-
అల్లుడు బియ్యం అదుర్స్!
నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది.. ఔషధ విలువలున్న ఆహారం తీసుకోవడంపై ఆసక్తి పెరిగింది.. సేంద్రియ విధానంలో సాగు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.. పాత కాలం పంటలకు ప్రస్తుతం మరింత గిరాకీ వచ్చింది. ఆ క్రమంలోనే తమిళనాడుకు చెందిన అల్లుడు బియ్యం (మాపిళ్లై సాంబ) వరి వంగడం పలమనేరు మండలంలో సాగులోకి వచ్చింది. అత్యున్నత గుణాలున్న ఈ బియ్యా నికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఏడు నెలల కాల పరిమితితో చేతికందే ఈ పంట రైతుకు కాసులవర్షం కురిపించే అవకాశముంది. అలాగే పురాతన వంగడాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సాక్షి, పలమనేరు: సాధారణంగా మనం తినే బియ్యం తెలుపు రంగులో ఉంటుంది. వరి పంట కాలం కూడా నాలుగునెలలు మాత్రమే. పంట నాలుగడుగుల దాకా పెరుగుతుంది. కానీ అల్లుడు బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది. దీని పంటకాలం ఏడు నెలలు. ఆరు నుంచి ఎనిమిది అడుగులు వరకు పెరుగుతుంది. ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలుండడంతో విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. గతంలో తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి ప్రాంతంలోని రైతులు శతాబ్దాల నుంచి ప్రకృతి విధానంలో సాగు చేస్తూ వస్తున్నారు. వారు కాపాడుకుంటూ రావడం వల్లే అపురూపమైన మాపిళ్లై సాంబ రకం వంగడాలు నేటి తరానికి అందుబాటులోకి వచ్చాయి. అక్కడి నుంచి విత్తనాలను తీసుకువచ్చి పలమనేరు మండలంలోని కూర్మాయి వద్ద ఓ ఔత్సాహిక రైతు చందూల్ కుమార్ ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. సేంద్రియ పద్ధతులో పంట పండిస్తున్నారు. ప్రస్తుతం పంట ఏపుగా ఎదిగింది. ఒబ్బిడికి సిద్ధంగా తయారైంది. వంగడం చరిత్ర ఇదీ.. తమిళనాడుతోపాటు కేరళలోని పలు జిల్లాల్లో సాగు చేస్తున్న పురాతన వరి వంగడమే మాపిళ్లై సాంబ రకం. తమిళంలో మాపిళ్లై అంటే పెళ్లికొడుకు, అల్లుడు అని అర్థం. పాత కాలంలో అల్లుడు దృఢంగా ఉండాలని పెళ్లికుమార్తె ఇంటి వారు ఈ రకం బియ్యాన్ని వండిపెట్టేవారట. నూతన వధూవరులకు ఈ రకం అన్నాన్నే పెట్టడం ఇప్పటికీ కన్యాకుమారి ప్రాంతంలో ఉంది. ఇందులోని ఔషధ విలువల కారణంగా పురుషులకు వీర్యపుష్టి లభిస్తుందని నమ్ముతారు. ఈ బియ్యాన్ని తింటే కాన్పు సాధారణంగా అవుతుందని విశ్వసిస్తారు. అల్లుళ్లకు ప్రత్యేకంగా వడ్డిస్తారు కనుకే ఈ రకం బియ్యాన్ని మాపిళ్లై సాంబ అని పిలుస్తుంటారు. ఏపీ, తెలంగాణాలో అల్లుడు సాంబ, పెళ్లికొడుకు సాంబ, కేరళలో వరణ్సాంబ, కర్ణాటకలో వర సాంబ, ఉత్తరాది రాష్ట్రాల్లో దుల్హా సాంబగా పేర్లున్నాయి. ఆన్లైన్లో ఈ రకం బియ్యానికి బ్రైడ్గ్రూమ్ రైస్ అని పిలుస్తున్నారు. ఇది రాయలసీమలోని బైరొడ్లును పోలి ఉంటుంది. పలు సమస్యలకు ఔషధమే! ఈ రకం కిలో బియ్యంలో ఓ గ్రాము ఫ్యాట్, 80 గ్రాముల కార్బొహ్రైడ్రేట్, 7 గ్రాముల ఫైబర్, 7 గ్రాముల ప్రొటీన్, 50.8 గ్రాముల కాల్షియం, 90.4 గ్రాముల పోషకాలు, 5.47 గ్రాముల ఐరన్ పోషకాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిర్ధారించారు. ఈ బియ్యంతో వండిన ఆహారాన్ని భుజిస్తే రక్తశుద్ధితోపాటు మల బద్దకం, పైల్స్ సమస్యలు తలెత్తవు. అలాగే మధుమేహం బారిన పడినవారికి కూడా మేలు చేస్తుంది. రూ.200 పైమాటే.. దుకాణాల్లో ఈ రకం బియ్యం పెద్దగా అందుబాటులో లేదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీలు కిలో నుంచి మూడు, ఐదు కిలోల బ్యాగుల్లో వీటిని ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. డీమార్ట్, బిగ్ బాస్కెట్లాంటి మాల్స్లోనూ అందుబాటులో ఉన్నాయి. రూ.160 నుంచి రూ.250 దాకా కంపెనీలను బట్టి ధరలున్నాయి. దేశావాళి వరి వంగడాల్లో అగ్రస్థానం.. హరిత విప్లవం తర్వాత పలు రకాల హైబ్రిడ్ వరి వంగడాలు సృష్టించబడ్డాయి. సుమారు 2వేల దాకా వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం దేశవాళీ రకాలు వంశపారంపర్యంగా సాగులో ఉన్నాయి. అందులో అత్యంత పోషకాలు కలిగినవిగా రత్నబోడి, నవారా, కులాకర్, తాజముడి, కుజిపాటియాలా, మైసూర్మల్లిగె, చిట్టి ముత్యాలు, బర్మాబ్లాక్, బహురూపి, కుంకుమసార, కాలాబాటి, కోతాంబరి లాంటివి పేరు గడించాయి. అయితే వీటన్నింటికీ మించిన రకంగా మాపిళ్లై సాంబ అగ్రస్థానంలో నిలుస్తుంది. అందుకే మార్కెట్లో దీనికంత డిమాండ్ ఏర్పడింది. అధ్యయనం చేసి సాగు చేశా కొన్నేళ్ల నుంచి ప్రకృతి సేద్యం చేస్తున్నా. పలు రకాల దేశీయ వరి వంగడాలను సాగు చేస్తున్నా. గతంలో బ్లాక్రైస్ను సాగుచేశా. కానీ అన్నింటికంటే ఎక్కువ ఔష ధ గుణాలున్న మాపిళ్లై సాంబ సాగు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, బాగా అధ్యయనం చేశా. అనంతరం సాగు ప్రారంభించా. ఈ ప్రాంత రైతులకు ఈ వంగడాన్ని పరిచయం చేసి సాగు పెంచాలని భావిస్తున్నా. – చందూల్కుమార్, రైతు, కూర్మాయి, పలమనేరు మండలం అవగాహన పెరుగుతోంది హైబ్రిడ్ వరి వంగడా ల స్థానంలో దేశవాళీ విత్తనాలపై రైతుల్లో అవగాహన పెరిగింది. ముఖ్యంగా సేంద్రి య సేద్యంపై ఎక్కవ మంది మక్కువ చూపుతున్నారు. అపురూపమైన మాపిళ్లై సాంబకు (ఏంఏపీఎస్ఏఎంబీఏ–1) మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. రైతులు ఇలాంటి వరి వంగడాలను సాగు చేసేలా గ్రామాల్లో అవగాహన కలి్పస్తున్నాం. – సంధ్య, వ్యవసాయాధికారి, పలమనేరు మండలం మంచి పోషక విలువలు మన పూరీ్వకులు పండించిన ఎన్నో రకాల దేశీవంగడాలు కనుమరుగైయ్యాయి. కానీ కొందరు ఔత్సాహిక రైతులు మళ్లీ వాటిని సాగుచేస్తున్నారు. వీటిలో ఎన్నో రకాల పోషకాలున్నాయి. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండడంతో మలబద్దకం సమస్య తగ్గుతుంది. అనీమియాతో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది. కొలె్రస్టాల్ను కూడా తగ్గిస్తుంది. – యుగంధర్, మెడికల్ ఆఫీసర్, పలమనేరు -
సేంద్రియంతో సిరులు
60 సెంట్లలో సాగు రూ.రెండు లక్షలు ఆదాయం తక్కువ ఖర్చు... ఆదాయం అధికం గంగవరం: మండల కేంద్రంలోని బసవరాజుకు రెండు ఎకరాల పొలం ఉంది. అందులో బిందు సేద్యంతో ఆయన చేమంతి పూల తోటలు సాగు చేస్తున్నాడు. రెండు ఎకరాల్లో నాలుగు విడతల్లో తైలం చేమంతి పూలు సాగు చేస్తున్నాడు. 10 వేల తైలం పసుపు, తెలుపు చేమంతి మొక్కల ద్వారా రూ. రెండు లక్షల ఆదాయం సంపాదిస్తున్నట్లు బసవరాజు తెలిపాడు. తమిళనాడులోని రాయకోట నుంచి ఆ రెండు రకాల పూల మొక్కలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపాడు. రూ. రెండుకు ఓ మొక్క కొనుగోలు చేస్తున్నట్లు ఆయన వివరించాడు. ఎరువుల ఖర్చు లేదు చేమంతి పూలతోటల సాగుకు సేంద్రియ ఎరువు, జీవామృతానికి కేవలం రూ.వెయ్యిలోపే ఖర్చు అవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎరువు ఆవుపేడ, ఆవు గంజరం, శనగపిండి, కొంత మొత్తం బెల్లంతో తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపాడు. ఈ ఎరువు 20 రోజులకు ఓసారి మొక్కకు అందించాలి. దీనికి తోడు వేపాకు, ఆవుగంజరం, ఆవుపేడ మురగబెట్టి పిచికారి చేసి పంటను చీడపీడల నుంచి దూరం చేస్తున్నాని తెలిపారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడే కాకుండా అధిక ఆదాయం పొందుతున్నాని తెలిపాడు. జీరో బడ్జెట్తో ఎరువులు ఇంట్లో దేశవాళీ ఆవు ఉంటే రెండు ఎకరాలకు సరిపోయే ఎరువులు తయారు చేయవచ్చని రైతు బసవరాజు సూచిస్తున్నాడు. ఆవు మూత్రం, పేడ, బెల్లం, శనగపిండితో జీవామృతం తయారు చేసుకోవచ్చు. దీనిని డ్రిప్ ద్వారా మొక్కకు అందిస్తున్నామని తెలిపారు. ఈ తరహా ఎరువు వల్ల పంట నాణ్యతతో పాటు దిగుబడికి మార్కెట్లో గిరాకీ ఉంటుందన్నాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
నేను లేక.. మీరుండలేరు..!
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- నేను లేక.. మీరుండలేరు..!
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
Advertisement