తీవ్ర విషాదం: సులభ్‌ ఫౌండర్‌ ఇకలేరు! | Sakshi
Sakshi News home page

Bindeshwar Pathak: సులభ్‌ ఫౌండర్‌ ఇక లేరు!

Published Tue, Aug 15 2023 4:03 PM

Sulabh founder Bindeshwar Pathak dies at Delhi hospital - Sakshi

Sulabh founder Bindeshwar Pathak passed away సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు వ్యవస్థాపకుడు స్వచ్ఛ రైలు మిషన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బిందేశ్వర్ పాఠక్‌ (80) ఇక లేరు. ఆగస్టు 15, మంగళవారం ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూసారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉదయం బిందేశ్వర్ పాఠక్ జాతీయ జెండాను ఆవిష్కరించి, ఆ వెంటనే  గుండెపోటుతో కుప్పకూలిపోవడం విషాదాన్ని నింపింది.  

సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్‌ను బిందేశ్వర్ పాఠక్ 1970లో స్థాపించారు. మాన్యువల్ స్కావెంజర్ల కష్టాలను తీర్చేందుకు బిందేశ్వర్ పాఠక్ విస్తృతంగా ప్రచారం చేశారు. మూడు దశాబ్దాల క్రితం తాను రూపొందించిన సులభ్ టాయిలెట్లను ఫెర్మెంటేషన్ ప్లాంట్లకు అనుసంధానం చేయడం ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తిని వినూత్నంగా వినియోగించేందుకు నిర్ణయిచారు.

అలాగే అప్పటి కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ఆధ్వర్యంలో రైలు ప్రాంగణంలో పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్‌ను స్వచ్ఛ రైలు మిషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.

ఎవరీ బిందేశ్వర్ పాఠక్
మానవ హక్కులు, పర్యావరణ పరిశుభ్రత, సాంప్రదాయేతర ఇంధన వనరులు, వ్యర్థాల నిర్వహణ ,విద్య ద్వారా సామాజిక సంస్కరణల నిమిత్తం  పనిచేసిన సామాజిక వేత్త. భారతదేశంలోని స్కావెంజర్లందరూ 13 మిలియన్ల బకెట్ ప్రైవీలను మాన్యువల్‌గా శుభ్రపరిచే పని నుండి విముక్తి  పొందాలని భావించిన వ్యక్తి. మురికివాడల్లో పబ్లిక్, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలలో 7,500 కంటే ఎక్కువ పబ్లిక్ టాయిలెట్లను నిర్మించి, ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా పే-అండ్ యూజ్ ప్రాతిపదికన వాటిని నిర్వహిస్తున్న భారతదేశంలో తొలి వ్యక్తి డాక్టర్ పాఠక్. ప్రతిరోజూ 10 మిలియన్లకు పైగా ప్రజలు ఈ సౌకర్యాలను ఉపయోగిస్తున్నారు.

బయోగ్యాస్
మానవ విసర్జనల ఆధారంగా 60 బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన ఘనత బిందేశ్వర్ సొంతం. వీటిని హౌసింగ్ కాలనీలు, ఎత్తైన భవనాలు ,పబ్లిక్ టాయిలెట్లలో అమర్చవచ్చు. అలాంటి ప్రాంతాల్లో మురుగు కాలువలు లేకుంటే, టాయిలెట్లను సెప్టిక్ ట్యాంక్‌కు కాకుండా బయోగ్యాస్ డైజెస్టర్‌కు అనుసంధానించాలనే ప్రచారాన్ని విస్తృతంగా  చేపట్టారు. 

బిందేశ్వర్ పాఠక్ 1964లో సోషియాలజీలో పట్టభద్రుడయ్యాడు. పాట్నా విశ్వవిద్యాలయం నుండి 1980లో మాస్టర్స్ డిగ్రీని, 1985లో పీహెచ్‌డీని పొందారు. డాక్టర్ పాఠక్ మంచి రచయిత  వక్త కూడా. ది రోడ్ టు ఫ్రీడమ్ సహా అనేక పుస్తకాలను రచించారు.  ప్రపంచ వ్యాప్తంగా పారిశుద్ధ్యం, ఆరోగ్యం, సామాజిక పురోగతిపై జరిగే సమావేశాలలో తరచుగా పాల్గొనేవారు. 1991లో భారతదేశపు మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌  లభించింది.

Advertisement
Advertisement