Sakshi News home page

ఎన్‌సీఎల్‌ఏటీలో గో ఫస్ట్‌కు ఊరట

Published Tue, May 23 2023 7:45 AM

Good news for go first nclt bankruptcy proceedings setback to lessors - Sakshi

న్యూఢిల్లీ: నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎస్‌సీఎల్‌ఏటీ) సోమవారం సంక్షోభంలో ఉన్న ఎయిర్‌లైన్‌ గో ఫస్ట్‌పై దివాలా పరిష్కార ప్రక్రియను సమర్థించింది. దీనితో  సంక్షోభంలో పడిన వాడియా గ్రూప్‌ సంస్థ– గో ఫస్ట్‌  నుండి తమ విమానాలను వెనక్కి తీసుకునేందుకు ఎయిర్‌క్రాఫ్ట్‌ లీజర్లు చేసిన ప్రయత్నాలకు తక్షణం  అడ్డుకట్ట పడింది..  

క్లెయిమ్‌లపై ఎన్‌సీఎల్‌టీకి వెళ్లవచ్చు...
క్లెయిమ్‌లకు సంబంధించి ఎయిర్‌క్రాఫ్ట్‌ లీజర్లు అలాగే  గో ఫస్ట్‌ మధ్యంతర రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ (ఐఆర్‌పీ) నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎస్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించాలని చైర్‌పర్సన్‌ జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల అప్పిలేట్‌ బెంచ్‌ ఆదేశించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్‌కు మే నెల 10వ తేదీన నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) కాస్త ఊరటనిస్తూ,  కంపెనీ స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది. అలాగే ఆర్థిక వ్యవహారాలు, చెల్లింపులకు సంబంధించి మారటోరియం విధించింది. 

మే 4న మధ్యంతర పరిష్కార నిపుణుడిగా (ఐఆర్‌పీ) అభిలాష్‌ లాల్‌ను నియమించడంతో పాటు ఏ ఉద్యోగినీ తీసివేయకూడదని ఆదేశించింది. అలాగే, రద్దయిన మేనేజ్‌మెంట్‌.. తక్షణ ఖర్చుల కోసం రూ. 5 కోట్ల మొత్తాన్ని ఐఆర్‌పీ వద్ద డిపాజిట్‌ చేయాలని సూచించింది. తమ విజ్ఞప్తులను కూడా తెలుసుకున్న తర్వాతే గో ఫస్ట్‌ దివాలా పిటీషన్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ సంస్థకు విమానాలను లీజుకిచ్చిన కంపెనీల అభ్యంతరాలను ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చింది.  దీనితో దివాలా విచారణ పూర్తయ్యే వరకూ ఇతరత్రా దావాల నుంచి గో ఫస్ట్‌కు రక్షణ లభించనట్లయ్యింది.  సంస్థ ఆస్తులను బదిలీ చేయడానికి గానీ రుణ దాతలు రికవర్‌ చేసుకోవడానికి గానీ ఈ ఉత్తర్వు్యలతో వీలుండదు.

Advertisement

What’s your opinion

Advertisement