగించిన రాజే జిల్లా క్రికెట్ సంఘాలను బెదరించి, రిగ్గింగ్ జరిపి లలిత్ గెలుపునకు బాటలు వేశారని వార్తలు వచ్చాయి. వ్యక్తిగత సభ్యులు కిషోర్త్కు ఓటేయకుండా వారికి ఓటు హక్కుల్ని తొలగిస్తూ ఆర్డినెన్సునే జారీ చేశారు. రాజే కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో లలిత్.. రాజస్తాన్ సూపర్ సీఎంగా వ్యవహరించారన్న ఆరోపణలూ వచ్చాయి. వ్యాపార సంబంధాలు.. 2007లో.. రాజస్తాన్ ప్రభుత్వం సీఎం వసుంధర రాజే కూడా ఒక ప్రమోటర్గా అంబర్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీని ప్రారంభించింది. ఆ అథారిటీ పురాతత్వ ప్రాముఖ్యమున్న, 2 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు హవేలీలు.. చాబ్రోంకి హవేలీ(466 గజాలు), బైరాతియోంకి హవేలీ(1,463 గజాలు)లను అంబర్ హెరిటేజ్ సిటీ కన్స్ట్రక్షన్ సంస్థకు కారుచవకగా అమ్మేసింది. చాబ్రోంకిని రూ. 9 లక్షలకు, బైరాంకిని రూ. 21 లక్షలకు అమ్మేసింది. ఆ తరువాత ఆ అంబర్ హెరిటేజ్ సంస్థ.. ఆనంద్ హోటల్స్గా పేరు మార్చుకుంది. ఈ ఆనంద్ హోటల్స్ సంస్థ ప్రమోటర్స్ ఎవరో కాదు.. మోదీ, ఆయన భార్య మినాల్. ఈ అంశంతో పలు ఇతర అవినీతి ఆరోపణలూ రావడం రాజే ప్రతిష్టను దిగజార్చింది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి అంశంగా ప్రచారం చేపట్టిన కాంగ్రెస్ లలిత్ను పవర్ బ్రోకర్గా అభివర్ణించింది. ఆ ఎన్నికల్లో రాజే ఓడిపోయారు. మోదీ వర్సెస్ రాజే.. ఆ తర్వాతా లలిత్, రాజేల మధ్య.. వారి కుటుంబాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఐపీఎల్ అవకతవకలు బయటపడ్డాక 2013 సెప్టెంబర్లో బీసీసీఐ లలిత్పై జీవితకాల నిషేధం విధించింది. అయినా, పట్టించుకోని రాజే(2013 ఎన్నికల్లో ఆమె ఘనవిజయం సాధించి మళ్లీ సీఎం అయ్యారు) 2014 మేలో లలిత్ ఆర్సీఏ అధ్యక్షుడయ్యేలా చూశారు. దాంతో ఆగ్రహించిన బీసీసీఐ ఆర్సీఏను సస్పెండ్ చేసింది. దేశవాళీ పోటీల్లో రాజస్తాన్ క్రికెటర్లపై నిషేధం విధించింది. ఆ క్రికెటర్లు హైకోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు ఆదేశాల మేరకు వారికి మళ్లీ ఆడే అవకాశం కల్పించారు. ఆ తరువాతే, ఆర్సీఏ ఉపాధ్యక్షుడు అమిన్ పఠాన్ నేతృత్వంలోని మోదీ వ్యతిరేక బృందం రాజేకు దగ్గరైంది. 2014, అక్టోబర్లో రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి లలిత్ తొలగింపుతో లలిత్, రాజేల మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి. లలిత్ స్థానంలో బీజేపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీనర్, లలిత్కు ఒకప్పటి అనుచరుడు అమిన్ పఠాన్ ఆర్సీఏ అధ్యక్షుడు కావడం వెనుక రాజే హస్తం ఉందని లలిత్ భావించాడు. ఆ నియామకాన్ని లలిత్ సవాలు చేయడంతో.. 2015 మార్చిలో ఆర్సీఏ జనరల్ బాడీ సమావేశంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి మరీ తొలగించారు. దీనిపై లలిత్ గ్రహం ఆయన ట్వీట్స్లో కనిపించింది. ‘నా దగ్గర చాలా మిస్సైల్స్ ఉన్నాయి, జాగ్రత్త’ అని రాజేను ఉద్దేశించి హెచ్చరిస్తూ ట్వీట్ చేశాడు. తర్వాత తన పీఆర్ బృందం ద్వారా.. 2010లో తన బ్రిటన్ ఇమ్మిగ్రేషన్కు రాజే సహకరించడానికి సంబంధించిన డాక్యుమెంట్ను మీడియాకు విడుదల చేశాడు. తర్వాత పలు ట్వీట్ల ద్వారా, సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా రాజేను ‘మోదీగేట్’లో భాగం చేశాడు. లలిత్, రాజేల విభేదాలు తీవ్రం కావడానికి కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ కూడా ఒక కారణమన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అడవిమామిడిపల్లిలో అగ్నిప్రమాదం
Lok Sabha Election 2024: పోలింగ్ బూత్ గుర్తింపు...మొబైల్ నంబర్తో
మంటలు అంటుకొని రైతు మృతి
బాధిత జర్నలిస్టుకు ఆర్థికసాయం
కడియం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
రగులుతున్న క్యాంపస్లు!
మహిళలు వ్యాపారాల్లో రాణించాలి
అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యం
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
సీత్యతండాలో అగ్ని ప్రమాదం
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement