మార్కెట్ల ర్యాలీ బాట- ఐటీ, ఫార్మా జూమ్‌

23 Nov, 2020 15:51 IST|Sakshi

195 పాయింట్లు పెరిగి 44,077 వద్ద నిలిచిన సెన్సెక్స్‌

67 పాయింట్లు బలపడి 12,926 వద్ద ముగిసిన నిఫ్టీ

ఐటీ, ఫార్మా, మెటల్‌, రియల్టీ ప్లస్‌- బ్యాంక్స్‌ వీక్‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.3 శాతం అప్‌

ముంబై, సాక్షి: దేశీ స్టాక్‌ మార్కెట్లలో రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. గత వారం మధ్యలో బ్రేక్‌ పడినప్పటికీ తిరిగి వరుసగా రెండో రోజు మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 44,271ను తాకడం ద్వారా ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. చివరికి 195 పాయింట్లు బలపడి 44,077 వద్ద నిలిచింది. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 12,926 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 12,969కు చేరింది. కోవిడ్‌-19 కట్టడికి వెలువడనున్న వ్యాక్సిన్లపై అంచనాలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆర్‌బీఐ ప్యానల్‌ సూచనల నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీ, స్మాల్‌ బ్యాంకులు తదితర ఫైనాన్షియల్‌ రంగ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది.

బ్యాంక్స్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ, ఫార్మా, మెటల్‌, రియల్టీ, ఆటో 2.8-0.6 శాతం మధ్య వృద్ధి చూపాయి. అయితే బ్యాంక్‌ నిఫ్టీ 0.7 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్‌, గెయిల్‌, డాక్టర్‌ రెడ్డీస్, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, ఆర్‌ఐఎల్‌, బీపీసీఎల్‌, టీసీఎస్‌ 6.7-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్‌బీఐ లైఫ్‌, టైటన్‌, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, ఎయిర్‌టెల్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 3.5-0.6 శాతం మధ్య క్షీణించాయి. 

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, బీహెచ్‌ఈఎల్, జీఎంఆర్‌, అదానీ ఎంటర్‌, సెయిల్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, బాలకృష్ణ, మదర్‌సన్, పీవీఆర్, ఐడియా 9.5-3.5 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క ఎల్‌ఐసీ హౌసింగ్‌, ముత్తూట్‌, గ్లెన్‌మార్క్‌, బీఈఎల్‌, సీమెన్స్‌, వోల్టాస్‌, బీవోబీ, ఎస్కార్ట్స్‌, పేజ్‌, మెక్‌డోవెల్‌, బాష్‌, అపోలో టైర్‌ 2.4-0.6 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్ క్యాప్స్‌ 1.3 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,683 లాభపడగా.. 1,148 నష్టాలతో నిలిచాయి.   

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,861 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,869 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1,181 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,855 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు