-
6 వేల మందిపై ‘ఫిలిప్స్’ కంపెనీ వేటు...కారణం ఇదే
ప్రముఖ వైద్య పరికరాల సంస్థ ఫిలిప్స్ వరల్డ్ వైడ్గా వేల మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్దమైంది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో రాయ్ జాకబ్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. మూడు నెలల ముందు ఫిలిప్స్ సంస్థ 4వేల మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. తాజాగా సిబ్బందికి పింక్ స్లిప్లు జారీ చేయనున్నట్లు జాకబ్స్ తెలిపారు. ఇది కష్టతరమైన సమయం, కానీ తప్పడం లేదంటూ ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు. 2025 నాటికి వర్క్ ఫోర్స్ను మరింత తగ్గించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాదిలో 3వేల మందిని, 2025 నాటికి మొత్తం 6వేల మందిని తొలగిస్తామని అన్నారు. ఫిలిప్స్ సంస్థ నిద్రలేమని సమస్యతో బాధపడే వారి కోసం స్లీప్ రెస్పిరేటర్లను చేసింది. వాటి వల్ల వినియోగదారులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటూ ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదుతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తూ రెస్పిరేటర్లను రీకాల్ చేసింది. వెరసీ ఫిలిప్స్ కంపెనీ గత ఏడాది క్యూ4లో సుమారు 114 మిలియన్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది. గత ఏడాది మొత్తం ఆ కంపెనీ సుమారు 1.605 బిలియన్ల యూరోలు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. -
స్వాతంత్య్ర సమరయోధుడు సీవీ చారి ఇక లేరు
- శ్వాసకోశ వ్యాధితో కన్నుమూత - ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది, ఆలిండియా హిందీ నాగరిక లిపి అధ్యక్షుడు సీవీ చారి(86) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం విజయనగర్ కాలనీలోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో చారికి అంత్యక్రియలు నిర్వహించారు. రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, సామాజికవేత్తలు హాజరై ఆయనకు ఘన నివాళులర్పించారు. చారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. భూదానోద్యమంలో కీలక పాత్ర పోషించిన సీవీ చారి నల్లగొండ జిల్లా దేవరకొండ మునుగోడు గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 15 ఏళ్ల ప్రాయంలోనే భూదానయజ్ఞ ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. వినోబాభావేతో కలసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తన భూములను పేదలకు పంచిపెట్టారు. నల్లగొండలో ప్రారంభమైన చారి ప్రస్థానం హైదరాబాద్ నగరంతో పెనవేసుకుంది. ఎలాంటి ఆర్భాటాలకూ తావు లేకుండా, రాజకీయ పదవులను ఆశించకుండా తన జీవితమంతా సామాజిక సేవకే అంకితం చేశారు. హైదరాబాద్లోని గాంధీభవన్ ట్రస్టుతో ఆయనకు 30 ఏళ్లకుపైగా అనుబంధం ఉంది. సుదీర్ఘకాలం పాటు భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్గా పనిచేశారు. గాంధీ ప్రతిష్టాన్, గాంధీ స్మారక నిధికి చైర్మన్గా వ్యవహరించారు. వినోబాభావే, జయప్రకాష్నారాయణ్, నిర్మలాదేశ్పాండే, రామానందతీర్థ, ఇందిరాగాంధీ, పివీ నరసింహారావు, ప్రభాకర్జీ, మొరార్జీదేశాయ్ వంటి ప్రముఖుల తో కలసి నడిచారు. ప్రముఖుల నివాళి... అంతకుముందు సీవీ చారి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం నాంపల్లిలోని గాంధీభవన్ ట్రస్టు కార్యాలయంలో ఉంచారు. వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హాజరై సీవీ చారి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, గాంధీభవన్ ట్రస్ట్ చైర్మన్ జి.నారాయణరావు, అంత్యోదయ మండలి కార్యదర్శి సుబ్రహ్మణ్యం, హిందీ మహావిద్యాలయ చైర్మన్ సురేంద్ర లూనియా, ఎమ్మెల్సీ భాను, కాంగ్రెస్ నేత నిరంజన్, భూదానయజ్ఞ బోర్డు మాజీ చైర్మన్ సర్వర్షిణి రాజేందర్రెడ్డితో పాటు సీపీఐ, సీపీఎం, బీజేపీ, టీడీపీలకు చెందిన నాయకులు నివాళులర్పించారు. తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, తెలంగాణ, ఏపీ పీసీసీల అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి, రఘువీరారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేతలు మల్లు భట్టివిక్రమార్క తదితరులు చారి మృతిపట్ల తమ సంతాపాన్ని ప్రకటించారు. -
నాస్తికోద్యమ నేత లవణం అస్తమయం
* శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ కన్నుమూత * అంతిమ కోరిక మేరకు నేత్రదానం * ప్రముఖుల సంతాపం సాక్షి, విజయవాడ/హైదరాబాద్: నాస్తికోద్యమ నేత, సంఘసంస్కర్త గోపరాజు లవణం (86) శుక్రవారం విజయవాడలో కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రముఖ సంఘసంస్కర్త, నాస్తికోద్యమ నిర్మాత గోపరాజు రామచంద్రరావు (గోరా), సరస్వతీ గోరాల ద్వితీయ కుమారుడైన లవణం తండ్రి నుంచి నాస్తికత్వం, సంఘసేవ అలవరుచుకున్నారు. చారిత్రాత్మక ఉప్పు సత్యాగ్రహం జరిగే సమయంలో జన్మించడంతో గోరా తన కుమారుడికి ‘లవణం’ అని పేరు పెట్టారు. చిన్ననాటి నుంచే సంఘసేవలో పాల్గొని అస్పృశ్యత, మూఢనమ్మకాలు, జోగిని దురాచార నిర్మూలనకు, నేరస్తులను సంస్కరించేందుకు అవిశ్రాంత పోరాటం చేశారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు. ముప్పైకి పైగా దేశాల్లో పర్యటించి నాస్తికోద్యమాన్ని ప్రచారం చేశారు. నాస్తిక వారపత్రిక సంఘం, ఆర్థిక సమత, నాస్తికమార్గం, హిందీ పత్రిక ఇన్సాన్, ఇంగ్లిష్ మాసపత్రిక ఎథియిస్ట్ నిర్వహణలో లవణం ప్రముఖ పాత్ర వహించారు. భూదాన, సర్వోదయ ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1960లో మహాకవి జాషువా కుమార్తె హేమలతను వివాహం చేసుకున్నారు. 1962లో తలపెట్టిన ప్రపంచ శాంతియాత్రలో లవణం పాల్గొన్నారు. 1966-67లో అమెరికాలో శాంతి ఉద్యమంలోనూ, మార్టిన్ లూథర్ కింగ్ నాయకత్వాన పౌరహక్కుల ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 1977 దివిసీమ ఉప్పెన సమయంలో సహాయ పునర్నిర్మాణ మహాసభలలో పాల్గొన్నారు. 2005లో నక్సలైట్ల సమస్య పరిష్కారానికి గట్టి కృషి సల్పారు. 2006లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్వర్ణో త్సవాల ముగింపు సభలో హింసలేని విప్లవం, అవినీతిలేని ప్రజాస్వామ్యం, ప్రజాప్రతినిధుల బాధ్యతపై ఆయన ప్రసంగించారు. ఆయన తన జీవితమంతా సమాజ పరివర్తనకు కృషి చేశారు. ఆయన కోరిక మేరకు కళ్లను స్వేచ్ఛా గోరా ఐ బ్యాంకుకు దానం చేశారు. భౌతికకాయాన్ని శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలకు అప్పగిస్తారు. లవణం భౌతికకాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ వివరాలు గోరా తొమ్మిది మంది సంతానంలో లవణం రెండో వారు. లవణంకు సంతానం లేదు. సతీమణి హేమలత 2008లో కన్నుమూశారు. ప్రముఖ వైద్యుడు జి.సమరం, మాజీ ఎంపీ చెన్నుపాటి విద్యకు లవణం సోదరుడు. లవణం మృతికి సీఎంల సంతాపం గోపరాజు లవణం మృతికి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తం చేశారు. జోగినుల జీవితాలను మెరుగు పరిచేందుకు నిజామాబాద్ జిల్లాలో రెండు దశాబ్దాల క్రితం లవణం సతీమణి హేమలతతో కలసి పనిచేసిన అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలనకు సామాజిక కార్యకర్తగా లవణం చేసిన కృషిని ప్రస్తావించారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడిన లవణం మృతి నాస్తికోద్యమానికే కాకుండా రాష్ట్రానికే తీరని లోటు అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్ జగన్ సంతాపం సంఘ సంస్కర్త డాక్టర్ లవణం మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. సమాజంలో బడుగుల అభ్యున్నతికీ, కుల వ్యవస్థ నిర్మూలనకూ లవణం చేసిన కృషిని కొనియాడారు. వర్నిలో విషాదం వర్ని(నిజామాబాద్): నాస్తికోద్యమ నేత గోపరాజు లవణం మృతితో నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని వర్ని ప్రాంతంతో ఆయనకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. 1997లో వర్నికి చెందిన మార్ని రామకృష్ణారావు హేతువాద సభలకు వెళ్లినప్పుడు అక్కడ ఆయనకు లవణంతో పరిచయమైంది. వర్ని ప్రాంతంలో ప్రబలంగా ఉన్న చేతబడి, బాణామతి వంటి మూఢనమ్మకాల గురించి రామకృష్ణారావు ద్వారా తెలుసుకున్న లవణం దంపతులు ఈ ప్రాంతానికి వచ్చి ప్రజల్లో చైతన్యం కల్పించారు. లవణం స్ఫూర్తితో వర్నిలో 1980లో నాస్తిక మిత్ర మండలి ఏర్పాటు చేశారు. జిల్లాలో జోగిని వ్యవస్థ దురాచారానికి ఎందరో మహిళలు బలవుతున్నారని గమనించి నాటి గవర్నర్ కుముద్ బిన్ జోషి, జిల్లా కలెక్టర్ ఆశామూర్తితో చర్చించి ఆ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేశారు. అభాగ్యులైన మహిళల కోసం 1985లో ఇక్కడ ‘చెల్లి నిలయం’ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా జోగినులకు వివాహాలు జరిపించారు. ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట్యా 1997లో ప్రకృతి చికిత్సాలయూన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలందించారు. ఆయనతో కలసి పనిచేసిన కొందరు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు విజయవాడ వెళ్లారు. -
మృత్యువుతో పోరాటం
పొద్దస్తమానం ఆటో తోలి రోజుకు రూ. 200లు సంపాదించే ఓ డ్రైవర్ ఉన్నదాంట్లోనే సర్దుకొని ఆనందంగా కుటుంబాన్ని పోషించేవాడు. ఆరునెలల కిందట అతనికి ఓ విషాదకరమైన వార్త వినాల్సి వచ్చింది. ఉన్న ఒక్కగానొక కుమారుడు శ్వాసకోశ వ్యాధిబారిన పడ్డాడు. దాచుకున్న డబ్బులతోపాటు సుమారు ఏడు లక్షలు అప్పులు చేసి కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ లాభం లేకుండా పోయింది. ఖరీదైన వైద్యం చేయించలేక ప్రస్తుతం ఆక్సిజన్పైనే ఆ చిన్నారిని బతికిస్తున్నాడు. ముద్గుగా కనిపించే బాలుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా ఏమీ చేయలేని దీనస్థితిలో ఉన్నాడు. దాతల సాయంకోసం ఎదురుచూస్తున్నాడు. - అర్వపల్లి అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామానికి చెందిన సూరారపు ఉపేంద్ర, శ్రీనుల ఏకైక కుమారుడు లక్కి (15నెలలు) ఆరు నెలల కిందట పర్సిస్టెంట్ బ్రాంకో నిమోనియా, వైరల్ రియాక్టిట్ శ్వాసకోశ వ్యాధిబారిన పడ్డాడు. ప్రస్తుతం ఆక్సిజన్తో గాలి పీల్చుకుంటూ నరకం అనుభవిస్తున్నాడు. గుండెలో ఎడమ జఠరిక వాపుతో దీని పని విధానం తగ్గిపోయింది. బాలుడి రక్తంలోని ఎర్రరక్త కణాల్లో హిమోగ్లోబిన్, ఆక్సిజన్ సంతృప్తతా శాతం సాధారణ స్థాయిలో ఉండకుండా తగ్గాయి. ఊపిరితిత్తులతో రక్తకణాలు చేరి శ్వాస క్రియకు ఇబ్బందిగా మారాయి. దీంతో పూర్తిగా ఆయసం వచ్చి ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. లక్షల ఖర్చుచేసినా.. బాలుడిని సూర్యాపేట, ఖమ్మం, హైదరాబాద్లోని కార్పోరేట్ ఆసుపత్రుల్లో 6నెలల నుంచి చూయిస్తూ ఇప్పటివరకు రూ. 7లక్షలు ఖర్చు చేశారు. ఉన్న ఎకరం భూమి అమ్మడంతో పాటు బయట వడ్డీలకు రూ. 3లక్షల వరకు తెచ్చాడు. అయినా వ్యాధి తగ్గక పోగా ప్రస్తుతం ఆక్సిజన్ ఎక్కించకపోతే బతికే స్థితిలో లేడు. ఇదిలావుండగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో శ్వాసకోశ వ్యాధి లేకపోవడంతో ఖరీదైన వైద్యం తప్పడంలేదు. ప్రస్తుతం రోజు ఆక్సిజన్ సిలిండర్కు రోజుకు రూ. 500 ఖర్చు చేస్తున్నార. ఆటో తోలగా వచ్చిన డబ్బులు సరిపోవడంలేదు. అయినప్పటికీ అప్పులు చేస్తూ ఆక్సిజన్ సిలిండర్లను సూర్యాపేట నుంచి తెచ్చి బతికించుకుంటున్నాడు. దాతల సాయం అవసరం ప్రస్తుతం బాలుడికి కార్పోరేట్ ఆసుపత్రిలో యాంటి బ్యాక్టీరియల్, యాంటి థెరఫి చికిత్స జరిపించాలి. దీని ద్వారా ఊపిరితిత్తులలోని మూసుకపోయిన గాలిగదులు తెరచుకొని శ్వాసలో ఇబ్బంది లేకుండా హిమోగ్లోబిన్, ఆక్సిజన్ సంతృప్తతా శాతం పెరుగుతుంది. అలాగే దీనికి తోడు రోగ నిరోదక శక్తి పెరుగుతుంది. ఈ చికిత్సకు సుమారు 3నెలలకు పైగానే వ్యవధి పట్టే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇందుకు సుమారు రూ. 7లక్షలకు పైగానే డబ్బు ఖర్చవుతుంది. దీనికి దాతలు సహకరిస్తే తప్ప తమ కొడుకు బతికే పరిస్థితి లేదని బాలుడి తల్లిదండ్రులు విలవిస్తున్నారు. ఎవైరె నా సాయం చేయాలనుకునేవారు ఎస్బీఐ అకౌంట్నంబర్ 34632819973లలో జమ చేయడంగాని, 9704883594 నెంబర్కు సంప్రదించడంగాని చేయవచ్చు. చేతిలో పైసాలేదు కుమారుని కోసం ఉన్న భూమి అమ్మేశాను. లక్షల్లో అప్పు చేశాను అయినా వ్యాధి నయంకాలే. ఇంకా లక్షల రూపాయలు కావాలంటున్నారు. మా పిల్లవాడిని బతికించడం కోసం తిరగని ఆసుపత్రిలేదు. రోజుకు రూ. 500 ఖర్చు చేసి ఆక్సిజన్ పెట్టించి బతికించుకుంటున్నా. - సూరారపు శ్రీను, తండ్రి దేవుడే దిక్కు బాలుడిని బతికించు కోవడం కోసం చేసేదంతా చేశాం. కట్టు బట్టలు తప్ప మాకు ఏమి మిగల లేదు. ఆక్సిజన్ తేవడానికి రోజు కొకరి కాళ్లుచేతులు పట్టుకొని అప్పుతెస్తున్నం. తిండికి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా మనసున్న దాతలు సాయం చే సి పుణ్యం కట్టుకోవాలి. - సూరారపు ఉపేంద్ర, తల్లి -
ఫ్లూతో రెండేళ్ల బాలుడి మృతి
ఎంజీఎం(వరంగల్) : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో స్వైన్ప్లూతో మంగళవారం రాత్రి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా రామగుండానికి చెందిన అంజా (2) అనారోగ్యంతో ఈ నెల 25వ తేదీన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. జ్వరం, జలుబు, శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న బాలుడిని అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. స్వైన్ఫ్లూ సోకినట్లుగా అనుమానించిన వైద్యులు 27వ తేదీన తెమడ నమూనాలు సేకరించి హైదరాబాద్లోని ప్రీవెంట్ ఆఫ్ మెడిసిన్కు పంపించారు. ఈ క్రమంలో 27వ తేదీ రాత్రి మృతి చెందాడు. సోమవారం పంపించిన బాలుడి నమూనాల ఫలితాలు బుధవారం రాత్రి అందినట్లు ఎంజీఎం ఆర్ఎంఓ హేమంత్, మెడిసిన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. కాగా, బాలుడి తల్లి 18వ తేదీన స్వైన్ప్లూ సోకి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
బాధ్యత నాది
కాంగ్రెస్లో పలువురి చేరిక
త్వరగా నిద్రలేవమన్నందుకు చెరువులో దూకి ఆత్మహత్య
జిల్లా ఉండన్నా? పోవన్నా..?
రేపు బాన్సువాడకు రాజ్నాథ్సింగ్ రాక
దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్సే
సకాలంలో పనులు పూర్తి చేయాలి
నేడు సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో
తప్పనిసరిగా ఓటు వేయాలి
తప్పక చదవండి
Advertisement