Honey Trapping: Woman Befriends Man Via Dating App Later Demanded For Money At Gurugram - Sakshi
Sakshi News home page

హాయ్‌.. హోటల్‌లో కలుద్దాం.. డేటింగ్‌ యాప్‌లో యువకులే ఆమె టార్గెట్‌..

Published Fri, Jun 9 2023 5:49 PM

Woman Befriends Man Via Dating App Later Demand Money At Gurugram - Sakshi

గురుగ్రామ్‌: ఇటీవలి కాలంలో హానీట్రాప్‌ కేసులు పెరుగుతున్నాయి. ఎరక్కపోయి కొందరు కిలేడీల చేతికి చిక్కి మోసపోతున్నారు. తాజాగా ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఓ కిలేడీ డేటింగ్‌ యాప్‌లో ఓ వ్యక్తిని పరిచయం చేసుకుని హోటల్‌కు తీసుకెళ్లింది. అక్కడ సదరు వ్యక్తికి అనుకోని అనుభవం ఎదురైంది. అనంతరం, లైంగిక వేధింపులకు పా​ల్పడినట్టు డ్రామా క్రియేట్‌ చేసి డబ్బు కాజేయాలని ప్లాన్‌ వేసింది. ఈ క్రమంలో హానీట్రాప్‌కు దిగిన జంటను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. 

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన బినితా కుమారి(27) గురుగ్రామ్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. అలాగే, హర్యానా రోహతక్‌లోని భాలతో గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహేశ్ ఫోగట్ ఓ ఎన్జీవోలో పని చేస్తున్నాడు. వీరిద్దరు కలిసి డేటింగ్ యాప్‌(బంబుల్‌ డేటింగ్‌ యాప్‌)లో అమాయకులకు గాలం వేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. కాగా, డేటింగ్‌ యాప్‌లో బినితా కుమారి.. ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలో గురుగ్రామ్‌ సెక్టార్‌-23లోని ఓ హోటల్‌కు రావాలని ఆఫర్‌ ఇచ్చింది. దీంతో, దొరికిందిలే ఛాన్‌ అని బాధితుడు హోటల్‌కు వెళ్లాడు. 

అయితే, హోటల్‌కు వెళ్లిన తర్వాత మనోడికి ఊహించని విధంగా షాక్‌ తగిలింది. బినితా కుమారి సదరు వ్యక్తిని బీర్ తాగమని బలవంతం చేసింది. తాను ఊహించినదానికి పరిస్థితులు వేరుగా కనిపించడంతో బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, ఆ తర్వాత ఆయనకు ఫోన్ చేసి తనతో అసభ్యంగా ప్రవర్తించావని, లైంగికంగా వేధించావని బెదిరించింది. రూ. 5 లక్షలు ఇవ్వాలని లేదంటే.. పోలీసు కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చింది. 

అనంతరం, ఆమె గురించి ఆలోచించేలోపే మహేష్‌ ఫోగట్‌ నుంచి బాధితుడికి ఫోన్‌ వెళ్లింది. రూ. 5 లక్షలు ఇస్తేనే సమస్య సెటిల్‌మెంట్ అవుతుందని బెదిరింపులకు దిగాడు. దీంతో, కంగారుపడిన బాధితుడు చేసేదేమీలేక డీల్‌కు ఒప్పుకుంటూ రూ.2 లక్షలు మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు. ఈ క్రమంలోనే వారిద్దరికీ రూ. 50 వేలు ఇచ్చి భరోసా ఇచ్చాడు. మిగిలిన డబ్బులు త్వరలోనే ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. భాదితుడి ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై డీఎల్ఎఫ్ ఫేజ్-3 పోలీసు స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది.

కాగా, ఈ కేసుపై రంగంలోకి దిగిన పోలీసులు.. మిగిలిన డబ్బులు తీసుకోవడానికి మౌల్సరి మార్కెట్ సమీపంలోని సాయి టెంపుల్‌కు రావాలని బాధితుడు ఆ ఇద్దరికీ కాల్ చేశాడు. డబ్బులు తీసుకుంటుండగా మహేష్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత బినితా కుమారిని డీఎల్ఎఫ్-3 యూ బ్లాక్ నుంచి అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇక, వీరిద్దరూ ఇప్పటి వరకు 12 మందిని మోసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: వీడియో: అప్సరను పూజారి సాయికృష్ణ అందుకే చంపాడు.. షాకింగ్‌ విషయాలు వెల్లడి

Advertisement
Advertisement