ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు | Sakshi
Sakshi News home page

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

Published Sun, Nov 12 2023 1:30 AM

బాధిత లైన్‌మెన్‌ ఇస్రాయిల్‌   - Sakshi

అనంతపురం అర్బన్‌/ క్రైం:ప్రజలకు మంత్రి ఉష శ్రీచరణ్‌, కలెక్టర్‌ గౌతమి, ఎస్పీ అన్బురాజన్‌, జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ చీకట్లను పారదోలి ప్రజల జీవితాల్లో మరిన్ని కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే దీపావళి పర్వదినాన జాగ్రత్తలతో టపాసులు కాల్చాలని... పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.

రేపు ‘స్పందన’ రద్దు

అనంతపురం అర్బన్‌: దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ నెల 13న సెలవు ఉన్నందున ఆ రోజున కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ‘స్పందన’ కార్యక్రమం రద్దు చేసినట్లు డీఆర్‌ఓ గాయత్రీదేవి తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించి అర్జీలు ఇచ్చేందుకు ఎవ్వరూ జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు.

టీడీపీ నేతల దాష్టీకం

సచివాలయ లైన్‌మెన్‌పై దాడి

తాడిపత్రిటౌన్‌: విద్యుత్తు బిల్లు చెల్లించాలని అడిగిన లైన్‌మెన్‌పై టీడీపీ నాయకులు దాష్టీకం ప్రదర్శించారు. చెప్పుతో దాడి చేసి అవమానపరిచారు. బాధితుడు తెలిపిన మేరకు... యర్రగుంటపల్లిలో ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో విజిలెన్స్‌ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో టీడీపీ నాయకుడు నారాయణస్వామి ఇంటిలో అక్రమంగా విద్యుత్‌ వినియోగిస్తున్నట్లు గుర్తించి జరిమానా విధించారు. తమకు ఫైన్‌ పడటానికి సచివాలయ లైన్‌మెన్‌ ఇస్రాయిలే కారణమని నారాయణస్వామి కక్ష పెంచుకున్నాడు. తాజాగా నవంబర్‌లో అసెస్మెంట్‌, కాంపౌండ్‌ చార్జెస్‌తో కలుపుకొని రూ.5,527 బిల్లు వచ్చింది. ఈ మొత్తం చెల్లించాలంటూ శనివారం ఇంటికి వచ్చిన లైన్‌మెన్‌తో నారాయణస్వామి గొడవకు దిగాడు. నీ వల్లే మాకు ఇంత బిల్లు పడిందంటూ మండిపడ్డాడు. ఇంతలో నారాయణస్వామి కుమారుడు లక్ష్మీనారాయణ అలియాస్‌ శివ ఇంట్లోంచి బయటకు వచ్చి ఆగ్రహంతో ఊగిపోతూ చెప్పుతో లైన్‌మెన్‌పై దాడి చేశాడు. విద్యుత్తు మీటర్‌ తిరగకుండా చేసి.. విజిలెన్స్‌ దాడుల్లో దొరికిపోయి.. బిల్లు అడిగినందుకు తనపై దాడి చేయడంపై బాధితుడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Advertisement
Advertisement