పెట్టుబడులకు ‘పీఎల్‌ఐ’ ఆకర్షణ | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు ‘పీఎల్‌ఐ’ ఆకర్షణ

Published Wed, Dec 29 2021 6:32 AM

PLI Scheme a game changer in attracting global firms to set up shop in India - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌కు అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కీలకంగా ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. దేశానికి పెట్టుబడులను భారీగా తీసుకురావడానికి, భారత్‌ తయారీ సామర్థ్యాన్ని పటిష్టంగా పెంపొందించడానికి ఈ పథకం ఎంతో దోహపదడుతున్నట్లు ఆమె వివరించారు. జౌళి, స్టీల్, టెలికం, ఆటోమొబైల్, ఔషధ పరిశ్రమ వంటి 13 కీలక రంగాలకు ప్రయోజనాలు సమకూర్చుతూ 2021–22 వార్షిక బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పీఎల్‌ఐ స్కీమ్‌ను ఆవిష్కరించారు. ఈ పథకం కోసం రూ.1.97 లక్షల కోట్లు కేటాయించారు. ఎంవీ కామత్‌ శతజయంతి స్మారక ఉపన్యాసం సందర్భంగా ఆర్థికమంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..

► మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో అంతర్జాతీయంగా భారీగా పెట్టుబడుల ఆకర్షణకు కేంద్రం తగిన ప్రణాళికను రూపొందిస్తోంది. కేవలం ఒకే అంశంపై ఆధారపడకుండా విస్తృత స్థాయిలో పెట్టుబడుల ఆకర్షణకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోంది. ఆయా స్కీమ్‌ల పట్ల మంచి స్పందన కూడా లభిస్తోంది. పీఎల్‌ఐ స్కీమ్‌ కూడా ఈ తరహాదే.  
► ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విధానం స్థిరమైన స్వల్పకాలిక, మధ్యకాలిక విధానంపై ఆధారపడి దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఉద్దేశించినదై ఉంటుంది.  2021 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ స్పష్టంగా మార్గాన్ని నిర్దేశించింది.  రానున్న 20 నుంచి 25 సంవత్సరాల్లో ప టిష్ట పురోగతిని సాధించాలని కేంద్రం భావిస్తోంది.  
► దేశ పటిష్ట పురోగతికి ప్రభుత్వం ఆరు ప్రధాన, వ్యూహాత్మక రంగాలను గుర్తించింది.  
► దేశంలో స్టార్ట్‌అప్స్‌ గణనీయంగా పురోగమిస్తున్నాయి. భారతదేశం దాదాపు 38 యూనికార్న్‌లతో (బిలియన్‌ డాలర్ల విలువపైబడిన కంపెనీ) 2020ని ముగించింది, కానీ 2021లో అందుకు సమాన సంఖ్యలో యూనికార్న్‌ రావడానికి మేము తగిన ప్రోత్సాహకాలు ఇచ్చాము. భారతదేశంలో ప్రతి నెలా కనీసం మూడు యునికార్న్‌లు ఉద్భవిస్తున్నాయి. వినూత్నమైన, ఔత్సాహిక వ్యాపారవేత్తలు వినూత్నమైన వ్యా పార మార్గాలు, విధానాలతో ముందుకు వస్తున్నారు. స్వయం ఉపాధి పొందాలనుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
► కంపెనీల నిధుల సమీకరణ అంత సులభమేమీ కాదు. అయితే భారతదేశం ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో 63 విజయవంతమైన ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌లను (ఐపీఓ)  చూసింది.  అధిక మొత్తం లో కంపెనీలు నిధులను సమీకరించగలిగాయి.  
► ఐపీఓల పట్ల కూడా ప్రజా ఆసక్తి పెరిగింది. ప్రజలు ఇప్పుడు బ్యాంకులో పొదుపు లేదా బ్యాంకులో చిన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఆధారపడటం లేదు. మధ్యతరగతి కూడా బ్యాంక్‌ లేదా పోస్టాఫీసులలో సురక్షితమైన ఎంపికల నుంచి కొంచెం రిస్క్‌ ఉన్న అసెట్స్‌కు మారుతున్నారు. స్టాక్‌ మార్కెట్లలో వారి పెట్టుబడులు పెరుగుతున్నాయి.   


రిఫండ్స్‌ @ రూ.1.49 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ రూ.1.49 లక్షల కోట్లకుపైగారిఫండ్స్‌ జరిపినట్లు ఆదాయపు గురువారం ఒక అధికారిక ప్రకటన తెలిపింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్‌ 27 వరకూ 4.67 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్స్‌ దాఖలయినట్లు కూడా ప్రకటన పేర్కొంది. 1.42 కోట్ల ఎంటిటీల విషయంలో రూ.50,793 కోట్లు, 2.19 లక్షలకు పైగా ఎంటిటీల విషయంలో రూ.98,504 కోట్ల కార్పొరేట్‌ రిఫండ్స్‌ జరిగినట్లు ప్రకటన వివరించింది.  2020–21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్‌ దాఖలుకు చివరితేదీ 2021 డిసెంబర్‌ 31. నిజానికి ఈ గడువు జూలై 31తో ముగిసిపోగా, డిసెంబర్‌ 31 వరకూ ప్రభుత్వం పొడిగించింది.   

Advertisement
Advertisement