ఆర్థిక సేవల చేరువలో ‘జన్‌ధన్‌’ విప్లవం | Sakshi
Sakshi News home page

ఆర్థిక సేవల చేరువలో ‘జన్‌ధన్‌’ విప్లవం

Published Tue, Aug 29 2023 4:30 AM

PM Jan Dhan Yojana Completes 9 Years Of Implementation - Sakshi

న్యూఢిల్లీ: జన్‌ధన్‌ యోజన ఆధారిత చర్యలు, డిజిటల్‌ పరివర్తన దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే విషయంలో విప్లవాత్మకంగా పనిచేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. జన్‌ధన్‌ యోజన పథకం కింద 50 కోట్ల మందిని అధికారిక బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తీసుకొచ్చామని, ఈ ఖాతాల్లో డిపాజిట్లు రూ.2 లక్షల కోట్లను మించాయని మంత్రి తెలిపారు.

ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై) పథకం తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక సమ్మేళన చర్యల్లో ఇది కూడా ఒకటిగా పేర్కొన్నారు. జన్‌ధన్‌ ఖాతాల్లో 55.5 శాతం మహిళలు ప్రారంభించినవేనని, 67 శాతం గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో తెరుచుకున్నవేనని వెల్లడించారు. ఈ పథకం కింద 2015 మార్చి నాటికి 14.72 కోట్ల బ్యాంక్‌ ఖాతాలు ఉంటే, 2023 ఆగస్ట్‌ 16 నాటికి 50.09 కోట్లకు పెరిగాయి.

ఇదే కాలంలో డిపాజిట్లు రూ.15,670 కోట్ల నుంచి రూ.2.03 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. ఈ ఖాతాలకు సంబంధించి 34 కోట్ల రూపే కార్డులను కూడా బ్యాంకులు మంజూరు చేశాయి. ఈ కార్డుపై రూ.2 లక్షల ఉచిత ప్రమాద బీమా సైతం లభిస్తుంది. ఈ ఖాతాల్లో కనీస బ్యాలన్స్‌ ఉంచాల్సిన అవసరం కూడా లేదు.

‘‘భాగస్వాములు, బ్యాంక్‌లు, బీమా కంపెనీలు, ప్రభుత్వ అధికారుల సంయుక్త కృషితో పీఎంజేడీవై కీలక చొరవగా పనిచేసి, దేశంలో ఆర్థిక సేవల విస్తరణ ముఖచిత్రాన్ని మార్చేసింది’’అని మంత్రి సీతారామన్‌ పేర్కొన్నారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ మాట్లాడుతూ.. జన్‌ధన్‌–ఆధార్‌–మొబైల్‌ ఆర్కిటెక్చర్‌తో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా లబి్ధదారులకు బదిలీ చేయగలుగుతున్నట్టు చెప్పారు. 

Advertisement
Advertisement