Sakshi News home page

కస్టమర్‌కు అనుకూలంగా సేవలు ఉండాలి

Published Fri, Jun 9 2023 4:34 AM

RBI looks to ease KYC pain, deter mis-selling by banks - Sakshi

ముంబై: బ్యాంకులు కస్టమర్‌కు ప్రాధాన్యం ఇస్తూ, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్‌బీఐకి ప్యానెల్‌ సిఫారసు చేసింది. మరణించిన ఖాతాదారు వారసులు ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌ చేసుకునేందుకు అనుమతించాలని, కేంద్రీకృత కేవైసీ డేటాబేస్‌ తదితర సూచలను ప్యానెల్‌ చేసిన వాటిల్లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా  పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికెట్‌ను బ్యాంకుకు సంబంధించి ఏ శాఖలో అయినా, ఏ నెలలో అయినా సమర్పించేందుకు అనుమతించాలని, దీనివల్ల రద్దీని నివారించొచ్చని పేర్కొంది. ఆర్‌బీఐ నియంత్రణలోని సంస్థల పరిధిలో వినియోగదారు సేవా ప్రమాణాల సమీక్షపై ఏర్పాటైన కమిటీ తన నివేదికను సమర్పించింది. గతేడాది మే నెలలో ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ బీపీ కనుంగో అద్యక్షతన ఈ కమిటీని నియమించడం గమనార్హం.

సూచనలు..
ఇంటి రుణాన్ని తీర్చివేసిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్లను తిరిగి రుణ గ్రహీతకు స్వాధీనం చేసే విషయంలో నిర్ధేశిత గడువు ఉండాలి. గడువులోగా ఇవ్వకపోతే బ్యాంక్‌/ఎన్‌బీఎఫ్‌సీపై జరిమానా విధించాలి. డాక్యుమెంట్లు నష్టపోతే, వాటిని తిరిగి పొందే విషయంలో బ్యాంకులు తమ వంతు సహకారం అందించాలి. ఇందుకు అయ్యే వ్యయాలను బ్యాంకులే పెట్టుకోవాలి. కస్టమర్లకు సంబంధించి రిస్క్‌ కేటగిరీలను సూచించింది. వేతన జీవులు అయితే వారికి వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, వారిని హై రిస్క్‌గా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొంది. విద్యార్థులను తక్కువ రిస్క్‌ వారిగా కేటాయించొచ్చని సూచించింది. కస్టమర్లతో వ్యవహారాలు నిర్వహించే సిబ్బంది, వారి పట్ల దురుసుగా వ్యవహరించకుండా నిర్ణీత కాలానికోసారి తప్పనిసరి శిక్షణ పొందాలని కూడా పేర్కొంది.  

Advertisement
Advertisement