కొండకోనల్లో జయకేతం ఎగురవేశారు...వనాలతో వందనాలు అందుకున్నారు... గూడాల ప్రజల గుండెల్లో నిండిపోయారు...సౌకర్యాలు లేకపోయినా... సాహసంగా పరిస్థితులకు సవాల్ విసిరి గెలిచిచూపించారు...అహర్నిశలు శ్రమిస్తున్నారు... కార్యసాధనలో చేవ చూపుతున్నారు... నిర్మాణాత్మకంగా వ్యహరిస్తూ... శక్తి స్వరూణులుగా నిలుస్తున్నారు జిల్లాలో మహిళా ప్రజాప్రతినిధులు.
● లాలనలో .. పాలనలో సత్తా చాటుతున్న గిరి మహిళలు ● నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
పాడేరు/కొయ్యూరు/చింతూరు/అనంతగిరి : ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుందన్నారు మహాకవి గురజాడ. ఆయన మాటను నిజం చేస్తూ.. ఆకాశమే హద్దుగా సత్తా చాటుతామంటున్నారు నేటి మహిళలు. ఆలన–పాలన నుంచి ఆర్మీ, అంతరిక్షం వరకు ఎందాకై నా వెళ్లే సాహసం వారి సొంతం.
ఏదైనా సాధించగల ఆత్మవిశ్వాసం వారి ఆయుధం. లాలిస్తారు. అవసరమైతే కాఠిన్యం చూపిస్తారు. సమాజంలోని పరిస్థితులు మారాయి. రాజకీయ, వ్యాపార, వైద్యం తదితర రంగాల్లో గిరి మహిళలు తమ ప్రతిభ చూపుతున్నారు. పిల్లల లాలనలోనే కాదు ప్రజా పాలనలోనూ ముందుంటాం అంటున్నారు. రాజకీయాల్లో సత్తా చాటుతూ పురుషులకు తామేమీ తీసిపోమంటూ విజయాలు కై వశం చేసుకుంటున్నారు. అధికార పీఠం అధిరోహించి.. అడవి బిడ్డల సేవలో తరిస్తున్న ఆ మహిళామూర్తులు తరిస్తున్నారు.