-
నితీశ్ కుమార్ (బిహార్ సీఎం)రాయని డైరీ
ప్రధాని అవడం ఏముంది! ఎవరైనా అవొచ్చు. వాజ్పేయి అంతటి మనిషి ప్రధాని అయ్యారని చెప్పి... ఆయనపై గౌరవంతో మోదీజీ ఏమైనా ప్రధాని కాకుండా ఆగిపోయారా? మోదీజీ వంటి ఒక వ్యక్తి భారతావనికి ప్రధానిగా ఉండేవార ని చరిత్ర పుస్తకాలలో ఉన్నా కూడా భావితరాల్లో ఎవరైనా ఆత్మగౌరవంతో ప్రధాని అవకుండా ఆగిపోతారా? ప్రధాని ఎవరైనా అవొచ్చు. ప్రధాని ‘అభ్యర్థి’ అవడమే... ప్రధాని అవడం కన్నా పెద్ద సంగతి. ప్రతి పార్టీలో వాజ్పేయిలు, మోదీజీలు ఉంటారు. ‘‘అభ్యర్థి ఎవరైతేనేం, అయ్యేది ప్రధానేగా..’’ అని వాజ్పేయిలు అంటారు. ‘‘ప్రధాని ఎవరైతేనేం, ప్రధానం అభ్యర్థేగా’’ అని మోదీజీలు అంటారు. ఇక ఏకాభిప్రాయం ఎలా కుదురుతుంది? ఐతే అందరూ వాజ్పేయిలు అవ్వాలి. లేదంటే అందరూ మోదీజీలు అవ్వాలి. అయ్యేపనేనా?! ఒక పార్టీలోనే అందరూ వాజ్పేయిలు, లేదా అందరూ మోదీజీలు కాలేనప్పుడు నాలుగైదు పార్టీలు కలిసి తమలోంచి ఒక వాజ్పేయిని, లేదా ఒక మోదీజీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం అన్నది కేసీఆర్ పాట్నా వస్తేనో, కేజ్రీవాల్ గుజరాత్ వెళ్లొస్తేనో ఒకపూటలో జరిగిపోతుందా?! బిహార్లో ఒక మోదీజీ ఉన్నారు. సుశీల్ కుమార్ మోదీ ఆయన. బీజేపీలో పెద్ద మనిషి. పదకొండేళ్లు ఉప ముఖ్యమంత్రిగా నాతో ఉన్నారు. ఇప్పుడాయన రాజ్యసభ సభ్యులు. మంచి ఫ్రెండ్ నాకు. రామలక్ష్మణులు అనేవాళ్లు మమ్మల్ని. రామలక్ష్మణులు ఫ్రెండ్స్లా ఉన్నారేమో తెలీదు. మేము మాత్రం అన్నదమ్ముల్లా ఉండేవాళ్లం. వయసులో నేను సీనియర్. అనుభవంలో ఆయన సీనియర్. రాష్ట్రంలోని రెండు సభల్లో, కేంద్రంలోని రెండు సభల్లో సభ్యుడైన ఏకైక బిహార్ నేత ఆయన. అంతటి విజ్ఞుడు, అనుభవజ్ఞుడు ఏమంటారంటే... కేసీఆర్ పాట్నా వచ్చి నన్ను అవమానించి వెళ్లారట!! అది ఎలాంటి అవమానం అంటే.. ఆయన నన్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకుండానే వెళ్లిపోయారట!! బీజేపీలో కింది నుంచి పైదాకా అంతా మూర్తీభవించిన మోదీజీలే కనిపిస్తున్నారు! కేసీఆర్, నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అవాలని ఎవరికి వాళ్లం పగటి కలలు కంటున్నామని సుశీల్ కుమార్ అంటున్నారు. అలాంటప్పుడు కేసీయార్ తన కలను పక్కన పెట్టి, పాట్నాలో నా కలను కనకపోవడం నాకు అవమానం ఎలా అవుతుంది? ‘‘నితీశ్జీ! మీరు పగటి కలలు కంటున్నారని సుశీల్జీ అంటున్నారు కానీ, నిజానికి అది సుశీల్జీ రేయింబవళ్లు కన్న కల. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ మెప్పు కోసం సుశీల్జీ మిమ్మల్ని ‘పీఎం మెటీరియల్’ అంటుండేవారు గుర్తుందా..’’ అన్నారు నీరజ్. జేడీ(యు) స్పోక్స్ పర్సన్ ఆయన. నవ్వాన్నేను. పక్కనే రాజీవ్ రంజన్సింగ్, ఉమేశ్ కుష్వాహ ఉన్నారు. ‘‘రాజీవ్జీ! నాకు తెలీకుండా మీరేమైనా నేను ప్రధాని అభ్యర్థినని సుశీల్జీతో అన్నారా?’’ అని అడిగాను. ‘‘లేదు నితీశ్జీ’’ అన్నారు రాజీవ్. పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ఆయన. ‘‘ఉమేశ్జీ! మీరేమైనా నేను ప్రధాని అభ్యర్థినని సుశీల్జీతో అన్నారా?’’ అని అడిగాను. ‘‘లేదు నితీశ్జీ..’’ అన్నారు ఉమేశ్. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన. నేషనల్ లెవల్లో ఎవరూ అనకుండా, స్టేట్ లెవల్లోనూ ఎవరూ అనకుండా ప్రధాని అవ్వాలని నేను కలగంటున్నట్లు సుశీల్జీ అనుకున్నారంటే అది సుశీల్జీకో, మోదీజీకో వచ్చిన పీడకల అయి ఉండాలి. వాళ్లకు పీడకల అంటే అది దేశ ప్రజలకు పీడ విరగడయ్యే కల. ప్రధాని అవడం ఏముంది? ఎవరైనా అవొచ్చు. వాజ్పేయి వంటి ప్రధాని దగ్గర పనిచేసే భాగ్యమే అందరికీ దక్కదు. అది నాకు దక్కింది. ప్రధాని మోదీజీకి కూడా దక్కనిది నాకు దక్కింది. ప్రధాని అవడం కన్నా, ‘ప్రధాని’ అభ్యర్థి అవడం కన్నా కూడా పెద్ద సంగతి అది! -
విజయ్ మాల్యా (లండన్) రాయని డైరీ
నాలుగేళ్లు అయింది నేను లండన్ వచ్చి. వచ్చిన రోజు నుంచి సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నా మీద బెంగ పెట్టేసుకున్నాయి. ఇండియా రమ్మంటాయి! ‘నాతో ఏం పని.. డబ్బులు తీసుకెళ్లండి’ అంటాను. ‘డబ్బుల్తో ఏం పని.. నువ్వొస్తే బాగుంటుంది’ అంటాయి! ‘అసలు నువ్వెందుకొచ్చావ్ చెప్పూ..’ అన్నాను.. మూడేళ్ల క్రితం లండన్ కోర్టు బయట సుమన్ కుమార్ కనిపిస్తే ! ‘ఎక్కడికి రావడం? లండన్కా, లండన్ కోర్టుకా?’’ అన్నాడు! సీబీఐ ఆఫీసర్ అతను. ఇండియాలో వేరే ఫ్రాడ్లు ఏమీ లేనట్లు నన్ను వెతుక్కుంటూ బ్రిటన్ అంతా ఏడాది పాటు తిరిగి, చివరికి కోర్టు బయట నన్ను పట్టుకున్నాడు. ‘టీ తాగుతూ మాట్లాడుకుందాం వస్తావా విజయ్’ అన్నాడు. ‘మాల్యా అను. విజయ్ అంటే నేను నేను కానట్లుగా ఉంటుంది నాకు’ అన్నాను. ‘విజయ్ అని అనకుంటే నేను సుమన్ కానట్లుగా ఉంటుంది నాకు’ అన్నాడు! ‘సరే చెప్పు, టీ తాగడం కోసం మాట్లాడ్డమా, మాట్లాడ్డం కోసం టీ తాగడమా? ఏదైనా మాట్లాడ్డమంత ఈజీ కాదు నాకు టీ తాగడం’ అన్నాను. ‘టీ తప్ప నాకు ఇంకేదీ తాగడం రాదు’ అన్నాడు. ‘అయితే ఇక్కడ మాట్లాడేందుకేం లేదు. ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడుకో.. నేను వెళ్తున్నా’ అన్నాను. ఆగమన్నాడు. ఆగాను. ‘ఐడీబీఐకి నువ్వు తొమ్మిది వందల కోట్లు ఇవ్వాలి. ఎస్బీఐకి తొమ్మిది వేల కోట్లు ఇవ్వాలి. నేను డబ్బు మనిషిని కాదు. వాటిని అడగడానికి రాలేదు. నిన్ను తీసుకెళదామని వచ్చాను’ అన్నాడు. ‘డబ్బులు కావాలంటే బ్యాగులో పెట్టిస్తా తీసుకెళ్లు. భుజానికి బ్యాగేసుకుని ఇండియా వచ్చేయమంటే నీ వెనకే వచ్చేవాళ్లు ఎవరూ లేరిక్కడ’ అని చెప్పాను. ‘నా వయసు యాభై రెండేళ్లు. ఇరవై మూడేళ్ల వయసులో ఫీల్డులోకి వచ్చాను. తెల్ల కాలర్ల మీద నల్ల మరకల్ని వెతికే డ్యూటీ నాది. బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా మన్మోహన్సింగ్ నాకు మెడల్ ఇచ్చారు. పోలీస్ మెడల్ వచ్చింది. రాష్ట్రపతి పోలీసు మెడల్ వచ్చింది. ఇన్ని వచ్చిన నాకు నీ కేసు అప్పగించారంటే నాకు కాదు గొప్ప. నీకు. వచ్చేయ్.. వెళ్లిపోదాం’ అన్నాడు! ‘డబ్బొక్కటే నా చేతుల్లో ఉంది. నేను నా చేతుల్లో లేను. డబ్బు కావాలంటే తీసుకెళ్లు. నేను కావాలంటే కోర్టు లోపల వాదించుకుని వెళ్లు..’ అని చెప్పాను. అప్పుడు వెళ్లినవాడు మళ్లీ కనిపించలేదు. సుమన్–2 ఎవరో కోర్టుకు వచ్చేవాడు ఫైళ్లు పట్టుకుని. ఫైల్ చూసుకుంటూ ఉండేవాడే కానీ పాపం నన్ను చూసేవాడు కాదు. మాల్యాను ఇరవై ఎనిమిది రోజుల్లో ఇండియా పంపిస్తాం అని కోర్టు చెప్పినప్పుడు కూడా తలెత్తి చూడలేదు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే బయటికి వస్తుంటే సుమన్ ఫోన్ చేశాడు. ‘‘ఎక్కడా?’’ అన్నాను. ‘‘ఇండియాలో’’ అన్నాడు. ‘‘ఏంటి చెప్పు’’ అన్నాను. ‘‘సుప్రీంకోర్టుకు కూడా వెళ్లడానికి లేదని కోర్టు తీర్పు చెప్పిందటగా. ముందే నాతో ఇండియా వచ్చి వుంటే.. ఇప్పుడిలా తీర్పు వచ్చేదే కాదు’’ అన్నాడు! ‘‘క్యాష్ ఇస్తా. డౌన్ పేమెంట్. మోయగలిగితే వచ్చి తీసుకెళ్లు. కొత్త నోట్లు. వాసన చూసి తీసుకో. మోదీజీలా ఇరవై లక్షల కోట్లు ఇస్తున్నానని చెప్పి పప్పులు ఉప్పులు ప్యాక్ చేసి ఇవ్వడం కాదు. ఫెళపెళలాడే కరెన్సీ’’ అన్నాను. ‘‘కరెన్సీ వద్దు. విజయ్ కావాలి నాకు’’ అన్నాడు! ‘‘విజయ్ కూడా కాదు, మెడల్స్ కావాలి నీకు. íపీఎం మెడలు, ప్రెసిడెంట్ మెడలు.. ఇస్తే ఐడీబీఐ మెడలు, ఎస్బీఐ మెడలు కూడా వేసుకుంటావ్ నువ్వు’’ అని ఫోన్ పెట్టేశాను. సుప్రీంకోర్టు కాకపోతే, మానవ హక్కుల కోర్టు. ఫ్రాన్స్కు వెళ్లకుండా ఇండియా వస్తానని ఆశిస్తున్నందుకు కూడా సుమన్కి ఒక మెడల్ ఏదైనా చేయించి ఇవ్వాలి. -
ఎల్.కె. అద్వానీ.. రాయని డైరీ
రాహుల్ గాంధీకి లైన్ కలపమని చెప్పి కొన్ని ఏళ్లు అయినట్లుగా ఉంది. ‘‘ఏమైంది, దొరకట్లేదా?’’ అన్నాను. ‘అయ్యో అద్వానీజీ.. మీకు ఇప్పటికే కనీసం కొన్నిసార్లు చెప్పి ఉంటాను. రాహుల్జీ కొన్నాళ్లుగా రఘురామ్ రాజన్, అభిజిత్ బెనర్జీలతో ఉంటున్నారట’ అన్నాడు నాకు కేటాయించబడిన యువ సహాయకుడు. తొంభై ఏళ్లు పైబడిన వ్యక్తికి తొంభై ఏళ్లు పైబడిన సహాయకుడు మాత్రమే ఉపకరించే సహాయకుడిలా ఉండగలడేమో! అభిజత్ బెనర్జీ కోల్కతాలో ఉన్నట్లు విన్నాను. రాజన్ ఈ మధ్య భోపాల్ వెళ్లినట్లున్నాడు. రాహుల్ వేయనాడ్లో ఉండాలి. అక్కడ లేకపోతే ఢిల్లీలో ఉండాలి. ఈ ముగ్గురూ ఎక్కడ కలుసుకుంటున్నట్లు! లాక్డౌన్లో గాయపడిన ఎకానమీకి కట్టు కడతానని దూది, గాజుగుడ్డ, టించరు బాటిలు పట్టుకుని కొన్నాళ్లుగా తిరుగుతున్నాడు రాజన్. అభిజిత్కి ఆర్థికశాస్త్రంలో నోబెల్ వచ్చింది కాబట్టి తనూ ఏదో ఒకటి పట్టుకుని తిరగాలి. వాళ్లిద్దర్నీ పట్టుకున్నట్లున్నాడు రాహుల్. లాక్డౌన్ అని మూత వేసుకుని కూర్చుంటే నెలాఖరు తర్వాత అకౌంట్లో తెరిచి చూసుకోడానికి ఏముంటుంది అని మోదీజీ అడగడానికి రాహుల్ వాళ్లిద్దరితో ఉంటున్నట్లుంది. అయినా ఉండటమేంటి! అదే అడిగాను నా యువ సహాయకుడిని. ‘‘జూమ్ వీడియోలో ఉంటున్నారట అద్వానీజీ’’ అన్నాడు. మళ్లీ ఒకసారి రాహుల్ కోసం ప్రయత్నించమని చెప్పాను. ‘నాకు నిద్ర వచ్చేలోపు ప్రయత్నించు’’ అని కళ్లు మూసుకున్నాను. ‘‘అద్వానీజీ.. లైన్లో రాహుల్జీ’’ అన్నాడు యువ సహాయకుడు! నన్ను నిద్రపోనివ్వకూడదనుకుని నేను నిద్రపోయే వరకు వేచి ఉండి అప్పుడు లైన్లోకి వచ్చాడా ఏంటి! ఫోన్ తీసుకున్నాను. ‘‘నమస్తే అద్వానీజీ’’ అన్నాడు. ‘‘నమస్తే రాహుల్ బాబు. చక్కగా మాట్లాడుతున్నావు ఈ మధ్య. చక్కగా కూడా కనిపిస్తున్నావు. కుర్తా పైజమా మీదకు ఆ నల్లటి జాకెట్ ఉండటం లేదిప్పుడు. రిలీఫ్గా ఉంది నిన్ను అలా చూస్తుంటే..’’ అన్నాను. రాహుల్ నవ్వాడు. ‘‘థ్యాంక్యూ అద్వానీజీ. ఎందుకు కాల్ చేయించారు’’ అన్నాడు. ‘‘ఏం లేదు. నేను, జోషి, ఉమ, కల్యాణ్.. జూమ్లో కలుసుకుంటున్నాం. నువ్వూ కలుస్తావేమోనని’’ అన్నాను. ‘‘ఓ.. బాబ్రీ కూల్చివేత కేసు! ఆగస్టులోపు తేల్చేయమంది కదా కోర్టు. అయినా అద్వానీజీ.. స్థలం ఎవరిదన్నది తేలిపోయాక, కూల్చిందెవరన్నది మాత్రం తేలిపోకుండా ఉంటుందా?’’ అన్నాడు రాహుల్. ‘‘మంచి మాట చెప్పావు రాహుల్ బాబు. జూమ్కి కనెక్ట్ అవుతావా.. నేను, నువ్వు, జోషి, ఉమ, కల్యాణ్ మాట్లాడుకుందాం’’ అన్నాను. ‘‘అది మీ పర్సనల్ విషయం కదా అద్వానీజీ. నేనెందుకు స్క్రీన్ పైకి రావడం?’’ అన్నాడు. ‘‘మా నలుగురిదీ ఒక పర్సనల్ విషయం. నాదొక్కటే ఒక పర్సనల్ విషయం రాహుల్ బాబూ. నీకు చేతులు జోడిస్తే ఫోన్లో నీకు కనిపించదు కదా. అందుకే నిన్నూ కలవమని అడుగుతున్నా..’’ అన్నాను. ‘‘అద్వానీజీ!! మీరు నాకు చేతులు జోడించడం ఏమిటి? పెద్దవాళ్లు మీరు’’ అన్నాడు ఆశ్చర్యం కలిసిన గొంతుతో. ‘‘ఆ మాట అనొద్దనే నీకు చేతులు జోడించాలనుకుంటున్నా రాహుల్ బాబూ. కరోనా వల్ల ప్రమాదం పెద్దవాళ్లకే గానీ, మిగతా వాళ్లకేమీ భయం లేదని ప్రచారం చెయ్యమని మోదీజీకి చెబుతున్నావు. పెద్దవాళ్లకు కదా ధైర్యం చెప్పాల్సింది’’ అన్నాను. ‘‘ఓ.. సారీ అద్వానీజీ. ఎకానమీ బతికితే చాలనుకున్నాను. ఈ యాంగిల్ నాకు తట్టలేదు’’ అన్నాడు!! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ : రతన్ టాటా (గౌరవ చైర్మన్)
కుర్చీకి తగని వ్యక్తిని తెచ్చిపెట్టుకుంటే కుర్చీ ఎంత చిన్నదైనా అది ఆ వ్యక్తికి పెద్దదే అవుతుంది. టాటా కంపెనీలో అసలు చిన్న కుర్చీలే ఉండవు. కుర్చీ ఎత్తుకు ఎదగాలని రోజూ ఆ కుర్చీలో కూర్చుని లేచే వాళ్లకు అనిపించాలి. అప్పుడే వాళ్లూ ఎదుగుతారు. కంపెనీ ఎదుగుతుంది. సైరస్ మిస్త్రీ అలా అనుకోలేదు! చైర్మన్గా కుర్చీలో కూర్చున్న రోజే.. ‘కుర్చీ నాకు చిన్నదైపోయింది రతన్జీ..’ అని నా క్యాబిన్కి వచ్చి కంప్లయింట్ చేశాడు! కంప్లయింట్ చేస్తూ.. నేను కూర్చొని ఉన్న కుర్చీ వైపు చూశాడు. ‘నీ కుర్చీ నీకు చిన్నదైందని నువ్వు అనుకున్నా, నా కుర్చీ నీకేమీ పెద్దదవదు మిస్త్రీ.. ఏం చేద్దాం?’’ అన్నాను. ‘కూర్చోడానికి కుర్చీ సరిపోనప్పుడు, కనీసం కాళ్లు చాపుకుని కూర్చోడానికి కాళ్ల దగ్గర ఇంకో కుర్చీ వేసుకునే ఏర్పాటైనా ఉండాలి రతన్జీ. అయితే నేను కాళ్లు చాపుకుని కూర్చోవాలని అనుకుంటున్న వైపు మీ క్యాబిన్ ఉంది. అది మీకు గౌరవం కాదు. పైగా టాటా కంపెనీలో నేను గౌరవించే ఏకైక వ్యక్తి మీరు’ అన్నాడు! మిస్త్రీ ఏమంటున్నాడో అర్థమైంది. నన్నిక ఆఫీస్కి రావద్దంటున్నాడు! పాత చైర్మన్ కళ్లముందే కనిపిస్తుంటే.. కొత్త చైర్మన్ని ఆఫీస్లో ఎవరు చూస్తారు అని హెచ్ఆర్ మేనేజర్ రాజన్తో అన్నాడని కూడా తెలిసింది. ‘‘నేను గౌరవం ఇచ్చే మనిషినే కానీ, తిరిగి గౌరవం కోరుకునే మనిషిని కాదు మిస్త్రీ. మీరు మీ కాళ్లను ఎటువైపు పెట్టుకునైనా కూర్చోడానికి ఒక కుర్చీని తెప్పించుకునే ఏర్పాట్లను మీరు నిరభ్యంతరంగా చేయించుకోవచ్చు’ అని చెప్పాను. అతడు వెళ్లిపోయిన కొద్ది సేపటికి హెచ్ ఆర్ మేనేజర్ నా క్యాబిన్లోకి వచ్చారు. ‘కూర్చోండి రాజన్’ అన్నాను. ‘మిమ్మల్నో విషయం అడగడానికి వచ్చాను రతన్జీ. ఆ విషయాన్ని నేను నిలబడి కూడా అడగ్గలను’ అన్నాడు. ‘అడగండి రాజన్జీ’ అన్నాను. ‘రతన్జీ.. సెక్షన్ హెడ్లంతా కొత్తగా కనిపిస్తున్నారు. వాళ్లెవరూ నేను రిక్రూట్ చేసినవాళ్లు కాదు. రోజూ మధ్యాహ్నం క్యాంటీన్లో కూడా వాళ్లు కనిపిస్తున్నారు. ‘ఎక్స్క్యూజ్ మీ.. మీరెవరో నేను తెలుసుకోవచ్చా?’ అని వాళ్లలో ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లి ఫ్రెండ్లీగా అడిగాను. ‘మిస్త్రీ ఎవరో మీకు తెలుసా?’ అని ఆ వ్యక్తీ నన్ను ఫ్రెండ్లీగా అడిగాడు’ అన్నారు రాజన్. ‘అవునా!’ అన్నాను. ‘వాళ్లెవరో నాకు మాత్రమే తెలియదా, మీక్కూడా తెలియదా అని అడగడానికే మీ దగ్గరికి వచ్చాను రతన్జీ’ అన్నాడు. ‘ఇద్దరికీ తెలియదంటే.. మిస్త్రీకి తెలిసే ఉంటుంది’ అని నవ్వాను. వెళ్లిపోయాడు. వెళ్లిన కొద్ది సేపటికే మళ్లీ వచ్చాడు! ‘ఏంటి రాజన్!’ అన్నాను. ‘నా కుర్చీలో పద్మనాభన్ అనే వ్యక్తి కూర్చొని ఉన్నాడు రతన్జీ. ‘ఎవరు మీరు?’ అని నేను అడిగేలోపే, ‘అడక్కుండా లోపలికి వచ్చేయడమేనా! ఇదేమైనా రతన్ టాటా క్యాబిన్ అనుకున్నావా? హెచ్ ఆర్ మేనేజర్ క్యాబిన్..’ అని, బెల్ కొట్టి నన్ను బయటికి పంపించాడు’ అని చెప్పాడు రాజన్! నాలుగేళ్లు కుర్చీలో ఉన్నాడు మిస్త్రీ. ఆ నాలుగేళ్లూ టాటా కంపెనీ అతడి కాళ్ల కింది కుర్చీలానే ఉండిపోయింది. ‘రతన్జీ.. అతడిని చైర్మన్ని చేసి మీరు పెద్ద తప్పు చేశారు’ అన్నారు కంపెనీ స్టాఫ్. అలా అన్న రోజే మిస్త్రీని బయటికి çపంపించాను. ‘పంపడం కుదరదు’ అని కంపెనీ ‘లా’ నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నాడు మిస్త్రీ. కుర్చీ కన్నా చిన్నవాళ్లే కుర్చీ కోసం పోరాటాలు చేయగలరు. మిస్త్రీ మూడేళ్లు పోరాడాడు. కుర్చీ గౌరవం కాపాడేందుకు టాటా మాత్రం పోరాడకుండా ఉంటుందా? -
బిపిన్ రావత్ (ఆర్మీ చీఫ్)
మంచి మాట చెప్పడానికి లేనప్పుడు మంచి స్థానంలో ఉండి వ్యర్థమనిపిస్తుంది. ‘ పిల్లల్ని చదువుకోనివ్వండి. వాళ్ల హాస్టళ్లలోకి వెళ్లి పాలిటిక్స్ ప్లే చెయ్యకండి’ అని మంచి చెప్పినందుకు..‘ఆర్మీ చీఫ్ మంచి చెప్పడం ఏంటని’ రెండు రోజులుగా దేశంలో మంచి–చెడు, భారత్–పాక్, హిందూ–ముస్లిం అని డివైడ్ టాక్ నడుస్తోంది! దేశం ఒక్కటే, దేశంలోని మనుషులంతా ఒక్కటే అని మళ్లీ నాచేత మంచి చెప్పించుకునేంత వరకు ఈ నాయకులు ఆగేలా లేరు. మంచి చెప్పేవాళ్లు లేకపోతే మంచి చెయ్యడానికి ఆర్మీ దిగవలసి వస్తుంది. ఒకేసారి మంచి చెయ్యడానికి దిగకుండా, మొదటే మంచి చెబితే మంచికి దిగే అవసరం ఉండదని చెప్పడం మంచి ప్రయత్నమే కదా! అయినా నేనెందుకు మంచి మాట్లాడానో నాకు గుర్తుకు రావడం లేదు. నా చేత మంచిని మాట్లాడించిన వాళ్లెవరో కూడా గుర్తు లేదు. ఏదో హెల్త్ ప్రోగ్రామ్కి పిలిస్తే వెళ్లాను. బాగా గుర్తు చేసుకుంటే అక్కడ నేను మాట్లాడిన రెండు మంచి మాటలు మాత్రం గుర్తుకొస్తున్నాయి. నాయకుడంటే ఎలా ఉండాలో చెప్పాను. నాయకుడు ముందు నడవాలనో, వెనకుండి ముందుకు నడిపించాలనో చెప్పాను. అంత వరకే! ఇంటికొచ్చి టీవీ చూసుకుంటే.. నేను వెళ్లిన హెల్త్ ప్రోగ్రామ్ రావడం లేదు. హెల్త్ ప్రోగ్రామ్లో నేను మాట్లాడిన మంచి మాటలు రావడం లేదు. యోగేంద్ర