-
కార్పొరేట్ రంగంలో సాహో భారత్! గ్లోబల్ కంపెనీలను ఏలుతోంది మనోళ్లే..
మైక్రోసాఫ్ట్.. గూగుల్.. అడోబ్.. ఐబీఎం.. నోవార్టిస్.. డెలాయిట్.. స్టార్బక్స్.. బాటా.. యూట్యూబ్.. గోడాడీ.. మైక్రాన్.. ఫెడ్ఎక్స్.. డీబీఎస్.. ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత అవుతుంది లిస్ట్! ఇంతకీ ఏంటీ లిస్ట్ అంటారా? వీటన్నింటిలోనూ కామన్ విషయం ఒకటుంది. అదేనండీ ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాల్లో దుమ్మురేపుతున్న ఈ గ్లోబల్ కంపెనీలన్నింటినీ ఏలుతున్నది మనోళ్లే! మనదేశంలో పుట్టి.. సప్తసముద్రాలను దాటి కార్పొరేట్ రారాజులుగా తమ సత్తా ఏంటో చాటిచెబుతున్నారు భారతీయులు. టెక్నాలజీ.. ఫార్మా.. ఫ్యాషన్.. బ్యాంకింగ్.. రిటైల్.. తయారీ.. ఐటీ.. ఏ రంగంలోనైనా మనోళ్లు సరైనోళ్లు అనిపించుకుంటున్నారు. అందుకే ప్రపంచం ఇప్పుడు భారత్ లీడర్స్ వెంటపడుతోంది. ఫార్చూన్-500 టాప్ కంపెనీల్లో దాదాపు 60 కంపెనీల డ్రైవింగ్ సీట్లో ఉన్నది భారత సంతతికి చెందినవారే కావడం గమనార్హం. ఆయా కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 6 లక్షల కోట్ల డాలర్ల పైమాటే!! అంటే మన కరెన్సీలో 492 లక్షల కోట్ల రూపాయలన్న మాట! మనదేశ ఎకానమీ (జీడీపీ) దాదాపు 3.2 లక్షలకోట్లడాలర్లతో పోలిస్తే రెట్టింపు విలువ వీటి సొంతం. ఇతర రంగాల్లోనూ భారత సారథులు దూసుకుపోతున్నారు. అమెరికా వైస్ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఐఎంఎఫ్ డిప్యుటీ ఎండీ గీతా గోపీనాథ్తో పాటు తాజాగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ కాబోతున్న అజయ్ బంగా దీనికి నిదర్శనం. అసలు కార్పొరేట్ ప్రపంచమంతా సారథ్యం కోసం భారత్ వైపు ఎందుకు చూస్తోంది? మనోళ్లకున్న ప్రత్యేకతేంటి? ఈ కథేంటో చూద్దాం రండి మరి!! అమెరికా సిలికాన్ వ్యాలీలో భారతీయులదే హవా. ఎందుకంటే అక్కడున్న అనేక టెక్నాలజీ, ఐటీ కంపెనీల్లో మన ఇంజినీర్లు లక్షల సంఖ్యలో (దాదాపు మూడో వంతు) పని చేస్తుండటమే కాదు.. ఏకంగా చాలా దిగ్గజ కంపెనీల్లో టాప్ పొజిషన్లను చేరుకుని భారత్ పేరును ప్రపంచవ్యాప్తంగా మార్మోగేలా చేస్తున్నారు. శంతను నారాయణ్ దాదాపు 15 ఏళ్లుగా అడోబ్ సీఈఓ స్థానంలో పాతుకుపోయారు. ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న అనేక కంపెనీలు భారత సంతతికి చెందిన వారి వెంటపడి మరీ సారథ్యాన్ని అప్పగిస్తుండటం వారి ప్రతిభాపాటవాలను చాటిచెబుతోంది. 2004లో గూగుల్లో చేరిన సుందర్ పిచాయ్ దాదాపు పదేళ్లలోనే కంపెనీ టాప్ పొజిషన్కు చేరుకోవడం దీనికి నిదర్శనం. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్, గూగుల్ డ్రైవ్, జీ మెయిల్, గూగుల్ మ్యాప్స్, ఆండ్రాయిడ్ వంటి ప్రాజెక్టుల సక్సెస్కు సుందర్ పిచాయ్ దూరదృష్టి అపారమైన నైపుణ్యాలే కారణం. అంతేకాదు, 2015లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చూస్తే గూగుల్ షేర్ ధర ఏకంగా 76 శాతం ఎగబాకడం విశేషం. ఆయన హయాంలోనే ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృ సంస్థ) తొలిసారిగా 2020 జనవరిలో ట్రిలియన్ (లక్షకోట్ల) డాలర్ల మైలురాయిని చేరుకోగా, 2021 నవంబర్లో 2 ట్రిలియన్ డాలర్లను సైతం తాకింది. ఇక మన తెలుగు తేజం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ను పోటీదారులకు అందనంత ఎత్తులో నిలబెట్టి ప్రపంచ కార్పొరేట్లలో తన రూటే సెపరేటు అని చూపించారు. ఎందుకంటే 2014లో మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టిన నాదెళ్ల.. 2019లో కంపెనీని తొలిసారి ట్రిలియన్ డాలర్ల విలువను అధిగమించేలా చేశారు. అజూర్క్లౌడ్ బిజినెస్తో భవిష్యత్తు దిశగా కంపెనీని నడిపించడమే కాదు.. 2021లో ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు మైక్రోసాఫ్ట్ దూసుకెళ్లేలా చేసిన ఘనత నాదెళ్లదే. తన హయాంలో 45 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన కంపెనీలు ఇప్పుడు మైక్రోసాఫ్ట్కు కనకవర్షం కురిపిస్తున్నాయి. వీటిలో లింక్డ్ఇన్, మోజాంగ్ (మైన్క్రాఫ్ట్ వీడియో గేమ్), న్యూయన్స్, గిట్ హబ్ వంటివి ఉన్నాయి. గత సీఈఓ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ బామర్ 14 ఏళ్ల సారథ్యంలో కంపెనీ షేరు 32 శాతం పడిపోగా, ఆయన కొనుగోలు చేసిన అక్వాంటివ్, నోకియా మొబైల్ బిజినెస్ వంటివి కంపెనీకి నష్టాలు మిగల్చడం గమనార్హం. ఇక ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఐటీ కంపెనీగా, టాప్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా నిలుస్తున్న ఐబీఎం సారథిగా కూడా భారత్కు చెందిన అరవింద్ కృష్ణను నియమించడం విశేషం. తాజాగా గూగుల్ అనుబంధ సంస్థ యూట్యూబ్ సీఈఓగా పగ్గాలు చేపట్టిన నీల్మోహన్ కూడా ఈ జాబితాలో చేరారు. లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువ.. ఫార్చూన్-500 ప్రపంచ టాప్ కంపెనీల్లో దాదాపు 60 కంపెనీలకు భారత సంతతికి చెందిన వారే సీఈఓలు. మనోళ్లు సారథ్యం వహిస్తున్న ఈ కార్పొరేట్ దిగ్గజాల మార్కెట్ విలువ ఏకంగా 6 లక్షలకోట్ల (ట్రిలియన్) డాలర్లకు పైగానే ఉంటుంది. మన కరెన్సీలో చూస్తే ఈ విలువ దాదాపు రూ. 492 లక్షలకోట్లు. మన దేశ ప్రస్తుత జీడీపీ (స్థూలదేశీయోత్పత్తి) విలువ దాదాపు 3.2 ట్రిలియన్ డాలర్లు కాగా, అంతర్జాతీయంగా భారతీయ గ్లోబల్ సీఈఓల నేతృత్వంలోని కంపెనీల మార్కెట్ విలువ దీనికి రెట్టింపు కావడం విశేషం. అంతేకాదు మొత్తం ఆఫ్రికా ఖండంలోని దేశాల జీడీపీ (3.1 ట్రిలియన్ డాలర్లు)తో లెక్కగట్టినా ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ దాదాపు డబుల్ అన్నమాట. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లోని ఎస్ అండ్ పీ-500 ఇండెక్స్ మొత్తం మార్కెట్ విలువలో 13 శాతం వాటా భారతీయ సీఈఓల నిర్వహణలో ఉన్న కంపెనీలదే. మనోళ్ల సత్తా అది మరి! ఇక ఆయా కంపెనీల ఆదాయాలు, లాభాలదీ అదిరిపోయే రేంజే. నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ 2022లో 202 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. నికర లాభం 72 బిలియన్ డాలర్లు (రూ. 5 లక్షల కోట్లు). సుందర్ పిచాయ్ నాయకత్వం వహిస్తున్న ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృ సంస్థ) గతేడాది 282 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని, 60 బిలియన్ డాలర్ల నికరలాభాన్ని సంపాదించింది. ఇక మిగతా 60 కంపెనీల ఏడాది లాభాలను కూడా లెక్కేస్తే ప్రపంచంలోని అనేక దేశాల జీడీపీని మించి పోతుంది. ప్రస్తుతం ప్రపంచంలో ట్రిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువ ఉన్న కంపెనీలు 4 మాత్రమే ఉండగా (యాపిల్, సౌదీ ఆరామ్కో, మైక్రోసాఫ్ట్, గూగుల్) వీటిలో రెండింటి పగ్గాలు మనోళ్ల చేతిలోనే ఉన్నాయి. ఇక టాప్-100 ప్రపంచ కంపెనీల్లో మన రిలయన్స్ ఇండస్ట్రీస్ (మార్కెట్ విలువ 196 బిలియన్ డాలర్లు, ర్యాంక్ 47), టీసీఎస్ (149 బిలియన్ డాలర్లు, ర్యాంక్ 74), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (126 బిలియన్ డాలర్లు, ర్యాంక్ 96) మాత్రమే ఉన్నాయి. ఏ రంగమైనా సై.. ఇందు గలరందు లేరని సందేహము వలదు, ఎందెందు వెదకి చూసినా భారతీయ సీఈఓలు అందందే గలరు అన్న చందాన.. మనోళ్లుఅన్ని రంగాల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంటున్నారు. టెక్నాలజీలో చేయి తిరిగిన భారతీయులు ఇతర రంగాలకు చెందిన అనేక గ్లోబల్ దిగ్గజాల సీఈఓలుగానూ దూసుకెళ్తున్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఫార్మా అగ్రగామి నోవార్టిస్. అమ్మకాలపరంగా ఫైజర్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీగా నిలుస్తున్న ఈ కంపెనీకి సారథిగా ఉన్నది కూడా భారత్కు చెందిన వసంత్ నరసింహన్. ఇక ప్రపంచంలోనే నంబర్వన్ కాఫీ రిటైల్ బ్రాండ్గా నిలుస్తున్న స్టార్బక్స్ ఘుమఘుమలు దశదిశలా వ్యాపించేలా చేస్తున్నది లక్ష్మణ్ నరసింహన్. గతంలో ఆయన బ్రిటిష్ కన్జూమర్ గూడ్స్ దిగ్గజం రెకిట్ బెన్కిసర్ సీఈఓగా కూడా పనిచేశారు. ప్రపంచ స్కాచ్ విస్కీ రారాజుగా వెలుగొందుతున్న బ్రిటిష్ కంపెనీ డియాజియో పగ్గాలు సైతం మన ఇవాన్మెనెజెస్ చేతిలోనే ఉన్నాయి. ప్రపంచంలో అమ్ముడవుతున్న ప్రతి 5 స్కాచ్ విస్కీ బాటిల్స్లో ఒకటి డియాజియోకు చెందిన ‘జానీవాకర్’ బ్రాండ్దే కావడం విశేషం. గ్లోబల్ మల్టీనేషనల్ కెమికల్ కంపెనీ.. లిండే సీఈఓగా గత ఏడాది సంజీవ్ లాంబా బాధ్యతలు చేపట్టారు. ఆదాయం, మార్కెట్ వాటా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ గ్యాస్ కంపెనీగా వెలుగొందుతోంది. గ్లోబల్ కన్సల్టింగ్ వ్యాపార రంగంలో వరుసగా ఐదో ఏడాది కూడా నంబర్ 1 స్థానాన్ని చేజిక్కించుకున్న డెలాయిట్ను నడిపిస్తోంది భారతీయ సంతతికి చెందిన పునీత్ రంజన్. బిగ్ అంతర్జాతీయ అకౌంటింగ్ కంపెనీల్లో సైతం డెలాయిట్దే పైచేయి. ఇక మరో గ్లోబల్ ఫార్మాదిగ్గజం వెర్టెక్స్ సీఈఓ రేష్మా కేవలరమణి, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద లాజిస్టిక్స్ కంపెనీగా నిలుస్తున్న ఫెడెక్స్ చీఫ్ రాజ్ సుబ్రమణ్యం, మల్టీనేషనల్ ఇంజినీరింగ్ దిగ్గజం ఎమర్సన్ ఎలక్ట్రిక్ కంపెనీ చీఫ్ సురేంద్రలాల్ కర్సన్ భాయ్, గ్లోబల్ టాప్-10 ఇన్సూరెన్స్ కంపెనీల్లోఒకటైన ప్రుడెన్షియల్ సారథి అనిల్ వాధ్వానీ, కంప్యూటర్ నెట్వర్కింగ్ దిగ్గజం అరిస్టా నెట్వర్క్స్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్, సింగపూర్ బ్యాంకింగ్ అగ్రగామి డీబీఎస్ గ్రూప్సీ ఈఓ పియూష్ గుప్తా, బ్రిటిష్ మల్టీనేషనల్ బ్యాంక్ బార్క్లేస్ గ్రూప్ సీఈఓ సీఎస్ వెంకట కృష్ణన్, ప్రపంచ ఫుట్వేర్ దిగ్గజం బాటా కార్పొరేషన్ సీఈఓ సందీప్ కటారియా, డొమైన్ నేమ్ సర్వీసుల రంగంలో ప్రపంచ నంబర్ వన్ గోడాడీ సీఈఓ అమన్ భూటానీ సైతం తమ ప్రతిభాపాటవాలతో భారతీయ లీడర్స్గా అవతరించారు. ఇక బ్రిటిష్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘చానెల్’ను నడిపిస్తున్నది భారతీయ సంతితికి చెందిన లీనా నాయర్ కావడం మరో విశేషం. ప్రపంచ టాప్-5 లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్స్లో లూయీ విటోన్ను వెనక్కి నెట్టి ఈ ఏడాది ‘చానెల్’ మూడో ర్యాంకును చేజిక్కించుకుందంటే అదంతా నాయర్ ఘనతే! ఇలా ఒకటేంటి కార్పొరేట్ ప్రపంచంలో దాదాపు అన్ని రంగాలకు చెందిన అగ్రస్థాయి కంపెనీలు ఇప్పుడు తమకు భారతీయ లీడర్లే కావాలంటూ వెంట పడుతున్నారు!! మాజీ గ్లోబల్ సీఈఓలు పెప్సీకో ఇంద్రానూయీ, వొడాఫోన్ అరుణ్ శరీన్, నోకియా రాజీవ్ సూరి, సన్ మైక్రోసిస్టమ్స్ వినోద్ ఖోస్లా, హార్మన్ ఇంటర్నేషనల్ దినేష్ పలివాల్, సిటీ బ్యాంక్ విక్రమ్ పండిట్, ట్విటర్ పరాగ్ అగర్వాల్ కూడా ఈ కోవకు చెందినవారే. మన మూలాలే బలం.. భారతీయులు గ్లోబల్ కంపెనీల్లో లీడర్షిష్ స్థానాలకు చేరుకోవడానికి కారణం మన మూలాలే. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మన విద్యా వ్యవస్థ. ప్రస్తుతం సారథ్యం వహిస్తున్న వారిలో చాలామంది దాదాపు భారత్లోనే గ్రాడ్యుయేషన్ వరకు చదువుకోవడం.. ముఖ్యంగా ఐఐటీలు, ఇతర అత్యున్నత కాలేజీల్లో ఇంజినీరింగ్ చేయడం గమనార్హం. మనకున్న ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులు చేసి, అమెరికా, యూరప్ తదితర దేశాల్లో మరింత ఉన్నత చదువులు చదవడం కూడా వారి ఎంపికకు దోహదం చేస్తోంది. అంటే ప్రాథమికస్థాయిలో వారికి బలమైన నాయకత్వ పునాదులు ఇక్కడే పడ్డాయని చెప్పుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంగ్లిష్ భాషపై మనోళ్లకున్న పట్టు కూడా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కీలకపాత్ర పోషిస్తోందని సింగపూర్ బ్యాంకింగ్ దిగ్గజం డీబీఎస్ గ్రూప్ సీఈఓ పియూష్ గుప్తా విశ్లేషించారు. చాలా వరకు మధ్యతరగతి బ్యాగ్రౌండ్ నుంచి రావడం కూడా సాధించాలన్న పట్టుదలకు ప్రధాన కారణమనేది ఆయన అభిప్రాయం. చొచ్చుకుపోయే తత్వం, ఎలాంటి సవాళ్లనైనా అధిగమించ గల ఆత్మవిశ్వాసం, నిర్వహణ సామర్థ్యం, పరిస్థితులకు అనువుగా మారగల నైజం, కుటుంబ విలువలు, తోటివారికి చేయూతనందించడం ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అన్నిరంగాల్లోనూ అగ్రస్థానాలకు చేరుకునేలా చేస్తున్నాయని అంటున్నారు ఫైర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రేమ్ వత్స. భారతీయులు సహజంగానే పొదుపరులు. కంపెనీ చీఫ్లుగా అనవసర వ్యయాలను తగ్గించి, లాభాలను పెంచడంలో తమకు సాటిలేదని నిరూపించుకుంటున్నారు. ఇది కూడా వారికి సారథ్యాన్ని కట్టబెట్టడంలో కీలకపాత్ర పోషిస్తోంది. అంతేకాదు, మన ఆర్థికవ్యవస్థ పురోగతి సైతం భారతీయుల నాయకత్వానికి దన్నుగా నిలుస్తోంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది. ప్రస్తుతం 3.2 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న జీడీపీ 2028 కల్లా 5 ట్రిలియన్ డాలర్లకు, 2036 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు, 2045 నాటికి 20 ట్రిలియన్ డాలర్లను అధిగమించనుందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ తాజా నివేదికలో అంచనా వేయడం గమనార్హం. అంతేకాదు స్టార్టప్ ఎకోసిస్టమ్లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలుస్తూ నవకల్పనలకు పెద్దపీట వేస్తుండటం కూడా ఎంట్రప్రెన్యూర్స్, నాయకత్వలక్షణాలకు దోహదం చేస్తోందనేది పరిశ్రమ నిపుణుల మాట. దేశంలో యూనికార్న్లుగా (బిలియన్ డాలర్ల విలువను అధిగమించినవి) ఆవిర్భవించిన స్టార్టప్స్ సంఖ్య ఇప్పటికే 100కు చేరింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ స్టార్టప్స్లో కూడా 25 శాతం సంస్థల సారథ్యం భారతీయుల చేతిలోనే ఉండటం భవిష్యత్తులో మనోళ్ల జోరుకు అద్దం పడుతోంది. దక్షిణాది దూకుడు.. తెలుగు వెలుగులు! అమెరికా, యూరప్, ఆసియాలోని అనేక గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న మెజారిటీ భారత సంతతి సీఈఓలు దక్షిణ భారతావనికి చెందిన వారే కావడం మరో విశేషం. సందర్ పిచాయ్, వసంత్ నరసింహన్, లక్ష్మణ్ నరసింహన్, రాజేష్ సుబ్రమణ్యం, రంగరాజన్ రఘురామ్, గణేష్ మూర్తి, రవి కుమార్, సీఎస్ వెంకట కృష్ణన్ ఇంకా చాలా మంది ఈ జాబితాలో ఉన్నారు. అంతేకాదు, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, అడోబ్ శంతను నారాయణ్, ఐబీఎం అరవింద్ కృష్ణ, కేవియం సీఈఓ సయ్యద్ అష్రాఫ్ అలీ, కెనడా ఆటోమొబైల్ కాంపొనెంట్ దిగ్గజం మ్యాగ్నా కార్పొరేషన్ సీఈఓ సీతారామ (స్వామి) కోటగిరి వీళ్లంతా తెలుగు రాష్ట్రాల్లో జన్మించారు. సత్య నాదెళ్ల, శంతను నారాయణ్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ కాబోతున్న అజయ్పాల్ సింగ్ బంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) పూర్వ విద్యార్థులు. కెనడా ఆర్థిక సేవల దిగ్గజం ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రేమ్ వత్స సైతం హెచ్పీఎస్లోనే హైస్కూల్ చదువు పూర్తి చేశారు. ఈ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 18 బిలియన్ డాలర్లు. ఏడాదికి రూ. 2,300 కోట్లు! ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ శాలరీ ప్యాకేజీ చూస్తే కళ్లు బైర్లు గమ్మాల్సిందే! 2022లో ప్రపంచంలోకెల్లా అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీలు అందుకున్న టాప్-10 సీఈఓల్లో సుందర్ కూడా ఒకరు. ఆయన ఏకంగా 28 కోట్ల డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ. 2,300 కోట్లు. ఏంటీ ఈ సొమ్ముతో ఏకంగా ఒక కంపెనీయే పెట్టేయొచ్చు అనుకుంటున్నారా.. అట్లుంటది మరి మన సుందర్తోని! అంతేకాదు ప్రస్తుతం సుందర్ ఆస్తుల విలువ దాదాపు 150 కోట్లడాలర్ల (రూ.12,300 కోట్లు) పైనే అని అంచనా. ఒక మిడిల్క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన సుందర్ పిచాయ్ తన కలలను సాకారం చేసుకున్న తీరు, ఆయన లైఫ్ జర్నీ భారతీయ యువతకు నిజంగా గొప్ప స్ఫూర్తిదాయక పాఠం. చిన్నప్పుడు తామంతా హాల్లో ఒకే చోట కిందే పడుకునేవారిమని.. మొదటిసారి ఇంట్లోకి ఫ్రిజ్ వచ్చినప్పుడు కలిగిన ఆనందం ఇంకా తన కళ్లముందే కదలాడుతోందంటూ పిచాయ్ ఒక ఇంటర్వ్యూలో నెమరువేసుకున్న తీపిగుర్తులు ఆయన ఏ స్థాయి నుంచి టెక్నాలజీ ఎవరెస్ట్ను అధిరోహించారనేందుకు చిన్న ఉదాహరణ మాత్రమే! మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్లదీ దాదాపు ఇలాంటి సక్సెస్ జర్నీయే. ఆయన 2022లో అందుకున్న మొత్తం ప్యాకేజీ 5.5 కోట్లడాలర్లు (రూ. 451 కోట్లు). నాదెళ్ల నెట్వర్త్ సుమారు 81 కోట్ల డాలర్లు (రూ.6,700 కోట్లు)గా అంచనా. ఐబీఎం చీఫ్ అరవింద్ కృష్ణ, పాలో ఆట్లో సీఈఓ నికేష్ అరోరా, స్టార్బక్స్ సీఈఓ లక్ష్మణ్ నరసింహన్ ఇలా భారత సంతతికి చెందిన గ్లోబల్ సీఈఓలు అందరూ ఏటా రూ.150 నుంచి రూ.300 కోట్ల స్థాయిలో వార్షిక వేతన ప్యాకేజీలను అందుకుంటుండటం వారి ప్రతిభకు దక్కుతున్న ప్రతిఫలానికి నిదర్శనం. అపూర్వసహోదరులు.. ప్రపంచ బ్యాంక్ అత్యున్నత పదవి సైతం భారతీయుడినే వరిస్తోంది. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా అజయ్ బంగాను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇటీవలే నామినేట్ చేశారు. దీంతో ఈ పదవిని చేపట్టనున్న తొలి భారతీయుడిగా బంగా రికార్డ్ సృష్టించారు. మాస్టర్కార్డ్ సీఈఓగా 12 ఏళ్ల పాటు పని చేసిన అజయ్ బంగా కోవిడ్ సమయంలో కూడా కంపెనీలో ఉద్యోగాల కోత అనేది లేకుండా చూశారు. 50 కోట్లమంది డిజిటల్ ఎకానమీలో భాగస్వామ్యం అయ్యేలా తోడ్పాటు అందించారు. ప్రస్తుతం బంగా పీఈ సంస్థ జనరల్ అట్లాంటిక్ వైస్చైర్మన్గా ఉన్నారు. అంతేకాదు, అజయ్ సోదరుడు ఎంఎస్ బంగా సైతం ప్రపంచ ఎఫ్ఎంసీజీ దిగ్గజం యూనిలీవర్లో టాప్ పొజిషన్లలో పని చేశారు. అంతక్రితం ఆయన హిందుస్థాన్ యూనిలీవర్ సీఈఓగా ఉన్నారు. అంతేకాదు, నోవార్టిస్ సీఈఓ వసంత్ నరసింహన్, కాఫీ కింగ్ స్టార్బక్స్ సీఈఓ లక్ష్మణ్ నరసింహన్ కూడా స్వయానా అన్నదమ్ములే. మరో సోదరుల జంట కూడా గ్లోబల్ సీఈఓలుగా ‘మా ఆట సూడు నాటు.. నాటు.. నాటు’ అంటూ దుమ్ము రేపుతున్నారు. హైబ్రీడ్ క్లౌడ్ డేటా సర్వీసుల గ్లోబల్ కంపెనీ నెట్యాప్ సీఈఓ జార్జ్ కురియన్, గూగుల్క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ఇద్దరూ ఒకే రంగంలోని రెండు దిగ్గజాలకు సారథ్యం వహిస్తున్నారు. ఈ అపూర్వసహోదరులు... ప్రపంచ కార్పొరేట్రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకుంటూ భారత్కు గర్వకారణంగా నిలుస్తున్నారు. -శివరామకృష్ణ మిర్తిపాటి -
గూగుల్ బాస్.. ఉద్యోగం ఇవ్వండి
ఏడేళ్ల చిన్నారి లేఖ ∙స్పందించిన సుందర్పిచాయ్ లండన్: గూగుల్లో ఉద్యోగం కావాలంటూ ఏడేళ్ల ఒక చిన్నారి పెట్టుకున్న దరఖాస్తుకు ఆ సంస్థ సీఈవో సుందర్పిచాయ్ సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్చ పరిచారు. ఇంగ్లండ్లోని హియర్ఫోర్డ్కు చెందిన ఏడేళ్ల క్లో బ్రిడ్జ్వాటర్ సరదాగా ఒకరోజు తాను ఎక్కడ పనిచేస్తే బాగుంటుందో చెప్పాలంటూ తన తండ్రిని అడిగింది. దీనికి గూగుల్ అయితే బాగుంటుందని పాప తండ్రి ఆండీ బదులిచ్చాడు. వెంటనే ఆ అమ్మాయి గూగుల్ సీఈవో పిచాయ్ను ‘గూగుల్ బాస్’ అని సంభోదిస్తూ ఉద్యోగం కోసం లేఖ రాసింది. తాను చదువులో బాగా ముందుంటానని టీచర్లు కితాబిచ్చినట్లు ఆ లేఖలో చెప్పుకొచ్చింది. తనకు కంప్యూటర్, స్విమ్మింగ్ అంటే బాగా ఇష్టమని, స్విమ్మింగ్లో ఒలింపిక్ పతకం సాధిస్తానని తెలిపింది. తన తండ్రి ఇచ్చిన ట్యాబ్లెట్లో తాను రోబో ఆటను ఆడతానని, దానిద్వారా కంప్యూటర్ల గురించి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని తన తండ్రి చెప్పినట్లు వివరించింది. దీనికి పిచాయ్ సమాధానమిస్తూ.. ‘నీ లేఖకు కృతజ్ఞతలు. నీకు కంప్యూటర్లు, రోబోలు ఇష్టమన్నావు. టెక్నాలజీ గురించి ఇంకా తెలుసుకోవడం కొనసాగిం చు. ఎప్పుడూ ఇలాగే కష్టపడు. గూగుల్లో పని చేయడం, ఒలింపిక్స్లో పతకం సాధించడంతో పాటు అన్ని లక్ష్యాలను చేరుకుంటావని భావిస్తున్నాను. నీ చదువు పూర్తవగానే గూగుల్కి మళ్లీ దరఖాస్తు చేసుకో’ అంటూ పేర్కొన్నారు. -
యాపిల్ను దాటిన గూగుల్ ‘ఆల్ఫాబెట్’
570 బిలియన్ డాలర్లకు మార్కెట్ విలువ శాన్ ఫ్రాన్సిస్కో: మెరుగైన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ గల కంపెనీగా టెక్ సంస్థ యాపిల్ను అధిగమించింది. సోమవారం మార్కెట్ ముగిసిన తర్వాత జరిగిన లావాదేవీల్లో షేరు ధర ప్రకారం ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ ఏకంగా 570 బిలియన్ డాలర్లకు ఎగిసింది. యాపిల్ మార్కెట్ విలువ 535 బిలియన్ డాలర్లు. సెలవుల సీజన్లో ఆన్లైన్ ప్రకటనల ఆదాయాల ఊతంతో డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఆల్ఫాబెట్ లాభాలు 4.92 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇటు పీసీలు, అటు మొబైల్ పరికరాల విభాగాల్లోను ప్రకటనల ఆదాయం గణనీయంగా వచ్చినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. -
భారత్లో గూగుల్ జోరు..
♦ తొలి పర్యటనలో భారీ ప్రణాళికలను ప్రకటించిన సీఈఓ సుందర్ పిచాయ్ ♦ మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలకు హామీ... ♦ హైదరాబాద్లో మరో కొత్త క్యాంపస్... ♦ వచ్చే ఏడాది చివరికల్లా 100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై ♦ చౌకగా ఇంటర్నెట్ అందించడమే లక్ష్యమని వెల్లడి వ్యక్తిగతంగా నాకు, కంపెనీ పరంగా గూగుల్ వృద్ధికి భారత్ ఎన్నో అవకాశాలను కల్పించింది. అందుకే ఈ దేశానికి అంతకుమించిన ప్రతిఫలాన్ని అందించేందుకు ప్రయత్నిస్తా. న్యూఢిల్లీ: ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారత్లో దూకుడు పెంచుతోంది. కొత్తగా మరో భారీ క్యాంపస్ ఏర్పాటుతో పాటు పెద్దయెత్తున ఉద్యోగాలను కూడా కల్పించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం మరిన్ని పెట్టుబడులను వెచ్చిస్తామని... దేశంలో కోట్లాది మందికి చౌక ఇంటర్నెట్ కల్పించడమే లక్ష్యమని పేర్కొంది. కంపెనీ సీఈఓగా భారత్కు చెందిన సుందర్ పిచాయ్ ఈ ఏడాది ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి స్వదేశంలోకి అధికారికంగా అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటన కోసం బుధవారం ఇక్కడికి వచ్చిన సందర్భంగా ‘గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన కంపెనీ ప్రణాళికలను వెల్లడించారు. చెన్నైలో పుట్టిపెరిగిన పిచాయ్... తొలిరోజు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ; ఐటీ, టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్లను కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలతో పాటు ఇతర ఉన్నతాధికారులతో కూడా ఆయన భేటీ కానున్నారు. హైదరాబాద్లో భారీ కొత్త క్యాంపస్... భారత్లో గూగుల్ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా హైదరాబాద్లో భారీ స్థాయిలో మరో కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేస్తామని పిచాయ్ ప్రకటించారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, బిజినెస్ డెవలప్మెంట్ రంగాల్లో పెట్టుబడులు పెడతామని చెప్పారు. ప్రజలకు ఇంటర్నెట్ను మరింత చేరువ చేయడం కోసం సులువైన, వేగవంతమైన కొత్త ప్రొడక్టులను అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తున్నట్లు కూడా గూగుల్ చీఫ్ పేర్కొన్నారు. అయితే, ఈ కొత్త క్యాంపస్ కోసం ఏమేరకు పెట్టుబడులు ఉంటాయన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం భారత్లో గూగుల్కు 1,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ‘భారత్కు ఉద్దేశించిన ప్రొడక్టుల రూపకల్పన కోసం హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న కొత్త క్యాంపస్ను ఉపయోగించుకుంటాం. బెంగళూరు క్యాంపస్లో భారీగా కొత్త కొలువులు కూడా కల్పిస్తాం’ అని పిచాయ్ వివరించారు. రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై... వచ్చే ఏడాది(2016) చివరినాటికి దేశవ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నామని గూగుల్ సీఈఓ పేర్కొన్నారు. మొత్తం 400 స్టేషన్లలో ఉచిత వైఫై కోసం ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు కోసం గూగుల్, రైల్వే శాఖకు చెందిన టెలికం విభాగం రైల్టెల్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలి దశలో 100 స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని అందిస్తామని పిచాయ్ వెల్లడించారు. వచ్చే నెల(జనవరి)కల్లా ముంబై సెంట్రల్ స్టేషన్లో వైఫై అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కేంద్రాన్ని ప్రధాని మోదీ సందర్శించిన సందర్భంగా గూగుల్ ఈ ఉచిత వైఫై ప్రాజెక్టుపై హామీనిచ్చిన సంగతి తెలిసిందే. ‘దేశంలో ప్రతిఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధాన లక్ష్యంతో మేం ముందుకెళ్తున్నాం. అంతేకాదు ఇక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా, వారి అభిప్రాయాలను ఇంటర్నెట్ ద్వారా అందరికీ తెలియజేసేవిధంగా తగిన ప్రొడక్టులను రూపొందించాలన్నదే మా ప్రయత్నం. రానున్న కాలంలో ఇంటర్నెట్ యూజర్లుగా మారనున్న 100 కోట్ల మంది భారతీయులే లక్ష్యంగా మా కొత్త ఉత్పత్తులు ఉంటాయి’ అని పిచాయ్ చెప్పారు. మరోపక్క, మహిళల కోసం ఉద్దేశించిన గ్రామీణ ఇంటర్నెట్ ప్రోగ్రామ్ను మూడేళ్లలో దేశ వ్యాప్తంగా మూడు లక్షల గ్రామాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మకంగా(పైలట్) నడుస్తోందన్నారు. భారత్ కోసం మూడంచెల వ్యూహం... భారత్తో పాటు ఇతర వర్ధమాన దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం పెంచేందుకు అనుసరించాల్సిన మూడంచెల వ్యూహాన్ని పిచాయ్ తన తొలి పర్యటనలో ప్రకటించారు. మెరుగైన కనెక్టివిటీ, అత్యంత నాణ్యమైన సాఫ్ట్వేర్లతో ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం ఇందులో మొదటిది. సరళంగా ఉండేవిధంగా భారతీయుల కోసం ప్రత్యేక ప్రొడక్టుల రూపకల్పన రెండోది. ఇక గూగుల్ గ్లోబల్ ప్లాట్ఫామ్లయిన ఆండ్రాయిడ్, క్రోమ్లను ఉపయోగించుకొని స్థానిక సమస్యలకు మెరుగైన పరిష్కారాలను అందించడం మూడో అంశంగా పిచాయ్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యం పొందిన గూగుల్ క్రోమ్ బ్రౌజర్తో పాటు క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించిన ఘనత పిచాయ్ సొంతం. ఆండ్రాయిడ్ ఓఎస్ యూజర్లకు సంబంధించి భారత్ త్వరలోనే అమెరికాను వెనక్కినెట్టేయనుందని కూడా ఈ సందర్భంగా పిచాయ్ చెప్పారు. భారత్లోనూ ‘ప్రాజెక్ట్ లూన్’.. కోట్లాది మంది ప్రజలకు ఇంటర్నెట్ను చౌకగా అందించేందుకు గూగుల్ తలపెట్టిన ‘ప్రాజెక్ట్ లూన్’ను భారత్లోనూ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ను చేరువ చేయాలంటే ప్రాజెక్ట్ లూన్ వంటివి చాలా అవసరమని పిచాయ్ వ్యాఖ్యానించారు. ‘ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలను నెలకొల్పాలన్నది గూగుల్ సంకల్పం. ఇందులో భాగమే ప్రాజెక్ట్ లూన్. దీని కోసం ఆకాశంలో చాలా ఎత్తుకు బెలూన్లను పంపి వాటి ద్వారా నెట్ వినియోగానికి అవసరమైన సిగ్నల్స్ ప్రసారమయ్యేలా చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా అనేక స్థానిక టెలికం కంపెనీలతో ఈ ప్రాజెక్టు విషయంలో పని చేస్తున్నాం. ఒకరకంగా వీటిని గాలిలో(20 కిలోమీటర్ల ఎత్తులో) తేలియాడే సెల్ టవర్లుగా పరిగణించొచ్చు’ అని గూగుల్ వైస్ ప్రెసిడెంట్(యాక్సెస్ స్ట్రాటజీ, ఎమర్జింగ్ మార్కెట్స్) మారియన్ క్రోక్ పేర్కొన్నారు. భారత్లో ఈ ప్రాజెక్టు అమలుకు వీలుకల్పిస్తారన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ టెక్నాలజీని న్యూజిలాండ్, అమెరికాలోని కాలిఫోర్నియా, బ్రెజిల్లలో గూగుల్ పరీక్షించింది. వైర్లెస్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ(ఎల్టీఈ లేదా 4జీ) ఆధారంగా పనిచేసే ఈ ఒక్కో బెలూన్తో భూమిపైన 40 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ కనెక్టివిటీని కల్పించవచ్చని గూగుల్ చెబుతోంది. ఇందుకోసం సెల్యులార్ స్పెక్ట్రం ఉన్న టెలికం ఆపరేటర్లతో గూగుల్ భాగస్వామ్యం కుదుర్చుకోవాలని భావిస్తోంది. అయితే, దీనిలో ఉపయోగించే స్పెక్ట్రం బ్యాండ్నే సెల్యులార్ ఆపరేటర్లు కూడా ఉపయోగిస్తున్న నేపథ్యంలో సాంకేతికంగా సమస్యలు ఉంటాయని తాజాగా టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంటులో పేర్కొనడం గమనార్హం. వచ్చే ఏడాది మాకు అతిపెద్ద మార్కెట్ ఇదే.. గూగుల్కు రానున్న ఏడాదిలో అమెరికా కంటే భారత్ అతిపెద్ద మార్కెట్గా ఆవిర్భవించనుందని పిచాయ్ పేర్కొన్నారు. అందుకే ఇక్కడ మరింత దృష్టి కేంద్రీకరించాల్సిన తరుణం వచ్చిందని కూడా ఆయన చెప్పారు. వ్యాపారానికి సానుకూల పరిస్థితుల విషయంలో భారత్లో పురోగతి ఉందని... అయితే, ఇది మరింత పెరగాల్సిందేనని పిచాయ్ అభిప్రాయపడ్డారు. సమాచార స్వేచ్ఛ అనేది అత్యంత ప్రధానమైన అంశమని.. ఇంటర్నెట్తోనే ఇదంతా సాధ్యపడుతుందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. భారతీయులు గనుక యూట్యూబ్ వీడియోలను రూపొందిస్తే, వాటిని చూసేవారిలో 60 శాతం మంది ఇతర దేశాల్లోనే ఉంటారని.. సమాచార స్వేచ్ఛా ప్రవాహానికి ఇదే నిదర్శనమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. క్రోమ్బిట్తో మానిటర్ పీసీగా..! వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ‘ట్యాప్ టు ట్రాన్స్లేట్’ అనే కొత్త ఫీచర్ను గూగుల్ పరిచయం చేస్తుందని గూగుల్ సీఈఓ ప్రకటించారు. దీనిలో ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉపయోగించే అన్ని యాప్లలోనూ ఎలాంటి టెక్స్ట్నైనా అప్పటికప్పుడే ఇతర భాషల్లోకి తర్జుమా చేసి చూపించడం దీని ప్రత్యేకత. మరోపక్క, ‘క్రోమ్బిట్’ పేరుతో చిన్న పరికరాన్ని వచ్చే నెలలోనే భారత్లో ప్రవేశపెట్టనున్నామని గూగుల్ వైస్ప్రెసిడెంట్ జాసన్ టైటస్ చెప్పారు. దీనిద్వారా ఏ మానిటర్నైనా కంప్యూటర్గా మార్చేసుకోవడానికి వీలవుతుందని.. ముఖ్యంగా విద్యా రంగంలో కంపూటర్ల వాడకాన్ని పెంచేందుకు ఇది దోహదం చేస్తుందని ఆయన వివరించారు. ఇక భారత్ ప్రణాళికల్లో భాగంగా ఇప్పటికే 11 భారతీయ భాషల్లో టైపింగ్కు ఉపయోగపడే వర్చువల్ కీబోర్డును గూగుల్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వచ్చే మూడేళ్లలో 20 లక్షల మంది ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లకు సాంకేతికపరమైన సహకారాన్ని అందించేందుకు కూడా గూగుల్ ముందుకొచ్చిన విషయాన్ని పిచాయ్ గుర్తుచేశారు.. ఇందుకోసం జాతీయ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు 30 యూనివర్సిటీలతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2018 కల్లా భారత్లో 50 కోట్ల మంది ఆన్లైన్ యూజర్లుగా మారనున్నారని.. గూగుల్ వైస్ప్రెసిడెంట్(ఇండియా, ఆగ్నేయాసియా) రాజన్ ఆనందన్ పేర్కొన్నారు. ఇప్పటికీ 30 శాతం మొబైల్ ఇంటర్నెట్ వాడకం 2జీ కనెక్షన్లతోనే జరుగుతోందని కూడా ఆయన తెలిపారు. ఇందుకోసం తక్కువ బ్యాండ్విడ్త్తో పనిచేసే ఉత్పత్తులను రూపొందించడంపై దృష్టి పెట్టినట్లు ఆనందన్ వెల్లడించారు. -
ప్రణబ్, మోడీతో భేటీ కానున్న సుందర్ పిచాయ్
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సుందర్ పిచాయ్ తొలిసారి ఇండియాకు రాబోతున్నారు. భారత పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. కాగా.. ఈ పర్యనటలో కొత్త ప్రాడక్ట్ లాంచింగ్ ఏమీ ఉండబోదని గూగుల్ వర్గాలు తెలిపాయి. అయితే.. ఈ పర్యటనలో పిచాయ్ గూగుల్ ఉద్యోగులను కలవనున్నారు. రెండు రోజుల భారత పర్యటనలో పిచాయ్ బుధవారం మీడియా సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశం కానున్నారు.తన పర్యటనలో రెండో రోజు శ్రీరామ్ కాలేజీలో జరగబోయే ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అటునుంచి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ఇవ్వనున్న విందులో సుందర్ పిచాయ్ పాల్గొంటారు. సెప్టెంబర్లో అమెరికా వెళ్లిన మోదీ సిలికాన్ వ్యాలీని సైతం సందర్శించారు. అప్పుడు పిచాయ్ ప్రధానితో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా గూగుల్.. భారతీయ రైల్వే శాఖతో కలిసి దేశంలో ఉచిత వై ఫై కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. కాగా.. పిచాయ్ తాజా పర్యనటలో గూగుల్ భారత్ లో చేపట్టబోయే భవిష్యత్ కార్యక్రమాల ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
స్కూలు బస్సులు కండిషన్లో ఉండాలి
బహిరంగ ప్రదేశాల్లో పెంపుడు శునకాలపై ఆంక్షలు
అనల్ అరసు నామినేట్
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement