డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ ఐపీవో @ రూ. 500 కోట్లు

22 Oct, 2022 01:22 IST|Sakshi

షేరు ధర శ్రేణి రూ. 197–207

న్యూఢిల్లీ: కేబుళ్లు, వైర్‌ హార్నెస్‌ అసెంబ్లీల తయారీ సంస్థ డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ తాజాగా పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 500 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం షేరు ధర శ్రేణిని రూ. 197–207గా నిర్ణయించింది. ఐపీవో అక్టోబర్‌ 31న ప్రారంభమై నవంబర్‌ 2న ముగుస్తుంది. ఐపీవో కింద కొత్తగా జారీ చేసే ఈక్విటీ షేర్ల పరిమాణాన్ని రూ. 500 కోట్ల నుంచి రూ. 400 కోట్లకు సంస్థ తగ్గించింది.

ప్రమోటర్లు (ఎన్‌సీబీజీ హోల్డింగ్స్, వీఎన్‌జీ టెక్నాలజీ) ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో రూ. 100 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ఇన్వెస్టర్లు కనీసం 72 షేర్లకు బిడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇష్యూలో 75 శాతాన్ని క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు (క్యూఐఐ), 15 శాతాన్ని సంస్థాగతయేతర ఇన్వెస్టర్లకు, 10 శాతాన్ని రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 1,102 కోట్లుగా నమోదైంది. ఆర్డరు బుక్‌ 2020 మార్చి నాటికి రూ. 1,941 కోట్లుగా ఉండగా 2022 మార్చి నాటికి రూ. 2,369 కోట్లకు పెరిగింది. 

మరిన్ని వార్తలు