అమలాపురం రూరల్: కలెక్టరేట్ గోదావరి భవనంలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 166 మంది అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్.నుపూర్ అజయ్, జిల్లా రెవెన్యూ అధికారి ిసీహెచ్ సత్తిబాబు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జగనన్నకు చెబుదాం – స్పందన అర్జీల పరిష్కారంలో ఏమాత్రం అలసత్వం చూపవద్దని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు తమ లాగిన్కు వచ్చిన ఫిర్యాదులను 24 గంటల్లో ఓపెన్ చేయడం లేదని, దీనిని రాష్ట్ర స్థాయి టీములు పర్యవేక్షిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఏ రోజు వచ్చిన ఫిర్యాదులను అదే రోజు ఓపెన్ చేసి, సంబంధిత క్షేత్ర స్థాయి అధికారులకు పంపాలని ఆదేశించారు. అర్జీలు పునరావృతం కాకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఒకే సమస్యపై అర్జీలు పునరావృతమైతే అర్జీదారును పిలిపించి, ఆ సమస్య పరిష్కరించాలని, లేకుంటే ఏ కారణంతో పరిష్కరించలేకపోతున్నారో స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
పోలీసు ‘జగనన్నకు చెబుదాం’కు 19 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి 19 అర్జీలు వచ్చాయి. ఎస్పీ సుసరాపు శ్రీధర్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పలువురు అర్జీదారులు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి తమ సమస్యలు చెప్పుకొన్నారు. కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వచ్చాయి. కొన్ని ఫిర్యాదుల పరిష్కారానికి ఎస్పీ శ్రీధర్ అక్కడికక్కడే చర్యలు చేపడుతూ ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడారు. జిల్లా స్పెషల్ బ్రాంచి సీఐ రాజశేఖర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.