-
గయ్యాళి గుండమ్మకు వందేళ్లు.. నమ్మినవాళ్లే మోసం చేయడంతో..!
కోడలిని ఎన్ని రకాలుగా హింస పెట్టాలి? భర్త నోరు ఎలా మూయించాలి? కూతుర్ని అల్లారు ముద్దుగా ఎలా పెంచుకోవాలి? ఇంటి అల్లుడ్ని ఎలా ఆడుకోవాలి?... ఇవన్నీ తెలుసుకోవాలంటే సూర్యకాంతం చేసిన పాత్రలు చూస్తే చాలు. ఇంతకు మించి ఎవరూ గయ్యాళితనాన్ని చూపించలేరేమో అన్నంతగా నటించారామె. అందుకే తమ కూతుళ్లకు ఆమె పేరు పెట్టే సాహసం చేయరు తల్లి దండ్రులు. కానీ వ్యక్తిగతంగా ఆమె మనసు సున్నితం. తనది కాని స్వభావాన్ని వెండితెరపై అద్భుతంగా అభినయించిన ఈ అద్భుత నటి శత జయంతి నేడు (అక్టోబర్ 28) ఆరంభం. ఈ సందర్భంగా సూర్యకాంతంని గుర్తు చేసుకుందాం... ‘‘ఒకరి బాధతో నాకు సంతోషం దక్కుతుందంటే ఆ సంతోషమే నాకు వద్దు’’... వెండితెరపై గయ్యాళి అత్తగా విజృంభించిన సూర్యకాంతం నోటి నుంచి వచ్చిన మాటలివి. నటిగా గయ్యాళితనాన్ని కనబర్చిన ఆమె వ్యక్తిగా కాస్త సున్నిత మనస్కురాలే. నిజానికి కథానాయికగా వెండితెరపై అందంగా, సున్నితంగా కనిపించాలన్నది సూర్యకాంతం కల. ఆ కల నెరవేర్చుకునే చాన్స్ వచ్చినప్పటికీ, ఒక హీరోయిన్ చేజారిన అవకాశాన్ని తాను అంది పుచ్చుకుని ఆనందపడటానికి ఇష్టపడక... ‘‘ఒకరి బాధతో నాకు సంతోషం దక్కుతుందంటే ఆ సంతోషమే నాకు వద్దు’’ అని తిరస్కరించారు. అది హిందీ సినిమా. అయినా వదులుకున్నారంటే వ్యక్తిగతంగా సూర్యకాంతానిది ఎంత మంచి మనసో అర్థం చేసుకోవచ్చు. ఇక వెండితెరపై ఎడమ చేయి ఆడిస్తూ, విసురుగా ఆమె డైలాగ్ చెప్పే తీరులో కనిపించిన గయ్యాళితనాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇలా ఎడమ చేయి తిప్పే అలవాటు సూర్యకాంతానికి చిన్నప్పుడే ఉంది. చిన్నారి సూర్యకాంతం బాల్యంలోకి వెళితే ఆ విషయాలు తెలుసుకోవచ్చు. సూర్యం... భలే చలాకీ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న పోన్నాడ అనంతరామయ్య, వెంకటరత్నమ్మలకు జన్మించారు సూర్యకాంతం. మగపిల్లాడి దుస్తులు వేసుకుని, బెత్తం పట్టుకుని భలే చలాకీగా ఉండేదట చిన్నారి సూర్యకాంతం. తల్లిదండ్రులు సూర్యం అని పిలిచేవారట. ‘సూర్యం అటు వెళ్లకు.. బూచీ ఉంది’ అంటే... ఎడమ చేయి ఊపుతూ ‘బూచీ లేదు.. ఏమీ లేదు’ అనేదట సూర్యం. ఆ చేయి కదలిక, మాట తీరు అందర్నీ నవ్వించేవట. ఇక సినిమాల్లోకి వచ్చాక ఎడమ చేయి తిప్పుతూ సూర్యకాంతం డైలాగులు పలికిన తీరు ఆకట్టుకున్నాయి. ఎడమ చేయి తిప్పడం అనేది చిన్న వయసులోనే ఆమెకు అలవాటైంది. ఆరేళ్ల వయసులోనే పాటలు పాడటం, డ్యాన్స్ నేర్చుకుంది సూర్యం. ఈ చిన్నదాన్ని హిందీ సినిమా పోస్టర్లు ఆకర్షించాయి. కాగా సూర్యంకి ఎనిమిదేళ్ల వయసప్పుడు ఆమె తండ్రి చనిపోయారు. అప్పటికే ఆమె తోబుట్టువులకు పెళ్లయి, అత్తవారింటికి వెళ్లిపోయారు. సూర్యం, ఆమె తల్లి మాత్రమే ఉండేవారు. అప్పట్లో కాకినాడలో అందరూ అమ్మాయిలే ఉన్న ఓ డ్రామా కంపెనీని నిర్వహించేవారు బాలాంత్రపు ప్రభాకర రావు. నటించాలనే ఆసక్తి ఉన్నా అవకాశం అడగడానికి సూర్యం ఇష్టపడలేదు. అయితే ఓ అమ్మాయి రాకపోవడంతో ఆ పాత్రకు చలాకీ సూర్యంని తీసుకున్నారు ప్రభాకర రావు. తల్లి వెంకటరత్నం కూడా కూతురి ప్రతిభకు అడ్డుకట్ట వేయదలచుకోలేదు. అలా ‘సతీ సక్కుబాయి’ నాటకంలో మగపిల్లవాడి వేషం వేసింది సూర్యం. ఆ తర్వాత కూడా అబ్బాయి పాత్రలు చాలానే చేసి, రంగస్థలంపై నిరూపించుకుంది. హనుమాన్ డ్రామా కంపెనీలోని నాటకాల్లోనూ నటించింది. ఆ డ్రామా కంపెనీ మద్రాసులోనూ నాటకాలు వేస్తుండటంతో కూతురితో సహా సూర్యం తల్లి చెన్నపట్నం చేరుకున్నారు. అప్పటికి సూర్యం వయసు 20. ఇక సినిమాల్లో నటిస్తానంటే తల్లి ఓకే చెప్పేశారు. హిట్ గయ్యాళి జెమినీ స్టూడియో ఓ సినిమాలో సూర్యకాంతంకి సైడ్ డ్యాన్సర్గా అవకాశం ఇచ్చి, నెలకు రూ. 60 జీతం అంటే ఒప్పుకోలేదామె. దాంతో రూ. 75 ఇవ్వడానికి అంగీకరించారు. అయితే కొంత కాలం తర్వాత జెమినీ స్టూడియో నుంచి ఆమె బయటకు వచ్చేశారు. నటిగా సూర్యకాంతం తొలి చిత్రం ‘నారద నారది’ (1946). ఆ తర్వాత చిన్నా చితకా పాత్రలు చేస్తూ వచ్చిన సూర్యకాంతంకి ‘సౌదామిని’ చిత్రంలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. అయితే కారు ప్రమాదం వల్ల ముఖానికి గాయం కావడంతో ఆ అవకాశం చేజారింది. కాస్త కోలుకున్నాక ‘సంసారం’ (1950) చిత్రంలో గయ్యాళి అత్త పాత్రకు అవకాశం వస్తే, కాదనుకుండా ఒప్పుకున్నారు సూర్యకాంతం. గయ్యాళి అత్త అంటే సూర్యకాంతమే అన్నంతగా నటించడంతో ఆ తర్వాత కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 40 ఏళ్ల పాటు దాదాపు 700 చిత్రాల్లో నటించారామె. టైటిల్ రోల్లో... సూర్యకాంతం కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘గుండమ్మ కథ’ (1962) ముందు ఉంటుంది. ఆ చిత్రంలో ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి హీరోలు ఉన్నప్పటికీ సూర్యకాంతం వీలైనంత గయ్యాళితనం ప్రదర్శిస్తారనే నమ్మకంతో ఆమె పాత్ర పేరు వచ్చేట్లు ‘గుండమ్మ కథ’ టైటిల్ పెట్టారు ఆ చిత్ర దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. ఆ నమ్మకాన్ని నిజం చేశారు సూర్యకాంతం. ఇంకా ఆమె చేసిన చిత్రాల్లో ‘చక్రపాణి, దొంగరాముడు, చిరంజీవులు, తోడికోడళ్లు, అత్తా ఒకింటి కోడలే, ఇల్లరికం, కులగోత్రాలు, దాగుడు మూతలు, ఉమ్మడి కుటుంబం, అత్తగారు–కొత్తకోడలు, దసరా బుల్లోడు, వియ్యాలవారి కయ్యాలు’ వంటివి ఉన్నాయి. ‘మాయాబజార్’లోని హిడింబి పాత్ర ఒకటి. వంటల పుస్తక రచయిత అప్పట్లో సినిమా స్టార్ కనబడితే ఆటోగ్రాఫ్ కోసం ఎగబడేవారు. కానీ, నటిగా గయ్యాళి ముద్రపడ్డ సూర్యకాంతం కనబడితే దగ్గరికి వెళ్లడానికి భయపడేవారట. ఇక షూటింగ్కి వెళ్లేటప్పుడు తనతో పాటు తినుబండారాలు తీసుకువెళ్లి, యూనిట్లో అందరికీ పెట్టడం, లొకేషన్లోనే వండటం చేసేవారట సూర్యకాంతం. ఓ వంటల పుస్తకం కూడా వెలువరించారామె. నమ్మినవాళ్లే... సూర్యకాంతం ఆర్థిక లావాదేవీల విషయంలో నిక్కచ్చిగా ఉండేవారట. అలాగే సులువుగా ఎవర్నీ నమ్మేవారు కాదట. చివరికి కారు పాడైతే, మెకానిక్ ఇంటికి వచ్చి తన కళ్ల ముందే బాగు చేయాలట. సెకండ్ హ్యాండ్ కార్లు కొని అమ్మేవారట. ఎంత తెలివిగలవాళ్లయినా ఎక్కడో చోట బోల్తా పడతారన్నట్లు.. నమ్మినవాళ్లే ఆమెను మోసం చేశారట. సూర్యకాంతం మరణానికి ఆ మానసిక వేదన ఓ కారణం అంటుంటారు. నటిగా తన కాంతిని ప్రేక్షకులకు వదిలి వెళ్లారామె. వెండితెరపై ఆమెను రీప్లేస్ చేసే మరో గయ్యాళి అత్త రాలేదు... ఎప్పటికీ రాదు కూడా. గయ్యాళి అత్తగా తొలి చిత్రం ‘సంసారం’ (1950) ఒప్పుకున్న ఏడాదే మద్రాసు హైకోర్టు జడ్జి పెద్దిభొట్ల చలపతిరావుతో సూర్యకాంతం పెళ్లి జరిగింది. వీరికి సంతానం లేరు. అక్క కొడుకు అనంత పద్మనాభ మూర్తిని దత్తత తీసుకున్నారు సూర్యకాంతం. 1978లో చలపతిరావు చనిపోయారు. 1994 డిసెంబర్ 18న సూర్యకాంతం చెన్నైలో కన్నుమూశారు. అయితే ఆమె భౌతికకాయాన్ని సందర్శించడానికి ఓ పది మంది సినీ ప్రముఖులు కూడా వెళ్లలేదు. సూర్యకాంతం సేవా కార్యక్రమాలు చేశారు. కాకినాడ, హైదరాబాద్తో పాటు మరికొన్ని నగరాల్లో సత్రాలు ఏర్పాటు చేసి, అనాధలను చేరదీశారట. అలాగే పలువురు వితంతువులకు ఒకే వేదికపై పునర్వివాహాలు చేశారు. ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం చేసేవారు. ‘మంచి మనసులు’లో లాయర్ ఎస్వీ రంగారావుకు సూర్యకాంతం భార్య. అక్కినేని తనకు పెళ్లయ్యిందని అబద్ధం చెప్పి ఆ ఇంట్లో అద్దెకు దిగుతాడు. ఆ ఇంటి ఆడపిల్ల సావిత్రి ఇది కనిపెట్టి అక్కినేని భార్యకు కొడుకు పుట్టాడని దొంగ టెలిగ్రాము వచ్చేలా చేస్తుంది. దాంతో సూర్యకాంతం శుభవార్తే కదా అని గుప్పిట్లో చక్కెర పట్టుకుని భర్తతో ‘ఏదీ.. ఒకసారి నోరు తెరవండీ’ అంటుంది. దానికి ఆయన ‘నీ ముందు నేనెప్పుడైనా నోరు తెరిచానటే’ అంటాడు. ఆజానుబాహుడు ఎస్వీఆర్ సైతం తెరపై సూర్యకాంతం ముందు నోరు తెరవ లేదు. ‘గుండమ్మ కథ’ కథారచయిత డీవీ నరసరాజు స్క్రిప్ట్ రాసేటప్పుడు సవితి కూతురు సావిత్రిని గుండమ్మ బాధలు పెట్టాలి కాబట్టి.. ‘గుండమ్మ గయ్యాళితనాన్ని ఎస్టాబ్లిష్ చేసే సీన్లు రాయనా?’ అని నిర్మాత చక్రపాణిని అడిగారు. ‘గుండమ్మగా వేస్తున్నది సూర్యకాంతం... సూర్యకాంతం అంటేనే గయ్యాళి. ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు. ఫిల్మ్ వేస్టు’ అన్నారాయన. పని గట్టుకుని సీన్లు రాయకపోయినా గయ్యాళితనాన్ని పండించారు సూర్యకాంతం. ‘శాంతి నివాసం’లో ఇల్లరికం అల్లుడు నర సింహాలు (రేలంగి)ని ‘గొడ్డు సింహాలు’ అంటూ అవమానిస్తుంటుంది అత్త (సూర్యకాంతం). అప్పుడు మామగారి (చిత్తూరు నాగయ్య) దగ్గరికెళ్లి, ‘చూశారా మావగారు.. అత్త నన్ను గొడ్డు సింహాలు అంటోంది’ అని మొరపెట్టుకుంటాడు నరసింహాలు. దానికి మామగారు ‘అంతా ఆ భగవంతుని లీల. నాతో చెప్పుకుంటావేమి నాయనా’ అని జారుకుంటాడు. భార్యంటే ఆ భర్తకు అంత భయం. -
Suryakantham: తపాలా కవరుపై గయ్యాళి అత్త ముద్ర
బాలాజీచెరువు(కాకినాడ సిటీ): తెలుగు చలనచిత్ర రంగంలో ‘సహజనటి’గా పేరుగాంచిన డాక్టర్ సూర్యకాంతం పేరున తపాలాశాఖ ప్రత్యేక కవరు విడుదల చేయనుంది. ఈ నెల 18న దీనిని ఆవిష్కరించనున్నట్టు కాకినాడ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ డీఎస్యూ నాగేశ్వర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమె కాకినాడకు చెందిన వారు. తెలుగు వెండితెరపై గయ్యాళి అత్తయ్యగా పేరుపొందిన ఈ నటీమణి పేరున కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులోని సత్కళావాహినిలో ‘ప్రత్యేక తపాలా చంద్రిక ఆవిష్కరణ’ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి, మేయర్ సుంకర శివప్రసన్న, విశాఖ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ ఎం. వెంకటేశ్వర్లు హాజరవనున్నారు. సూర్యకాంతం ప్రస్తానం 1924 అక్టోబరు 28న కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో జన్మించిన సూర్యకాంతం చిన్నప్పటి నుంచే అల్లరి అమ్మాయిగా ముద్ర పడిపోయారు. కాకినాడ యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్లో నాటకాలు వెయ్యడం ద్వారా అంజలి, ఆదినారాయణరావు, ఎస్వీ రంగారావు లాంటి ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. అదే ఆమెకు వెండితెరపై ఆసక్తిని పెంచింది. తొలి రోజుల్లో చిన్న చిన్న గుర్తింపు లేని పాత్రలకే సూర్యకాంతం పరిమితమయ్యారు. వరద గోదావరిలా సంభాషణలు వల్లించగల సామర్థ్యం ఉన్న ఆమె ‘ధర్మాంగత’ చిత్రంలో మూగపాత్ర ధరిచారు. అయితే హీరోయిన్గా నటించినా మాటలు లేకపోవడంతో ఓ మంచి అవకాశం అలా జారిపోయింది. 1950లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హీరోలుగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సంసారం సినిమా సూర్యకాంతం కెరీర్ను ఓ మలుపు తిప్పింది. ఆ చిత్రం కయ్యాలమారిగా..గయ్యాళి గంపగా నిలబెట్టింది. అక్కడి నుంచి ఒకటా, రెండో ఎన్నో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఆమె కోసమే పాత్రల్ని.. సంభాషణలు చిత్రీకరించేవారంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ నటులిద్దరు హీరోలుగా నటించిన సినిమాలో ఆమె పాత్ర పేరుతోనే ‘గుండమ్మ కథ’ తీశారంటే సూర్యకాంతం స్థాయి అర్థం చేసుకోవచ్చు. తాను తింటూ నలుగురికి పెట్టడం ఆమె గొప్ప లక్షణాలని సూర్యకాంతం గురించి తెలిసిన వారు చెబుతుండేవారు. సినిమాలో ‘అత్తరికాన్ని’ చెలాయించి ప్రేక్షకుల గుండెలపై చెరగని ముద్ర వేసుకున్న ఈ మహానటి 1994 డిసెంబరు 18న కన్నుమూశారు. ఎన్ని తరాలు మారినా తెలుగుతనం ఉన్నంతవరకూ గుర్తుండిపోయే అతి తక్కువ సహజ నటుల్లో సూర్యకాంతం ఒకరు. ఇంతటి మహానటి మన జిల్లాకు చెందిన వారు కావడం గర్వకారణం. -
నీ ముందు నేనెప్పుడైనా నోరు తెరిచానటే
ఆమె పెత్తనానికి తల వొంచని కోడలు లేదు. ఆమె దాష్టికానికి బాధలు పడని సవతి కూతురు లేదు. ఆమె నోటికి జడవని భర్త లేడు. ఆమె తగాదాకు బెదిరి పారిపోని ఇరుగింటి పొరుగింటివారు లేరు. అసలు ఆమె పేరు పెట్టుకోవాలంటేనే గడగడలాడే తెలుగువారున్నారు. అయినా ఆమెను ఇష్టపడని వారంటూ లేరు. ఎందుకంటే తెర మీద ఆమె చేసిన చెడ్డలన్నీ మంచికే దారి తీశాయి. కష్టాలు ఎదుర్కొన్నవాడే మనిషి.సూర్యకాంతంను ఎదుర్కొన్నావారే హీరో... హీరోయిన్. నేడు ఆమె 95వ జయంతి. ‘గుండమ్మ కథ’ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. రచయిత డి.వి.నరసరాజు. సవితి కూతురైన సావిత్రిని కథ ప్రకారం గుండమ్మ బాధలు పెట్టాలి. ‘గుండమ్మ గయ్యాళితనాన్ని ఎస్టాబ్లిష్ చేసే సీన్లు రాయమంటారా?’ అని అడిగారు నరసరాజు. ‘ఎందుకండీ దండగ. గుండమ్మగా వేస్తున్నది సూర్యకాంతం. సూర్యకాంతం అంటేనే గయ్యాళి. మళ్లీ ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు. ఫిల్మ్ వేస్టు’ అన్నారు చక్రపాణి. నిజంగానే సినిమాలో గుండమ్మ సావిత్రిని బాధించే సీన్లు ఉండవు. కాని ప్రేక్షకులు మాత్రం ఆమె సావిత్రిని బాధిస్తున్నదనే మానసికంగా అనుకుంటారు. సూర్యకాంతం సృష్టించుకున్న ఇమేజ్ అలాంటిది. ‘శాంతి నివాసం’లో సూర్యకాంతం అత్తగారిలా నానా రాద్ధాంతం చేస్తూ ఉంటుంది. కొడుకైన కాంతారావు, కోడలైన దేవిక గదిలో ఉన్నా సహించలేదు. పైగా కూతురైన బాల సరస్వతిని అత్తారింటికి పంపక అల్లుడైన రేలంగిని కాల్చుకు తింటుంటుంది. రేలంగి పేరు నరసింహాలు. కాని ‘గొడ్డు సింహాలు’ అని పిలుస్తూ అవమానిస్తూ ఉంటుంది. రేలంగి నోరు బాదుకుంటూ మావగారైన చిత్తూరు నాగయ్య దగ్గరకు వెళ్లి ‘చూశారా మావగారు. అత్త నన్ను గొడ్డు సింహాలు అంటోంది’ అని మొరపెట్టుకుంటాడు. దానికి నాగయ్య ఆకాశం వైపు చూస్తూ విభూతి ముఖంతో ‘అంతా ఆ భగవంతుని లీల. నాతో చెప్పుకుంటావేమి నాయనా’ అని జారుకుంటాడు. సూర్యకాంతం ఇంట్లో ఉన్నాక భర్త సాక్షాత్తూ చిత్తూరు నాగయ్య అయినా నిమిత్తమాత్రుడే. ‘మంచి మనసులు’లో లాయరైన ఎస్.వి.రంగారావుకు సూర్యకాంతం భార్య. అక్కినేని తనకు పెళ్లయ్యిందని అబద్ధం చెప్పి ఆ ఇంట్లో అద్దెకు దిగుతాడు. ఆ ఇంటి అల్లరి ఆడపిల్లైన సావిత్రి ఇది కనిపెట్టి అక్కినేని భార్యకు కొడుకు పుట్టాడని సరదాకు దొంగ టెలిగ్రాము వచ్చేలా చేస్తుంది. అది చూసి నమ్మిన సూర్యకాంతం మంచి శుభవార్తే కదా అని గుప్పిట్లో చక్కెర పట్టుకుని భర్తయిన ఎస్.వి.ఆర్తో ‘ఏదీ.. ఒకసారి నోరు తెరవండీ’ అంటుంది. దానికి ఎస్.వి.ఆర్ జవాబు– ‘నీ ముందు నేనెప్పుడైనా నోరు తెరిచానటే’. ఎస్.వి.ఆర్ తెర మీద కూడా పులే. కాని భార్య సూర్యకాంతం అయినప్పుడు పిల్లి. సూర్యకాంతం చనిపోయి దాదాపు 25 సంవత్సరాలు. ఆమె నటించిన గొప్ప సినిమాలు వచ్చి దాదాపు 50 సంవత్సరాలు. అయినా సరే తెలుగువారు తమ పలుకుబడిలో ఆమె పేరు మరువలేదు. తీసేయలేదు. ఇది మగ ప్రపంచం. వాడు తనకు నచ్చనివి ఎదురుపడితే కొడతాడు, తిడతాడు, అమి తుమి తేల్చుకుంటాడు. కాని స్త్రీ అలా చేయలేదు. తన కోపం, అక్కసు, నిస్సహాయత, అసంతృప్తి అన్నీ ఎదుటివాళ్ల మీద నిరపాయంగా తీర్చుకోవాల్సిందే. దానికి నోటిని ఆయుధంగా చేసుకుంటుంది. తద్వారా గయ్యాళిగా పేరు తెచ్చుకుంటుంది. ఇదొక వ్యక్తిత్వ లక్షణం. మానసిక అవస్థ. ఇలాంటి అవస్థలో ఉన్నవారు గతించిపోరు. వారు ఉన్నంత కాలం ప్రజల మధ్య సూర్యకాంతం అనే పేరు మాసిపోదు. ఎందుకంటే ఆమె ఆ మాత్రకు నిలువెత్తు నమూనాగా నిలిచింది కాబట్టి. తెలుగువారు తెలుగు సినిమాలు మొదలెట్టినప్పుడు సమాజానికి అనుగుణంగా కుటుంబ కథలే ఎంచుకున్నారు. కుటుంబంలో విలన్లకు చోటు లేదు. విధికి తప్ప. ఆ విధి పాత్రను సూర్యకాంతం పోషించింది. కథలు మలుపు తిప్పింది. మంచివారికి పుట్టెడు కష్టాలు వచ్చేలా చేసింది. పరీక్షలు పెట్టింది. చివరికి వాటిలో పాస్ చేయించి, తాను చెడ్డ పేరును మూటగట్టుకుని, వారికి మంచి పేరు వచ్చేలా చేసింది. కాకినాడలో బాల్యంలో దూకుడుగా పెరిగిన సూర్యకాంతం ఆ వ్యక్తిత్వాన్నే తన పాత్రలో ప్రవేశపెట్టింది. ‘సంతానం’ (1950) ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా. అందులో 26 ఏళ్ల వయసులో రేలంగికి తల్లిగా నటించి తెర మీద డైలాగులను చెరిగేసిందామె. ఆ తర్వాత ఆగలేదు. ‘మాయాబజార్’, ‘తోడి కోడళ్ళు’, ‘అప్పు చేసి పప్పు కూడు’, ‘వెలుగు నీడలు’, ‘భార్యాభర్తలు’, ‘కలసి ఉంటే కలదు సుఖం’, ‘కులగోత్రాలు’, ‘రక్త సంబంధం’... ఎన్నో. ‘దసరా బుల్లోడు’ సినిమాలో ఆమె పెట్టే కష్టాలకు ఆమెను ఏం చేసినా పాపం లేదన్నంతగా సగటు ప్రేక్షకులు కోపం తెచ్చుకునే స్థాయికి ఆమె పాత్రను రక్తి కట్టించింది. రేలంగి, రమణారెడ్డి, గుమ్మడి, ఎస్.వి.రంగారావు వంటి ఉద్దండులు ఆమెకు భర్తగా నటించి కథలను పండించారు. పద్మనాభం ఆమెకు పర్మినెంట్ కొడుకు. ఒకే పాత్ర.. కాని ప్రతి సినిమాలో భిన్నంగా పోషించిందామె. ఎడమ చేయి ఆడిస్తూ, విసురుగా డైలాగ్ చెప్పే పద్ధతి మరొకరికి రాలేదు. రాబోదు కూడా. ఆమె ఎంతో కపటిగా నటించింది. ఎంతో అమాయకురాలిగా కూడా నటించింది. ఎంతో గయ్యాళిగా కోపం తెప్పించి ఎంతో చాదస్తంతో నవ్వులు కూడా పూయించింది. ఇన్నీ చేసింది ఒక్కతే సూర్యకాంతం. తెర మీద గయ్యాళిగా ఉన్న సూర్యకాంతం నిజ జీవితంలో స్నేహశీలి. దాత. నటీనటులకు ఆత్మీయురాలు. భక్తురాలు. వారికి ఏదైనా ఆపద వస్తే వారి తరుఫున తాను మొక్కులు మొక్కుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. షూటింగ్కి రకరకాల పదార్థాలు వండి తెచ్చి పంచి పెట్టేదామె. మంచి వంటకత్తె. తెలుగునాట వంటల పుస్తకం వెలువరించిన తొలి రచయితల్లో ఆమె ఒకరు. ఆమె చేసిన పులిహోర వంటిది మళ్లీ జీవితంలో ఎరగనని నటుడు గుమ్మడి చెప్పుకున్నారు. సంతానం కలగకపోతే అక్క కొడుకును దత్తత తీసుకుని అతడినే తన కుమారుడిగా చూసుకున్నారు. చదువుకోవాలని ఎంతో ఉన్నా చదువుకోలేకపోయిన సూర్యకాంతం చివరి రోజుల్లో తిరుపతి మహిళా యూనివర్సిటీ వారు ‘డాక్టరేట్’తో సత్కరించడాన్ని ఎంతో గొప్పగా భావించింది. ‘నా పేరు కాంతమ్మ’ అని ఆమె అంటే ఎస్.వి.ఆర్ ‘సూర్యకాంతమ్మ’ అని అందిస్తాడు ఒక సినిమాలో. ఆ పేరు అలా నిలిచి ఉంది మరి. 1994 డిసెంబర్ 18న ఆమె చెన్నైలో కన్నుమూస్తే తెలుగు పరిశ్రమ నుంచి పట్టుమని పదిమంది హాజరయ్యారు. తెర మీద ఎంతో గయ్యాళితనం ప్రదర్శించిన ఆ గొప్ప నటి పట్ల తెలుగు వారు ప్రదర్శించిన సిసలైన గయ్యాళితనం అది. - కె -
50 ఏళ్లవయస్సులో ఫ్రెంచ్ నేర్చుకుంది..
గళ్ల లుంగీ, బుగ్గ మీద గాటు ఉన్న రౌడీని చూసిన దాని కంటే సూర్యకాంతమ్మను చూస్తే ప్రేక్షకులకు దడుపు ఎక్కువ.ఎవరిని ఏం బాధలు పెడుతుందో. ఎవరిని రాచిరంపాన పెడుతుందో.ఆమె తలుచుకుంటే ఎవరి జీవితమైనా నాశనం అయిపోతుంది.అందుకే తెలుగువారు తమ ఆడ పిల్లలకు‘సూర్యకాంతం’ అనే పేరే పెట్టడం మానేశారు.తెరమీద ఇంతగా నమ్మించగలిగిందంటేఆమె ఎంత గొప్ప నటి అయ్యుండాలి. ఎంతో సౌమ్యురాలు, అమాయకురాలు, స్నేహశీలి అయినసూర్యకాంతం గురించి ఆమె కుమారుడు పద్మనాభమూర్తి పంచుకున్న జ్ఞాపకాలివి. అమ్మకు ఆరేళ్ల వయస్సులోనే మా తాతయ్య చనిపోవడంతో వాళ్ల పెద్దక్క, బావల దగ్గర పెరిగింది. అమ్మ అల్లరిగా ఉండటం వల్లనో ఏమో చదువు పెద్దగా ఒంట పట్టలేదు. సినిమాల మీద మక్కువ కలిగింది. పల్లెటూరి నుంచి కాకినాడకు ఎడ్లబండిలో వచ్చి, పృథ్వీరాజ్ కపూర్ నటించిన హిందీ చిత్రాలు చూసేదట. సినిమాల మీద వ్యామోహంతో, పెద్దక్క ఒప్పుకోకపోయినా అమ్మమ్మతో కలిసి మద్రాసు వచ్చేసిందట. నారదనారది (1946) అమ్మ మొదటి చిత్రం. మొదట్లో నాయిక పాత్రలు ధరించాలనుకుందట. కాని ఒకసారి అమ్మ పడిపోవటంతో, మ¬క్కు మీద మచ్చ పడిందట. క్లోజప్లో మచ్చ కనపడుతుంది కాబట్టి ఇక నాయిక పాత్రలకు పనికిరానని నిర్ణయించుకుని, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయిందట. 1962లో విడుదలైన ‘గుండమ్మ కథ’ చిత్రంతో అమ్మ గయ్యాళి పాత్రలకు చిరునామాగా మారిపోయింది. ఒక్కసారి డైలాగ్ వింటే చాలు వెంటనే వచ్చేసేది. ఒకే టేక్లో ఓకే అయిపోయేదట. డైలాగ్ పలకడంలో విచిత్రమైన మాట విరుపు, ఎడమ చేతివాటం...ఈ రెండు ప్రత్యేకతలూ అమ్మను గొప్ప నటిని చేశాయి. పది భాషలు వచ్చు.. అమ్మ స్కూల్ చదువులు పెద్దగా చదువుకోలేదన్న మాటే గానీ పది భాషలు అవలీలగా మాట్లాడగలదు. మద్రాసు వచ్చాక ఇంగ్లిషు, 50 ఏళ్లవయస్సులో ఫ్రెంచ్ నేర్చుకుంది. బెంగాలీ అంటే అమ్మకు చాలా ఇష్టం. దిన పత్రికలు, పుస్తకాలు, నవలలు, పురాణేతిహాసాలు బాగా చదివేది. ఆంధ్రపత్రిక పేపరు ఆలస్యం అయితే చాలు పేపరు బాయ్ను నిలదీసేది. క్రమశిక్షణతో ఉండేది.. తెల్లవారుజామునే నిద్రలేవడం, పూజ చేసుకోవడం, వంట పూర్తిచేసి, మాకు క్యారేజీలు పెట్టి, తన కోసం సిద్ధం చేసుకున్న క్యారేజీలతో షూటింగ్కు వెళ్లడం ఆవిడ దినచర్య. ఇంటికి వచ్చే బంధువుల కోసం నిమిషాల్లో ఏదో ఒక ప్రత్యేక వంటకం తయారు చేసేది. అనారోగ్యంతో బాధపడుతున్న రోజుల్లో కూడా అందరికీ చక్కని ఆతిథ్యం ఇచ్చేది.ఉన్నంతలో దానధర్మాలు చేసింది. చిన్న చిన్నపత్రికలకు ఆర్థికంగా సహాయపడింది. పద్మనాభ మూర్తి చిన్నతనంలోనే.. మా అమ్మ (సూర్యకాంతం) నాకు స్వయానా పిన్ని. నేను రోజుల పిల్లాడిగా ఉన్నప్పుడే దత్తతు తీసుకుని మద్రాసులోనే బారసాల చేసిందట.కాకినాడ సమీపంలో ఉన్న వెంకటరాయపురం అమ్మ పుట్టిల్లు. మా తాతయ్యను నాలో చూసుకునేందుకే నాకు అనంత పద్మనాభమూర్తి అనే పేరు పెట్టి, నన్ను ‘నాన్నా’ ‘నానీ’ అని పిలిచేది. నాన్నగారు పెద్దిభొట్ల వెంకట చలపతిరావు. నన్ను కన్న తల్లి (సత్యవతి) ఇంటి పేరును నిలపడం కోసం ‘దిట్టకవి’ ఇంటి పేరునే కొనసాగించింది. నేను స్కూల్కి ప్రతిరోజూ కారులోనే వెళ్లేవాడిని. డ్రైవర్ రాకపోతే ఇంట్లో పనివాళ్లు సైకిల్ మీద స్కూల్లో దింపేవారు. ఆ స్కూల్లో ఒక ల్యాబ్ కట్టడానికి అమ్మ పదిహేను వేల రూపాయలు డొనేషన్ ఇచ్చింది. నేను ఎం. కామ్ చదువుకున్నాను. చదువు పూర్తయ్యాక కెనరా బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. కాని దూరమని పంపలేదు. ఆ తరవాత చెన్నై మైలాపూర్ ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. దగ్గరగా ఉండటంతో అమ్మఅనుమతితో చేరాను. శత్రువు ఇంటికి వచ్చినా వాళ్లని ఆదరించి అన్నం పెట్టేది. లైట్ కలర్స్ బాగా ఇష్టపడేది. నలుపు రంగంటే అస్సలు ఇష్టం లేదు అమ్మకు. ఒకసారి లైట్ బ్లూ కలర్ కారు బుక్ చేస్తే వాళ్లు బ్లాక్ కలర్ ఇచ్చారు. అప్పుడు గొడవ పెట్టి మార్చుకుంది అమ్మ. అమ్మే స్వయంగా కారు డ్రైవ్ చేసేది. 1994లో అమ్మ కన్నుమూసింది. అమ్మ కాలం చేసి పాతికేళ్లు దాటినా సూర్యకాంతం గారి అబ్బాయిగా నేను పొందే ప్రేమాభిమానాలతో కూడిన గౌరవ మర్యాదలు ఎవ్వరూ అపహరించేందుకు వీలులేని తరగని ఆస్తి. అమ్మను పద్మ పురస్కారాలతో సత్కరించకపోయినా, తెలుగు ప్రేక్షకులు అంతకంటే గొప్ప కీర్తిప్రతిష్టలతో ఆమెను వారి గుండెల్లో పదిలంగా ఉంచుకున్నారు. భయస్తురాలు.. అమ్మ ఎవరిని ఏ వరసలో పిలిస్తే, నేనూ అలాగే పిలిచేవాడిని. అమ్మ వాళ్ల అక్కయ్యలను.. దొడ్డమ్మ అనకుండా దొడ్డక్క అని పిలిచేవాడిని. అమ్మ ఎక్కడకు వెళ్లినా తన వెంటే నన్ను తీసుకువెళ్లేది. నాకు ఒంట్లో బాగా లేకపోతే ఎందరో దేవుళ్లకు మొక్కులు మొక్కేది. దేవాలయాలకు వెళ్లినప్పుడు హుండీలో నా చేత డబ్బులు వేయించేది, నా పేరున అర్చనలు చేయించేది. అమ్మ దయ వల్ల చాలా బాగా ఉన్నాను. అమ్మకి ఎవరి మీద అభిమానం, గౌరవం ఉండేవో వాళ్లకి ఏదైనా అవుతుందేమోనని భయం ఎక్కువగా ఉండేది. జగపతి పిక్చర్స్ అధినేత వి.బి. రాజేంద్రప్రసాద్గారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన త్వరగా కోలుకోవాలని మొక్కుకుంది అమ్మ. ఆయనకు తగ్గాక అందరికీ భోజనాలు పెట్టింది. ఎవరికి ఒంట్లో బావుండకపోయినా, వాళ్ల తరపున అర్చనలు చేయించేది, మొక్కులు తీర్చేది. మా పుట్టినరోజు నాడు గుడికి తీసుకెళ్లి, పూజలు చేయించి, ఇంటికి వచ్చిన వాళ్లకి భోజనాలు పెట్టేది. కేక్ కట్ చేయటం అమ్మకు ఇష్టం లేదు. నెయ్యి అంటే చాలా ఇష్టం.. అందరం కలిసి అన్నం తినాలనేది అమ్మ. ఒక్కోసారి అమ్మ వండుకున్న కూర అమ్మకే నచ్చేది కాదు. వెంటనే ‘నాన్నా! నెయ్యి వేసి మాగాయి అన్నం కలిపి పెట్టరా’ అనేది నాతో. అమ్మకు నెయ్యి – మాగాయి, నెయ్యి – ఆవకాయ అంటే చాలా ఇష్టం. జీవితంలో ఒక్కరోజు కూడా నెయ్యి లేకుండా అన్నం తినేది కాదు. ఎన్ని మానేసినా, నెయ్యి మాత్రం మానలేదు అమ్మ. అన్నీ అమ్మే చూసింది.. నా వివాహం అమ్మే కుదిర్చి చేసింది. నా భార్య పేరు ఈశ్వరిరాణి. నాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి సూర్య సత్య వెంకట బాల సుబ్రహ్మణ్యం చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. అమ్మాయి జయలక్ష్మి ఎంబిఏ చదివి, గీతమ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తోంది. మా ఇంటి మొత్తానికి ఒక్క గదిలోనే ఏసీ ఉండేది. అందరం ఆ గదిలో చేరి కబుర్లు చెప్పుకునేవాళ్లం. అమ్మ చేతి వంట... నోరూరేనంట.. అమ్మ చేతి వంట అమృతంలా ఉండేదనుకునేవారు సినిమా వారంతా. అమ్మకు బయట తిండి తినే అలవాటు లేదు. అందుకే షూటింగులకు వెళ్లేటప్పుడు తనకు మాత్రమే కాకుండా, షూటింగ్లో ఉన్న మిగతా వాళ్ల కోసమూ వంట చేసి తీసుకెళ్లేది. అమ్మ రాక కోసం అందరూ ఎదురు చూసేవారు. ఎన్టిఆర్ ‘అక్కయ్యగారూ! ఏం తెచ్చారు?’ అని అడిగి మరీ తినేవారు. పెరుగన్నమే.. టిఫిన్ లేదు.. పొద్దున్నపూట టిఫిన్ కాకుండా పెరుగన్నమే తినాలి. నేను పదవీ విరమణ చేసేవరకూ ఉదయం పెరుగన్నమే తిన్నాను. ఇంటికి ఎవరు వచ్చినా ‘మజ్జిగ తాగుతారా! అన్నం తింటారా!’ అని అడిగేది. కాఫీ టిఫిన్లు ఇచ్చేది కాదు. ఆవిడ చాలా సింపుల్. జనసమ్మర్దంలోకి వెళ్లాలంటే అమ్మకి చాలా భయం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దేవాలయాలకు, బీచ్లకు రద్దీ లేని సమయంలో నన్ను తీసుకుని వెళ్లేది. అమ్మ చాలా రిజర్వ్డ్. అప్పట్లో సినిమా వారంతా టి నగర్లో ఉంటే, మేం మాత్రం సిఐటీ కాలనీలో ఉండేవాళ్లం. అన్నీ చదివి వినిపించాలి.. అమ్మ నాకు తెలుగు నేర్పించింది. అన్ని రకాల పుస్తకాలు కొని తను చదివాక, నా చేత చదివించేది. నేను మూస ధోరణిలో చదువుతుంటే, ‘ఆడ మగ గొంతు మార్చి చదివితేనే బాగుంటుంది, అప్పుడే అర్థమవుతుంది’ అనేది. ఆవిడ మరణించాక అర్థమైంది పుస్తకాలు చదవటం వల్ల లోకజ్ఞానం వస్తుంది కాబట్టే చదివించిందని. అమ్మను ఎన్నటికీ మరువలేను.– కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై – వైజయంతి పురాణపండ -
సూర్యకాంతం మొగుడు
‘ముత్యాల ముగు’్గ సీరియల్ చూసిన వారికి విరాట్గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సీరియల్ నటుడు ప్రజ్వల్. ఇప్పుడు ‘జీ తెలుగు’ లో ప్రసారమయ్యే ‘సూర్యకాంతం’ సీరియల్లో చైతన్యగా తన నటనతో మెప్పిస్తున్నాడు. కన్నడ సీరియల్ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రజ్వల్ తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్న విధానాన్ని ఈ విధంగా వివరించారు. ‘‘ఇంటర్మీడియెట్ తర్వాత కన్నడలోని ఓ సీరియల్లో కృష్ణుడి పాత్ర కోసం నన్ను అడిగారు. అప్పటికి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఉండటం వల్ల ఆ పాత్రకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘పునర్ వివాహ్’ సీరియల్లో ప్రధాన పాత్ర పోషించాను. నటుడిగా మారకముందు నేను డాన్సర్ని. తొమ్మిదేళ్ల వయసు నుంచి నేను పుట్టకముందు అమ్మ సాగరసంగమం సినిమాలో కమల్హాసన్ గారిని చూసి అబ్బాయి పుడితే భరతనాట్యం నేర్పించాలనుకున్నారట. అలా నాకు భరతనాట్యం, కథక్ నేర్పించారు. ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా అక్కడకు తీసుకెళ్లేవారు అమ్మనాన్నలు. తొమ్మిదేళ్ల వయసు నుంచే ఉత్తర, దక్షిణ భారతదేశాలు ముఖ్యంగా కాశీ, రామేశ్వరం, ఢిల్లీ, హైదరాబాద్లలోనూ వేదికల మీద నృత్య ప్రదర్శనలు ఇచ్చాను. చిన్నప్పుడు అమ్మనే నాకు మేకప్ చేసేవారు. ఇప్పటికీ ఎక్కడ నా నృత్య ప్రదర్శన ఉన్నా మేకప్లో ఫినిషింగ్ టచ్ అమ్మనే ఇవ్వాలి. కళ్లకు కాజల్, నుదటన తిలకం అమ్మ దిద్దితేనే నాకూ ఆ నృత్యం సంపూర్ణం అనిపిస్తుంది. బేసిక్గా సైన్స్ స్టూడెంట్ని. ఇంటర్మీయెట్ తర్వాత ఇంజనీరింగ్ చదివాలా.. డాన్సర్గా నా కలను సంపూర్ణం చేసుకోవాలా అనే సందిగ్దం వచ్చింది. రెండోదానికే నా ఆలోచన మళ్ళింది. దీంతో కామర్స్ తీసుకొని, ఆర్ట్ ఫీల్డ్కి వచ్చాను. సూర్యకాంతం సీరియల్లో సన్నివేశం నృత్యం వల్ల మెరుగు రామాయణ, భారత కథలు, పురాణ పురుషులను నృత్యం ద్వారా చూపించాల్సి ఉంటుంది. దీనికి పురాణ, ఇతిహాసాలను క్షుణ్ణంగా ఔపోసన పడతాం. దీని వల్ల మానవ ప్రవృత్తి అర్ధమవుతుంది. జీవితంలో ఏదైనా అనుకోని సంఘటన ఎదురైతే నాడు ఇలాంటి సందర్భంలో వారు ఎలా ప్రవర్తించారో గుర్తుకువచ్చి మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటాం. భవిష్యత్తు ప్రణాళికలు సీరియల్స్లో చేరక ముందు నృత్యప్రదర్శనలు ఇస్తూనే డ్యాన్స్ క్లాసెస్ తీసుకునేవాడిని. భవిష్యత్తులో అకాడమీ ఏర్పాటు చేయాలని ఉంది. ప్రస్తుతం సీరియల్స్ వల్ల రెగ్యులర్ క్లాసులు తీసుకోవడం లేదు. ‘సూర్యకాంతం’లో... ‘జీ తెలుగు’లో వచ్చే ‘సూర్యకాంతం’ సీరియల్లో హీరో చైతన్య పాత్ర పోషిస్తున్నాను. చైతన్యకు కుటంబమే ప్రపంచం. అక్కలు, బావలు.. తప్ప మరొకటి తెలియదు. లోకజ్ఞానం అస్సలు లేదు. అలాంటి అతనికి పూర్తి అపోజిట్ క్యారేక్టర్ సూర్యకాంతంది. చదువు రాని అమ్మాయితోనూ, ఆమె కుటుంబంతో కలిసి ప్రయాణిస్తూ ఆమె కలలకు భరోసాగా నిలుస్తుంటాడు. తన కుటుంబాన్నీ–సూర్యకాంతం కుటుంబాన్నీ ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అనేది ఇందులో ప్రధానంగా నడుస్తుంటుంది. అన్న చెబితే ఓకే! రియల్ లైఫ్ మా కుటుంబంలో మా అన్నయ్య నాకు చాలా సపోర్ట్.‘నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి పూర్తిగా అంకితమై ఉండాలి’ అని చెబుతారు. ‘మంచి జరిగిందా ఓకే. లేదంటే దానిని వదిలేసి మరోటి ఎంపిక చేసుకో’ అని చెబుతారు. చిన్నప్పటి నుంచి ఇంట్లోనూ, బయట నాకు సపోర్ట్ చేసేవారే దొరకడం నా అదృష్టం అనుకుంటాను. నా జీవిత భాగస్వామి కూడా నా సంతోషాన్ని, ఆసక్తిని పంచుకుని ప్రోత్సహించేలా రావాలని కోరుకుంటున్నాను. సినిమా, సీరియల్ ఏదైనా సైన్స్ ఫిక్షన్ స్టోరీలో లీడ్ రోల్లో నటించాలని ఉంది.’– నిర్మలారెడ్డి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement