-
సీతారామయ్యగారింట్లో పెళ్లి!
తెలుగులో వచ్చిన సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామాల్లో ఎవర్గ్రీన్గా నిలిచిపోయే ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఈ రోజుకీ ఈ సినిమా నుంచి పుట్టిన ఫార్ములాతోనే లెక్కలేనన్ని సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... సీతారామయ్యగారింట్లో పెళ్లి హడావుడి అప్పటికే మొదలైపోయింది. ఇంట్లో వాళ్లంతా ఏదో ఒక పనిలో పడిపోయి బిజీబిజీగా కనిపిస్తున్నారు. గేటుముందు ఒక ట్యాక్సీ వచ్చి ఆగింది. ‘‘ఎంతైందీ?’’ అంటూ ట్యాక్సీకి డబ్బులిచ్చి లగేజీ సర్దుకుంటోంది ఆ అమ్మాయి. ఇంట్లో వాళ్లంతా ‘ఎవరా?’ అనుకుంటూ ఆ అమ్మాయినే చూస్తూన్నారు. ‘‘ఇది సీతారామయ్యగారి ఇల్లే కదండీ?’’ అడిగింది ఆ అమ్మాయి కాస్త బెరుకుగానే. ‘‘అవునమ్మా!’’ అంది ఆ ఇంటి ఆడపడుచు. ‘‘నేను సీతారామయ్యగారి మనవరాలిని. అమెరికా నుండి వస్తున్నాను. డాక్టర్ శ్రీనివాసమూర్తిగారి అమ్మాయిని..’’ ఆ అమ్మాయి తనను తాను పరిచయం చేసుకుంది. ఆ ఇంటి ఆడపడుచుతో పాటే పక్కనే నిలబడి ఈ మాటలన్నీ విన్న ఒక పిల్లాడు ఇల్లంతా ఆ మాటను వినిపించాడు. ఆ ఇంట్లో ఇప్పుడు హడావుడి ఇంకాస్త ఎక్కువైంది. ‘‘అమ్మా, నాన్నా?’’ అడిగింది ఆడపడుచు. ‘‘రాలేదండీ! నాన్నకు తీరుబాటు కాలేదు. అమ్మ.. నాన్నతో ఉండకపోతే, వీలుకాదు. అందుకే పెళ్లికి నన్ను వెళ్లమని పంపారు.’’ సీతారామయ్య బయటికొచ్చి ఆ అమ్మాయిని చూశాడు. మనవరాలిని చూసిన సంతోషం అతనిలో కనిపిస్తున్నా, దాన్ని దాచేస్తూ గంభీరంగా చెప్పాడు – ‘‘వచ్చిన బంధువులకు ఇంట్లో సదుపాయాలు అవీ సరిగ్గా చూడండి. ఇది సీతారామయ్యగారింట్లో జరుగుతున్న పెళ్లి’’. సీతారామయ్య మనవరాలు రావడంతోనే ఇంట్లో అందరికీ నచ్చేసింది. ఇట్టే కలిసిపోయింది. ‘‘నాన్న నన్ను ‘నాన్నా నాన్నా’ అని పిలుస్తాడు నానమ్మా!’’ అని మనవరాలు చెప్తూ పోతుంటే సీతారామయ్యకు, ఆయన భార్యకు కళ్లలో నీళ్లు తిరిగాయి. కొడుకు గుర్తొచ్చాడు. ఎప్పుడు ఇల్లు వదిలేశాడతను? ఆ భార్యాభర్తలిద్దరూ ఇప్పటికీ కొడుకును తల్చుకోని రోజంటూ లేదు. మనవరాలు సీత పందొమ్మిదేళ్ల వయసు వచ్చిందాక ఎలా ఉందో కూడా వాళ్లు చూడలేదు. సీతను ఇలా ఇప్పుడు చూస్తూండడం వాళ్లకు సంతోషంగా ఉంది. సీతరామయ్యకు మాత్రం కొడుకు రాలేదనే కోపం, బాధ అలాగే ఉంది. అందుకే మనవరాలితో మాట్లాడటానికి కూడా ఇష్టంగా లేడు. కానీ ఆమె చేష్టలు, ఇంట్లో అందరితో ఇష్టంగా కలిసిపోవడం, ఏదో ఒకలా తనతో మాట్లాడాలని ప్రయత్నాలు చేస్తూ ఉండటం సీతారామయ్యకు తెలీకుండానే మనవరాలిని దగ్గర చేస్తున్నాయి. పెళ్లి రోజు రానే వచ్చేసింది. సీతారామయ్య ఇంట్లో పెళ్లి కాబట్టి ఊరంతా ఒకదగ్గర చేరినట్టుంది పెళ్లి మండపమంతా. సీతారామయ్య తన మనవరాలైన పెళ్లికూతురుకు పదివేలు కట్నం చదివించాడు. అలాగే సీత కూడా నాన్న తరపున కట్నం చదివించింది. పదివేల డాలర్లు. ‘‘మీరు పదివేలు చదివిస్తే, మీ వాడు పదివేల డాలర్లు చదివించాడు. అంటే మీకంటే పదిహేడు రెట్లు ఎక్కువ.’’ అన్నాడు పెళ్లిలో సీతరామయ్య పక్కనే కూర్చున్న ఓ పెద్దమనిషి. ‘‘ఎంతెక్కువైనా ఖర్చు విషయంలో ఇక్కడ రూపాయి ఎంతో అక్కడ డాలరూ అంతే. అదో గొప్పా!?’’ అంటూ కొట్టిపారేశాడు సీతారామయ్య. ఆ మాటలను వింటూ తాతయ్యనే చూస్తూ కూర్చున్న సీత చిన్నగా నవ్వింది. పెళ్లి అయిపోయింది. సీతంటే ఇప్పుడు ఇంట్లో అందరికీ ఇష్టం. సీతారామయ్య కూడా మనవరాలిని మూడు రోజులకు మించి దూరం పెట్టలేకపోయాడు. ఆయనే సీతను దగ్గరికి తీసుకొని ముద్దుపెట్టి ‘‘నువ్వు నా మనవరాలివి.’’ అన్నాడు. సీత ఆనందానికి అవధుల్లేవు. ఇల్లంతా తిరుగుతూ గట్టిగా అరిచి చెప్పింది – ‘‘తాతయ్య నాకు ముద్దు పెట్టాడు’’. రోజులు గడుస్తున్నాయి. పందొమ్మిదేళ్లు ఈ ప్రపంచాన్ని చూడని సీత ఇప్పుడిదే ప్రపంచంగా గడిపేస్తోంది. సీతరామయ్యకూ ఇదంతా ఓ కలలా ఉంది. సీత వచ్చాక ఆ ఇల్లు ఎంత సంతోషంగా ఉందో, అంత సంతోషంగా ఉన్న ఒకరోజు. అమెరికా నుంచి సీతారామయ్య కొడుకు శ్రీనివాసమూర్తి స్నేహితుడు వివేక్ సీతను చూడ్డానికి వచ్చాడు. సీతారామయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. సీతకు కబురెళ్లింది. పొలం చూసొస్తానని వెళ్లిన సీత పరిగెత్తుకుంటూ వచ్చింది. సీతారామయ్య, ఆయన భార్య, వివేక్ ఏం మాట్లాడకుండా కూర్చున్నారు. సీత కంగారు పడిపోతోంది. ఎవ్వరూ ఏం మాట్లాడటం లేదు. గట్టిగా అరిచినట్టు అడిగింది – ‘‘ఎవ్వరూ ఏం మాట్లాడరే!’’. ‘‘నువ్వు ఆడిన నాటకానికి ఇంకా మేం నీతో మాట్లాడాలా?’’ సీతారామయ్య గట్టిగా అడిగాడు. ‘‘నాటకమా?’’ అమాయకంగా నటిస్తూ అడిగింది సీత. ‘‘ఆయన అన్నీ వివరంగా మాతో చెప్పారు.’’ అంది సీతారామయ్య భార్య, వివేక్ను చూపిస్తూ. సీతలో కంగారు ఇంకా పెరిగిపోయింది. ‘‘చెప్పేశారా?.. అంకుల్..?’’‘‘అదీ.. సీతా..’’ వివేక్ మాటలను మధ్యలోనే ఆపేస్తూ, ‘‘బాబూ! మీరు దయచేసి కాసేపు మాట్లాడకండి.’’ అన్నాడుసీతారామయ్య. వెంటనే సీతవైపు చూస్తూ.. ‘‘ముందు నాకు సమాధానం చెప్పవే సీతా! ఈ విషయం మా ముందు దాచవలసిన అవసరం ఏమొచ్చింది?’’ అడిగాడు. ‘‘తాతయ్యా! అదీ..’’ సీత తడబడుతోంది. ‘‘హఠాత్తుగా మీ నాన్న వస్తున్నాడని తెలిస్తే, నేను గుండె ఆగి చచ్చిపోతాననుకున్నాడా? వాడింటికి వాడొస్తున్నాడు.’’తాతయ్య మాటలు వింటున్న సీత కంగారంతా ఎగిరిపోయింది. పొలం దగ్గర్నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినప్పట్నుంచి ఉన్న కంగారు అది. వివేక్ ఎక్కడ నిజం చెప్పేశాడో అని. కానీ వివేక్ నిజం దాచేశాడు. సీతారామయ్యకు చెప్పిన చిన్న అబద్ధంతోనే ఆ నిజాన్ని దాచేశాడు. ఆ అబద్ధం అప్పటికి సీత కళ్లలో ఆనందాన్ని తెచ్చిపెట్టింది. కానీ నిజం.. నిజం ఏదో ఒకరోజు చెప్పాల్సి రావొచ్చు. కొడుకు ఎప్పటికీ రాడని తెలిస్తే, ఆ రోజు సీతారామయ్య ఏమవుతాడో!! -
ఇదో మనవరాలి కథ
నాటి సినిమా మాట తప్పని తండ్రి – ఆ తండ్రి పెంపకంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే వ్యక్తిగా పెరిగిన కొడుకు – తండ్రీకొడుకుల మంచితనాన్ని పుణికి పుచ్చుకున్న మనవరాలు. ముగ్గురూ మంచితనానికి కేరాఫ్ అడ్రస్. సీతారామయ్యగారు గొప్పవారు. తాతయ్యకు బాధ కలగకుండా ఉండటానికి మనసులో బాధను దిగమింగుకునే మనవరాలు ఇంకా గొప్ప. తండ్రీ–కొడుకు– మనవరాలు... ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఎమోషనల్ జర్నీ ‘సీతారామయ్యగారి మనవరాలు’. ఈ తాతా మనవరాలి కథ ఏంటంటే... గోదావరి తీరంలోని సీతారామపురం ఊరి పెద్ద సీతారామయ్య (అక్కినేని నాగేశ్వరరావు). భార్య జానకి (రోహిణి హట్టంగడి), ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. ఇది సీతారామయ్య కుటుంబం. కొడుకు శ్రీనివాస మూర్తి అలియాస్ వాసు (రాజా)కి తండ్రంటే ప్రాణం. కొడుకంటే తండ్రికి కూడా బోల్డంత ప్రేమ. ఫాదర్–సన్ అనడంకంటే ‘బెస్ట్ ఫ్రెండ్స్’ అనడం కరెక్ట్గా ఉంటుంది. కొడుక్కి పెళ్లి సంబంధం చూస్తాడు సీతారామయ్య. ఆ విషయం చెప్పేలోపే వాసు తాను సుమతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని తండ్రికి చెబుతాడు. మునసబుని వియ్యంకుణ్ణి చేసుకుంటానని మాటిచ్చేసానంటాడు తండ్రి. సుమతికి మనసిచ్చానంటాడు కొడుకు. తండ్రి మాటకు ఊళ్లో ఎంత విలువ ఉందో చెప్పి, పెళ్లికి ఒప్పుకోమంటారు వాసు అక్కా బావ. అటువంటి తండ్రి కడుపున పుట్టిన కొడుకుగా మాట తప్పలేనంటాడు వాసు. తప్పక పెళ్లికి ఒప్పుకుంటాడు సీతారామయ్య. అవే చివరి మాటలు! పాతికేళ్లు ప్రతి మాటనూ పంచుకున్న కొడుకు మనసిచ్చిన అమ్మాయి గురించి ఒక్క మాట కూడా ముందు చెప్పకపోవడం తనను అవమానించినట్లుగా, అగౌరవించినట్లుగా భావిస్తాడు సీతారామయ్య. సుమతి, తానూ డాక్టర్స్ కాబట్టి, ఊళ్లో ఆస్పత్రి కట్టిస్తే, ఇక్కడే ఉంటామంటాడు వాసు. ఆస్పత్రి కావాలంటే ఆస్పత్రి, ఆస్తి కావాలంటే ఆస్తి.. ఏదైనా ఇచ్చేస్తా.. కానీ, ఎప్పటికీ నాతో మాట్లాడకూడదంటాడు. కొడుకుతో సీతారామయ్య మాట్లాడే చివరి మాటలవే. ఈ తండ్రీకొడుకుల మధ్య జానకమ్మ నలిగిపోతుంది. పుట్టిన తర్వాత కొడుకు చేసిన మొదటి తప్పుని క్షమించమని జానకమ్మ బతిమాలుతుంది. తాను కూడా మొదటిసారి మాట తప్పానంటాడు సీతారామయ్య. మరోవైపు కోడలు సుమతి అన్యోన్యంగా ఉన్న తండ్రీకొడుకులు తన కారణంగా విడిపోయారని బాధపడుతుంది. చేసేదేం లేక భార్యతో సహా ఇంటి నుంచి వెళ్లిపోతాడు వాసు. కాలం ఎవరికోసమూ ఆగదు. 20 ఏళ్లు గడిచిపోతాయ్. పైకి మామూలుగానే ఉన్నా సీతారామయ్య మనసులో కొడుకు జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. బాధను బయటపెట్టకుండా సీతారామయ్య, జానకమ్మ గంభీరంగా రోజులు గడుపుతుంటారు. కట్ చేస్తే... అమెరికా టు ఇండియాకి సీత సీతారామయ్య మనవరాలి (పెద్ద కుమార్తె కూతురు) వివాహం కుదురుతుంది. ఈ పెళ్లికి సీతారామయ్య మరో మనవరాలు (వాసు కూతురు) సీత (మీనా) అమెరికా నుంచి ఇండియా వస్తుంది. మనవరాలిని చూసి, మురిసిపోతుంది జానకమ్మ. సీతారామయ్య మనసు మురిసినా బయటపడడు. ‘నా పేరు సీత.. మీ పేరే’ అంటూ తాతయ్యతో మాటలు కలిపిన మనవరాలికి మెల్లమెల్లగా దగ్గరవుతాడు సీతారామయ్య. పెరిగింది అమెరికాలో అయినా తెలుగింటి పిల్లలా మనవరాలు ఉండటం, సంస్కృతీ సంప్రదాయాలకు విలువ ఇవ్వడం సీతారామయ్య మనసుని ఆకట్టుకుంటుంది. మనవరాలిలో కొడుకుని చూసుకుంటాడు. మాట పట్టింపుతో కొడుకు తన ఇంటికి రాలేదని ఓ మూల బాధపడతాడు. అంతా సాఫీగా సాగుతోందనుకుంటున్న సమయంలో అమెరికా నుంచి వాసు ఫ్రెండ్ (మురళీమోహన్) ఇండియా వచ్చి, సీతారామయ్యగారింటికి వెళతాడు. ‘మా అబ్బాయి ఎప్పుడు వస్తాడు’ అని సీతారామయ్య దంపతులు అడగడంతో తన తల్లిదండ్రులు చనిపోయిన విషయాన్ని సీత దాచిన విషయం అతనికి అర్థమవుతుంది. చెప్పొద్దని మురళీమోహన్తో సీత విన్నవించుకుంటుంది. అతను వచ్చిన దారినే అమెరికా చెక్కేస్తాడు. మనవరాలిలోనే కొడుకు ‘నీలో నన్ను చూసుకునేవరకూ తాతయ్యకు నేను చనిపోయిన విషయం చెప్పకు’ అని తండ్రి చివరి క్షణాల్లో చెప్పిన మాటను నిలబెట్టడానికి సీత విశ్వప్రయత్నం చేస్తుంది. దుఃఖాన్నంతా లోపల మింగేసుకుని, బయటికి నవ్వుతుంటుంది. ఇప్పుడో చిక్కొచ్చి పడుతుంది. సీతారామయ్య–జానకమ్మల షష్టిపూర్తి వేడుక నిర్ణయం అవుతుంది. ఆ వేడుకకు కొడుకు వస్తాడని ఆశిస్తారు. వాసు రాడు? మరీ ఇంత పట్టింపా? అని సీతారామయ్య బాధపడిపోతాడు. ఎలాగైతేనేం వేడుక బాగానే జరుగుతుంది. ఆ తర్వాత జరగకూడనిదే జరుగుతుంది, జానకమ్మ హఠాన్మరణం ఇంటిల్లిపాదినీ కుంగదీస్తుంది. ఇప్పుడైనా కొడుకు వస్తాడని ఎదురు చూస్తాడు సీతారామయ్య. రాకపోవడంతో ఈసారి బాధ.. కోపంగా మారుతుంది. ‘నువ్విక్కడే ఉంటే నా కొడుకు లేని వెలితి బాగా కనిపిస్తోంది. అమెరికా వెళ్లిపో’ అంటాడు మనవరాలితో. సీత కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. చివరకు తాతయ్య చెప్పినట్లే అమెరికా ప్రయాణమవుతుంది. కానీ, అప్పటివరకూ రాసుకున్న డైరీని మరచిపోయి, వెళ్లిపోతుంది. అది చదివి, కొడుకు చనిపోయిన విషయం తెలుసుకున్న సీతారామయ్య ఎయిర్పోర్ట్కి వెళ్లి మనవరాలిని వెనక్కి తీసుకొస్తాడు. కొడుకు అస్తికలను గోదావరిలో కలుపుతాడు. ‘మా నాన్న మీకు గిఫ్ట్ పంపించాడు’ అంటూ ఇంటికొచ్చిన రోజున మనవరాలు ఇచ్చిన చేతి కర్రను నదిలో విసిరేస్తాడు. దీని అవసరం లేదు.. నువ్వున్నావుగా అంటూ మనవరాలిని అక్కున చేర్చుకుంటాడు. ఇది ఓ మనవరాలి కథ. అందుకే ఏయన్నార్ లాంటి స్టార్ ఉన్నప్పటికీ ‘సీతారామయ్యగారి మనవరాలు’ అని టైటిల్ పెట్టారు. ఆ మనవరాలి ప్రేమ, త్యాగం మనసుని మెలిపెడతాయి. తప్పంతా పరిస్థితులదే మాట ఇచ్చిన తండ్రిదీ తప్పు కాదు. తండ్రి మాటను కాదన్న కొడుకుదీ కాదు. తప్పంతా పరిస్థితులదే. మానస రాసిన ‘నవ్వినా కన్నీళ్లే’ అనే నవల ఆధారంగా తీసిన సినిమా ఇది. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిచయ వాక్యాలతో సినిమా గంభీరంగా మొదలవుతుంది. నవలను దర్శకుడు క్రాంతికుమార్ వెండితెరకు ట్రాన్స్ఫామ్ చేసిన తీరు బాగుంటుంది. కళ్లెదుటే జరుగుతున్న కథేనేమో అన్నంతగా హృదయాన్ని తాకే సన్నివేశాలతో తీశారు. అక్కినేని నాగేశ్వరరావు తొలిసారి విగ్ లేకుండా నటించిన సినిమా. ‘సీతారామయ్య’లాంటి పాత్రలు చేయడం ఆయనకు కష్టం కాదు. జీవించేశారు. ఏయన్నార్కి దీటుగా నటించగలిగింది మీనా. బాలనటిగా మెరిసిన మీనా మెయిన్ లీడ్ చేసిన మొదటి సినిమా ఇది. అద్భుతంగా నటించింది. ఈ పాత్రల్లో వీళ్లను తప్ప వేరేవాళ్లను చూడలేం అన్నంతగా రోహిణి హట్టంగడి, రాజా, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు తదితరులు నటించారు. అతిథి పాత్రలో దాసరి నారాయణరావు గోదావరి యాసలో నవ్వించారు. ‘పూసింది పూసింది పున్నాగ’, ‘భద్రగిరి రామయ్య’, ‘కలికి చిలకల...’ వంటి పాటలతో సినిమా హాయిగా సాగుతుంది. కీరవాణి ఇచ్చిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ ప్లస్.1991లో వచ్చిందీ సినిమా. విడుదలై పాతికేళ్లవుతున్నా సీతారామయ్యగారు, ఆయన మనవరాలు మనసుల్లో నిలిచిపోయారంటే కథ గొప్పతనం అది. ఏయన్నార్ అభినందనను మరచిపోలేను – మీనా ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమాకి ఛాన్స్ వచ్చినప్పుడు కొంచెం భయపడ్డాను. అక్కినేని నాగేశ్వరరావుగారితో సినిమా చేయడం అంటే మాటలా? టెన్షన్ అనిపించినప్పటికీ మంచి ఛాన్స్ అని ఒప్పుకన్నా. నాగేశ్వరరావుగారు బాగా మాట్లాడేవారు. దాంతో నా భయం మొత్తం పోయింది. ‘మనం ఎవరి కోసమైనా వెయిట్ చేయొచ్చు.. మనకోసం ఎవరూ వెయిట్ చేయకూడదు. పంక్చువాల్టీ ముఖ్యం’ అని ఏయన్నార్గారు నాకో సలహా ఇచ్చారు. అది ఎప్పటికీ మరచిపోలేను. అలాగే సినిమా విడుదలైన తర్వత, ‘లొకేషన్లో నువ్వు యాక్ట్ చేసినప్పుడు ఏమీ అనిపించలేదు. కానీ, సినిమాలో చూస్తే చాలా బాగానే యాక్ట్ చేశావ్ అనిపించింది’ అని మెచ్చుకున్నారు. అది మరచిపోలేను. చెన్నయ్లో జరిగిన వందేళ్ల భారతీయ సినిమా పండగ (2014) అప్పుడు అన్ని భాషలవాళ్లు వచ్చారు. అక్కడే ఏయన్నార్గారి పుట్టినరోజు వేడుక జరిగింది. ఆ వేడుకలో నేను పాల్గొన్నాను. ఆయన్ను చూడటం అదే చివరిసారి. ‘మనం’ చూసినప్పుడు ఎమోషనల్ అయ్యాను. తల్లిదండ్రులు చనిపోయారనే విషయం తాతయ్య–నానమ్మలకు చెప్పలేక గోదావరి తీరాన మీనా ఏడవడం, తాతయ్య అమెరికా వెళ్లిపొమ్మన్నప్పుడు పడే బాధ ప్రేక్షకుల కళ్లు చెమర్చే సన్నివేశాలు. కొడుకు పంపిన బహుమతి (చేతికర్ర)ని సీతారామయ్య ఆప్యాయంగా తడిమి చూసుకునే సీన్, అది చూసి జానకమ్మ మురిసిపోవడం అలరిస్తాయి. ‘పెళ్లి చేసినట్లే చేసి నాకు మరణశిక్ష విధించారు’, ‘కన్నతండ్రికి అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడా మీ నాన్న.. వాడి కోసం ఒక్క మెట్టు కూడా దిగను’, ‘మాటకు విలువ తెలియనవాడితో నన్ను మాట్లాడమని అడగొద్దు’ వంటి డైలాగ్స్ సూపర్బ్. గణేశ్ పాత్రో రాసిన ఇలాంటి సంభాషణలు సినిమాకు బలం. 1991లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. నాలుగు నంది అవార్డులు దక్కించుకుంది. మలయాళంలో ‘సంధ్వానమ్’గా, కన్నడంలో ‘బెల్లి మొదగళు’ పేరుతో, హిందీలో ‘ఉదార్ కీ జిందగీ’గా రీమేక్ అయింది. – డి.జి. భవాని
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement