మాయలేడి.. కోవిడ్‌ వ్యాక్సిన్‌ పేరుతో వృద్ధురాలిని నమ్మించి.. | Sakshi
Sakshi News home page

మాయలేడి.. కోవిడ్‌ వ్యాక్సిన్‌ పేరుతో వృద్ధురాలిని నమ్మించి..

Published Fri, Feb 11 2022 9:02 PM

Gold Chain Theft An Old Woman In The Name Of The Covid Vaccine - Sakshi

కర్నూలు: నగర శివారులోని న్యూ పోస్టల్‌ కాలనీలో నివాసముంటున్న వృద్ధురాలు మద్దమ్మను(70) గుర్తు తెలియని మహిళ కోవిడ్‌ వ్యాక్సిన్‌ పేరుతో మాయమాటలు చెప్పి మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును తస్కరించి మాయమైంది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో 50 ఏళ్ల వయస్సున్న ఓ మహిళ ముఖానికి స్కార్ఫ్‌ ధరించి మద్దమ్మ ఇంటి వద్దకు వచ్చి తాను సచివాలయం వలంటీర్‌ అంటూ పరిచయం చేసుకుంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు వేయించుకున్నావా అని ఆరా తీసి బూస్టర్‌ డోస్‌ వేయడం కోసం వచ్చానని నమ్మబలికింది. మంచంపై పడుకోబెట్టి తన బ్యాగులో ఉన్న బీపీ మిషన్, స్టెతస్కోప్‌తో పరీక్షించినట్లు నటించింది.

 చదవండి: ఆనందంగా గడిపి.. కుటుంబ సభ్యులందరూ నిద్రపోయాక..

తలను అటువైపు తిప్పుకోమని చెప్పి మెడలో ఉన్న మూడు తులాల చైన్‌ను కట్టర్‌తో కత్తిరించింది. వృద్ధురాలు గుర్తించి ఇదేమిటని ప్రశ్నించగా మళ్లీ చైన్‌ ఇస్తానంటూ ఆమె బ్యాగులో ఉన్న నకిలీ చైన్‌ను గొంతులో వేసి కదులకుండా పడుకో  ఆఫీసర్‌ను పిలుచుకుని వస్తానంటూ అక్కడి నుంచి కనిపించకుండా మాయమైంది. వృద్ధురాలు కొద్దిసేపటికి తేరుకుని నకిలీ గొలుసు మెడలో వేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీని సేకరించారు. రెండు నెలల క్రితం స్టాంటన్‌పురం, నరసింహారెడ్డి నగర్‌లో కూడా ఇదే తరహాలోనే మహిళ చోరీకి పాల్పడింది. సీసీ పుటేజీ ఆధారంగా పాత నేరస్తురాలిగా పోలీసులు నిర్దారణకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు.   

Advertisement
Advertisement