-
రెమో మళ్లీ వచ్చేస్తున్నాడు.. బుకింగ్స్ అదుర్స్!
స్టార్ డైరెక్టర్ శంకర్, విక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రం అపరిచితుడు. సదా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రభుత్వ అధికారుల్లో అవినీతి, అక్రమాల కథ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా 2005లో విడుదలై సూపర్హిట్ను సొంతం చేసుకుంది. ఆస్కార్ సినిమా బ్యానర్పై రూపొందించిన ఈ చిత్రాన్ని రూ.20 కోట్లతో తెరకెక్కించగా.. రూ.60 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆ ఏడాది రిలీజైన అన్ని చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ రి రిలీజ్కు సిద్ధమైంది. ఈ సినిమాను మే 17వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.కాగా.. ఈ చిత్రంలో విక్రమ్, ప్రకాశ్ రాజ్ మధ్య సన్నివేశాలు అభిమానులను అలరించాయి. విక్రమ్ నటనా విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూడగలిగారు. త్రిపాత్రాభినయంతో రెమో, అపరిచితుడు, బ్రాహ్మణుడిగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగు, తమిళ రాష్ట్రాల్లో రి రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా.. ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఎన్నికల తర్వాత సరైనా సినిమా థియేటర్లో లేకపోవడంతో విక్రమ్ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తుందని ఆశిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు హరీశ్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. -
బీజేపీకే దక్షిణ భారత్: అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అత్యధిక లోక్సభ సీట్లను సాధించి, అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించబోతోందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పది స్థానాలకుపైగా కచ్చితంగా గెలుస్తామని.. 13 సీట్లలో పార్టీ పరిస్థితి సంతృప్తికరంగా ఉందని చెప్పారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లను బీజేపీయే గెలవబోతోందని పేర్కొన్నారు. ఈసారి 400 సీట్లు దాటుతామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగియడానికి ముందు శనివారం సాయంత్రం కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్లతో కలసి అమిత్ షా మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అవినీతి, అక్రమాలు, కుటుంబ రాజకీయాలతో తెలంగాణ రాజకీయాలు భ్రషు్టపట్టాయి. దీనిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లలో బీజేపీకి విజయాన్ని కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో 4% ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వడం ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాయడమే. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తాం. గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ విఫలం: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైంది. సోనియా పుట్టినరోజున రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కానీ సోనియా ఎన్నో పుట్టినరోజున అనేది చెప్పలేదు. రైతులకు రూ.15 వేల భరోసా, ధాన్యానికి రూ.500 బోనస్, మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వలేదు. అవేవీ చేయలేదు. కానీ కాంగ్రెస్ రాష్ట్ర నేతలు హైకమాండ్కు ఇచ్చిన ఒక హామీ ని మాత్రం పూర్తిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు కోసం తెలంగాణ నుంచి వసూలు చేసి పంపిస్తున్నారు. పీవోకే భారత్లో భాగమే.. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా.. పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉందంటూ కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్, కూటమి నాయకుడు ఫారూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయి. కశీ్మర్ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోం. పీవోకే భారత్లో అంతర్భాగమే. రేవంత్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్కు ఆధారాలు అడుగుతున్నారు. అలా స్ట్రైక్స్ చేసిన మూడో దేశం భారత్ మాత్రమే. దేశ సరిహద్దులు, అంతర్గత అంశాల్లో చొరబడేందుకు ఎవరు ప్రయత్నించినా చూస్తూ ఊరుకోబోం. వారి భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లి మరీ దాడిచేస్తాం. ఇండియా కూటమి దేశాన్ని విభజిస్తోంది.. దేశాన్ని ఉత్తర, దక్షిణాలుగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు విభజన చేస్తున్నాయి. ఇప్పటికే దేశాన్ని కాంగ్రెస్ ఒకసారి విడగొట్టింది. వారికి అంతకన్నా ఇంకేం రాదు. బీజేపీ ఉన్నంత వరకు విభజన జరగనివ్వం. అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వలేదు. కేవలం ఎన్నికల ప్రచారం కోసమే సమయం ఇచ్చింది. బెయిల్ రావడమే క్లీన్ చిట్ అనుకుంటే.. అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. కాంగ్రెస్ రాహుల్ గాం«దీని 20సార్లు లాంచ్ చేసినా విజయవంతం కాలేదు. 21వసారి కూడా అదే విఫల ప్రయత్నం చేస్తోంది. వారి తీరుతో ఆర్థికంగా వెనుకబాటు 2014లో తెలంగాణ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్గా ఉంది. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కుటుంబ పాలన, అవినీతి, ఓటు బ్యాంకు రాజకీయాలతో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడింది. లక్షల కోట్లు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఏటా రూ.80 వేల కోట్లు వడ్డీల కిందే కట్టాల్సిన దుస్థితి నెలకొంది. విభజనకు ముందు కేంద్రం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రూ.15వేల కోట్లు అందితే.. ఇవాళ ఒక్క తెలంగాణకే కేంద్రం నుంచి రూ.60వేల కోట్లు గ్రాంట్లుగా వస్తోంది. తెలంగాణలో మౌలిక వసతుల కోసం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు అందిన నిధులకంటే.. మోదీ సర్కారు గత పదేళ్లలో రెట్టింపు నిధులు ఇచ్చింది. రిజర్వేషన్ల రద్దు ఉద్దేశమేదీ లేదు బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే కాంగ్రెస్ ప్రచారాన్ని అవాస్తవం. గత పదేళ్లుగా ఎన్డీయేకు లోక్సభలో మూడింట రెండొంతుల మెజారిటీ ఉంది. మేం రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్లం. కానీ మాకు ఆ ఉద్దేశం లేదు. మేం మా మెజారిటీని ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దుకు, రామాలయ నిర్మాణానికి వాడాం. ఏవైనా మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ఆర్థికంగా, సామాజికంగా, విద్యపరంగా వెనుకబాటుదనం ప్రాతిపదికన రిజర్వేషన్లను ముస్లింలు, క్రిస్టియన్లు పొందవచ్చు. దానికి మేం వ్యతిరేకం కాదు. నేరుగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకం. ఈ అంశంపై నా మాటలను మారి్ఫంగ్ చేసి ప్రచారం చేశారు. ప్రధానిగా మోదీ వచ్చే ఐదేళ్ల టర్మ్ను పూర్తిచేస్తారు. దానిపై బీజేపీలో ఎలాంటి అనుమానాల్లేవు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి పథంలో నిలపాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఇచ్చిన హామీల్లో 92 శాతం అమలు చేశాం. మూడు దశల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారు. నాలుగో దశలోనూ మద్దతివ్వాలని కోరుతున్నాం’’అని అమిత్ షా పేర్కొన్నారు. మా ప్రగతి ఓవైపు.. వారి అవినీతి మరోవైపు.. ఓ వైపు ఇండి కూటమి.. మరోవైపు ఎన్డీయే కూటమి బరిలో ఉన్నాయి. ఓవైపు రూ.12 లక్షల కోట్ల అవినీతి కూటమి.. మరోవైపు 23 ఏళ్లుగా సీఎంగా, ప్రధానిగా ఉన్న మోదీపై 25 పైసల అవినీతి కూడా లేని కూటమి. అధికార అహంకారం తలకెక్కిన ఇండి కూటమి అటు.. సెలవు లేకుండా దీపావళిని కూడా సైనికుల మధ్య జరుపుకొనే మోదీ ఇటు.. నోట్లో బంగారు స్పూన్తో పుట్టి, కాస్త ఎండలు కాస్త పెరగగానే థాయ్లాండ్కో. మరో చోటికో వెళ్లే యువనేత అటు.. పేదింట్లో పుట్టి పెరిగి, పేదల కష్టాలు తెలిసి వాటిని దూరం చేస్తున్న మోదీ ఇటు.. గత పదేళ్లలో మేం దేశ అంతర్గత భద్రత, ఆరి్ధక వ్యవస్థ, మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ ఇండియా వంటివాటిలో గణనీయ ప్రగతి సాధించాం. రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అర్థ రహితం తెలంగాణకు పెట్టుబడులు రాకుండా కేంద్రం కుట్రచేస్తోందన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం. రాష్ట్రాన్ని వారు నడుపుతున్న తీరును చూసి ఎవరూ పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. అయినా పెట్టుబడులు కావాలంటే ప్రధానిని కలసి, అడిగితే బాగుంటుంది. అనవసర విమర్శలు సరికాదు. ప్రాంతీయ పార్టీలు తమ వాణిని వినిపించే అధికారం ఉంటుంది. కేసీఆర్కు కూడా ఆ అధికారం ఉంది. అంతే తప్ప బీజేపీతో పోల్చుకోవాలనుకోవడం హాస్యాస్పదం. ఎండోమెంట్ చట్టం తొలగింపు అంశం కోర్టు ముందుంది. కోర్టు ఏం చెబితే అదే చేస్తాం. -
వందో ఆస్కార్కి నాలుగు వేల కోట్లు!
ఆస్కార్ శతాబ్ది ఉత్సవాల (ఆస్కార్ అవార్డుల వందో వేడుక) సన్నాహాలు మొదలయ్యాయి. 2028లో జరగనున్న ఈ వేడుకల కోసం ఆస్కార్ నిర్వాహకులు ఇప్పట్నుంచే ప్రణాళికలు వేస్తుండటం హాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ‘ఆస్కార్ 100’ పేరిట ఈ వేడుకలు జరగనున్నట్లుగా రోమ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆస్కార్ ప్రతినిధులు వెల్లడించారు. ‘‘ఆస్కార్ 100’ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నాం.ఇందుకోసం 500 మిలియన్ డాలర్ల క్యాంపైన్ (దాదాపు రూ. నాలుగు వేల కోట్లు)ను లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ఏడాదిన్నరలో ఇప్పటికే ‘ఆస్కార్ 100’ కోసం వంద మిలియన్ డాలర్లను సేకరించాం. ‘ఆస్కార్ 100’ ఈవెంట్ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నాం. ఈ వేడుకల సందర్భంలోనే మరో వంద సంత్సరాల పాటు ఆస్కార్ అవార్డు వేడుకలను ఎలా నిర్వహించాలనే విషయాలను చర్చించుకుని, ఓ అవగాహనకు రావాలనుకుంటున్నాం’’ అని ఆస్కార్ కమిటీ ప్రస్తుత సీఈవో బిల్ క్రామోర్ చెప్పుకొచ్చారు. ఇక 97వ ఆస్కార్ అవార్డుల వేడుకలు వచ్చే ఏడాది మార్చి 2న జరగనున్న విషయం తెలిసిందే. -
లొంగని రాక్షసుడు
ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. సందీప్ కిషన్, కాళిదాసు జయరామ్ లీడ్ రోల్స్లో నటించారు. కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూన్ 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, ‘అడంగాద అసురన్ (లొంగని రాక్షసుడు) పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.ఈ పాటకు లిరిక్స్ రాయడంతో పాటు ఈ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్తో కలిసి పాడారు ధనుష్. ‘‘అడంగాద అసురన్’ పాటను ఏఆర్ రెహమాన్గారు రెడీ చేసినప్పట్నుంచి, మీతో (ప్రేక్షకులు) ఈ పాటను షేర్ చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాను. ఈ పాటను ఇప్పుడు రిలీజ్ చేశాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు ధనుష్. -
జూన్లో రాయన్
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘రాయన్’ చిత్రం జూన్లో విడుదలకు సిద్ధం అవుతోంది. సన్ పిక్చర్స్పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని జూన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో పాటు ఈ సినిమా నుంచి తొలి పాటని ఈ నెల 9న రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు ధనుష్. ఆ మధ్య ఈ మూవీ నుంచి విడుదలైన మటన్ కొట్టు రాయన్గా ధనుష్ ఫస్ట్ లుక్కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. -
డిజిటల్ ఫ్లాట్ఫామ్లో మరో ఓటీటీ సంస్థ!
ఇప్పుడు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టతరంగా మారిందన్నది ప్రత్యేకంగా చె ప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో చిన్న చి త్రాల నిర్మాతలకు ఓటీటీ ప్లాట్ఫామ్లు వరప్రసాదంగా మారాయనే చెప్పాలి. అలా ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ పెద్ద చి త్రాల స్ట్రీమింగ్లో బిజీగా ఉన్నాయి. కొత్తగా ఓటీటీ ప్లస్ పేరుతో కొత్త ప్లాట్ఫామ్ ప్రారంభమైంది. ప్ర ముఖ సినీ విమర్శకుడు, దర్శకుడు కేబుల్ శంకర్, ఎంఆర్ శీనివాసన్, సుధాకర్ కలిసి ఈ ఓటీటీ ప్లస్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. చెన్నైలోని ప్రసాద్ల్యాబ్లో జరిగిన దీని ప్రారంభోత్సవంలో జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత దర్శకుడు శీనూ రామస్వామి ముఖ్యఅతిథిగా హాజరైన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.అదే విధంగా ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల యంగ్ డైరెక్టర్స్ జాన్ కిళడి(పైరీ), మణివర్మన్(ఒరునొడి), ఆర్.వెంకట్(కిడా), బాలాజీ వేణుగోపాల్ (లక్కీమేన్), కన్నుసామి(వట్టార్ వళక్కు), యశ్వంత్ కిశోర్ (కన్నగి), విఘ్నేశ్కార్తీక్( హార్ట్స్పార్ట్) శరత్ జ్యోతి, రచయిత వసంత్ బాలక్రిష్ణన్, జయచంద్ర హస్మీ (కూస్ ముణుసామివీరప్పన్(వెబ్సిరీస్)ను అభినందించి వారికి జ్ఞాపికలను ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఓటీటీ ప్లస్ ప్లాట్ఫామ్ భవిష్యత్లో కొత్తగా వచ్చే వారికి వరప్రసాదం అవుతుందన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వర్థమాన దర్శకుల చిత్రాలను ప్రశంసించారు. వారిని తనతో గౌరవింపజేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ ఓటీటీ ప్లస్ ప్లాట్ఫామ్ నిర్వాహకుల్లో ఒకరైన కేబుల్ శంకర్ మాట్లాడుతూ.. ఓటీటీ ప్లాట్ఫామ్ల అవసరం నానాటికీ పెరిగిపోతోందన్నారు. అలా ఈ ఓటీటీ ప్లస్ మరో 5 ఓటీటీ ప్లాట్ఫామ్లతో కలిసి పని చేస్తోందని చెప్పారు. మరిన్ని ఓటీటీ సంస్థలను ఒకే ప్లాట్ఫామ్గా చేయాలన్నదే తమ భావన అని పేర్కొన్నారు. రోజుకు ఒక్క రూపాయి చెల్లించి ఈ ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్సిరీస్, లఘు చిత్రాలు చూడవచ్చని చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి ముందు కేబుల్ శంకర్ దర్శకత్వం వహించిన ఫెమినిస్ట్ అనే వెబ్ సిరీస్ మొదటి ఎపిసోడ్ను, సెన్టెన్స్ అనే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. -
మరింత ఆలస్యంగా ‘ఇండియన్ 2’..?
భారతీయుడి రాక మరింత ఆలస్యం కానుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన బ్లాక్బస్టర్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’). పాతిక సంవత్సరాల తర్వాత కమల్హాసన్తోనే ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్స్గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను తెరకెక్కించారు శంకర్. ‘ఇండియన్ 2’ని ఈ ఏడాది జూన్లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది.అయితే ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటిస్తారనే టాక్ కోలీవుడ్లో ప్రచారంలోకి వచ్చింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ప్రీత్, బాబీ సింహా, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటించారు. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: అనిరు«ద్ రవిచందర్. -
ముంబైలో వేట్టయాన్
ముంబైలో అమితాబ్ బచ్చన్ను కలిశారు వేట్టయాన్. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వేట్టయాన్’ (వేటగాడు). అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా ఇతర లీడ్ రోల్స్లో దుషారా విజయన్, మంజు వారియర్, రితికా సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇది. తాజాగా ‘వేట్టయాన్’ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది.రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గతంలో హైదరాబాద్లో జరిగిన ‘వేట్టయాన్’ షూటింగ్ షెడ్యూల్లో రజనీ, అమితాబ్ కాంబినేషన్ సీన్స్ తీశారు. ఇప్పుడు ముంబైలో వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ను తీస్తున్నారు. బూటకపు ఎన్కౌంటర్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. -
ఈ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయలేదంటే: జ్యోతిక
లోక్సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో మొత్తం 39 స్థానాలకు (ఏప్రిల్ 19) తొలి దశలోనే ఎన్నికలు జరిగాయి. ఎంతో ఉత్కంఠతో కూడిన ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే,బీజేపీ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. అయితే తమిళనాడు లోక్సభ ఎన్నికలకు ఓటు వేసేందుకు నటులు రజనీకాంత్, అజిత్ కుమార్, శివకార్తికేయన్, సూర్య,కార్తీ, ధనుష్ వంటి స్టార్ హీరోలు అందరూ పోలింగ్ బూత్లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ఆ సమయంలో సూర్య సతీమణి జ్యోతిక మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. అందుకు సంబంధించిన కారణాలను ఆమె తాజాగా స్పందించింది. ఇదే క్రమంలో తన పొలిటికల్ ఎంట్రీపై మనసు విప్పి మాట్లాడింది.సౌత్ ఇండియాలో టాప్ హీరోగా గుర్తింపు ఉన్న సూర్యతో జ్యోతిక పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. 2015లో మళ్లీ '36 ఏళ్ల వయసులో' అనే సినిమాతో తెరపైకి వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఈ మూవీ తర్వాత మళ్లీ ఆమె పలు ప్రాజెక్ట్లతో పుల్ బిజీ అయ్యారు. ప్రస్తుతం జ్యోతిక 'శ్రీకాంత్' అనే హిందీ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో జ్యోతిక బిజీగా ఉన్నారు. తాజాగా చెన్నైలో జరిగిన ఈ సినిమా తమిళ వెర్షన్ ప్రెస్ మీట్లో జ్యోతిక పాల్గొన్నారు. పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు జ్యోతిక స్పందిస్తూ.. లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయకపోవడంపై వివరణ ఇచ్చారు. 'గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా నా ఓటు హక్కును వినియోగించుకుంటూనే వచ్చాను. కానీ, కొన్నిసార్లు నేను అత్యవసరమైన పనుల వల్ల చెన్నైకి అందుబాటులో లేకుండా పోవచ్చు. ఆ సమయంలో నేను ఓటు వేయలేను. ఈసారి నేను అనారోగ్యంతో ఉన్నాను. ఇది వ్యక్తిగత విషయం. అందుకే ఓటు వేయలేదు. దానిని అందరూ గౌరవించాలి.' అని అన్నారు. జ్యోతిక ఎక్కువగా సోషల్ కంటెంట్ ఉన్న సినిమాలనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీంతో రాజకీయాల్లోకి రావచ్చు కదా అని మీడియా వారు ప్రశ్నించారు. అందుకు ఆసక్తి లేదని ఆమె సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఫిట్నెస్పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. -
పాన్ ఇండియా రేంజ్లో రజనీకాంత్ బయోపిక్
సెలబ్రిటీల జీవిత చరిత్రలు వెండితెరకెక్కడం సహజమే. అలా ఇప్పటికే రాజకీయ రంగంలో మహాత్మాగాంధీ, కామరాజర్, జయలలిత,వైఎస్ఆర్.. క్రీడా రంగంలో మహేంద్రసింగ్ ధోని వంటి పలువురు బయోపిక్స్ సినిమాగా రూపొందాయి. ఇందిరాగాంధీ, సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్లు తెరకెక్కుతున్నాయి. కాగా తాజాగా సూపర్స్టార్ రజనీకాంత్ బయోపిక్ను చిత్రంగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం జోరందుకుంది. కర్ణాటకకు చెందిన శివాజీరావ్ గైక్వాడ్ అనే ఒక సాధారణ బస్సు కండెక్టర్ ఇవాళ దక్షిణ భారత సినీ రంగంలో సూపర్స్టార్గా రాణిస్తున్నారు. అయితే ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నది అందరికీ తెలిసిందే. రజనీకాంత్ జీవిత పయనం చాలా మందికి స్ఫూర్తి అనే చెప్పాలి. కాగా ఈయన జీవిత చరిత్రను ఇప్పుడు వెండి తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా వార్త. హిందీలో పలు చిత్రాలను నిర్మించిన సుజిత్ నడియద్వాలా నటుడు రజనీకాంత్ బయోపిక్ను సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈయన ఇటీవల నటుడు రజనీకాంత్ను కలిసి ఈ విషయమై చర్చించినట్లు తెలిసింది. ఆయన అనుమతితో ఈ స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరూ? రజనీకాంత్గా ఎవరు నటిస్తారూ? అన్న విషయాల గురించి ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తం మీద రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కనుందన్న ప్రచారం మాత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరి ఇది హిందీలోనే రూపొందుతుందా? లేక పాన్ ఇండియా చిత్రంగా రానుందా? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
ఆ విషయం తెలిశాక ఖుష్బు తట్టుకోలేకపోయింది: సుందర్
తమిళ నటుడు, నిర్మాత సుందర్ సి కోలీవుడ్లో పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆయన అరణ్మనై-4తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. నటుడిగా స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈరోజే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సుందర్ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్నారు. తాజా ఇంటర్వ్యూలో తన భార్య ఖుష్బు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఖుష్బుకు పిల్లలు పుట్టరనే విషయం తెలియడంతో తాను తీవ్ర భావోద్వేగానికి గురైందని వెల్లడించారు.సుందర్ మాట్లాడుతూ..'ఇదంతా మా పెళ్లికి ముందు జరిగింది. అప్పుడు ఖుష్బు అనారోగ్యంతో ఉంది. తనకు పిల్లలు పుట్టరని ఒక వైద్యుడు చెప్పాడు. దీంతో నన్ను వేరే పెళ్లి చేసుకోమని ఖుష్బు ఏడుస్తూ చెప్పింది. కానీ నేను తననే వివాహం చేసుకోవాలకున్నా. నా జీవితంలో సంతానం లేకపోయినా సరే తననే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాను. కానీ దేవుడు మమ్మల్ని మరోలా దీవించాడు. ప్రస్తుతం మాకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.' అని తెలిపారు.సుందర్ దర్శకత్వం వహించిన అరణ్మనై- 4 తెలుగులో బాక్ పేరుతో విడుదల అవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్లో విడుదల కావాల్సి ఉండగా మే 3కి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఖుష్బు నిర్మించారు. ఈ చిత్రంలో యోగి బాబు, వీటీవి గణేష్, ఢిల్లీ గణేష్, కోవై సరళ కూడా నటించారు. ఈ ఫ్రాంచైజీలో మొదటి చిత్రం 2014లో విడుదల కాగా.. 2016లో పార్ట్-2 రిలీజైంది. 2021లో విడుదలైన మూడవ భాగం విడుదలైంది. -
రూ.కోటి రూపాయలు విరాళం ప్రకటించిన ప్రముఖ నటుడు
దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించి చాలా కాలమే అయ్యింది. అయితే నిధుల కొరత కారణంగా భవన నిర్మాణ కార్యక్రమాలు నిలిచిపోయాయి. అయితే దీన్ని పూర్తి చేయడానికి ప్రస్తుత కార్యవర్గం నడుం బిగించింది. భవన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రూ.40 కోట్ల వరకూ అవసరం అవుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. అందుకోసం నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు. బ్యాంకు నుంచి కొంత రుణం తీసుకుంటున్నట్లు సంఘం కార్యదర్శి విశాల్ ఇటీవల తెలిపారు. కాగా సంఘం నూతన భవన నిర్మాణం కోసం సినీ ప్రముఖులు పలువురు పెద్ద మొత్తంలో నిధిని విరాళంగా అందిస్తున్నారు. నటుడు, నిర్మాత, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉదయనిధిస్టాలిన్ ఇటీవల కోటి రూపాయలను విరాళంగా అందించారు. అదే విధంగా నటుడు, మక్కల్ నీతి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్, నటుడు విజయ్ కూడా కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. కాగా ఇటీవల నటుడు శివకార్తికేయన్ రూ. 50 లక్షలు విరాళం అందించారు. కాగా తాజాగా ప్రముఖ నటుడు నెపోలియన్ రూ.కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈయన 2000 నుంచి 2006 వరకూ నడిగర్ సంఘానికి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించారన్నది గమనార్హం. ఇప్పుడు కోటి రూపాయలను నూతన భవన నిర్మాణానికి విరాళంగా అందించడంతో ఆయనకు సంఘ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలుపుతూ మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. కాగా ఇటీవలే నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. రాజకీయ జీవితంనెపోలియన్ తన మామ, డిఎంకె నాయకుడు కెఎన్ నెహ్రూకి సహాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి 2001లో విల్లివాకం నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన 2006లో జరిగిన ఎన్నికల్లో మైలాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయి అనంతరం 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెరంబలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచి ఎంపీగా గెలిచారు. 2009 నుంచి 2013 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. నెపోలియన్ 2014లో డీఎంకే పార్టీకి రాజీనామా చేసి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. -
అజిత్కి జోడీగా...
కోలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా నిలిచిన వార్తల్లో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సిమ్రాన్, మీనా పేర్లు వినిపిస్తున్నాయి.ఈ ఇద్దరూ అతిథి పాత్రల్లో కాదు.. అజిత్ సరసన హీరోయిన్లుగా నటిస్తారని టాక్. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో అజిత్ మూడు పాత్రల్లో కనిపిస్తారట. మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, శ్రీలీల, సిమ్రాన్, మీనాతో అజిత్ జతకడతారని చెన్నై కోడంబాక్కమ్ అంటోంది. ఈ వార్త నిజమైతే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సిమ్రాన్, మీనా అజిత్తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. ‘అవళ్ వరువాళా (1998), వాలి’ (1999) వంటి విజయవంతమైన చిత్రాల్లో అజిత్ సరసన నటించారు సిమ్రాన్.అలాగే అజిత్కి జోడీగా ‘సిటిజెన్ (2001), విలన్’ (2002) వంటి చిత్రాల్లో నటించారు మీనా. ఇప్పుడు మళ్లీ ఈ హీరో సరసన సిమ్రాన్, మీనా నటిస్తే దాదాపు రెండు దశాబ్దాలకు ఈ కాంబినేషన్ కుదిరినట్లు అవుతుంది. మేలో ఈ చిత్రం షూటింగ్ని ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. సో... అజిత్ సరసన శ్రీలీల, సిమ్రాన్, మీనా నటించనున్నారా? అనేది త్వరలో తెలిసి΄ోతుంది. మహేశ్బాబు సినిమాలో...మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు సిమ్రాన్ని ఎంపిక చేశారని సమాచారం. గతంలో ‘యువరాజు’ (2000) చిత్రంలో మహేశ్బాబు–సిమ్రాన్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అయితే హీరో–హీరోయిన్గా కాదని, సిమ్రాన్ది అతిథి పాత్ర అని భోగట్టా. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను రాజమౌళి ప్రకటించనున్నారట. మరి.. సిమ్రాన్ ఈప్రాజెక్ట్లో ఉన్నారా? లేదా అనే ప్రశ్నకు అప్పుడు సమాధానం దొరుకుతుంది. -
స్టార్ హీరోకు కూతుర్ని.. నన్నే రూమ్కు వస్తావా అన్నాడు: వరలక్ష్మీ శరత్ కుమార్
కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ వరుస సినిమాలతో ట్రెండింగ్లో కొననసాగుతుంది. ఇండస్ట్రీలో ఒక ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందడమే కాకుండా అందుకు తగ్గట్లుగా.. తన మాట కూడా చాలా స్ట్రైట్గా ఉంటుంది. తప్పు చేస్తే ఎదుట ఉన్నది ఎంతటివారైనా సరే ముక్కు సూటిగా హెచ్చరిస్తుంది. తాజాగా ఆమె నటించిన లేడీ ఓరియెంటేడ్ సినిమా 'శబరి' మే 3న విడుదల కానుంది.సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా తన గతంలో జరిగిన ఒక సంఘటన గురించి పంచుకుంది. 'ఒక అమ్మాయి ఇండస్ట్రీలో రాణించడం అంత సులభం కాదు. నాన్నకు ఇష్టం లేకున్నా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. నేను హీరోయిన్గా పేరుపొందుతున్న రోజుల్లో తమళనాడుకు చెందిన ఒక టీవీ ఛానల్ అధినేత నా ఇంటికి వచ్చాడు. ఒక ప్రాజెక్ట్లో నటించాలని కోరాడు.. అందుకు నేను కూడా ఒప్పుకున్నాను. కానీ, కొంత సమయం తర్వాత మనం మళ్లీ బయట కలుద్దామా..? అన్నాడు. ఎందుకు సార్ అని నేను అడిగిన వెంటనే.. ఏదైనా మాట్లాడుకుందాం రూమ్ బుక్ చేస్తాను కలుద్దాం అన్నాడు. ఒక స్టార్ హీరో కుటుంబానికి చెందిన నన్నే ఇలా అడిగితే మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటి అని అతని మీద కేసు పెట్టాను. ఈ సంఘటన సుమారు ఆరేళ్ల క్రితం జరిగింది. ఇలాంటి వ్యక్తుల ఆటకట్టించాలని నేను 'సేవ్ శక్తి ఫౌండేషన్' స్థాపించాను.' అని ఆమె చెప్పింది.స్టార్ హీరో కూతురిని అయనంత మాత్రాన నాకు అవకాశాలు రాలేదు.. నన్ను కూడా చాలా సినిమాల్లో నుంచి తొలగించారు. కొంతమంది కమిట్మెంట్ అడగడం వల్ల చాలా సినిమాలను వదులుకోవాల్సి కూడా వచ్చిందని వరలక్ష్మీ తెలిపింది. సేవ్ శక్తి ఫౌండేషన్ ద్వారా చాలామంది ఆడబిడ్డలను రక్షించామని ఆమె చెప్పింది. ఎలాంటి ఆపద అయినా సరే తమ ఫౌండేషన్లోకి వచ్చి సాయం అడిగితే తప్పకుండా జరుగుతుందని ఆమె పేర్కొంది. -
ఓటేసేందుకు అమెరికా నుంచి వచ్చిన స్టార్ హీరో కూతురు
ఏప్రిల్ 26న కర్ణాటకలో రెండో దశ ఎన్నికలు జరిగాయి. సామాన్య ప్రజలతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా ప్రజలు తమ గ్రామాలకు చేరుకుని ఓటు వేశారు. ఈ కోవలో కన్నడ టాప్ హీరో దునియా విజయ్ కూతురు మోనిషా కూడా ఉన్నారు.ఇదిలా ఉంటే దునియా విజయ్ కూతురు మోనిషా అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదువుతుంది. ఏప్రిల్ 26న ఎన్నికలు ఉండటంతో తన ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు ఆమెరికా నుంచి బెంగళూరుకు చేరుకుంది. తండ్రి మాదిరి మోనిషా కూడా సినిమా రంగంలో రాణించాలని కోరుకుంటుంది. ఈ విషయంపై ఆమె ఇలా చెప్పింది. 'నేనూ, మా చెల్లి మోనికా ఇద్దరమూ సినిమా రంగంపై ఆసక్తి చూపుతున్నాం. నాన్నకు మొదట నచ్చలేదు. సినిమాల్లోకి వద్దని ఆయన చెప్పారు. కానీ, నా సీరియస్నెస్ చూసి ఒప్పుకున్నారు.సినిమా ఇండస్ట్రీకి వస్తే సరైన శిక్షణ తీసుకోవాలని నాన్న గారు సూచించారు. నటనతో పాటు సినిమాల్లోని వివిధ దశలు, సాంకేతికత, మీడియాను ఎలా ఎదుర్కోవాలి, నన్ను నేను ఎలా రక్షించుకోవాలి.. ఇలా అన్నీ సరిగ్గా నేర్చుకుని రావాలని నాన్న సూచించారు. దీంతో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నన్ను చేర్పించారు. ప్రస్తుతం అక్కడే చదువుకుంటున్నాను. కోర్సు పూర్తయ్యాక శాండల్ వుడ్కి తప్పకుండా వస్తాను.' అని చెప్పింది మోనిషా.బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు దునియా విజయ్. కన్నడలో ఎన్నో సినిమాలు చేసిన ఆయనకు తెలుగులో ఇదే మొదటి చిత్రం. ప్రస్తుతం ఆయన గోపీచంద్ చిత్రంలో నటిస్తున్నాడు. -
ఇరవయ్యేళ్ల తర్వాత యాభైఆరవ చిత్రంలో...
మాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ హిట్ పెయిర్ మోహన్లాల్, శోభనల జోడీ రిపీట్ కానుంది. మోహన్లాల్ హీరోగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఎమ్. రంజిత్ ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో శోభన కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాలో భాగమైనట్లుగా సోషల్ మీడియాలో శోభన ఓ వీడియో షేర్ చేశారు. ‘‘మోహన్లాల్గారి ఈ 360వ సినిమాలో నేను నటించనున్నాను. నాకు గుర్తు ఉన్నంతవరకు ఆయనతో నేను కలిసి చేయబోతున్న 56వ చిత్రం ఇది’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు శోభన. ఇక 1985లో వచ్చిన మలయాళ చిత్రం ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’లో తొలిసారి కలిసి నటించారు మోహన్లాల్, శోభన. ఆ తర్వాత ఈ ఇద్దరూ ‘మణిచిత్ర తాళు’ (ఈ సినిమా ఆధారంగానే ‘చంద్రముఖి’ తీశారు), ‘నాడోడిక్కట్టు’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 1994లో వచ్చిన మలయాళ చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’లో మెహన్లాల్, శోభన లీడ్ రోల్స్లో నటించారు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మోహన్లాల్, శోభన కలిసి నటించనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. 2009లో వచ్చిన మలయాళ చిత్రం ‘సాగర్ ఆలియాస్ జాకీ రీలోడెడ్’లో మోహన్లాల్ హీరోగా నటించగా, శోభన ఓ అతిథి పాత్ర చేశారు. -
గ్రీన్సిగ్నల్
మలయాళ చిత్రం ‘డియర్ స్టూడెంట్స్’ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు నయనతార. మలయాళ నటుడు నివిన్ ΄పౌలి నటించనున్న చిత్రం ‘డియర్ స్టూడెంట్స్’. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించనున్నారామె. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించి, ‘డియర్ స్టూడెంట్స్’ చిత్రంలో నయనతార నటిస్తున్నట్లు ఓ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. సందీప్ కుమార్ అండ్ జార్జ్ ఫిలిప్ రాయ్ ద్వయం ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. నివిన్ ΄పౌలికి చెందిన ΄పౌలి జూనియర్ పిక్చర్స్, కర్మ మీడియా నెట్వర్క్ ఎల్ఎల్పీ, రౌడీ పిక్చర్స్ అండ్ అల్ట్రా కలిసి ‘డియర్ స్టూడెంట్స్’ చిత్రాన్ని నిర్మించనున్నాయి. -
కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం
తమిళ నూతన సంవత్సరాది (ఏప్రిల్ 14) సందర్భంగా కోలీవుడ్లో కొత్త ఉత్సాహం కనిపించింది. స్టార్ హీరో సినిమాల కొత్త లుక్లు, సరికొత్త అనౌన్స్మెంట్లతో తమిళ చిత్ర పరిశ్రమ కళకళలాడింది. ఈ విశేషాలపై కథనం.. భారతీయుడు వస్తున్నాడు భారతీయుడు మళ్లీ వస్తన్నాడు. హీరో కమల్హాసన్ , దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా 1996లో విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. తాజాగా ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను రూ΄÷ందించారు కమల్హాసన్ , శంకర్. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’) చిత్రానికి సంబంధించిన పోస్ట్ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మే నెలాఖరులో ‘ఇండియన్ 2’ ట్రైలర్, జూన్ లో సినిమా రిలీజ్కి సన్నాహాలు చేస్తున్నామని చిత్రయూనిట్ పేర్కొంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్స్ను విడుదల చేశారు మేకర్స్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ‘ఇండియన్ 2’ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్, ఎస్జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ ఏడాదే కంగువ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ సినిమాలో దిశా పటానీ, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. కేఈ జ్ఞానవేల్రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానున్నట్లు చిత్రయూనిట్ స్పష్టం చేసింది. డిఫరెంట్ టైమ్లైన్స్లో జరిగే ఈ చిత్రంలో సూర్య నాలుగైదు గెటప్స్లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. విజిల్ పోడు విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘విజిల్ పోడు..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మదన్ కర్కే లిరిక్స్ అందించిన ఈ పాటను విజయ్, వెంకట్ప్రభు, యువన్ శంకర్ రాజా, ప్రేమ్గీ ఆలపించారు. ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. రాయన్ రెడీ ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. నార్త్ చెన్నై బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాసు జయరాం లీడ్ రోల్స్ చేయగా, సెల్వరాఘవన్, ప్రకాష్రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ను విడుదల చేసి, త్వరలోనే పాటలను రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. సన్పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ధనుష్ కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘రాయన్’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని కోలీవుడ్ సమాచారం. డబుల్ ధమాకా తమిళ కొత్త సంవత్సరంలో జోష్ పెంచారు రాఘవా లారెన్స్. ఆయన హీరోగా రెండు కొత్త సినిమాలను ప్రకటించారు. వాటిలో ఒక మూవీకి ‘హంటర్’ అనే టైటిల్ ఖరారైంది. రాఘవా లారెన్స్ కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్కు వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తారు. గోల్డ్మైన్ టెలీ ఫిలింస్, మనీష్ షా, సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ‘బెంజ్’ అనే కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లారెన్స్. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు కథ అందించారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీని సుధన్ సుందరం, లోకేష్ కనగరాజ్, జగదీష్ పళనిస్వామి నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని మరికొన్ని సినిమాల అప్డేట్స్ కూడా వచ్చాయి. -
రామాయణంకి ఎంతైనా కష్టపడతాను: యశ్
‘‘నమిత్, నేను కలిసి రామాయణంపై మూవీ చేస్తే బాగుంటుందని చాలా సార్లు అనుకున్నాం. కానీ, అంత పెద్ద సబ్జెక్టు తియ్యాలంటే అది మామూలు విషయం కాదు.. బడ్జెట్స్ కూడా సరిపోవు.. అందుకే నేను కూడా కో ప్రోడ్యూస్ చెయ్యాలనుకున్నాను. ఈ ‘రామాయణం’ కోసం ఎంతైనా కష్టపడతాను’’ అన్నారు ‘కేజీఎఫ్’ ఫేమ్ హీరో యశ్. ఆయన నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి రామాయణం నేపథ్యంలో ఓ సినిమా నిర్మించనున్నాయి. ఈ చిత్రానికి నితీష్ తివారి దర్శకుడు. నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తీయడంలో న్యాయం చేయగలను అనిపిస్తోంది’’ అన్నారు. కాగా నితీష్ తివారి దర్శకత్వంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ‘రామాయణ్’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికే నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాతలనే టాక్ వినిపిస్తోంది. -
కాన్స్ చిత్రోత్సవంలో భారతీయ చిత్రాలు
భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రం చరిత్ర సృష్టించింది. కాన్స్ చలన చిత్రోత్సవంలో ప్రధాన విభాగంగా భావించే పామ్ డ ఓర్’ అవార్డు పోటీలో నిలిచింది ఈ మలయాళ చిత్రం. ముంబైకి చెందిన పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పామ్ డ ఓర్’ అవార్డు కోసం పోటీలో నిలిచినట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ఏడాది కాన్స్ చిత్రోత్సవం మే 15 నుంచి 25 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఈ ఫెస్టివల్కు సంబంధించిన అవార్డులు, స్క్రీనింగ్ కానున్న సినిమాల జాబితాను ప్రకటించారు నిర్వాహకులు. కాన్స్లో అత్యధిక బహుమతిని అందించే పామ్ డ ఓర్’ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’తో పాటు అమెరికన్ ఫిల్మ్ ‘అనొర’, యూకే ఫిల్మ్ ‘ఓహ్.. కెనడా’, ఫ్రెంచ్ ఫిల్మ్ ‘బీటింగ్ హార్ట్స్’, పోర్చుగల్ ఫిల్మ్ ‘గ్రాండ్ టూర్’ వంటి దాదాపు 20 చిత్రాలు నిలిచాయి. ఇక ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో బ్రిటిష్ ఇండియన్ దర్శకురాలు సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్’, బల్గేరియన్ దర్శకుడు కోన్స్టాటిన్ బోజనోవ్ దర్శకత్వంలో భారతీయ నటీనటులు భాగమైన ‘ది షేమ్లెస్’ చిత్రాలతో పాటు చైనా ఫిల్మ్ ‘బ్లాక్డాగ్’, ‘సెప్టెంబర్ సేస్’, జపాన్ ఫిల్మ్ ‘మై సన్షైన్’ వంటి 15 చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇక ‘అవుట్ ఆఫ్ కాంపిటిషన్’ విభాగంలో ‘ఫూరియోషియా: ది మ్యాడ్మాక్స్ సాగ’, ‘రూమర్స్’తో పాటు మరో మూడు చిత్రాలు ఉన్నాయి. మిడ్నైట్ స్క్రీనింగ్ విభాగంలో ‘ది సఫర్’తో కలిసి నాలుగు చిత్రాలు, కాన్స్ ప్రీమియర్లో ‘ఇట్స్ నాట్ మీ’తో పాటు ఆరు చిత్రాలు, స్పెషల్ స్క్రీనింగ్ విభాగంలో ‘ది బ్యూటీ ఆఫ్ ఘాజా’తో కలిపి ఐదు చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. మూడు దశాబ్దాల తర్వాత... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పామ్ డ ఓర్’ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ పోటీ పడుతోంది. ఈ విభాగంలో 1994లో మలయాళ చిత్రం ‘స్వాహం’ నామినేషన్ను దక్కించుకున్నా, అవార్డు గెల్చుకోలేకపోయింది. ఈ సినిమాకు షాజీ నీలకంఠన్ కరుణ్ దర్శకత్వం వహించారు. అలాగే ఇదే విభాగంలో అవార్డు గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రం ‘నీచా నగర్’. 1946లో విడుదలైన ఈ హిందీ సినిమాకు చేతన్ ఆనంద్ దర్శకుడు. ‘నీచా నగర్’ చిత్రం తర్వాత ‘అమర్ భూపాలి’, ‘ఆవారా’ వంటి చిత్రాలు పామ్ డ ఓర్’కు నామినేషన్ దక్కించుకున్నా అవార్డు గెల్చుకోలేకపోయాయి. 30 ఏళ్లకు ఈ విభాగంలో పోటీ పడుతున్న భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’కు అవార్డు వస్తుందా? అనేది చూడాలి. ఈసారి పామ్ డ ఓర్’ విభాగంలో విజేతను నిర్ణయించే జ్యూరీ అధ్యక్షురాలిగా అమెరికన్ నటి గ్రెటా గెర్విక్ వ్యవహరిస్తున్నారు. ఆల్ వీ ఇమాజిన్... కథేంటంటే... కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ప్రభ, అనులు ముంబైలో పని చేస్తుంటారు. ఈ ఇద్దరూ వారి వారి రిలేషన్షిప్స్లో ఇబ్బందులు పడుతుంటారు. అలా ఈ ఇద్దరూ ఓ రోడ్ ట్రిప్కు వెళ్లినప్పుడు ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రం కథాంశమని సమాచారం. ఈ మలయాళ చిత్రానికి రచయిత–దర్శకురాలు, ఎడిటర్ పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. ఇక పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ కూడా ఇదే కావడం విశేషం. గతంలో పాయల్ దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’ 2015లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్కు ఎంపిక అయింది. అలాగే పాయల్ దర్శకత్వంలో వచ్చిన మరో డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ 2021లో జరిగిన కాన్స్ ఫెస్టివల్లో ‘గోల్డెన్ ఐ’ అవార్డును గెలుచుకుంది. మరి.. ఈసారి కూడా పాయల్ అవార్డును గెలుస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సంతోష్ కథేంటంటే... బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరికి దర్శకురాలిగా ‘సంతోష్’ తొలి చిత్రం. ఉత్తర భారతదేశంలోని ఓ గ్రామం నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుంది. వితంతువు సంతోష్కి తన భర్త చేసే పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం దక్కుతుంది. బలహీన వర్గానికి చెందిన ఓ అమ్మాయిపై జరిగిన అత్యాచారం, ఆ పై హత్యకు సంబంధించిన కేసుని ఛేదించే దర్యాప్తు బృందంలో సంతోష్ భాగం అవుతుంది. ఈ కేసుని ఆమె ఎలా హ్యాండిల్ చేసింది? అనేది కథాంశం. మరి.. ఈ చిత్రం కూడా అవార్డు దక్కించుకుంటుందా? చూడాలి. -
‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్కు సిస్టర్గా కరీనా కపూర్?
‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కరీనా కపూర్ ఓ హీరోయిన్గా నటించనున్నారన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో కరీనాది హీరోయిన్ పాత్ర కాదని, యశ్కు అక్క పాత్రలో ఆమె కనిపించనున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం గతంలో శ్రుతీహాసన్, సాయిపల్లవి వంటి వార్ల పేర్లు తెరపైకి రాగా, తాజాగా కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. మరి.. యశ్కు సిస్టర్ పాత్రలో కరీనా కనిపిస్తారా? యశ్తో కియారా జోడీ కడతారా? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. -
సౌత్ ఎంట్రీపై రూమర్స్.. హింట్ ఇచ్చిన కరీనా
ఉత్తరాది హీరోయిన్లు శిల్పా శెట్టి, ప్రీతీ జింతా, రవీనా టాండన్, కత్రినా కైఫ్ వంటివారు గతంలో సౌత్లో సినిమాలు చేశారు. ఆ తర్వాత కంగనా రనౌత్, ఈ రెండు మూడేళ్లల్లో శ్రద్ధా కపూర్, అలియా భట్ వంటి వారు దక్షిణాదిలో.. మరీ ముఖ్యంగా తెలుగు చిత్రాల్లో నటించారు. తాజాగా ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’తో దీపికా పదుకోన్, ఎన్టీఆర్ ‘దేవర’తో జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక మరో బాలీవుడ్ ప్రముఖ తార కరీనా కపూర్ సౌత్ సినిమాకి సై అన్నారని తెలుస్తోంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా రూపొందుతున్న కన్నడ చిత్రం ‘టాక్సిక్’లో కరీనా ఓ కీలక పాత్ర చేయనున్నారట. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కరీనా.. యశ్తో నటించాలనుంది అన్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్తో ‘‘దక్షిణాదిలోని ఓ స్టార్ హీరో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో నటించనున్నాను. సౌత్లో నాకిది ఫస్ట్ మూవీ. షూటింగ్లో పాల్గొనే టైమ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’’ అని కరీనా చెప్పారు. దాంతో ‘టాక్సిక్’ చిత్రాన్ని ఉద్దేశించే ఆమె ఈ విధంగా పేర్కొన్నారనే ఊహాగానాలు ఉన్నాయి. -
కల నిజమైంది
హీరో విశాల్ దర్శకుడిగా మారారు. 2017లో విశాల్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘తుప్పరివాలన్ ’ (తెలుగులో ‘డిటెక్టివ్’). మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘డిటెక్టివ్ 2’ను ప్లాన్ చేశారు విశాల్. అయితే కొంతకాలం క్రితం క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్ తప్పుకున్నారు. దీంతో ‘డిటెక్టివ్ 2’ కోసం విశాల్ దర్శకుడిగా మారారు. ‘‘డైరెక్టర్ కావాలన్న నా కల నిజమైంది. నా దర్శకత్వంలో రానున్న తొలి సినిమా ‘తుప్పరివాలన్ 2’. ఈ సినిమా కోసం లండన్ వెళ్తున్నాను. అజర్బైజాన్ , మల్తా లొకేషన్స్ లో చిత్రీకరణ జరగుతుంది. నా కలను నాకు మరింత చేరువ చేసిన మిస్కిన్ గారికి ధన్యవాదాలు’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు విశాల్. ఇక విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రత్నం’ ఏప్రిల్ 26న విడుదల కానుంది. హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. -
ఫీల్డ్ ఆఫ్ డ్రీమ్స్ ఫార్మాట్లో ఆస్కార్
ఆస్కార్ అవార్డు వేడుకలను వీలైనంత ఎక్కువమంది వీక్షకులకు చేరువ చేయాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది ఆస్కార్ అవార్డు కమిటీ. ఇందులో భాగంగా ఈ ఏడాది ‘ఫీల్డ్ ఆఫ్ డ్రీమ్స్’ ఫార్మాట్ను పునరుద్ధరించాలని అనుకుంటోందట. అప్పటి వరకూ జరిగిన అవార్డు వేడుకల్లో ఆస్కార్ గెలుచుకున్న ఐదుగురు స్టార్స్ తాజా వేడుకలో పాల్గొని, విజేతలను ప్రకటించి, అవార్డును ప్రదానం చేయడమే ఈ ఫార్మాట్ ఉద్దేశం. గతంలో (2009) జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో ఈ విధానాన్ని పాటించారు. ‘ఫీల్డ్ ఆఫ్ డ్రీమ్స్’ పేరిట అప్పటి అవార్డు వేడుకలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆ తర్వాత జరిగిన వేడుకల్లో ఈ ఫార్మాట్ని ఫాలో కాలేదు. పదిహేనేళ్లకు ఈసారి ఈ విధానాన్ని పునరుద్ధరించాలని కమిటీ భావిస్తోందట. మాజీ ఆస్కార్ విజేతలు తాజా విజేతలను ప్రకటించి, అవార్డును ప్రదానం చేయడం అనేది చూడ్డానికి కనువిందుగా ఉందని 2009లో జరిగిన అవార్డు వేడుకలో పలువురు పేర్కొన్నారు. వీక్షకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చిందట. కాగా, కరోనా తర్వాత ఆస్కార్ అవార్డు వేడుకల వీక్షకుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టిందని హాలీవుడ్ అంటోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ సంఖ్యలో వీక్షకులను రాబట్టడానికి గతంలో సక్సెస్ అయిన ఈ ఫార్మాట్ని పునరుద్ధరించాలని కమిటీ భావించిందని హాలీవుడ్ భోగట్టా. అయితే ఈ ‘ఫీల్డ్ ఆఫ్ డ్రీమ్స్’ నటీనటుల విభాగానికి మాత్రమే వర్తిస్తుంది. ఇక ఈ నెల 10న లాస్ ఏంజిల్స్లో (భారత కాలమానం ప్రకారం మార్చి 11) ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. మూడేళ్లుగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన జిమ్మీ కెమ్మెల్ ఈసారీ ఆ బాధ్యతను నిర్వర్తించనున్నారు. మరి.. వార్తల్లో ఉన్నట్లుగా ‘ఫీల్డ్ ఆఫ్ డ్రీమ్స్’ ఫార్మాట్ని కమిటీ రీ విజిట్ చేసిందా? లేదా అనేది ఆ రోజు తెలిసిపోతుంది. -
ధ్రువ్కు జోడీగా..?
తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ వ్రికమ్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జోడీగా కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ధ్రువ్ విక్రమ్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనుంది. కబడ్డీ ప్లేయర్ మానతీ గణేశన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు అనుపమా పరమేశ్వరన్ను తీసుకున్నారట. అనుపమాకి ఇటీవల మారి సెల్వరాజ్ ఈ కథను వినిపించగా, ఈ బ్యూటీ ఆల్మోస్ట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. మరి.. ధ్రువ్ విక్రమ్కు జోడీగా అనుపమా పరమేశ్వరన్ కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 15న తమిళనాడులోని తూత్తుకూడిలో ప్రారంభం కానుందని సమాచారం.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement