-
ఏం దొరికినట్లు?
జీవిత రహస్యాలన్నీ సత్యాలేనని నమ్మే పని లేదు. వాటిలో నమ్మకాలు కూడా కొన్ని ఉంటాయి. గంపలో కలిసిపోయినట్లు గుట్టుగా అవన్నీ సత్యాలలో కలిసి ఉంటాయి. నమ్మకాలను సత్యాలను వేరు చేసే పని వల్ల ఎవరికీ ప్రయోజన లేదు. ఇవాళ్టి సత్యం నిన్నటి నమ్మకం కావచ్చు. నేటి సత్యం రేపటికి ఒట్టి నమ్మకంగా మిగలవచ్చు. సత్యమూ, వాస్తవమూ కాని అలాంటి ఒక ప్రపంచంలో జీవించడానికి, అలాంటి ఒక ప్రపంచాన్ని భరించడానికి మనిషి ఇష్టపడడు. కానీ తాత్వికత అంటుంది... మనిషి ఒక దశకు చేరాక ఏ ప్రపంచమైనా ఒక లెక్కకు రాదని! అంటే, ప్రపంచాన్ని దాని నెత్తిపై నుంచి చూసేందుకు వీలైన ఒక పెద్ద చెట్టుపైన... అనుభవం, విజ్ఞత అటొక చెయ్యి ఇటొక చెయ్యి వేసి మనిషిని అతడి డెబ్బయవ యేటో, ఎనభయ్యవ యేటో లేపి కూర్చోబెడతాయని. నాకైతే నమ్మకం లేదు మనిషి ఎదుగుతాడని. జీవితపు ప్రారంభ సందర్భాలలో అతడికి నచ్చిన క్షణాలో, నచ్చని క్షణాలో ఏవో కొన్ని పోగుపడి ఉంటాయి. వాటితో ఒళ్లంతా చిక్కు ముడులు వేసుకుని అక్కడే సౌఖ్యంగా దుఃఖిస్తూనో, విషాదంలో సుఖిస్తూనో ఉండిపోతాడు. చివరికి అక్కడే ఒరిగిపోతాడు. అదే అతడి ఎదుగుదల. అదే అతడి ఉత్కృష్ట స్థితి. లేదా ఎదిగేందుకు ఇంకేమీ లేని స్థితి. అందుకే మన జీవితాన్వేషణలు రోజూ ఉదయాన్నే మొదలై, చీకటి పడేవేళకు ఇంటికి చేరుకుంటాయి. మధ్యలో ఏం దొరికినట్లు. బయల్దేరిన చోటికే రాకతప్పదన్న ఒక జీవిత సత్యమా? (ఇంగ్లండ్ కవి టి.ఎస్.ఇలియట్ స్వగతాల్లోంచి కొంత భాగం) -
నాలుగో బొమ్మ
ఒక రాకుమారుడి పట్టాభిషేకానికి ముందు ఒక సాధువు మూడు చిన్న బొమ్మలను అతడికి కానుకగా ఇచ్చాడు. ‘‘నేనేమైనా ఆడపిల్లనా! నాకు బొమ్మలిస్తున్నావు?’’ అన్నాడు రాకుమారుడు. సాధువు నవ్వాడు. ‘‘కాబోయే రాజుకు అవసరమైన కానుకలివి’’ అన్నాడు. ప్రశ్నార్థకంగా చూశాడు రాకుమారుడు.‘‘ప్రతి బొమ్మకు చెవిలో రంధ్రం ఉంటుంది. ఈ దారాన్ని ఆ బొమ్మల చెవిలోకి ఎక్కించి చూడు’’ అన్నాడు సాధువు. రాకుమారుడు మొదటి బొమ్మను తీసుకున్నాడు. ఆ బొమ్మ చెవిలోకి దూర్చిన దారం అవతలి చెవిలోంచి బయటికి వచ్చింది. ఈ రకం మనుషులు విన్నది విన్నట్లుగా గాలికి వదిలేస్తారు అని చెప్పాడు సాధువు. రాకుమారుడు రెండో బొమ్మ చెవిలోకి దూర్చిన దారం బొమ్మ నోట్లోంచి బయటికి వచ్చింది. ఈ రకం మనుషులు విన్నది విన్నట్లుగా బయటికి చెప్పేస్తారు అని చెప్పాడు సాధువు. రాకుమారుడు మూడో బొమ్మ చెవిలోకి దూర్చిన దారం ఎటు నుంచీ బయటికి రాలేదు! ఈ రకం మనుషులు విన్న దానిని తమ లోపలే నిక్షిప్తం చేసుకుంటారు అని చెప్పాడు సాధువు. ‘‘ఈ ముగ్గురిలో ఏ రకం మనుషులు నేను నమ్మదగినవారు?’’ అని అడిగాడు రాకుమారుడు. సాధువు నాలుగో బొమ్మను రాకుమారుడి చేతికి అందించాడు. ఆ నాలుగో బొమ్మ చెవిలోకి దారం దూర్చమన్నాడు. రాకుమారుడు దారం దూర్చగానే అది రెండో చెవిలోకి బయటికి వచ్చింది. మళ్లీ అదే బొమ్మలోకి ఇంకోసారి దారం దూర్చమని చెప్పాడు సాధువు. ఈసారి దారం నోట్లోంచి వచ్చింది. మళ్లీ ఒకసారి దారాన్ని దూర్చమని చెప్పాడు. అది ఎటువైపు నుంచీ బయటికి రాలేదు! ‘‘రాకుమారా ఈ నాలుగో రకం మనుషులే నువ్వు నమ్మదగినవారు, నువ్వు ఆధారపడదగినవారు. ఎప్పుడు వినకూడదో, ఎప్పుడు మాట్లాడకూడదో, ఎప్పుడు మౌనంగా ఉండకూడదో తెలిసిన వారే రాజ్యపాలనలో నీకు సహకారులుగా ఉండాలి’’ అని చెప్పాడు సాధువు. రాకుమారుడు సాధువుకు నమస్కరించి, నా నాలుగు బొమ్మలనూ తన దగ్గర ఉంచుకున్నాడు. ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండడం విజ్ఞత. ఎలా ఉండకూడదో అలా ఉండకపోవడం వివేకం. ఈ రెండూ ఉన్న వ్యక్తులు జీవితంలో రాణిస్తారు. -
విజ్ఞతతో అడుగేయాలి
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఆర్థిక సమస్యలపైనా...త్వరలో జరగబోయే పర్యావరణ శిఖరాగ్ర సమావేశంపైనా, యూరప్ ఎదుర్కొంటున్న శరణార్థుల సమస్యపైనా ప్రధానంగా దృష్టి సారించాల్సిన జీ-20 దేశాలకు ఇప్పుడు ఉగ్ర వాదం కీలకాంశంగా మారింది. టర్కీ తీరంలోని అంటాల్యా నగరంలో ఆదివారం ప్రారంభమైన శిఖరాగ్ర సదస్సు ప్రస్తుతం తన ఎజెండాను పక్కనబెట్టి పారిస్ మారణహోమంపై చర్చిస్తున్నది. ప్రపంచంలోని 85 శాతం ఆర్థిక వ్యవస్థలకు జీ-20 ప్రాతినిధ్యం వహిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సహకారంలో ఎదురవుతున్న సవాళ్ల పైనా, వాటిని ఎదుర్కొనడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా ఇది సమీక్షించాల్సి ఉంది. దేశాల ఆర్థిక వ్యవస్థలను కుంగదీస్తున్న నల్ల డబ్బు బెడద విషయంలో కఠినంగా వ్యవహరించాలని మన దేశం గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. ఏవేవో సాకులు చెప్పి చాలా దేశాలు నల్ల కుబేరుల వివరాలు ఇవ్వడానికి ముందు కు రావడం లేదు. పన్నుల ఎగవేత, నల్లడబ్బు లాంటి సమస్యలు వర్ధమాన దేశాల అభివృద్ధికి ఆటంకంగా పరిణమించాయని భారత్ ఆందోళన పడుతోంది. దేశాలన్నీ పారదర్శకతను పాటిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని చెబుతున్నది. అలాగే ఎన్నారైలు, వివిధ వ్యాపారాలు చేసేవారూ భారత్కు పంపే సొమ్ముపై లావాదేవీల భారాన్ని తగ్గించాలని మన దేశం కోరుతోంది. 2013లో ఇలా దేశంలోకి వచ్చిన సొమ్ము 7,000 కోట్ల డాలర్లు. ఈ లావాదేవీల వ్యయం దాదాపు 10 శాతం ఉండేది. మన దేశం గట్టిగా డిమాండ్ చేయడంవల్ల ప్రస్తుతం అది 7.5 శాతానికి వచ్చింది. 2030కల్లా దీన్ని 3 శాతానికి తీసుకురావాలని కోరుకుంటోంది. అంతేకాదు... వేర్వేరు దేశాలనుంచి వచ్చిపడుతున్న నిధుల వరదతోనే ఉగ్రవాదం వర్థిల్లుతున్న దని, దాన్ని ఆపగలిగినప్పుడే ఆ సమస్యను దుంపనాశనం చేయడం సాధ్యమ వుతుందని మన దేశం వాదిస్తోంది. అల్ కాయిదా, ఐఎస్ వంటి సంస్థలకు జీ-20 సభ్య దేశాల ఆర్థిక సంస్థల ద్వారానే నిధులు వెళ్తున్నాయి. ఇలాంటి సమస్యల న్నిటిపైనా చర్చ పెట్టాలని మన దేశం భావించింది. ఈ సమావేశంలో సిరియాపై అమీ తుమీ తేల్చుకోవాలని టర్కీ అనుకుంది. సిరియా విషయంలో అమెరికా నాన్చుడు వైఖరిపై అది ఆగ్రహంతో ఉంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ను సాధ్యమైనంత త్వరగా పదవీచ్యుతుణ్ణి చేస్తే తప్ప ఉగ్రవాదాన్ని ఎదుర్కొనలేమని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ వాదిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా 2009 తర్వాత టర్కీకి రావడం ఇదే ప్రథమం. ఆనాటి పర్యటన పర్యవసానంగా రెండు దేశాలమధ్యా సాన్నిహిత్యం, సహకారం పెరిగాయి. సిరియాతో తమకుండే తగువును అమెరికా ద్వారా పరిష్కరించుకోవా లన్నది ఎర్డోగాన్ ఎత్తుగడ. కనుకే సిరియాపై సైనిక చర్య తీసుకుంటే దాని పర్యవ సానంగా వచ్చిపడే సామాజిక, ఆర్థిక సమస్యలను భరించడానికి... ముఖ్యంగా 20 లక్షలమంది శరణార్థుల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన గతంలో చెప్పారు. స్వదేశంలో హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరంలో నిండా కూరుకుపోయి, తీరిక దొరక్క ఎర్డోగాన్ ఎటూ కదల్లేకపోయారు గానీ...లేకుంటే ఆయన జీ-20 ఎజెండాలో సిరియా సమస్యను తెచ్చిపెట్టేవారే. కానీ ఐఎస్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం ఇక తనవల్లగాదని ఇప్పటికే గ్రహించిన అమెరికా...ఆ విషయంలో సిరియా సహకారాన్నీ, ఇరాన్ తోడ్పాటునూ కోరుకుంటోంది. మారిన ఈ పరిణామం ఎర్డోగాన్కు మింగుడుపడటం లేదు. పారిస్లో ఉగ్రవాదులు సృష్టించిన బీభత్సం మాటలకందనిది. అందువల్లే 129మందిని పొట్టనబెట్టుకుని, మరో 352మందిని గాయపరిచిన ఆ ఉన్మాదుల చర్యను సదస్సులో మాట్లాడిన దేశాధినేతలంతా తీవ్రంగా ఖండించారు. ఆ మహమ్మారితో కఠినంగా వ్యవహరించేందుకు సమష్టిగా కదులుదామని ప్రకటిం చారు. దాంతోపాటు యూరప్ దేశాలకు ఇప్పుడు పెనుముప్పుగా పరిణమించిన శరణార్థుల సమస్యపై కూడా వారు దృష్టిసారించారు. ఇవి రెండూ సంబంధంలేని అంశాలు కాదు. అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అంతేకాదు...పారిస్ మారణహోమంపై అందుతున్న తాజా సమాచారాన్నిబట్టి చూస్తే ఈ రెండు అంశాలూ అక్కడ జరిగిన బీభత్సానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. శరణార్థుల రూపంలో వచ్చిన ఉగ్రవాదులు దాడికి పథక రచన చేసి ఉండొచ్చునని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయంటున్నారు. కనుక యూరప్ దేశాలు సరిహద్దుల పహారాను మరింతగా పెంచి, క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాకే శరణార్థులను అనుమతించాలని ఈ శిఖరాగ్ర సదస్సు కోరబోతున్నదని చెబుతున్నారు. అయితే ఉగ్రవాదానికి దారితీసిన పరిస్థితుల్ని సమీక్షించకుండా, ఆత్మవిమర్శ చేసుకోకుండా తీసుకునే ఇలాంటి నిర్ణయాలు ఆచరణలో ఫలితాన్నివ్వవు. సరిగదా వికటించి ఉగ్రవాదాన్ని మరింత పెంచుతాయి. సిరియాకూ, తమకూ ఉన్న సమస్యల్ని అంతర్జాతీయం చేసి లాభపడదామని టర్కీ ప్రయత్నించడం...స్వప్రయోజనాలను ఆశించి అమెరికా, నాటో దేశాలు దానికి పక్కతాళం వేయడం...అసద్ను పదవి నుంచి దించడానికి ఆయన వ్యతిరేకులకు విచక్షణారహితంగా డబ్బు, ఆయుధాలు అందించడం పర్యవసానంగానే ఐఎస్ ఉగ్రవాద సంస్థ పుట్టుకొచ్చిందని విస్మరించ కూడదు. అది సిరియా, లిబియా, ఇరాక్ తదితర ప్రాంతాల్లో సాగిస్తున్న మారణ హోమం వల్లనే కొంపా గోడూ వదిలి లక్షలాదిమంది శరణార్థు లుగా వస్తున్నారు. తాము సమావేశం నిర్వహించుకునే చోటకు కేవలం 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరియాలో ఊళ్లన్నీ వల్లకాడుల్లా మారాయని జీ-20 దేశాధినేతలు తెలుసుకోవాలి. సమస్య తమ సృష్టే గనుక కనీసం పరిష్కారం విషయంలోనైనా విజ్ఞతతో వ్యవహరించాలన్న స్పృహ ధనిక దేశాలకు కలగాలి. జీ-20 శిఖరాగ్ర సదస్సు అందుకు దోహదపడితే ప్రపంచానికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం సులభమవుతుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement