కేఎస్‌కే మహానది ఖాతా విక్రయం | Sakshi
Sakshi News home page

కేఎస్‌కే మహానది ఖాతా విక్రయం

Published Mon, Aug 22 2022 4:25 AM

State Bank sells distressed KSK Mahanadi loans to Aditya Birla ARC for Rs 1,622 crore - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) మొండిబకాయి(ఎన్‌పీఏ)గా మారిన కేఎస్‌కే మహానది పవర్‌ కంపెనీ రుణ ఖాతాను విక్రయించింది. ఆదిత్య బిర్లా ఏఆర్‌సీకి రూ. 1,622 కోట్లకు ఖాతాను బదిలీ చేసింది. ఈ(2022) ఏప్రిల్‌కల్లా కేఎస్‌కే మహానది చెల్లించాల్సిన రుణాల విలువ రూ. 3,815 కోట్లుకాగా.. 58 శాతం కోత(హెయిర్‌కట్‌)తో ఖాతాను ఏఆర్‌సీకి ఎస్‌బీఐ విక్రయించింది. కేఎస్‌కే మహానది పవర్‌ ఎన్‌పీఏ ఖాతాను ఎస్‌బీఐ నగదు ప్రాతిపదికగా ఈవేలం నిర్వహించింది.

ఇందుకు రూ. 1,544 కోట్ల రిజర్వ్‌ ధరను నిర్ణయించినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. కాగా.. మొత్తం 15 ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌ లభించినప్పటికీ ఏబీ ఏఆర్‌సీ నుంచి రూ. 1,544 కోట్లకు ఒకే బిడ్‌ దాఖలుకావడం గమనార్హం! స్విస్‌ చాలెంజ్‌ విధానంలో చేపట్టిన వేలం విధానంలో పోటీ బిడ్స్‌ దాఖలుకానప్పటికీ తదుపరి చర్చలతో బిడ్‌ను రూ. 1,622 కోట్లకు ఏబీ ఏఆర్‌సీ సవరించింది. ఇందుకు తగిన అనుమతులు పొందాక ఈ నెల 12న ఎస్‌బీఐ విక్రయాన్ని పూర్తి చేసింది. 2009లో ఏర్పాటైన కేఎస్‌కే మహానది పవర్‌ రెండేళ్లుగా కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉంది.

Advertisement
Advertisement