సాక్షి, తాడేపల్లి: రాజ్యసభ అభ్యర్థులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని మరోమారు కొనసాగించే అవకాశం ఉంది. మొత్తం ఖాళీ అయిన నాలుగు స్థానాల్లో 50 శాతం స్థానాలకు బీసీలను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ సాయంత్రానికి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, రాష్టం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వి.విజయసాయిరెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభుల పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది. ఆ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. శాసన సభలో పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే నాలుగు స్థానాలూ వైఎస్సార్సీపీ ఖాతాలోకి చేరడం ఖాయం.
ఖాళీ కానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మే 31గా ఈసీ నిర్ణయించింది. జూన్ 1వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3 వరకు గడువు ఉంటుంది. జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.
చదవండి: (సీమసిగలో మెగా పవర్ ప్రాజెక్ట్.. సీఎం జగన్ చేతులమీదుగా శంకుస్థాపన)