ఎస్‌ఎంఈ ఐపీవోల దూకుడు | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎంఈ ఐపీవోల దూకుడు

Published Fri, Dec 29 2023 5:31 AM

SME IPO market witnesses a record run in 2023 - Sakshi

కొద్ది రోజులుగా దేశీ స్టాక్‌ మార్కెట్ల ప్రధాన ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. తాజాగా ఇటు సెన్సెక్స్‌ 72,000 పాయింట్ల మైలురాయిని చేరగా.. పోటీగా అటు నిఫ్టీ 22,000 పాయింట్ల మార్క్‌వైపు కదులుతోంది. ఇటీవల ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఉత్సాహం చూపుతుండటంతో ప్రధాన ప్రైమరీ మార్కెట్‌ పలు ఐపీవోలతో కళకళలాడుతోంది. ఈ ప్రభావంతో చిన్న, మధ్యతరహా కంపెనీలు(ఎస్‌ఎంఈ) సైతం లిస్టింగ్‌కు క్యూ కడుతున్నాయి. వెరసి ఎస్‌ఎంఈ పబ్లిక్‌ ఇష్యూలు వెల్తువెత్తుతున్నాయి. దీంతో 2023లో సరికొత్త రికార్డుకు తెరలేచింది. వివరాలు చూద్దాం..

 ముంబై: ఈ క్యాలండర్‌ ఏడాది(2023)లో ఎస్‌ఎంఈ పబ్లిక్‌ ఇష్యూల విభాగం దూకుడు చూపుతోంది. ఇప్పటివరకూ 166 కంపెనీలు ఐపీవోలను పూర్తి చేసుకున్నాయి. బ్రోకింగ్‌ సంస్థ ఫైయర్స్‌ రీసెర్చ్‌ గణాంకాల ప్రకారం రూ. 4,472 కోట్లు సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. ఇంతక్రితం 2022లో 109 ఎస్‌ఎంఈలు పబ్లిక్‌ ఇష్యూలను చేపట్టాయి. మొత్తం రూ. 1,980 కోట్లు సమకూర్చుకున్నాయి. కాగా.. ఈ ఏడాది ఐపీవోకి వచ్చిన 166 సంస్థలలో 136 లాభాలతో లిస్టయ్యాయి. వీటిలో 24 ఎస్‌ఎంఈలు లిస్టింగ్‌ రోజున ఏకంగా 100 శాతం లాభాలను సాధించాయి. జాబితాలో గోయల్‌ సాల్ట్‌ 258 శాతం దూసుకెళ్లి టాప్‌ ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ బాటలో సన్‌గార్నర్‌ ఎనర్జీస్‌ 216 శాతం, బేసిలిక్‌ ఫ్లై 193 శాతం జంప్‌చేసి తదుపరి ర్యాంకుల్లో నిలిచాయి.

ఇన్వెస్టర్ల క్యూ
ఎస్‌ఎంఈ పబ్లిక్‌ ఇష్యూలకు ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది లిస్టయిన సంస్థలలో 51 ఇష్యూలు 100 రెట్లుపైగా సబ్ర్‌స్కిప్షన్‌ను సాధించాయి. మరో 12 ఐపీవోలు ఏకంగా 300 రెట్లు అధికంగా డిమాండును అందుకున్నాయి. ఫైయర్స్‌ వివరాల ప్రకారం రిటైల్‌ ఇన్వెస్టర్లు చరిత్రాత్మక స్థాయిలో ఆసక్తి చూపుతున్నారు. అంతగా ప్రసిద్ధంకాని చాలా కంపెనీల ఇష్యూలలో సైతం రిటైలర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. వెరసి స్పందనలో గత రికార్డులను తుడిచిపెడుతున్నారు. అయితే ఇకపై రానున్న ఐపీవోల విషయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉన్నట్లు ఫైయర్స్‌ పేర్కొంది. మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలకు చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్త వహించవలసిందిగా సూచిస్తోంది. ఈ స్పీడ్‌ దీర్ఘకాలం కొనసాగకపోవచ్చని అభిప్రాయపడింది. కొన్ని కంపెనీల షేర్లు దూకుడు చూపుతున్నప్పటికీ ఆర్థిక పనితీరు ఆ స్థాయిలో ఉండటంలేదని ప్రస్తావిస్తోంది. వెరసి చిన్న ఇన్వెస్టర్లకు బహుపరాక్‌ చెబుతోంది!

జోరు తీరిదీ..
బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా లిస్టయిన సంస్థలలో గోయల్‌ సాల్ట్‌ ముందునిలవగా.. లిస్టింగ్‌ రోజు భారీ లాభాలు ఆర్జించిన ఐపీవోల జాబితాలో పలు సంస్థలు చోటు సాధించాయి. వీటిలో సన్‌గార్నర్‌ ఎనర్జీస్‌(216 శాతం), బేసిలిక్‌ ఫ్లై స్టుడియో(193 శాతం), స్‌(216 శాతం), ఓరియానా పవర్‌(169 శాతం), ఏనియన్‌ టెక్‌ సొల్యూషన్స్‌(164 శాతం), సీపీఎస్‌ షేపర్స్‌(155 శాతం), శ్రీవారి స్పైసెస్‌(154 శాతం), ఇన్ఫోలియన్‌ రీసెర్చ్‌(142 శాతం), రాకింగ్‌డీల్స్‌ సర్క్యులర్‌(125 శాతం), నెట్‌ ఎవెన్యూ టెక్‌(122 శాతం), పారగాన్‌ ఫైన్‌ ఎస్‌(114 శాతం), విన్యాస్‌ ఇన్నొవేటివ్‌ టెక్‌(110 శాతం), కృష్ణా స్ట్రాపింగ్‌(109 శాతం), సార్‌ టెలివెంచర్‌(101 శాతం), ఇన్నోకయిజ్‌ ఇండియా(100 శాతం) తదితరాలున్నాయి.

Advertisement
Advertisement