-
చిన్న వయసు.. పెద్ద ఆలోచన
చిన్న హృదయంలో తట్టిన ఆలోచన ఎందరో మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. సేవా దృక్పథంతో 42 మంది విద్యార్థులు ఏకమై ఓ సంస్థను నెలకొల్పారు. సింహపురి చిన్నోడి మదిలో మెదిలిన ఆలోచన దేశ, విదేశాలల్లోని విద్యార్థులను కదిలించగా.. వారి దన్నుతో ఆర్థిక సంక్షోభంలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు ‘స్విఫ్ట్’ సంస్థ వెలిసింది. రెండేళ్లుగా వడ్డీలేని సూక్ష్మ రుణాలను అందిస్తూ.. లండన్ ప్రిన్స్ విలియమ్స్ మనసు గెలుచుకుని.. ‘ప్రిన్స్ డయానా’ అవార్డు దక్కించుకున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని రాంజీనగర్కు చెందిన కొరిశపాటి గోభాను శశాంకర్ అనే విద్యార్థికి పట్టుమని పదిహేడేళ్లు కూడా లేవు. మస్కట్లోని ఇంటర్నేషనల్ స్కూల్లో 11వ తరగతి చదువుతున్నాడు. మైక్రో ఫైనాన్స్పై ఆసక్తి పెంచుకుని వినూత్న సేవపై దృష్టి సారించాడు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న మహిళలను ఆదుకోవడం కోసం 2019 డిసెంబరులో ‘సస్టెయినింగ్ ఉమన్ ఇన్ మైక్రో ఫైనాన్స్ టర్మేయిల్’ (స్విఫ్ట్) పేరిట సూక్ష్మ రుణ సంస్థను ప్రారంభించాడు. దీనికి 42 మంది తోటి విద్యార్థుల మద్దతు లభించింది. వారంతా కలిసికట్టుగా పని చేస్తామని ధ్రువీకరిస్తూ విధి విధానాలను షేర్ చేసుకున్నారు. అలా ప్రారంభమైన స్విఫ్ట్ సంస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. ఆన్లైన్ ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలందించాలనే లక్ష్యం మేరకు నిరాటంకంగా రుణాలందిస్తున్నారు. రెండేళ్లలో వ్యక్తిగత, గ్రూపులతో కలిసి 1,450 రుణాలను మంజూరు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలకు రూ.60 లక్షలను ఆన్లైన్ ద్వారా అందించారు. రూ.25 లక్షలతో ప్రారంభం విద్యార్థులతో ఏర్పాటైన ఈ సంస్థ రూ.25 లక్షలతో మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మహిళలకు ఆ సంస్థ ఓ ప్రశ్నావళిని (క్వశ్చనీర్) ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచుతోంది. రుణం అవసరమైన వారు దానిని నింపితే.. వారి బ్యాంక్ ఖాతాకు రుణం జమ అవుతోంది. ఇలా రుణం పొందిన మహిళలు వారు తీసుకున్న మొత్తం ఆధారంగా వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంది. ఒక్కొక్కరికీ రూ.2,500 నుంచి రూ.40 వేల వరకు రుణం అందించారు. వారిలో గ్రూపులుగా ఏర్పడి రుణాలు పొందిన వారూ ఉన్నారు. స్విఫ్ట్ సంస్థకు రుణగ్రహీతల నుంచి కూడా మంచి సహకారం దక్కుతోంది. 98 శాతం మంది రుణాలు తిరిగి చెల్లిస్తున్నారు. ఇలా ప్రస్తుతం రూ.60 లక్షలను వివిధ వృత్తులు, వ్యాపారాల్లో ఉన్న మహిళలకు రుణాలుగా అందించారు. ప్రిన్స్ డయానా అవార్డుకు ఎంపిక సామాజిక దృక్పథం, మానవీయ విలువలు ఉన్న వారికి దివంగత లండన్ రాణి డయానా అవార్డును ప్రిన్స్ విలియమ్స్ ఏటా అందిస్తారు. విద్యార్థులతో ఏర్పాటైన స్విఫ్ట్ సంస్థ ఈసారి ప్రిన్స్ విలియమ్స్ మనసు గెల్చుకుంది. చిన్న వయసులో సామాజిక దృక్పథంతో.. లాభాపేక్ష లేకుండా సోషల్ ప్లాట్ఫామ్ ఆధారంగా మహిళలకు అండగా నిలుస్తున్న స్విఫ్ట్ సంస్థను డయానా అవార్డుకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని స్విఫ్ట్ సంస్థకు ఈ–మెయిల్ ద్వారా తెలియజేశారు. మరింత బాధ్యత పెరిగింది ప్రిన్స్ డయానా అవార్డు దక్కడం సంతోషంగా ఉంది. మహిళలకు దన్నుగా నిలవాలనే దృక్పథంతో ఆర్థికంగా చేయూత అందిస్తూ వడ్డీ లేని సూక్ష్మ రుణాలు ఇస్తున్నాం. నా తోటి 42 మంది విద్యార్థులతో స్విఫ్ట్ సంస్థను ఏర్పాటు చేశాం. swiftmfi.org వెబ్సైట్ ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం. – గోభాను శశాంకర్, స్విఫ్ట్ ఫౌండర్ -
AP: పోర్టుల ఖిల్లాగా సింహపురి
చరిత్ర గడ్డగా మిగిలిపోయిన సింహపురి పోర్టుల ఖిల్లాగా మారనుంది. ఆ నాడు కృష్ణపట్నం పోర్టు, శ్రీసిటీ, మాంబట్టు, మేనకూరు సెజ్లతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఈ రోజు రామాయపట్నం పోర్టు, దగదర్తి ఎయిర్ పోర్టు, క్రిస్ సిటీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సింహపురిని ప్రపంచ పటంలో చేర్చారు. సీ, ఎయిర్పోర్టులతో జిల్లా పారిశ్రామికంగా, వ్యాపారపరంగా కొత్త పుంతలు తొక్కుతోంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టులతో కావలి కనకపట్నంగా మారనుంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విశాలమైన సాగర తీరం.. మెండుగా ఉన్న భూములు సింహపురి చరిత్ర గతిని మార్చేసింది. ఓ వైపు కృష్ణపట్నం పోర్టు, సెజ్లతో సింహపురి కీర్తి ప్రపంచస్థాయికి చేరింది. తాజాగా రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రానుండడంతో పారిశ్రామికాభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రోడ్డు జల, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సరికొత్త హంగులతో కనెక్టివిటీ పెరగడంతో పారిశ్రామికవేత్తలు ఇటు వైపు చూస్తున్నారు. భవిష్యత్లో జిల్లా రూపురేఖలు మారనున్నాయి. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. జిల్లాకే తలమానికంగా సోమశిల, కండలేరు జలాశయాలు, కృష్ణపట్నం పోర్టు ఉన్నాయి. మరో వైపు రామాయపట్నం పోర్టు, దగదర్తి ఎయిర్పోర్టులు రానున్నాయి. 850 ఎకరాల విస్తీర్ణంలో రూ.3,736 కోట్లతో మొదటి దశ నిర్మాణ పనులకు బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేపట్టనున్నారు. రూ.10,640 కోట్ల వ్యయంతో 3,437 ఎకరాల్లో 19 బెర్త్లతో రామాయపట్నం పోర్టు తుది రూపు దిద్దుకోనుంది. 36 నెలల్లో పూర్తి చేసేందుకు అధికారుల కసరత్తు ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల వారికి ఓడరేవు ప్రయోజనాలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఆక్వా, గ్రానైట్, పొగాకు, ఐరన్ ఓర్ అనేక ముడి ఖనిజాలు ఎగుమతులకు ఈ పోర్టు కీలకంగా మారనుంది. నాడు కృష్ణపట్నం– నేడు రామాయపట్నం నాడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణపట్నం పోర్టు నిర్మించగా, నేడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రామాయపట్నం పోర్టు నిర్మిస్తున్నారు. తండ్రి, తనయులు ఇద్దరు ఇటు ప్రజల మదిలో, అటు చరిత్రలో నిలిచేపోయేలా నౌకశ్రాయాలు ఏర్పాటు చేశారు. కందుకూరు, కావలి నియోజక వర్గాల సరిహద్దులోని రామాయపట్నం పోర్టు నిర్మాణానికి గుడ్లూరు మండలంలోని మొండివారిపాళెం, ఆవులపాళెం, కర్లపాళెం, సాలిపేట, రావూరు, చేవూరు గ్రామాల పరిధిలో మొదటి దశలో 850 ఎకరాల భూసేకరణను అధికారులు పూర్తి చేశారు. కనకపట్నంగా కావలి రామాయపట్నంపోర్టుతో ప్రధానంగా కావలి పట్టణం మరింతగా అభివృద్ధి చెందనుంది. రామాయపట్నం పోర్టు కందుకూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పటికీ కావలికి మరింత దగ్గరగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. కావలి తీరంలో దక్షిణం వైపు జువ్వలదిన్నె హార్బర్, ఉత్తరం వైపు రామాయపట్నం పోర్టులు నిర్మింతమవుతున్న నేపథ్యంలో ఆయా ప్రాజెక్ట్లకు అనుబంధంగా పరిశ్రమలు రానున్నాయి. త్వరలోనే దగదర్తి ఎయిర్పోర్టు కూడా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కావలి ప్రధాన పట్టణం కానుంది. భవిష్యత్లో కావలి కనక పట్నంగా మారుతుందని ఆ నాడు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారని, అది త్వరలోనే రుజువు కాబోతుందని గుర్తు చేస్తున్నారు. -
అజాతశత్రువుకు అశ్రునివాళి
నెల్లూరు నుంచి సాక్షి ప్రతినిధి, సాక్షి, నెల్లూరు/ ఉదయగిరి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అకాల మృతితో సింహపురి కన్నీరుమున్నీరవుతోంది. తమ ప్రియతమ నేత పార్ధివదేహాన్ని చూసి అశేష అభిమాన జన సందోహం తల్లడిల్లిపోతోంది. అజాత శత్రువుకు అంతా అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. హైదరాబాద్లో హఠాన్మరణం చెందిన పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి భౌతికకాయాన్ని ప్రత్యేక హెలికాప్టర్లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి నెల్లూరుకు తరలించారు. ఆయన మాతృమూర్తి మణిమంజరి, సతీమణి శ్రీకీర్తి అదే హెలికాప్టర్లో వెంట ఉన్నారు. మేకపాటి రాజమోహన్రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి విమానంలో తిరుపతి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు వచ్చారు. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రత్యేక అంబులెన్స్లో గౌతమ్రెడ్డి పార్ధివ దేహం డైకాస్ రోడ్డులోని మేకపాటి కుటుంబం నివాసానికి మధ్యాహ్నం 12.15 గంటలకు చేరుకుంది. దారిపొడవునా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ‘గౌతమ్ రెడ్డి అమర్ రహే... జోహార్’ అని నివాళులర్పించారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు తరలి రావడంతో నెల్లూరులోని దారులన్నీ మేకపాటి గృహానికే బారులు తీరాయి. ప్రజలు కడసారి సందర్శించి నివాళులు అర్పించేలా మేకపాటి నివాసం వద్ద రెండు వరుసల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. 'తల్లి'డిల్లిన కన్న పేగు గుండెలు పిండేసే శోకం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైకి గౌతమ్రెడ్డి భౌతిక కాయాన్ని తరలించగానే అప్పటివరకు అతికష్టం మీద నిగ్రహించుకున్న అభిమానులు, కార్యకర్తల్లో దుఃఖం కట్టలు తెంచుకుంది. తమ ప్రియతమ నేత ఆప్యాయతను తలచుకుని భోరున విలపించారు. శ్రీకీర్తి తన భర్త పార్థివ దేహాన్ని పట్టుకుని విలపించడం అందర్నీ కలచివేసింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. గౌతమ్రెడ్డి తల్లి మణిమంజరి దుఃఖంతో అడుగులు వేయలేకపోయారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆమెను పట్టుకుని ఇంటిలోకి తీసుకువెళ్లారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి పరిస్థితి చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోక మానదు. విషణ్ణ వదనంతో ఉబికి వస్తున్న దుఃఖాన్ని అతికష్టం మీద నిగ్రహించుకుంటూ కూర్చుండిపోయారు. నేతలు, కార్యకర్తలు ఆయన వద్దకు వెళ్లి ఓదార్చేందుకు యత్నించారు. కాగా, ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, శంకర్ నారాయణ, శ్రీరంగనాథరాజు, గుమ్మలూరు జయరాం, పేర్నినాని, సీదిరి అప్పలరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం, ఏపీపీఏస్సీ చైర్మన్గా నియమితులైన గౌతమ్ సవాంగ్, తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి, ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణ రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, జోగి రమేష్, అంబటి రాంబాబు, ప్రసన్నకుమార్రెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి, వరప్రసాద్, రాంరెడ్డి ప్రతాప్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, డా.సిద్ధారెడ్డి, ఆదిమూలం, మేరుగ నాగార్జున, శ్రీనివాసరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, వెన్నపూస గోపాల్రెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, తదితరులు మంత్రి గౌతమ్రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, బొజ్జల సుదీర్రెడ్డి, అజీజ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేశ్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్యాదవ్ తదితరులు గౌతమ్ రెడ్డికి నివాళులర్పించారు. నేడు ఉదయగిరిలో అంత్యక్రియలు మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అంత్యక్రియలను బుధవారం ఉదయగిరిలో నిర్వహించనున్నారు. నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి బుధవారం ఉదయం అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ (మెరిట్స్) ఆవరణలో ఉదయం 11.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. గంధపు చెక్కలతో మంత్రి పార్ధివదేహాన్ని దహనం చేస్తారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, మంత్రి అనిల్కుమార్యాదవ్, కలెక్టర్ చక్రధర్బాబు అక్కడకు చేరుకుని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో హెలిప్యాడ్ను పరిశీలించారు. గుంటూరు ఐజీ త్రివిక్రమ్వర్మ, ఎస్పీ విజయారావు పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలువురు ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఉదయగిరిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టారు. రూట్ మ్యాప్.. నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి ఉదయం 6 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. జొన్నవాడ మీదుగా బుచ్చి, సంగం, నెల్లూరుపాళెం, మర్రిపాడు, బద్వేలు సరిహద్దు జాతీయ రహదారి నుంచి బ్రాహ్మణపల్లి, కృష్ణాపురం, నందిపాడు మీదుగా ఉదయగిరికి చేరుకుంటుంది. సీఎం పర్యటన షెడ్యూల్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం పది గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి 10.45 గంటలకు కడప ఎయిర్పోర్టు చేరుకుంటారు. 10.55 గంటలకు కడప నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 11.15కి అంత్యక్రియలు నిర్వహించే ఉదయగిరిలోని ఇంజనీరింగ్ కాలేజీ వద్దకు చేరుకుంటారు. 11.55 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి కడప వెళతారు. నెల్లూరు చేరుకున్న కృష్ణార్జునరెడ్డి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి మంగళవారం రాత్రి నెల్లూరు నగరంలోని నివాసానికి చేరుకున్నారు. అమెరికా నుంచి నేరుగా ఆయన చెన్నై చేరుకుని అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చారు. తండ్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో కృష్ణార్జున రెడ్డి కన్నీరుమున్నీరుగా విలపించారు. గౌతమ్ మృతి రాష్ట్రానికి తీరనిలోటు ఉదయగిరి: మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణం మేకపాటి కుటుంబంతో పాటు ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకేగాక రాష్ట్ర ప్రజలకు తీరని లోటని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి ఇంజినీరింగ్ కళాశాలలో మంత్రి అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మేకపాటి కుటుంబంలో అత్యంత తెలివైనవాడిగా గౌతమ్రెడ్డికి గుర్తింపు ఉందని చెప్పారు. అతి పిన్నవయస్సులోనే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో అతి ముఖ్యమైన శాఖకు మంత్రి పదవి చేపట్టి రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే తరుణంలో ఈ అకాల మరణం రాష్ట్ర ప్రజలను కలచివేసిందన్నారు. తన అన్న మేకపాటి రాజమోహన్రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన కొడుకుగా రాజకీయాల్లో ఎదుగుతున్న తరుణంలో ఈ విషాదవార్త తమ కుటుంబానికి తీరని లోటన్నారు. రాజకీయాల్లో చురుకైన వ్యక్తిగా, వివాదరహితుడిగా, నిజాయితీపరుడిగా, మచ్చలేని నాయకుడిగా ప్రతిపక్షాలు సైతం వేలెత్తి చూపలేని రాజకీయవేత్తగా గుర్తింపు పొందాడని చెప్పారు. -
శోకసంద్రంలో సింహపురి.. అజాతశత్రువు అకాల మృతితో తీవ్ర విషాదం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అజాత శత్రువుగా పేరు పొందిన మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో సింహపురి శోక సంద్రమైంది. కులమతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే మంత్రి గౌతమ్రెడ్డి ఆదర్శవంతమైన వ్యక్తిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నచ్చిన వ్యక్తిగా, మెచ్చిన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. వివాదరహితుడిగా, విమర్శలకు దూరంగా ఉంటారు. కారు డ్రైవర్ నుంచి అధికారుల వరకు అందరినీ గౌరవించే విశిష్ట వ్యక్తిత్వం ఆయన సొంతం. నారంపేటలో పారిశ్రామికవాడ మేకపాటి గౌతమ్రెడ్డి తన తండ్రి రాజమోహన్రెడ్డి అడుగుజాడల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసి 2014లో తొలిసారిగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో మరోమారు ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లె ఆయన స్వగ్రామం. మేకపాటి రాజమోహన్రెడ్డికి ముగ్గురు కుమారులు కాగా గౌతమ్రెడ్డి అందరి కంటే పెద్ద. ఆయన సోదరులు విక్రమ్రెడ్డి, పృథీ్వరెడ్డి కేఎంసీ కాంట్రాక్టు సంస్థను నిర్వహిస్తున్నారు. బాబాయి మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. పారిశ్రామిక ప్రగతి కోసం మంత్రి గౌతమ్రెడ్డి విశేషంగా తపించారు. సొంత నియోజకవర్గంలో నారంపేట పారిశ్రామికవాడను నెలకొల్పారు. జిల్లా వాసులకు ఉపాధికి కొరత లేకుండా చూడాలనే సంకల్పంతో సెజ్ ఏర్పాటు చేశారు. తండ్రంటే ప్రాణం ఆత్మకూరు/మర్రిపాడు: తన తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అంటే మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి పంచప్రాణాలు. ఆయన భావాలను పుణికి పుచ్చుకుని అదే అడుగుజాడల్లో నడిచారు. గతంలో రాజకీయాలతో పరిచయం లేకపోయినా తండ్రి పోటీ చేస్తున్న సమయంలో పలు నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారు. రాజకీయాల్లోకి ప్రవేశించాక వ్యాపార బాధ్యతలను సోదరులకు అప్పగించారు. ఏటా కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవటాన్ని గౌతమ్రెడ్డి ఆనవాయితీగా కొనసాగించారు. గత నెలలో సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు ఆయన కుటుంబంతో కలసి తిరుమలలో గడిపారు. అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాకే.. మంత్రి గౌతమ్రెడ్డికి తన తల్లి అంటే ఎంతో ప్రేమ. ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు ఆమె ఆశీస్సులు తీసుకునేవారు. మాతృమూర్తి మాట జవదాటేవారు కాదు. అలాంటి అమ్మకు పుత్రశోకం కలగడంతో తీవ్ర విషాదం నెలకొంది. ట్రెక్కింగ్ ఆయన హాబీ చిన్ననాటి నుంచి స్నేహితులతో గడపడం మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి ఇష్టం. ఒకసారి మనసుకు నచ్చితే ఆ స్నేహాన్ని వదులుకోరు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎంతో మంది స్నేహితులున్నారు. రాజకీయ, వ్యాపార, సినీ, పారిశ్రామిక రంగాల్లో ప్రముఖులంతా ఆయనకు చిరపరిచితులే. మేకపాటి గౌతమ్రెడ్డి నెల్లూరులో జన్మించినా బాల్యమంతా హైదరాబాద్లోనే గడిచింది. పదో తరగతి వరకు ఊటీలో, ఆపై హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేశారు. స్నేహితులతో కలసి నచ్చిన ప్రదేశాలను సందర్శించడం ఆయన అలవాటు. అంతేకాదు ట్రెక్కింగ్, హంటింగ్ , కారు ట్రక్కింగ్ ఆయన హాబీలు. రాజకీయాల్లోకి రాకముందు శనివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లి గడిపేవారు. -
Tiger Prawn: మళ్లీ టైగర్ శకం
జిల్లాలో నీలి విప్లవం సృష్టించి, అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో మీసం మెలేసిన సింహపురి టైగర్ రొయ్యల సాగు శకం మళ్లీ ప్రారంభం కానుంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం వరకు ఆక్వా రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందిన టైగర్ రొయ్యలను వివిధ రకాల వైరస్లు వెంటాడడంతో కనుమరుగయ్యాయి. ఆ స్థానాన్ని వెనామీ రొయ్యలు ఆక్రమించాయి. తాజాగా వెనామీలోనూ వైరస్లు విజృంభిస్తుండటంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. టైగర్ సరికొత్త బ్రీడర్తో తిరిగి రావడంతో రైతుల్లో ఆశలు మోసులు ఎత్తుతున్నాయి. వెనామీకి ప్రత్యామ్నాయంగా జిల్లాలోని ఆక్వా రైతులు టైగర్ సాగు వైపు అడుగులు వేశారు. సాక్షి, చిల్లకూరు: సింహపురిలో 1990వ దశకంలో టైగర్ రొయ్యలు నీలి విప్లవం సృష్టించాయి. దాదాపు దశా బ్దానికి పైగా డాలర్లు, యూరోలు ఆర్జించి పెట్టింది. తొలిదశలో రైతులను కోటీశ్వరులను తయారు చేసింది. కొన్నేళ్లలో వైరస్లు చుట్టుముట్టడంతో ఎంతో మంది రైతులను బికారీలను చేసింది. ఆ తర్వాత కొత్త రకం వెనామీ రావడంతో ఆక్వా సాగుదారులు అటు వైపు మళ్లారు. 2003 నుంచి 2015 వరకు వెనామీ సాగు డాలర్ల వర్షం కురిపించింది. వెనామీని సైతం పలు రకాల వైరస్లు వెంటాడుతుండడంతో దిగుబడులు తగ్గుతూ వచ్చాయి. వైరస్లకు యాంటీబయోటిక్స్ వాడడంతో ఎగుమతులు సన్నగిల్లాయి. నాసిరకం సీడ్ కారణంగా 120 రోజులు దాటినా కనీసం 100 కౌంట్ కూడా రాని పరిస్థితితో పెట్టుబడులు రాక అప్పులపాలవుతున్నారు. గూడూరు నియోజకవర్గంలో చిల్లకూరు, కోట, వాకాడు, చిట ్టమూరు మండలాల్లో సుమారు 2,500 హెక్టార్లలో సాగు చేసిన రైతులు ప్రస్తుతం 500 హెక్టార్లలో కూడా సాగు చేయలేక చతికిలపడ్డారు. చదవండి: (ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు) టైగర్ టు వెనామీ టు టైగర్ ఆంధ్రప్రదేశ్ నుంచే ఏటా 6.34 లక్షల టన్నుల (74 శాతం) రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో సింహపురిదే సింహభాగం వెనామీ రొయ్యలదే. అంతకు ముందు నాటు రొయ్య (టైగర్) హవా నడిచింది. ఆ తర్వాత టైగర్ రొయ్యలకు వైట్ స్పాట్ (తెల్లమచ్చ) వైరస్, ఇతరత్రా వ్యాధులు సోకడం, వ్యాధి రహిత తల్లి రొయ్యల (స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ బ్రూడర్స్) ఉత్పత్తి లేకపోవడంతో “టైగర్’ శకం ముగిసింది. అదే సమయంలో విదేశాల నుంచి స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ (ఎస్పీఎఫ్) వెనామీ బ్రూడర్స్ (తల్లి రొయ్యలు) రావడం, విస్తృత స్థాయిలో సీడ్ అందుబాటులోకి రావడంతో ఆక్వా రంగం పూర్తిగా వెనామీ వైపు మళ్లింది. ప్రస్తుతం వెనామీ రొయ్యలకు సైతం వైట్ స్పాట్, వెబ్రియా తదితర వైరస్లు, వ్యాధుల కారణంగా 40 కౌంట్లో పట్టాల్సిన 80–100 కౌంట్లో పట్టేయాల్సి వస్తోంది. దీంతో వెనామీ సాగు చేస్తున్న రొయ్యల రైతులు నష్టాలను చవి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తిరిగి టైగర్ రొయ్యలు అందుబాటులోకి వస్తున్నాయి. గుజరాత్లో తల్లి రొయ్యల పునరుత్పత్తి అమెరికాలోని హవాయికి చెందిన ఓ సంస్థ ఎస్పీఎఫ్ టైగర్ తల్లి రొయ్యలను అభివృద్ధి పర్చడంతో తిరిగి టైగర్ శకం ప్రారంభమైంది. వాటి దిగుమతికి 2019లో కేంద్రం అనుమతి ఇవ్వడంతో దేశీయ అవసరాలకు సరిపడా బ్రూడర్స్ దిగుమతికి అవకాశాలు తక్కువగా ఉండడంతో తల్లి రొయ్యల పునరుత్పత్తి కోసం గుజరాత్లో బ్రూడర్ మల్టిప్లికేషన్ సెంటర్ (బీఎంసీ)ను ఆ ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసింది. తల్లి రొయ్యల నుంచి ఉత్పత్తయ్యే సీడ్ను ఇక్కడ 4 నెలల పాటు పెంచి తద్వారా తల్లి రొయ్యలను పునరుత్పత్తి చేస్తోంది. వైట్స్పాట్తో పాటు ఇతర వ్యాధులను సైతం తట్టుకునేలా వాటిని అభివృద్ధి చేస్తారు. ఆ ప్రైవేట్ సంస్థ టైగర్ బ్రూడర్స్ను దిగుమతి చేసుకుని నెల్లూరు జిల్లాలోని వాకాడులో హేచరీ ద్వారా సీడ్ (రొయ్య పిల్లల)ను ఉత్పత్తి చేసింది. చిల్లకూరు మండలంలో కొంత మంది రైతులను ఎంపిక చేసుకుని వారికి సీడ్ను సరఫరా చేసి సుమారుగా 500 ఎకరాల వరకు తొలిసారిగా సాగు చేపట్టారు. 120 రోజుల క్రితం పిల్ల రొయ్యను వదలిన తర్వాత ఎలాంటి వైరస్లు సోకకుండా మేత సకాలం వేస్తుండడంతో అనుకున్న ఫలితం కన్నా రెట్టింపు దిగుబడి రావడంతో బ్లాక్ టైగర్ ఈ ప్రాంతంలో బాగా లాభాలు ఆర్జించి పెడుతుందన్న నమ్మకం ఏర్పడింది. చదవండి: (సింహపురి సమరం.. టీడీపీలో ఎన్నికల భయం) 120 రోజుల్లో 15 కౌంట్ రొయ్యలు తాజాగా అందుబాటులోకి వచ్చిన బ్లాక్ టైగర్ రొయ్యల సాగుకు ఎకరాకు లక్ష పిల్లలు మాత్రమే వదలితే సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి అవుతుంది. ఇవి 120 రోజుల్లో 15 కౌంట్ వస్తుండడంతో పాటు లాభాలు బాగా వస్తుండడంతో రైతులు పూర్తిగా టైగర్ సాగు వైపు మొగ్గు చూపేందుకు సిద్ధమవుతున్నారు. ఎకరాకు టన్ను నుంచి టన్నుర్నర దిగుబడి లభిస్తోంది. ప్రస్తుతం ఒక్కో రొయ్య పిల్ల రూపాయికి అందుబాటులో ఉంది. లాభాలు బాగున్నాయి పదేళ్లుగా వెనామీ సాగు చేసి ఒడిదొడుకులకు గురయ్యాం. ప్రస్తుతం బ్లాక్ టైగర్ సీడ్ అందుబాటులోకి రావడంతో సుమారు 100 ఎకరాల వరకు సాగు చేపట్టా, 120 రోజుల్లో చిన్న పాటి వైరస్ కూడా రాకపోగా 15 కౌంట్తో హార్వెస్ట్ చేసాను. వెనామీ 40 కౌంట్ రొయ్యలు రూ.460 ఉండగా టైగర్ 15 కౌంట్ రూ.780 ఉన్నాయి. దీంతో పెట్టుబడులు పోను లాభాలు బాగానే వస్తున్నాయి. – చిట్టేటి నారాయణ, ఆక్వా రైతు హేచరీలు పెంచేలా ఆలోచన బ్లాక్ టైగర్ను నెల్లూరు జిల్లాలో ప్రవేశ పెట్టాలని తొలిసారిగా వాకాడు ప్రాంతంలో ఒక హేచరీని లీజుకు తీసుకుని పిల్లను అందించే ప్రయత్నం చేశాం. అయితే ఆర్డర్లు భారీగా వస్తుండడంతో రాష్ట్రంలో విడవలూరు, విజయవాడ కరకట్ట, ఈతమొక్కల ప్రాంతాల్లో హేచరీలు ఏర్పాటు చేసి పిల్ల రొయ్యను ఉత్పత్తి చేసి రైతులకు సకాలంలో అందించేలా చేస్తాం . – జిగ్నేష్బాయి, హేచరీ నిర్వాహకులు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement