-
పక్కింటి కుర్రాడు
రియల్నేమ్ కన్నా రీల్నేమ్ ఆదిత్యగానే సీరియల్ ప్రేక్షకులకు పరిచయం. రక్తసంబంధం కుర్రాడు అనో, దుర్గమ్మ కొడుకు అనో చెప్పుకుంటూ ఉంటారు. ‘చూసి కూడా పలకరించకుండా వెళ్లిపోతున్నావేం’ అని నిష్టూరమాడుతుంటారు. పక్కింటి కుర్రాడు అనిపించేంటంత ఆప్యాయతను చూపేలా తన నటన ద్వారా ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు సిద్ధార్థ. ‘రెండేళ్లు అవుతోంది జీ తెలుగులో వచ్చే రక్తసంబంధం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువై’ అంటూ ఆనందంగా తన వివరాలను పంచుకున్నాడు సిద్ధార్ధ. అనుకోని ప్రయత్నం ‘పుట్టి పెరిగింది వైజాగ్ దగ్గర రాజవొమ్మంగి అనే ఊరు. నాన్న కుమార్ రాజు, అమ్మ సత్యాదేవి. ఇద్దరూ ఇప్పటికీ అన్ని విషయాల్లోనూ నాకు అండగా నిలుస్తారు. డిగ్రీ పూర్తయ్యాక ఎమ్సీయే చేద్దామనుకునే సమయంలో విజయనగరంలో సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. అలా ఆడిషన్స్లో పాల్గొన్నాను. 3 జీ లవ్, నేను నా ఫ్రెండ్, దాగుడుమూతా దండాకోర్.. ఇలా సినిమాలో నటిస్తూ ఉన్నాను. అప్పుడే సీరియల్స్ నుంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. స్వాతిచినుకులు, ప్రతిఘటన, ఓకే జాను, మట్టిగాజులు .. ఇలా సీరియల్స్ చేస్తూ వచ్చాను. ఈ పరిశ్రమకు వచ్చి ఆరేళ్లు అవుతోంది. 2018 జీ కుటుంబం అవార్డులో ఉత్తమ కొడుకు అవార్డు, 2019లో బెస్ట్ హీరో అవార్డులు అందుకున్నాను. నా వర్క్కి పూర్తి న్యాయం చేయగలుగుతున్నానని ఆనందంగా ఉంది. బెటర్హాఫ్ నా భార్య విష్ణుప్రియ. తను కూడా సీరియల్స్లో నటిస్తుంది. విష్ణు ప్రియ, నేను చిన్ననాటి నుంచి స్నేహితులం. సినిమాల్లోనూ ఇద్దరం కలిసి చేశాం. మా ఇరువైపుల కుటుంబాలలో మా ప్రేమకు ఎవరూ అడ్డు చెప్పలేదు. దీంతో ఇద్దరం ఒకింటివారమయ్యాం. నా బెస్ట్ క్రిటిక్ తనే. అందరూ బాగా చేశారని చెప్పినా.. తను మాత్రం సరైన సూచనలు చేస్తుంటుంది. ఏ సీన్లో ఇంకా ఎలా చేస్తే బాగుండేదో చెబుతుంటుంది. మా అబ్బాయి అయాన్ వర్మ పుట్టి రెండు నెలలు అవుతోంది. వాడితో మాకు టైమే తెలియడం లేదు. స్నేహమే.. జీవితం ఎందుకు చెబుతున్నానంటే.. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది నా స్నేహితులే. చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఫ్రెండ్స్ జాబితా ఎక్కువే. వాళ్ల వల్లే నేను సినిమాల్లోకి వచ్చాను. సీరియల్స్ చేయగలిగాను. ఈ పరిశ్రమకు వచ్చిన కొత్తలో వాళ్లే నాకు హెల్స్ చేశారు. ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని గట్టిగా కోరుకున్నారు. ఏ కాస్త టైమ్ దొరికినా ఫ్రెండ్స్తో సరదాగా గడపడం నాకున్న ఆనందాలలో ఒకటి. రక్తసంబంధం నన్ను ఆదిత్యగా తెలుగింటికి బాగా చేరువచేసిన సీరియల్ రక్తసంబంధం. బావ మరదళ్ల మధ్య లవ్ స్టోరీతో నడిచే ఈ సీరియల్లో రకరకాల మలుపులు ఉంటాయి. దుర్గమ్మ–ప్రియలు వదినామరదళ్లు. దుర్గమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు ఆడపిల్ల పుడితే సహించలేను అంటుంది. ఇది విన్న ప్రియ ఆందోళన పడుతుంది. ఇద్దరికీ ఒకేరోజున డెలివరీ అవుతుంది. దుర్గమ్మకు ఆడపిల్ల, ప్రియకు అబ్బాయి పుడతారు. దీంతో ప్రియ పిల్లలను మార్పిడి చేస్తుంది. ఈ కథలో బావామరదళ్లు అయ్యి ఆదిత్య–తులసిల మధ్య ప్రేమ ఆకట్టుకుంటుంది. తులసి గడసరి అమ్మాయి. అల్లారుముద్దుగా పెరిగిన క్యారెక్టర్ ఆదిత్య. దుర్గమ్మకు మేనకోడలు తులసి నచ్చదు. ప్రియకు కన్నకొడుకు ఎవరో తెలుసు. ఈ సన్నివేశాలన్నీ భావోద్వేగాల మధ్య నడుస్తుంటాయి. తులసికి–ఆదిత్యకు పెళ్లి జరుగుతుంది. ఆ అమ్మాయి ఇంట్లో అడుగుపెట్టకుండా అవాంతరాలు సృష్టిస్తుంటుంది దుర్గమ్మ. కుటుంబ బంధాలతో కూడిన కథనం అవడంతో ప్రేక్షకాదరణ బాగుంటోంది. ‘రక్త సంబంధం’ సీరియల్లో దృశ్యం పక్కింటి కుర్రాడు ఎప్పుడైనా దేవాలయానికి వెళితే.. అక్కడ చూసినవాళ్లు దగ్గరగా వచ్చి ‘మమ్మల్ని చూసి కూడా పలకరించట్లేదేంటి’ అని అడుగుతుంటారు. నేను ఆశ్చర్యపోతే వారే కాసేపాగి ‘మీరు సీరియల్లో చేస్తారు కదా! మా పక్కింటి కుర్రాడిలాగే అనిపిస్తారు’ అని మాటలు కలుపుతారు. వాళ్లు అలా అంటున్నప్పుడు నాకు ఈ గుర్తింపు వచ్చినందుకు చాలా ఆనందం వేస్తుంది. – నిర్మలారెడ్డి -
‘పింక్థాన్’
ఈమె పేరు విష్ణుప్రియ. అంధ విద్యార్థిని. చూపు లేకపోతేనేం.. ముందుచూపున్న అమ్మాయి. మార్చి 15నమహిళల్లో చైతన్యం కోసం ‘రన్’ చేస్తానంటోంది. ఆమే కాదు.. నటుడు, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ మిలింద్ సోమన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, బ్లేడ్ రన్నర్ కిరణ్ కనోజియా.. మరెందరో ఇందుకు రెడీ అవుతున్నారు.‘పింక్థాన్’ పేరిట వీరు సంకల్పించిన పరుగు పందెం.. అచ్చంగా మహిళల కోసం ఉద్దేశించింది. బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించడానికి ‘యునెటైడ్ సిస్టర్స్ ఫౌండేషన్’, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ కలిసి నిర్వహిస్తున్న పింక్థాన్లో వీరంతా పరుగు పంచుకోనున్నారు. ..:: శిరీష చల్లపల్లి సర్వ సాధనలో దేహ సాధన ముఖ్యమని ఆర్యోక్తి. ఇల్లు.. పిల్లలు.. ఉద్యోగం.. అన్నింటినీ ఒంటిచేత్తో నెట్టుకొస్తున్న నారీమణులు తమ సొంత ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ధ చేస్తారు. అందుకే నడివయసుకు వచ్చిన మహిళలెందరో ఒంట్లో నలతను నిత్యం ఎదుర్కొంటున్నారు. నడుం నొప్పి, తలపోటు వంటి చిన్నాచితకా రుగ్మతలు ఎందరో స్త్రీమూర్తులకు కామన్ అయిపోయాయి. ఇటీవల రొమ్ము క్యాన్సర్ బాధితులూ పెరిగిపోతున్నారు. మెడికల్ అధ్యయనాల ప్రకారం గతేడాది ఇండియాలో 5.27 లక్షల మంది బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారని తేలింది. వీరిలో 3 లక్షల మంది బలయ్యారు. రొమ్ము క్యాన్సర్పై పోరాటం ప్రకటించిన ‘యునెటైడ్ సిస్టర్స్ ఫౌండేషన్’ మార్చి 15న పీపుల్స్ ప్లాజాలో ఐదు వేల మందితో పింక్థాన్ నిర్వహించనుంది. ఈ నడకను విజయవంతం చేయడానికి వివిధ రంగాల నుంచి 20 మంది అంబాసిడర్లను ఎంపిక చేశారు. బుధవారం అమీర్పేటలోని గ్రీన్పార్క్ హోటల్లో వారు పింక్థాన్ వివరాలను వెల్లడించారు. సీరియస్నెస్ లేదు.. హైదరాబాద్ మహానగరంలో రొమ్ము క్యాన్సర్పై పింక్థాన్ నిర్వహిస్తుండటం ఇదే తొలిసారి. పింక్థాన్ 2012లో ముంబైలో తొలిసారి నిర్వహించారు. ఆనాటి రన్లో రెండువేల మంది మహిళలు పాలుపంచుకున్నారు. 2013లో దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో పింక్ థాన్ జరిగింది. 2014లో ఆరు నగరాల్లో 50 వేల మంది మహిళలు పాల్గొన్న పింక్థాన్.. ఈ ఏడాది హైదరాబాద్తో సహా తొమ్మిది నగరాల్లో జరగనుంది. ‘బెటర్ కాజ్తో నిర్వహిస్తున్న ఈ రన్ ఎందరికో స్ఫూర్తినివ్వాలి. ఇంట్లో అందరి ఆరోగ్యం గురించి పట్టించుకునే మహిళలు.. వారి ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోరు. యోగ, వ్యాయామం, మెడిటేషన్.. చేయడం ద్వారానే హెల్దీగా ఉంటారని అందరికీ తెలుసు. కానీ పని ఒత్తిడి, మాకెందుకులే అన్న ఫీలింగ్తో ఆరోగ్యాన్ని సీరియస్గా తీసుకోవడం లేద’ని అంటారు మిలింద్ సోమన్. సంకల్పం చాలు.. ఇలాంటి రన్లలో పాల్గొనాలంటే డ్రెస్ కోడ్ కంపల్సరీ అనుకుంటారు. పింక్థాన్ అందుకు మినహాయింపు. మంచి కోరుతూ సాగుతున్న ఈ పరుగులో పాల్గొనాలనే సంకల్పం ఉంటే చాలంటున్నారు నిర్వాహకులు. పంజాబీ డ్రెస్, చీర, షార్ట్స్.. ఇలా ఎవరికి నచ్చిన కాస్ట్యూమ్స్లో వారు రావొచ్చని చెబుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ను తరిమేయడమే అందరి ఎజెండా కావాలని కోరుతున్నారు. మగవాళ్లతో అన్నింటా పోటీ పడుతున్నామని చెబుతున్న ఆడవాళ్లు.. వ్యాయామం, జాగింగ్ల కోసం బయటకు రావడానికి మాత్రం ఇంకా ఆలోచించడం షాకింగ్గా ఉందని పింక్థాన్ మరో అంబాసిడర్ గుత్తా జ్వాల అంటున్నారు. ‘వ్యాయామం మగవాళ్ల కోసమే ఉద్దేశించింది కాదని మహిళలు గుర్తించాలి. పర్సనల్ కేర్తో పాటు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పాలుపంచుకోవాల్సిన బాధ్యత కూడా మహిళలపై ఉంద’ని చెబుతారామె. ఇప్పటి వరకూ తనకు జాగింగ్ చేసిన అలవాటు కూడా లేదని చెబుతున్న రేడియో మిర్చి ఆర్జే భార్గవి పింక్థాన్లో పది కిలోమీటర్ల రన్కు రెడీ అవుతున్నానని చెబుతోంది. ‘ఈ రన్లో పాల్గొంటున్నందుకు ఎగ్జైటింగ్గా ఉంది. ఉరుకుల పరుగుల జీవితానికి చెక్ పెట్టి ఆడవాళ్లంతా ఈ రన్లో పాల్గొనాల’ని పిలుపునిచ్చారామె. కి‘రన్’ స్ఫూర్తి.. ఎక్కడ 10కే, 5కే రన్ అయినా పాల్గొంటూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న బ్లేడ్ రన్నర్ కిరణ్ కనోజియా కూడా పింక్థాన్లో పరిగెత్తనుంది. విధిని ఎదిరించి విజేతగా నిలిచిన కిరణ్ను పలకరిస్తే.. ‘కొన్నేళ్ల కిందట.. హైదరాబాద్ నుంచి మా ఊరు ఫరీదాబాద్ ట్రైన్లో వెళ్తుండగా.. ఇద్దరు ఆకతాయిలు నన్ను రైలు నుంచి తోసేశారు. ఆ ప్రమాదంలో నా ఎడమకాలు పూర్తిగా చితికిపోయింది. నాకు జీవితమే లేదనుకున్నాను. నా పేరెంట్స్ ధైర్యాన్నిచ్చారు. ఆర్టిఫిషియల్ లెగ్తో మళ్లీ అడుగులు వేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు ఎక్కడ 10కే రన్ వాలిపోతాను. ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలం. క్యాన్సర్పై అవేర్నెస్ కల్పిస్తున్న పింక్థాన్లో పార్టిసిపేట్ చేస్తుండటం ఎంతో సంతోషాన్నిస్తోంది’ అని తెలిపింది. ముందువరసలో.. క్యాన్సర్ సర్వైవల్ నాయకురాలుగా ఉన్న ధరణి బ్రెస్ట్ క్యాన్సర్తో పోరాడి విజయం సాధించింది. పింక్థాన్లో ముందువరుసలో ఉంటానంటున్న ఆ మహిళ.. ‘క్యాన్సర్ సోకిన తర్వాత నేను నిరాశలో కూరుకుపోయాను. డాక్టర్స్ కౌన్సెలింగ్ తర్వాత నేను బతకగలననే నమ్మకం వచ్చింది. నాకేమీ కాలేదు.. కాదు అని మనసులో నిశ్చయించుకున్నాను. ట్రీట్మెంట్తో పాటు వ్యాయామం, జాగింగ్ చేస్తూ క్యాన్సర్ మహమ్మారిని అధిగమించాను’ అని తెలిపింది. మనోబలం ఉంటే ఎంతటి మహ మ్మారినైనా ఎదుర్కోవచ్చని చెబుతోంది ధరణి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement