అజ్ఞాతం వీడని పసుపు నేతలు
► 13 రోజులు దాటినా వెతుకులాటలోనే పోలీసులు
► ఉదయగిరి ఎమ్మెల్యే చుట్టూ కుంభకోణం
► కేసు తారుమారుకు అధికార పార్టీ యత్నాలు
నెల్లూరు : ‘తప్పంతా పసుపు కొనుగోలు చేసిన అధికారులదే. వాళ్లు సక్రమంగా పనిచేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మార్క్ఫెడ్ అధికారులు పట్టించుకోకపోవడం, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిం చడం వల్లే పసుపు కుంభకోణం జరిగింది’ అని ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. పసుపు కుంభకోణంలో పాత్రధారులు, సూత్రధారులు, లబ్ధి పొందిన వారంతా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులే. ఈ కుంభకోణం నుంచి వారిని బయటపడేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్న ఎమ్మెల్యే తప్పును పూర్తిగా అధికారులపై నెట్టే కార్యక్రమానికి తెరతీశారు.
అంతా వాళ్లే..
అడుగడుగునా పెచ్చుమీరిన రాజకీయ జోక్యంతో వీఆర్ఓ మొదలుకొని మార్క్ఫెడ్ ఉన్నతాధికారుల వరకు అందరూ టీడీపీ నేతలకు తలొంచారు. కొంత ప్రతిఫలం అందుకుని రూ.14 కోట్ల పసుపు కుంభకోణానికి తెరతీశారు. పాత్రధారులు, సూత్రధారులుగా 46 మందిని గుర్తించారు. అయితే, 46 మందిలో ప్రభుత్వ ఉద్యోగులు మినహాయిస్తే.. మిగిలిన వారంతా అధికార పార్టీకి చెందిన మండల, గ్రామస్థాయి నేతలే. గత నెల 28న వీరందరిపైనా కేసులు నమోదు కాగా.. ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.
అంత పసుపు ఎక్కడి నుంచి వచ్చింది
వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం ఉదయగిరి నియోజకవర్గంలో 368 ఎకరాల్లో మాత్రమే రైతులు పసుపు పంట సాగు చేశారు. ఎకరానికి సగటున 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందనుకున్నా.. మొత్తంగా 14,720 క్వింటాళ్ల పసుపు మాత్రమే ఆ నియోజకవర్గంలో పండింది. కానీ.. మార్క్ఫెడ్ అధికారులు 34,247 క్వింటాళ్ల పసుపు కొనుగోలు చేశారు. దీనినిబట్టి చూస్తే 20 వేల క్వింటాళ్ల పసుపు బయటినుంచి తెచ్చి విక్రయించారు. మార్కెట్లో పసుపు ధరలు భారీగా పతనం కావడంతో మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. ఏ గ్రేడ్ పసుపు కొమ్ములను క్వింటాల్ రూ.6,500, బి గ్రేడ్ రకానికి రూ.6 వేలు ధర నిర్ణయించి కొనుగోలు చేసింది. ఈ కుంభకోణంలో వీఆర్ఓ స్థాయి నుంచి మార్క్ఫెడ్ మేనేజర్ వై.రమాదేవి వరకు ప్రతి ఒక్కరూ సొమ్ములు దండుకున్నట్టు విచారణలో తేలింది.
అంతా ఆయన అనుచరులే
పసుపు కుంభకోణంలో మార్క్ఫెడ్ మేనేజర్ వై.రమాదేవి, మార్కెట్ కమిటీ కార్యదర్శి షేక్ ఇంతియాజ్తోపాటు 18 మంది వీఆర్ఓలను సస్పెండ్ చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి, నాసిరకం సరుకుతో ప్రభుత్వాన్ని, మార్క్ఫెడ్ను మోసం చేసిన 17 మంది టీడీపీ నేతలపై చీటింగ్, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యు లంతా ఎమ్మెల్యేకు కుడిభుజంగా వ్యవహరించే నాయకులే కావడం గమనార్హం. ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యవహారాలను మండలాల వారీగా సదరు నేతలు పర్యవేక్షిస్తున్నారు. దుత్తలూరు మండలంలో ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యవహారాలను ఎంపీపీ చీకుర్తి రవీంద్రబాబు పర్యవేక్షిస్తుంటాడు.
ఈ కేసులో మొదటి నింది తుడు ఆయనే. ఉదయగిరి మండలంలో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించే మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి రెండో నిందితుడు కాగా, వరికుంటపాడు పార్టీ బాగోగులు చూసే మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చండ్ర మధుసూదనరావు మూడో నిందితుడు. వీరితోపాటు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి చాగంటి రాజశేఖర్తోపాటు మరో 13 మందిపై కేసులు నమోదు చేశారు. రాజశేఖర్ సహా అందరూ పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
ఆ నలుగురే కీలకం
పూర్తిగా కాంట్రాక్ట్ పనులు, వ్యాపారాలపై దృష్టి సారించే ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు ఉదయగిరి నియోజకవర్గంలో వ్యవహారాలను చీకుర్తి రవీంద్రబాబు, ఏఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ చండ్రమధుసూదనరావు, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి చాగంటి రాజశేఖర్ చక్కబెడుతుంటారు. ఈ నలుగురే ఆయనకు ప్రధాన ఆధారం. ఈ నేపథ్యంలోనే ముగ్గురు నేతలు అడ్డంగా కోట్లు దండుకున్నారు. కడప, దుగ్గి రాల మార్కెట్ యార్డుల్లో నాసిరకం పసుపును క్వింటాల్ రూ.1000, రూ.1,500లకు కొనుగోలు చేసి రూ.6 వేలకు మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రంలో విక్రయించారు.
ఈ వ్యవహారం వెలుగు చూడటంతో తన అనుచరులను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే బొల్లినేని హైరానా పడ్డారు. అయితే, పూర్తి ఆధారాలు లభ్యం కావడంతో మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు తామేమీ చేయలేమని తేల్చి చెప్పారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులంతా ఆయన సూచనలతోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. నిందితుల్లో కొందరు విజయవాడ, మరికొందరు విశాఖపట్నంలో ఉన్నట్టు తెలుస్తోంది.