భర్తను హత్య చేసిన భార్యకు రిమాండ్‌ | Sakshi
Sakshi News home page

భర్తను హత్య చేసిన భార్యకు రిమాండ్‌

Published Mon, Sep 4 2023 1:38 AM

మాట్లాడుతున్న అదనపు ఎస్పీ ప్రతాప్‌శివకిశోర్‌ - Sakshi

చింతపల్లి రూరల్‌: భర్తను హత్య చేసిన భార్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్‌ శివకిశోర్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులకు తెలిపిన వివరాలివి. జి.కె వీధి మండలం సపర్లకు చెందిన కొర్ర కృష్ణారావు, గెమ్మిల వీరమ్మ దంపతులు గత బుధవారం గొడవ పడ్డారు. గొడవ ముదిరి వీరమ్మ భర్త కృష్ణారావును గొడ్డలితో తలపై కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన కృషారావును ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు.

ఈ ఘటనపై కృష్ణారావు తల్లి కోర్రా లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జి.కె వీధి సీఐ అశోక్‌కుమార్‌, సీలేరు ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కృష్ణారావుకు గతంలో పైళ్లె ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతని భార్య రెండేళ్ల క్రితం మృతి చెందడంతో అదే గ్రామంలో భర్త చనిపోయి ఉంటున్న వీరమ్మను వివాహమాడాడు. తన మొదట భార్య పిల్లలను వీరమ్మ సరిగ్గా చూడటం లేదనే భావనతో పాటు ఒకరిపై ఒకరు అనుమానంతో ఇద్దరూ నిత్యం గొడవ పడేవారు. పిల్లలను హాస్టల్‌లో చేర్పించి, వీరమ్మ పిన్ని ఇంట్లో చట్రపల్లిలో నివాసముంటుంది.

ఇద్దరూ తరుచూ గొడవలు పడడంతో విసుగు చెందిన వీరమ్మ అతని అడ్డు తొలగించుకోవాలని కృషారావు తలపై గొడ్డలితో మూడుసార్లు కొట్టింది. దీంతో తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన కృష్ణారావును ఆస్పత్రికి తరలించగా గురువారం మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఆధారాలు సేకరించి వీరమ్మను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

Advertisement
Advertisement