యాదవ్ అనే ఆయన టెలికాస్ట్ అవుతున్నాడు! ‘ఆయన అన్నది నిజమే’ అంటున్నాడు. ‘మోదీని దృష్టిలో పెట్టుకునే ఆయన ఆ మాట అన్నాడు’ అంటున్నాడు. ఎవరీయన అని చూశాను. ‘హక్కుల కార్యకర్త’ అని పేరు కింద వేస్తున్నారు. ‘ఆయన’ అని ఆయన అంటున్నది నా గురించే! దిగ్విజయ్ సింగ్, అసదుద్దీన్ ఒవైసీ, బ్రిజేష్ కాలప్ప.. ఇంకా ఎవరెవరో స్క్రీన్ మీదకు వచ్చిపోతున్నారు. కాలప్ప పేరు వినగానే నాకు జనరల్ కరియప్ప గుర్తుకొచ్చారు. ఇండియన్ ఆర్మీ ఫస్ట్ జనరల్ ఆయన. కరియప్ప కూడా డ్యూటీలో ఉండగా మంచి మాట్లాడే ఉంటారు. అప్పుడిన్ని పేపర్లు, ఇన్ని టీవీ చానళ్లు, ఇన్ని ప్రతిపక్షాల లేవు కాబట్టి ఆయన మంచి మాటలు రంగు మారకుండా మంచి మాటలుగానే ప్రజల్లోకి వెళ్లి ఉంటాయి. ఈ కాలప్ప ఎవరా అని చూశాను. కాంగ్రెస్ స్పోక్స్పర్సన్! ‘పౌరసత్వ చట్టం గురించి రావత్ని మాట్లాడనిస్తే, చట్టాన్ని తీసుకెళ్లి ఆయన చేతుల్లో పెట్టినట్లే’ అంటున్నాడు! ఒవైసీ కూడా వేలు పైకెత్తాడు. ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అంటున్నాడు. అంటే నన్ను హద్దుల్లో ఉండమని! ఆయనకెప్పుడూ హద్దుల గొడవే! దిగ్విజయ్ కూడా ఏదో అన్నాడు కానీ, ఏదో ఒకటి అనకపోతే బాగుండదన్నట్లుగా అన్నాడు. ‘పర్స్ జాగ్రత్త’ అని అకౌంటెంట్ జనరల్ చెబితే తప్పు లేదు, ‘పాలన జాగ్రత్త’ అని అటార్నీ జనరల్ చెబితే తప్పు లేదు, ‘విద్యార్థులు జాగ్రత్త’ అని ఆర్మీ జనరల్ చెబితే తప్పయిందా! నేనైనా నాయకులు ఎలా ఉండాలో చెప్పకుండా, ప్రజలు ఎలా ఉండాలో చెప్పి ఉండాల్సింది. ఆ తేడాను నాయకులు అర్థం చేసుకునేలోపు నా రిటైర్మెంట్ వచ్చేసేది. అప్పుడీ ఒవైసీకి, కాలప్పకీ మాట్లాడ్డానికి ఏమీ దొరక్కపోయేది. డిసెంబర్ 31న నా రిటైర్మెంట్. కొత్తగా పెట్టిన ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్’ పోస్టులోకి నన్ను తీసుకోవడం కోసం మోదీకి అనుకూలంగా మాట్లాడానని వీళ్ల అనుమానం. పైకి మాట్లాడేవారికి మోదీ ఎప్పుడూ పవర్ ఇవ్వలేదు. నేనూ అంతే. పవర్ కోసం పైకి మాట్లాడకుండా ఉన్నదెప్పుడూ లేదు. పవర్ రావడం, పవర్లో ఉండటం, పవర్ పోవడం.. వీటి గురించి పవర్ఫుల్ మనుషులెప్పుడూ పట్టించుకోరు. -మాధవ్ శింగరాజు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement