ఈశాన్య వర్షాలకు వాయుగుండం బ్రేక్‌!  | Sakshi
Sakshi News home page

ఈశాన్య వర్షాలకు వాయుగుండం బ్రేక్‌! 

Published Mon, Oct 23 2023 4:58 AM

Light rain likely in Andhra pradesh - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవ­నాల చురుకుదనానికి వాయుగుండం బ్రేకులు వేసింది. మళ్లీ ఇవి చురుకుదనం సంతరించుకోవడానికి మరి­కొన్ని రోజుల సమయం పట్టనుంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం బలపడి మరో మూడు, నాలుగు రోజులు ఉత్తర ఈశాన్య దిశగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌ తీరాల వైపు ప్రయాణించనుంది.

ఈ వాయుగుండం గాలి­లోని తేమను అటువైపు లాక్కుని పోతుండటంతో ఈశాన్య రుతుపవనాలు మన రాష్ట్రంపై ప్రభావం చూపలేకపోతున్నాయి. ఈ వాయుగుండం తీరాన్ని దాటే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. వాయుగుండం బెంగాల్‌ తీరాన్ని దాటడానికి ఇంకా నాలుగైదు రోజులు పడుతుంది. ఆ తర్వాత మరో రెండు మూడు రోజులకు గాని ఈశాన్య గాలుల్లో తేమ ఏర్పడే పరి స్థితి ఉండదు. అందువల్ల ఈశాన్య రుతుపవనాలు బలం పుంజుకోవడానికి కనీసం వారం రోజులైనా ప డుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తు­న్నా రు. ఏపీలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవాలంటే అప్పటివరకు వేచి ఉండాల్సిందేనని చెబుతున్నారు. 

తీరానికి దూరంగా వాయుగుండం
సాధారణంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం గాని, వాయుగుండం గాని ఏర్పడితే ఏపీలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. కానీ ప్రస్తుత వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే ఏర్పడినప్పటికీ అది తీరానికి దూరంగా ఉంది. పైగా ఈ వాయుగుండం ఆంధ్ర తీరం వైపు కాకుండా బెంగాల్‌ వైపు పయనిస్తూ పునరావృతం) చెందుతుంది. ఫలితంగా ఏపీలో వర్షాలు కురవడం లేదని వాతా వరణ నిపుణులు అంటున్నారు.  రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలకు వారమైనా పట్టవచ్చని చెబుతున్నారు. 

బలపడిన వాయుగుండం.. 
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఆదివారం సాయంత్రానికి తీవ్రవా యుగుండంగా బలపడింది. ఇది ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణంగా 550, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణంగా 710 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్రవాయుగుండం సోమవారం వరకు ఉత్తర దిశగా కదులుతుంది. ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుంటూ రీకర్వ్‌ తీసుకుని బంగ్లాదేశ్‌ తీరం వైపు పయనిస్తుందని ఐఎండీ తెలిపింది

Advertisement
Advertisement