-
కేసీఆర్ నిర్ణయం.. నూతన సచివాలయం సమీపంలో ట్విన్ టవర్స్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన నూతన సచివాలయం పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. రాష్ట్రస్థాయిలో కీలకమైన పనులన్నీ ఒకే చోట జరిగేందుకు మార్గం పడింది. ఇదే తరహాలో అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలోని వివిధ విభాగాధిపతుల (హెచ్ఓడీల) కార్యాలయాలను ఒకే గొడుగు కిందికి తేవాలని సీఎం కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఇందుకోసం కొత్త సచివాలయానికి సమీపంలో ట్విన్ (జంట) టవర్లు నిర్మించాలని.. దీనికి సంబంధించి స్థలాన్ని అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో సీఎం సమీక్షించారు. హెచ్ఓడీల వివరాలపై ఆరా.. దేశం గర్వించేలా నిర్మించుకున్న కొత్త సచివాలయం ఉద్యోగుల విధి నిర్వహణకు అత్యంత అనువుగా ఉందని.. ఆహ్లాదకర వాతావరణంలో ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారని సమీక్షలో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సచివాలయం ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో.. మౌలిక వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా హెచ్ఓడీల కార్యాలయాల కోసం ట్విన్ టవర్లను నిర్మించే అంశంపై అధికారులతో చర్చించారు. అన్ని శాఖల పరిధిలోని హెచ్ఓడీల వివరాలు, మొత్తం ఉద్యోగుల సంఖ్య, అవసరమైన స్థలం, సదుపాయాలు తదితర అంశాలపై ఆరా తీశారు. సచివాలయానికి సమీపంలో విశాలవంతమైన ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మంచి స్థలాలను అన్వేషించాలని.. హెచ్ఓడీల అధికారులు, సిబ్బంది తరచూ సచివాలయానికి రావాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. సమీపంలోనే ట్విన్ టవర్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. స్థలం ఎంపిక పూర్తయిన వెంటనే ట్విన్ టవర్ల నిర్మాణాన్ని చేపడతామని ప్రకటించారు. ఘనంగా దశాబ్ధి ఉత్సవాలు తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా జరగాలని, ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జూన్ 2 నుంచి రోజువారీగా నిర్వహించనున్న కార్యక్రమాల విషయంలో.. సంబంధిత శాఖలు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సీఎం కేసీఆర్కు వివరించారు. జూన్ 9 నుంచి కుల వృత్తులకు ఆర్థిక సాయం కుల వృత్తులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎంబీసీ కులాలు, రజక, నాయీ బ్రాహ్మణ, పూసల, బుడగ జంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతుల ప్రజలకు దశల వారీగా రూ.లక్ష ఆర్థిక సాయం అందించి ఆదుకుంటుందని చెప్పారు. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను మరో రెండు రోజుల్లో ఖరారు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి, మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ గంగుల కమలాకర్ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు వివరించారు. దీంతో దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా జూన్ 9న నిర్వహించ తలపెట్టిన సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఈ ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. అమరుల స్మారకం వద్ద తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయంలో సమీక్ష అనంతరం సీఎం కేసీఆర్ లుంబినీ పార్కు స్థలంలో నిర్మిస్తున్న తెలంగాణ అమరుల స్మారకం వద్దకు చేరుకుని పనులను పరిశీలించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆర్అండ్బీ అధికారులకు ఆదేశించారు. అమరుల స్మారకానికి ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని.. విగ్రహానికి రెండు వైపులా అద్భుతమైన ఫౌంటెయిన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్అండ్బీ ఈఈ శశిధర్కు సూచించారు. దశాబ్ధి ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా, ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొత్త సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా బీఆర్కేఆర్ భవన్ వద్ద నిర్మించిన వంతెనలను పరిశీలించారు. ఆదర్శ్నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థలంలో ట్వీన్ టవర్స్? ఆదర్శ్నగర్లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ భవనాలను కూల్చివేసి ఆ స్థలంలో హెచ్ఓడీల కార్యాలయాల కోసం ట్వీన్ టవర్స్ నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ కార్యాలయాల కోసం 40 లక్షల నుంచి 45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు అవసర మని అంచనా వేసినట్టు సమాచారం. అంతమేర భవనాల నిర్మాణానికి ఆదర్శ్నగర్ స్థలం అనువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
అక్కడ టీడీపీ, జనసేన లేవు.. సజావుగా అక్రమ కట్టడాల కూలివేత!
కొద్ది రోజుల క్రితం దేశరాజధానికి అల్లంత దూరంలో ఉన్న నోయిడాలోని అతి పెద్ద ట్విన్ టవర్స్ను ప్రభుత్వ యంత్రాంగాలే దగ్గరుండి కూల్చివేశాయి. ఇందుకోసం 3,700 కిలోలో పేలుడు పదార్ధాలను వినియోగించాయి. టవర్స్ నిర్మాణానికి కొన్ని ఏళ్లు పడితే వాటిని కూల్చి వేయడానికి కేవలం 9 సెకన్లు మాత్రమే పట్టింది. ఏడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టవర్లలో 900 ఫ్లాట్స్ ఉన్నాయి. కొన్ని వందల కోట్ల రూపాయల విలువజేసే ఆస్తి ఇది. కుతుబ్ మీనార్ కన్నా పొడవైన నిర్మాణం ఇది. ఇంతటి ఆస్తిని కూల్చివేయడానికి కారణం ఒక్కటే. టవర్స్ నిర్మించిన రియల్ ఎస్టేట్ కంపెనీ అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా నిర్మాణం చేసుకుపోయింది. దాంతో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టుకు వెళ్లారు. అన్నీ విన్న అత్యున్నత న్యాయస్థానం ఈ టవర్స్ను కూల్చివేయాల్సిందేనని ఆదేశించింది. సుప్రీం తీర్పుతో ఆగస్టు 28న ఈ టవర్స్ ను కూల్చివేశారు. దీనికి రెండేళ్ల క్రితం.. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో మారాడు గ్రామంలో అద్భుతమైన సరస్సును ఆనుకుని నాలుగు పెద్ద పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్లను అధికారులు కూల్చివేశారు. 2020 జనవరి 11న అత్యంత విలాసవంతమైన ఈ అపార్ట్ మెంట్లను పేలుడు పదార్ధాలతో కూల్చివేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ అపార్ట్ మెంట్ల నిర్మాణంలో పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపణలు ఉన్నాయి. వాటిపై ఫిర్యాదు చేసి అభ్యంతరాలు వ్యక్తం చేసినా భవన నిర్మాణాలు చేపట్టిన సంస్థ పట్టించుకోలేదు. మనల్ని ఎవరేం చేస్తారులే అని ధీమా వారిది. డబ్బుతో దేన్నయినా కొనేయచ్చన్న అహంకారం. వెరసి నిబంధనలను తొక్కి పారేసి అపార్ట్ మెంట్లు కట్టి పారేశారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే సమయంలో అపార్ట్ మెంట్లు కొనుకున్న వారు తాము జీవితాంతం కూడబెట్టిన సొమ్ముతో ఇళ్లు కొనుక్కున్నామని వాటిని కూల్చివేయవద్దని విజ్ఞప్తులు చేసుకున్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కోట్లాది రూపాయల డబ్బు ఉన్నా కూడా పర్యావరణ నిబంధనలు అమలు చేయడమే ముఖ్యమని భావించింది. అందుకే ఈ అపార్ట్మెంట్లను కూల్చివేయాల్సిందిగా 2019 డిసెంబరులో తీర్పు నిచ్చింది. కొచ్చిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమకట్టడాల కూల్చివేతకు ఏడు నెలల క్రితం ఆంధ్ర ప్రదేశ్లో విజయవాడ లో కృష్ణా నది తీరాన అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి పర్యావరణ నిబంధనలకు పాతరేసి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని సంకల్పించిన నాటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమార్కులందరికీ ఈ కూల్చివేత అనేది ఓ హెచ్చరికగా ఉండాలని భావించింది. అందుకే అంతకు ముందు అధికారంలో ఉన్న టిడిపి హయాంలో అక్రమంగా నిర్మించిన కట్టడాల్లోనే ఓ కట్టడంలో ప్రభుత్వ కార్యకలాపాలు మరో కట్టడాన్ని సాక్ష్యాత్తూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసంగా ఉంచుకోగా మరి కొందరు అక్రమ కట్టడాల్లో రక రకాల కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. కూల్చివేత అనేది ముందుగా అక్రమంగా నిర్మించిన ప్రభుత్వ భవనంతోనే మొదలు పెట్టడం పద్ధతిగా ఉంటుంది కాబట్టి ప్రజావేదిక ను కూల్చివేశారు. దీంతో పాటే కృష్ణా కరకట్టపై అక్రమంగా నిర్మించిన కట్టడాలకు సంబంధించిన యజమానులందరికీ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. అందులో చంద్రబాబు నాయుడు నివసిస్తోన్న లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఉంది. అంతే ఇక తెలుగుదేశం పార్టీ నేతలు వీధుల్లోకి వచ్చేసి తమపై రాజకీయ కక్ష సాధింపునకు దిగారంటూ గగ్గోలు మొదలు పెట్టింది. తమ ఆర్ధిక మూలాలు దెబ్బతీయడానికే ఈ కుట్ర అంటూ ఆరోపణలు చేసింది. దానర్ధం ఏంటి? ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు వారి వందిమాగధులవేనని తేటతెల్లం అయిపోలా? చిత్రం ఏంటంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినపుడు నాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ కృష్ణా నదిలో బోటులో పర్యటిస్తూ కరకట్టపై ఉన్నవన్నీ అక్రమ కట్టడాలేనని.. వాటిని త్వరలోనే కూల్చివేసి తీరతామని స్పష్టం చేశారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆ తర్వాత ఏమైందో కానీ కరకట్టపై మరికొన్ని అక్రమ కట్టడాలు యధేచ్ఛగా పుట్టుకొచ్చాయి. అందులోని ఓ అక్రమ కట్టడం చంద్రబాబుకు తెగ నచ్చేసింది. అందులోనే తాను ఉంటానని అనడంతో దాని యజమాని కూడా ఉదారంగా ఓకే అనేశారు. కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాలను కూల్చి వేయడం మొదలు పెట్టిన వెంటనే సామాజిక వేత్త, వాటర్ మ్యాన్ గా పేరొందిన రాజేంద్ర సింగ్ తో పాటు పలువురు పర్యావరణ వేత్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షించారు. టిడిపి హయాంలో కృష్ణా నది గర్భంలో అక్రమంగా ఇసుక తవ్వకాలతో పాటు నదీ తీరాన అక్రమకట్టడాలు చూసి రాజేంద్ర సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాటిపై ఆయన ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోయిన టిడిపి నేతలు రాజేంద్ర సింగ్కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపి ఆయనపై దాడికి దిగారు. అధికారం పోయాక ఎల్లో వాయిస్లో తేడా వచ్చింది. టిడిపికి మద్దతుగా ఉండే కొందరు ఎల్లో మేథావులు అయితే అక్రమ కట్టడాలైనా కూడా కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టారు కదా..వాటిని ఏదో ఒక పనికి వాడుకోవాలి తప్ప కూల్చివేయడం ఏంటి అంటూ చెత్త లాజిక్ ఒకటి తెరపైకి తెచ్చారు. కొన్ని కోట్లతో కట్టిన ప్రజావేదిక కన్నా.. అక్రమ కట్టడాల కన్నా కూడా కృష్ణా నదికి అక్రమ కట్టడాల వల్ల జరిగిన నష్టం కొన్ని వేల కోట్లకు పైనే ఉంటుందన్న స్పృహ వారిలో లేదు. అసలు పర్యావరణం అంటేనే అది తమకి సంబంధంలేని విషయం అన్నట్లుగానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ వచ్చారు. నొయిడాలో ట్విన్ టవర్స్ను పేల్చినపుడు వందల కోట్ల రూపాయల ఆస్తులను ధ్వంసం చేయడం ఏంటి? అని అక్కడి ప్రతిపక్షాలు గొడవ చేయలేదు. అసలు ఎందుకు కూల్చివేస్తున్నారు? అని ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ప్రజాసంఘం కానీ ప్రశ్నించలేదు. ఇది రాజకీయ కక్షసాధింపేనని ఆ టవర్స్ నిర్మించిన కంపెనీతో అంటకాగే రాజకీయ పార్టీలు ఆరోపించలేదు. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం, జనసేన వంటి బాధ్యతారహిత రాజకీయ పార్టీలు లేవు కాబట్టి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇపుడు మన పొరుగునే ఉన్న కర్ణాటక ప్రభుత్వం కూడా నిబంధనలకు విరుద్ధంగా చెరువులు, నాలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని డిసైడ్ అయ్యింది. ప్రత్యేకించి బెంగళూరు నగరాన్ని తాజాగా భారీ వర్షాలు వరదలు ముంచెత్తడంతో చెరువులు, పార్కుల కబ్జాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడి కార్పొరేట్ కార్యాలయాలు కొలువు తీరిన బహుళ అంతస్థుల భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేసి కూల్చివేత పనులు మొదలు పెట్టారు. అదృష్టం ఏంటంటే బెంగళూరు లో టిడిపి, జనసేన వంటి పార్టీలు లేవు కాబట్టి కూల్చివేతలపై ఎలాంటి రాజకీయాలు లేకుండా సజావుగా సాగుతున్నాయి. -
నోయిడా ట్విన్ టవర్స్- ఏపీ ప్రజావేదిక.. రెండూ కరెక్టేనా!
ఉత్తరప్రదేశ్లోని నోయిడా వద్ద రెండు భారీ ట్విన్ టవర్స్ను కూల్చివేసిన ఘట్టం దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షించింది. సుమారు నలభై అంతస్తుల భవనాన్ని కేవలం తొమ్మిది సెకన్లలోనే కూల్చేవేయడం ఒక ముఖ్యమైన అంశం అయితే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మరో ప్రధాన అంశం. సుప్రీంకోర్టు ఇచ్చింది కనుక ఈ ఆదేశాలు వివాదాస్పదం కాలేదు. రాజకీయ పార్టీలు దీనిపై విమర్శలకు దిగలేదు. అక్రమ భవనం అని కోర్టు నిర్థారించింది. అంతకు ముందు గత ఏడాది కేరళలోని కొచ్చి వద్ద నదీతీర ప్రాంతంలో నిర్మించిన మరో భారీ బహుళ అంతస్తుల భవంతిని కూడా సుప్రీం ఆదేశాల మేరకు కూల్చివేయవలసి వచ్చింది. ఈ ఘట్టాలు దేశానికి ఒక మంచి సందేశం ఇచ్చాయనే చెప్పాలి. చదవండి: పవన్ కల్యాణ్ని తిట్టిస్తున్నారని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం? తాత్కాలికంగా కొంతమంది వ్యక్తులకు ఈ పరిణామం అసౌకర్యం కలిగించినా, భవిష్యత్తులో బిల్డర్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడడకుండా ఉండడానికి ఇది ఆస్కారం ఇస్తుంది. విశేషం ఏమిటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అక్రమ సౌధం నేలకూలింది అన్న శీర్షికతో వార్తలు ఇచ్చిన ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు, ఏపీలో అక్రమ నిర్మాణాలు తొలగిస్తే మాత్రం విధ్వంసం అని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై బురదచల్లే యత్నం చేశాయి. విజయవాడ సమీపంలోని ఉండవల్లిలో కృష్ణా కరకట్టను ఆనుకుని పలు భవనాలు వెలిశాయి. అవన్ని కోస్టల్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించినవే. ప్రైవేటు వ్యక్తులే కాకుండా ప్రభుత్వం కూడా ఏకంగా ప్రజావేదిక పేరుతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్లో ఒక అక్రమ నిర్మాణం చేశారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. అధికారులు వద్దని సలహా ఇచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం నదీని అనుకుని ఎలాంటి నిర్మాణాలు జరగరాదు. దానికి నిర్దిష్టదూరంలోనే నిర్మాణాలు ఉండాలి. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. చివరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబే స్వయంగా ఒక అక్రమ నిర్మాణంలో బస చేశారు. కొందరు పర్యావరణ వేత్తలు వచ్చి దీనిపై అభ్యంతరం చెప్పినా, వారిపై నిర్భంధాలు విధించారే కాని, చేసిన తప్పును సరిదిద్దుకోలేదు. ఓటుకు నోటు కేసు తర్వాత హైదరాబాద్ నుంచి అకస్మాత్తుగా విజయవాడకు వెళ్లిపోయిన చంద్రబాబు, లింగమనేని రమేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందిన అతిథి గృహ భవనంలో మకాం చేశారు. దీనికి ప్రతిగా ఆయనకు రాజధాని భూముల పూలింగ్లో మినహాయింపులు ఇచ్చి లాభం చేశారన్న అభియోగం ఉంది. అది వేరే విషయం. చంద్రబాబు ఈ ఇంటిలో దిగడానికి కొన్ని నెలల ముందు ఆయన క్యాబినెట్లోని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణానదిలో వరదను పరిశీలించడానికి వెళ్లి, ఈ అక్రమ నిర్మాణాలను గమనించి వీటన్నిటిని తమ ప్రభుత్వం కూల్చివేస్తుందని అప్పట్లో ప్రకటించారు. తీరా సీన్ కట్ చేస్తే ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న టీడీపీ అధినేతే అలాంటి అక్రమ భవనం ఒకదానిలో దిగేసరికి ఉమా కూడా సైలెంట్ అయిపోయారు. తన ఇంటి వద్ద సదుపాయంగా ఉంటుందని భావించి ప్రజావేదిక పేరుతో ఒక కన్వెన్షన్ హాల్ తరహాలో నిర్మించుకున్నారు. 2019లో టీడీపీని ఓడించి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి ఈ ప్రజావేదికలో ఒక సదస్సు పెట్టి, ప్రభుత్వమే అక్రమ నిర్మాణం చేయడం ఏమిటని ప్రశ్నించి దానిని కూల్చివేయాలని ఆదేశించారు. అంతే: చంద్రబాబుతో సహా, పలువురు టీడీపీ నేతలు, వారికి వంత పాడే మరికొన్ని ఇతర పార్టీల నేతలు ఇంకేముంది విధ్వంసం అంటూ ప్రచారం చేశారు. ప్రజావేదిక కూల్చి ఏడాది అయిందంటూ మరోసారి ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇదొక్కటే కాదు. ఏపీలో ఎక్కడ అక్రమ కట్టడం ఉన్నా, చివరికి అది గోడ అయినా, దానిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనో టీడీపీ వారు అడ్డుకోవడం, వెంటనే స్టేలు తీసుకు రావడం చేశారు. చిత్రంగా గౌరవ హైకోర్టు వారు కూడా కారణం తెలియదు కాని, అలాంటి అక్రమ కట్టడాల కూల్చివేతకు ఎక్కువ సందర్భాలలో స్టే ఇచ్చారన్న అభిప్రాయం ఉంది. కృష్ణా కరకట్టపై ఉన్న భవనాలకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా, కొందరు హైకోర్టు నుంచి స్టే పొందగలిగారు. చివరికి టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నీటిపారుదల శాఖ స్థలంలో అక్రమంగా నిర్మించిన ప్రహరిగోడను కూల్చినా టీడీపీ మీడియా, టీడీపీ నేతలు రచ్చ,రచ్చ చేశారు. న్యాయ స్థానం నుంచి కూడా వారికి కొంత సానుకూలమైన ఆదేశాలు వచ్చాయి. విశాఖలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమించి గోడ కట్టిన గీతం యూనివర్శిటీలో ఆ గోడను తొలగించినప్పుడు కూడా ఇదే తంతు. కాని ఇప్పుడు సుప్రీంకోర్టు వారు నోయిడాలో ఏకంగా వందల కోట్ల రూపాయల విలువైన భారీ భవనాలను కూల్చివేయించారు. ఈ కూల్చివేతకు సుమారు ఇరవై కోట్ల వ్యయం అయిందని వార్తలు వచ్చాయి. ఈ భవనాలను నిర్మించిన బిల్డర్లు తమకు 500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. అంత ఖరీదైన భవనాల నిర్మాణానికి సహకరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదు. కాని కొందరు మాత్రం ఇలా కూల్చడం కన్నా, ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తే బాగుండేదన్న వాదనను తీసుకు వస్తున్నారు. సుప్రీంకోర్టే ఆ పని చేస్తే, ఇక ప్రభుత్వాలు దానిని మరింతగా దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రతివాదన చేసేవారు అంటున్నారు. కూల్చివేత ఘట్టం పూర్తి అయ్యాక, ఈ వాద, ప్రతివాదాలకు పెద్దగా విలువ ఉండదు. మరికొన్ని ఘట్టాలు కూడా గుర్తు చేసుకోవాలి. ఉత్తరప్రదేశ్లో అఘాయిత్యాలకు పాల్పడిన రౌడీషీటర్ల ఇళ్లను, మతకలహాలకు కారకులైనవారి ఇళ్లను అవి అక్రమమైనవి అయితే బుల్ డోజర్లు తీసుకు వెళ్లి కూల్చివేశారు. దానిని సుప్రీంకోర్టు కూడా నిలువరించలేదు. దాంతో యూపీ ప్రభుత్వానికి బుల్ డోజర్ ప్రభుత్వం అన్న పేరు కూడా కొంతమంది పెట్టారు. తెలంగాణలోని హైదరాబాద్లో వరదనీరు, డ్రైనేజీ వ్యవస్థ పారే నాలాల మీద ఇళ్లు కడితే వాటిని ఎందుకు కూల్చలేదని న్యాయస్థానం ఒక సందర్భంలో ప్రశ్నించింది. దాంతో అక్కడ ఉంటున్నవారికి ప్రత్యామ్నాయం చూపుతూ ఆ ఇళ్లను పలు చోట్ల కూల్చివేశారు. బాచుపల్లి అనే చోట అనుమతులు లేకుండా నిర్మించిన 200 పైగా విల్లాలను కూడా అధికారులు కూల్చివేశారు. అయినా ఇక్కడ ఎవరూ దానిని విధ్వంసంగా అభివర్ణించలేదు. ఏపీలో మాత్రం ప్రతిపక్ష టీడీపీ,దానికి వంతపాడే ఈనాడు, తదితర మీడియా మాత్రం ఆ తరహా ప్రచారం చేశాయి. నొయిడా ఘటన తర్వాత కూడా ప్రజా వేదికను తీసివేసిన విషయాన్ని విధ్వంసంగానే ప్రచారం చేస్తారా? ఏపీకి సపరేట్ రాజ్యాంగం ఉందని వారు భావిస్తారా?. కృష్ణానది అనుకుని ఉన్న విలాసవంత భవనాల ద్వారా కాలుష్యం నదిలో కలుస్తోందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అయినా ఏపీ వరకు మినహాయింపు ఇవ్వాలని వీరు అభిలషిస్తారా? ఈ మొత్తం ప్రకియలో టీడీపీ, అనుబంధ మీడియా ఆత్మరక్షణలో పడినట్లయింది. సుప్రీం కోర్టు చేసింది విధ్వంసమా?లేక నిబంధనలు పాటించడమా అన్నదానిపై వీరు నోరు విప్పలేని పరిస్థితి. అయితే కొన్నాళ్లకు అంతా మర్చిపోయారని అనుకున్న తదుపరి యథా ప్రకారం టీడీపీ కాని, వారి మీడియా కాని విధ్వంసపు రాతలు రాయకుండా ఉంటాయని భావించలేం. ఎందుకంటే టీడీపీ ఓడిపోతే రామోజీరావు తదితర మీడియా సంస్థల యజమానులు తామే ఓడిపోయామని ఫీల్ అవుతున్నారు. ఎలాగైనా చంద్రబాబును గద్దె ఎక్కించడం ద్వారా తమ ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చన్నది వారి ఆలోచన. ఇందు కోసం వారు పడరాని పాట్లు పడుతున్నారు. అయినా జగన్ వీటన్నిటిని సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. అంతిమంగా ప్రజావేదిక కూల్చివేత విషయంలో జగన్దే కరెక్టు అని సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాల ద్వారా తేలిందని అనుకోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్ టవర్స్.. నెటిజన్ల విమర్శల ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్ టవర్స్ను చూశారు కదా! వీటిని మన రైల్వే మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల్లో ఆదివారం పోస్ట్ చేసింది. పునరుద్ధరణ తరువాత న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (ఎన్డీఎల్ఎస్) ఇలా ఉండబోతోందని పేర్కొంది. ఆధునికంగా కనబడుతున్నా.. ఆ టవర్స్పై నెటిజన్స్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. 40 అంతస్తుల జంట భవనాల్లో మల్టీ లెవల్ పార్కింగ్, పికప్, డ్రాప్ జోన్స్, 91 బస్బేలు, 1,500 ఈసీఎస్ పార్కింగ్లు ఉంటాయని, షాపులు, ఆఫీసులు, ఓ పెద్ద హోటల్ నిర్వహణకు సరిపడా స్థలముంటుందని రైల్వే శాఖ పేర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ను 5వేల మంది రీట్వీట్ చేశారు. ► ఓ రైల్వే స్టేషన్కు అంత సంక్లిష్టమైన డిజైన్ అవసరమా? ► నిర్మాణానికి ఎక్కువ టైమ్ తీసుకోవడమే కాదు.. ఆ అద్దాల నుంచి వచ్చే ఉష్ణోగ్రత వేసవిలో ఢిల్లీ టెంపరేచర్ను మరింత పెంచుతుంది. ► డిజైన్ బాగానే ఉంది కానీ.. చూడ్డానికి 2025 ప్లాన్లా ఉంది. దానికోసం భూసేకరణ ఎలా చేస్తారు? బయట ఉన్న పహడ్గంజ్ నివాసితులను ఏం చేస్తారు? ► హైప్డ్ డిజైన్తో అనవసరమైన ఖర్చు. సింపుల్గా ఎఫెక్టివ్గా కట్టలేమా? ఆధునికత పేరుతో ధరలు పెంచుతారు. ఆ భారం ప్రయాణికులపైనే పడుతుంది. ► మన నిర్మాణాలు మన సంస్కృతిని ప్రతిబింబించాలి. ఇది ఎక్కడినుంచో కాపీ కొట్టినట్టు ఉంది. అంటూ విమర్శల వర్షం కురిపించారు. చదవండి: ఆగ్రా రైల్వేస్టేషన్లో టాయ్లెట్ చార్జీ రూ.112 -
నోయిడా ట్విన్ టవర్స్లో అత్యాధునిక సిస్మోగ్రాఫ్, బ్లాక్ బాక్సులు
నోయిడా: వంద మీటర్ల ఎత్తయిన జంట సౌధాలను నేలమట్టం చేసే సందర్భాన్ని పరిశోధకులు తమ అధ్యయనం కోసం వినియోగించుకున్నారు. భవిష్యత్ పరిశోధనకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టేందుకు ఈ బహుళ అంతస్తుల భవంతులను ఎంచుకున్నారు. వాటర్ఫాల్ ఇంప్లోజన్ విధానంలో నోయిడా సెక్టార్93ఏలోని జంట భవనాలను ఆదివారం నేలమట్టంచేయడం తెల్సిందే. పేలుడుపదార్ధాల ధాటికి భవనం నేలను తాకే క్రమం, శిథిలాలు సమీప ప్రాంతాలపై చూపే ప్రభావం, తదితర సమగ్ర సమాచారం సేకరించారు. డ్రోన్లు, థర్మల్ ఇమేజ్ కెమెరాలతో సంఘటనను అన్ని వైపుల నుంచీ షూట్చేశారు. చదవండి: (నోయిడా ట్విన్ టవర్స్: తిరిగి వస్తున్న జనం, సెల్ఫీలతో సందడి) పేలుడు ప్రభావాన్ని అంచనావేసేందుకు 20 అత్యాధునిక సిస్మోగ్రాఫ్లు, 10 బ్లాక్ బాక్స్లను ఆ భవనాల్లోనే బిగించామని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీబీఆర్ఐ) శాస్త్రవేత్త దేబీ ప్రసన్న చెప్పారు. పేలుడు ధాటికి భూమి కంపనాలను గణించేందుకు సిస్మోగ్రాఫ్లను వాడారు. జెట్ డెమోలీషన్స్ అండ్ ఎడిఫీస్ ఇంజనీరింగ్ సంస్థ ఈ భవనాలకు పేలుడుపదార్థాలు అమర్చి పేల్చేసింది. బ్లాక్ బాక్స్ బ్లాక్బాక్స్ను ప్రత్యేకమైన పదార్థంతో.. ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని తయారు చేస్తారు. చదవండి: (నోయిడా జంట టవర్ల కూల్చివేత: వంచితుల వ్యథ తీరేదెప్పుడు!)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement