Greenlam Industries Planning Invest Rs 950 Crores In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

ఏపీలో గ్రీన్‌లామ్‌ పెట్టుబడులు.. విస్తరణకు రూ. 950 కోట్లు కేటాయింపు

Published Tue, Dec 14 2021 3:13 PM

Greenlam Industries Planning Invest Rs 950 Crores In Andhra Pradesh - Sakshi

న్యూఢిల్లీ: సర్ఫేసింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ గ్రీన్‌లామ్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణ బాట పట్టింది. రానున్న రెండు, మూడేళ్లలో రూ. 950 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా మూడో ల్యామినేట్‌ ప్లాంటు ఏర్పాటుతోపాటు.. ప్లైవుడ్, పార్టికల్‌ బోర్డ్‌ బిజినెస్‌లోకి ప్రవేశించనున్నట్లు పేర్కొంది. పూర్తి అనుబంధ సంస్థ గ్రీన్‌లామ్‌ సౌత్‌ లిమిటెడ్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేట వద్ద కొత్త ల్యామినేట్‌ ప్లాంటు, పార్టికల్‌ బోర్డ్‌ తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. మెషీనరీపై రూ. 600 కోట్లు, ల్యామినేట్‌ సామర్థ్యం ఏర్పాటుకు రూ. 225 కోట్లు చొప్పున వెచ్చించనున్నట్లు వివరించింది. 
సామర్థ్య విస్తరణ 
పార్టికల్‌ బోర్డ్స్‌ తయారీకి వీలుగా ఆధునిక సాంకేతికత, పరికరాలు, మెషీనరీ కోసం రూ. 600 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. తద్వారా వార్షికంగా 2,31,000 సీబీఎం సామర్థ్యంతో పార్టికల్‌ బోర్డులను రూపొందించనున్నట్లు తెలియజేసింది. ఈ బాటలో వార్షికంగా 3.5 మిలియన్‌ ల్యామినేట్‌ షీట్లు, బోర్డుల తయారీకి వీలుగా మరో రూ. 225 కోట్లను వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ల్యామినేట్‌ పరిశ్రమలోనే తొలిసారి అత్యంత ఆధునికత కలిగిన సమీకృత సౌకర్యాలతో ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. కొత్తగా చేజిక్కించుకున్న అనుబంధ సంస్థ హెచ్‌జీ ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలో ప్లైవుడ్‌ తయారీకి ప్రత్యేకించిన యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. తమిళనాడులోని టిండివనమ్‌ వద్ద రూ. 125 కోట్ల పెట్టుబడితో 18.9 మిలియన్‌ చరదపు మీటర్ల వార్షిక సామర్థ్యంతో నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. వెరసి కొత్తగా ఏర్పాటు చేయనున్న తయారీ యూనిట్లపై రెండు, మూడేళ్లలో రూ. 950 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు గ్రీన్‌లామ్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ, సీఈవో సౌరభ్‌ మిట్టల్‌ స్పష్టం చేశారు.  
షేర్ల విభజన 
కంపెనీ ఈక్విటీ షేర్లను 1:5 ప్రాతిపదికన విభజించేందుకు బోర్డు అనుమతించినట్లు గ్రీన్‌లామ్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా వెల్లడించింది. వెరసి రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 1 ముఖ విలువగల 5 షేర్లుగా విభజించనుంది. ఈ వార్తల నేపథ్యంలో గ్రీన్‌లామ్‌ షేరు బీఎస్‌ఈలో దాదాపు యథాతథంగా రూ. 1,689 వద్ద ముగిసింది. 

చదవండి: ఏపీలో భళా.. దేశంలో డీలా!

Advertisement
Advertisement