గుంటూరు ఎడ్యుకేషన్: శారీరక, మానసిక వికాసానికి క్రీడలు దోహదం చేస్తాయని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ డిగ్రీ కళాశాలలో సోమవారం ఏఎన్యూ అంతర్ కళాశాలల మెన్స్ వాలీబాల్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే గిరిధర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువులకే పరిమితం కాకుండా క్రీడల్లో తప్పనిసరిగా పాల్గొనడం ద్వారా శారీరకంగా, ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, మానసికంగా దృఢంగా తయారవుతారని చెప్పారు. అదేవిధంగా ఇటువంటి పోటీలు ప్రతి క్రీడాకారుడికి ఎన్నో అవకాశాలను కల్పిస్తాయని, క్రీడలను ఉపయోగించుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అన్నారు. ఏఎన్యూ వ్యాయామ విద్య డైరెక్టర్ ఆచార్య పి.జాన్సన్ మాట్లాడుతూ యువ క్రీడాకారులు టోర్నమెంట్లో ప్రతిభా పాఠవాలు చూపడం ద్వారా విశ్వ విద్యాలయ స్థాయిలో రాణించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆడేవిధంగా ఎదగాలని సూచించారు. కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడల్లో రాణించే విధంగా తీర్చిదిద్ది, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడమే కళాశాల లక్ష్యమన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా విద్యార్థులకు క్రీడాకోటాలో ఉద్యోగాలను అందిపుచ్చుకోగలరని చెప్పారు. అనంతరం వివిధ కళాశాలల నుంచి వచ్చిన క్రీడాకారులు జాతీయ జెండాకు వందనం చేసి, మార్చ్ ఫాస్టింగ్ చేశారు. కాగా టోర్నమెంట్ మంగళ, బుధవారాల్లో కొనసాగనుంది. కార్యక్రమంలో కళాశాల కోశాధికారి వి.కృష్ణానంద్, ప్రిన్సిపాల్ ఏబీపీ మనోహర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జి.వెంకటేశ్వరరావు, ఏఎన్యూ పూర్వ వ్యాయామ విద్య డైరెక్టర్ ఆచార్య వై.కిషోర్, జాతీయ వాలీబాల్ జట్టుకు కెప్టెన్గా చేసిన జాగర్లమూడి సింగారావు, ఎస్.నిరంజన్, వ్యాయామ అధ్యాపకులు, కోచ్లు పాల్గొన్నారు.
పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ టీజేపీఎస్ కళాశాలలో ఏఎన్యూ అంతర కళాశాలల మెన్స్ వాలీబాల్ పోటీలు ప్రారంభం