పోలవరంలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన వివరాలిలా.. | Sakshi
Sakshi News home page

Polavaram: సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన వివరాలిలా..

Published Thu, Mar 3 2022 4:35 PM

CM Jagan and Gajendra Singh Shekhawat to Visit Polavaram on 4 March - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఈనెల 4వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పరిశీలించనున్నారు. వీరి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతంలో స్పిల్‌వే, ఫిష్‌ ల్యాడర్, కాఫర్‌డ్యామ్, ఈసీఆర్‌ఎఫ్‌ ప్రాంతాలను పరిశీలించి పనులను వివరాలను సీఈ సుధాకర్‌బాబు నుంచి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు ప్రాంతంలోని మేఘ ఇంజనీరింగ్‌ కార్యాలయంలో ఇంజనీరింగ్‌ అధికారులు, మేఘ ప్రతినిధులతో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై  చర్చించారు. క్వాలిటీ కంట్రోల్‌ సీఈ ఆర్‌.సతీష్‌కుమార్, ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.  

సీఎం పర్యటన వివరాలు ఇలా.. 
ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు 1 పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. ఆ తర్వాత 11.20 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. అక్కడి నుంచి 12.30 గంటలకు పోలవరం డ్యామ్‌ సైట్‌ చేరుకుని పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు పోలవరం డ్యామ్‌ సైట్‌ నుంచి తిరిగి బయలుదేరి 5.30 గంటలకు తాడేపల్లి నివాసం చేరుకుంటారు.

సీఎం సెక్యూరిటీ పరిశీలన
సీఎం సెక్యూరిటీ బృందం సభ్యులు, జాయింట్‌ కలెక్టర్‌ అంబేడ్కర్‌ ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. అడిషనల్‌ ఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ కె.లతాకుమారి, తహసీల్దార్‌ బి.సుమతి, ఎస్సై ఆర్‌.శ్రీను, ఈఈ పి.ఆదిరెడ్డి ఉన్నారు.  

చల్లవారిగూడెం పునరావాస కాలనీలో.. 
జంగారెడ్డిగూడెం రూరల్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఈనెల 4న చల్లవారిగూడెం పునరావాస కాలనీ సందర్శనలో భాగంగా ఏర్పాట్లను బుధవారం చింతలపూడి, పోలవరం ఎమ్మెల్యేలు వీఆర్‌ ఎలీజా, తెల్లం బాలరాజు, ఏఎస్పీ కృష్ణంరాజు పరిశీలించా రు. ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యేలు సూచించారు. ఎంపీపీ కొదమ జ్యోతి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, పట్టణ అధ్యక్షుడు పీపీఎన్‌ చంద్రరావు ఉన్నారు.  

Advertisement
Advertisement