Sakshi News home page

స్టార్టప్‌లకు రూ. కోటి ఫండింగ్‌ 

Published Sun, Dec 3 2023 2:32 AM

For startups Rs Crore funding - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువతను నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) ‘‘లీప్‌ ఎహెడ్‌’’ పేరిట ప్రత్యేక పథకాన్ని చేపట్టింది. ఈ పథకం ద్వారా ప్రారంభ దశలో (స్కేలింగ్‌) ఉన్న స్టార్టప్‌లతో పాటు గ్రోత్‌ స్టేజ్, ప్రోడక్ట్‌ డైవర్సిఫికేషన్, కొత్త ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలో ఉన్న స్టార్టప్‌లకు కోటి రూపాయల వరకు నిధులు సమకూర్చనుంది.

ఈ పథకం కింద ఎంపికైన స్టార్టప్‌లకు మూడు నెలల పాటు హైబ్రీడ్‌ మోడల్‌లో శిక్షణ ఇచ్చి మెంటారింగ్‌ చేస్తూ మార్కెటింగ్, ఫండ్‌ రైజింగ్‌ వంటి అవకాశాలను కల్పి స్తుంది. ఇందుకోసం డిసెంబర్‌ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌టీపీఐ కోరింది. ఇప్పటివరకు రాష్ట్రం నుంచి 75 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 15 స్టార్టప్‌లను ఎంపిక చేసి ఆర్థిక సాయం అందిస్తారు. 

ఎన్‌జీఐఎస్‌ కింద 95 స్టార్టప్స్‌ నమోదు 
స్టార్టప్‌లను ప్రోత్సహించే నెక్టŠస్‌ జనరేషన్‌ ఇంక్యుబేషన్‌ స్కీం (ఎన్‌జీఐఎస్‌) కింద రాష్ట్రంలో 95 స్టార్టప్‌లు నమోదు చేసుకున్నట్లు వినయ్‌కుమార్‌ తెలిపారు. ఇందులో 28 స్టార్టప్స్‌కు రూ.25 లక్షల చొప్పున సీడ్‌ ఫండింగ్‌ అందించినట్లు చెప్పారు.

 రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్స్‌కు ప్రోత్సాహం అందిస్తుండటంతో పలు కాలేజీల్లో ఇంక్యుబేషన్‌ సెంటర్లలో యువత స్టార్టప్స్‌పై ప్రయోగాలు చేస్తున్నారన్నారు. విశాఖలో నాలుగో తరం సాంకేతిక పరిజ్ఞానం పెంచేలా ఏర్పాటు చేసిన కల్పతరువు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ, ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నాస్కామ్‌ ఏర్పాటు చేసిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలు స్టార్టప్స్‌కు మంచి వేదికలుగా మారాయని ఆయన వివరించారు.  

6న విజయవాడలో ఔట్‌రీచ్‌ కార్యక్రమం 
లీప్‌ ఎహెడ్‌ కార్యక్రమంపై విద్యార్థులు, ఔత్సాహిక స్టార్టప్స్‌కు అవగాహన కల్పి ంచడానికి ఈ నెల 6న విజయవాడలో ఔట్‌ రీచ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్‌టీపీఐ విజయవాడ జాయింట్‌ డైరెక్టర్‌ బి.వినయ్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంక్యుబేషన్, స్టార్టప్‌ సెంటర్లు ఉన్న పలు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో కూడా సదస్సులు నిర్వహిస్తామన్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement