Sakshi News home page

హాజీరా స్టీల్‌ ప్లాంటు పనులు వేగవంతం

Published Fri, Sep 29 2023 5:37 AM

AMNS India Hazira project to be commissioned by 2026 - Sakshi

అహ్మదాబాద్‌: హాజీరా ఉక్కు ప్లాంటు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆర్సెలర్‌మిట్టల్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ లక్ష్మీనివాస్‌ మిట్టల్‌ తెలిపారు. ఇది 2026 నాటికల్లా అందుబాటులోకి రాగలదని ’వైబ్రెంట్‌ గుజరాత్‌’ సదస్సు 20 ఏళ్ల వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టులో దాదాపు 20,000 మంది పైచిలుకు వర్కర్లు పాలుపంచుకుంటున్నారని మిట్టల్‌ చెప్పారు.

ఆర్సెలర్‌మిట్టల్‌లో భాగమైన ఏఎంఎన్‌ఎస్‌ ఇండియా గతేడాది అక్టోబర్‌లో హాజీరా ప్లాంటు సామరŠాధ్యలను 15 మిలియన్‌ టన్నులకు పెంచుకునేందుకు రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు,  తొలి దశలో ఉత్పత్తిని రెట్టింపు చేయాలని, ఆ తర్వాత మూడింతలు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు మిట్టల్‌ చెప్పారు. భారత్‌ దిగుమతులను తగ్గించుకుని, స్వావలంబన సాధించేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు.

జీ20 సదస్సు విజయవంతం కావడం భారత్‌ ఖ్యాతిని మరింతగా ఇనుమడింపచేసిందని మిట్టల్‌ చెప్పారు. అటు, గుజరాత్‌లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి, పెట్టుబడుల రాకకు ఇన్వెస్టర్ల సదస్సు ఎంతగానో ఉపయోగపడుతోందని వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా వెల్‌స్పన్‌ సంస్థ చైర్మన్‌ బీకే గోయెంకా తెలిపారు. సెమీకండక్టర్‌ ఎలక్ట్రానిక్స్‌పై కసరత్తు చేసేందుకు జపానీస్‌ వ్యాపార బృందాన్ని నవంబర్‌లో ఆహా్వనించే యోచనలో ఉన్నట్లు జపాన్‌ ఎక్స్‌టర్నల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ తకాషి సుజుకీ తెలిపారు. తదుపరి వైబ్రెంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సదస్సు వచ్చే ఏడాది జనవరి 10–12 మధ్య గాంధీనగర్‌లో నిర్వహించనున్నారు.  

Advertisement

What’s your opinion

Advertisement