హిందూపురం అర్బన్: పసిడి ధర మరింత పైపెకి ఎగబాకింది. సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది. గురువారం 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర ఏకంగా రూ.70 వేలు మార్కు దాటింది. ఇక వెండి అదే బాటలో పయనిస్తూ కిలో రూ. 82 వేలకు చేరింది. మార్కెట్ వర్గాలు తెలిపిన మేరకు గురువారం 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) రూ.70,620లకు చేరగా, 22 క్యారెట్లు రూ. రూ.64 వేలు పలికింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో జనం బంగారం కొనుగోళ్లపై ఉత్సాహం చూపుతున్నారు.
కానీ రోజురోజుకూ పెరుగుతున్న ధరలు చూసి అల్లాడిపోతున్నారు. మరోవైపు పెరిగిన ధరతో వ్యాపారం సాగక హిందూపురం, ధర్మవరం, పెనుకొండ తదితర పట్టణాల్లోని 500పైగా బంగారం దుకాణాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. అసలే ఎన్నికల సమయం కావడంతో వ్యాపారులు డబ్బు ఒక చోట నుంచి మరో చోటికి తీసుకెళ్లడం కష్టంగా మారింది. బంగారు ఆభరణాల రవాణా పెద్ద ప్రహసనమైంది. ఓవైపు డాలర్ రేటు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ ఉండటంతో ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది.