చిరకాలంగా మహిళాలోకం ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందటంతో పార్లమెంటు ఆమోదముద్ర లభించినట్టయింది. నూతన పార్లమెంటు భవనం ప్రారంభమయ్యాక జరిగిన ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే కావటం, దీన్ని దాదాపు అన్ని పక్షాలూ ఏకగ్రీవంగా ఆమోదించటం ఒక అరుదైన సన్నివేశం. మహిళా కోటాకు లోక్సభలో బుధవారం 454 మంది అనుకూలంగా ఓటేయగా, కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. రాజ్యసభలో హాజరైన మొత్తం సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు.
ఇందుకు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అభినందించితీరాలి. దశాబ్దాలుగా నేతల ఎన్నికల ప్రచార సభల్లో... చానెళ్ల చర్చల్లో మాత్రమే వినబడుతూ చట్టసభల్లో మాత్రం కనబడని బిల్లుకు ప్రాణప్రతిష్ట చేసి, పట్టాలెక్కించి అన్ని పార్టీలనూ అంగీకరింపజేయటం చిన్న విషయమేమీ కాదు. అయితే జనాభా లెక్కల సేకరణ, దాని ఆధారంగా జరిపే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చాకే కోటా అమలవుతుందనటం నిరాశ కలిగించే అంశం.
ఏతావాతా 2029 తర్వాత మాత్రమే ఇది ఆచ రణలోకొస్తుంది. అంటే... మరో ఆరేళ్ల వరకూ దీనికి మోక్షం కలగదు! విస్తట్లో అన్ని పదార్థాలూ వడ్డించి, తినడానికి ఇంకా ముహూర్తం ఆసన్నం కాలేదని చెప్పినట్టయింది. స్వాతంత్య్రం సిద్ధించి 76 సంవత్సరాలు గడిచాక మాత్రమే మహిళా కోటా సాకారం కాగా, దాని అమలుకు మరింత సమయం పడుతుందనటం ఏమాత్రం భావ్యంకాదు. ఈ బిల్లు ఆమోదంలో కొట్టొచ్చినట్టు కనిపించే అంశం మరొకటుంది.
ఇరవైయ్యేడేళ్ల క్రితం తొలిసారి లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడే ఓబీసీ వర్గాల వాటా నిర్ధారించాలని బలహీనవర్గాలు పట్టుబట్టాయి. చట్టసభలో మాత్రమే కాదు... వెలుపల సైతం అనేక ప్రజాసంఘాలు ‘కోటాలో కోటా’ గురించి డిమాండు చేస్తూనే ఉన్నాయి. దాదాపు మూడు దశాబ్దాలు గడిచాక కూడా ఆ విషయం తేల్చకుండానే బిల్లు ఆమోదం పొందటం మనం ఆచరిస్తున్న విలువలను పట్టి చూపుతుంది. బిల్లుపై అన్ని పార్టీలనూ ఒప్పించిన అధికార పక్షానికి ‘కోటాలో కోటా’ గురించి నిర్దిష్టంగా తేల్చటం అంత కష్టమైన పనేమీ కాదు. ఎందుకనో ఆ పని చేయలేదు.
మహిళా కోటా బిల్లుకు తామే ఆద్యులమని, యూపీఏ ప్రభుత్వ కాలంలో 2010లో దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందామని కాంగ్రెస్ నేత సోనియాగాంధీ చెబుతున్నారు. కానీ ఆ బిల్లుకూ, ఇప్పుడు ఆమోదం పొందిన బిల్లుకూ సంబంధం లేదు. అసలు మహిళా కోటా బిల్లుకు అంతకన్నా పూర్వ చరిత్ర చాలా ఉంది. తొలిసారి 1996లో అప్పటి ప్రధాని హెచ్డీ దేవెగౌడ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టగా, ఆ మరుసటి ఏడాది వచ్చిన ఐకె గుజ్రాల్ సర్కారు సైతం బిల్లు దుమ్ము దులిపింది.
అప్పుడే ఓబీసీ కోటా సంగతేమిటన్న చర్చ మొదలైంది. వాజపేయి హయాంలోని ఎన్డీఏ ప్రభుత్వం వరసగా 1998, 1999, 2002, 2003 సంవత్సరాల్లో మహిళా కోటా బిల్లును గట్టెక్కించాలని ప్రయత్నించింది. కానీ ఓబీసీ కోటా విషయంలో దుమారం రేగి ఆగిపోయింది. 2008లో యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా ఒక ప్రయత్నం జరిగింది. 2010 మార్చి 9న రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. కానీ లోక్సభలో ఎస్పీ, బీఎస్పీ తదితర పక్షాలు ‘కోటాలో కోటా’ కోరుతూ అడ్డుకున్నాయి.
ఇప్పుడు ఓబీసీ కోటా తేల్చాలని చెబుతున్న కాంగ్రెస్ నేతలు తమ హయాంలో ఆ పని ఎందుకు చేయలేకపోయారో సంజాయిషీ ఇవ్వాలి. మరోపక్క కోటా చట్టంగా రూపుదిద్దుకున్న నాటినుంచి కేవలం పదిహేనేళ్లు మాత్రమే ఉంటుంది. ఆ లెక్కన 2029 వరకూ అమలే సాధ్యం కాని చట్టం మరో తొమ్మిదేళ్లపాటే అమల్లో ఉంటుంది. ఆ తర్వాత పొడిగింపు సంగతి ఏమవుతుందన్నది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది. ఈ పరిమితి ఏవిధంగా చూసినా సబబుగా లేదు.
అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో మహిళలకు 33 శాతం కోటా ఇవ్వటంలో జాప్యం జరగటం సమర్థించుకోలేనిది. లింగ వివక్ష, అసమానతలు, వేధింపులు అన్ని స్థాయిల్లోనూ ఉన్న సమాజంలో మహిళలను విధాన నిర్ణయాల్లో భాగస్వాములను చేయటం, వారి ప్రాతినిధ్యం పెంచటం ఎంతో అవసరం. అందువల్ల సమాజ నిర్మాణంలో తామూ భాగస్వాములమని, తమ ఆలోచనలకూ విలు వుంటున్నదని స్త్రీలు గుర్తిస్తే అది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
మరింతమంది మహిళలు రాజకీయాల్లోకి రావడానికి వీలవుతుంది. సమాజంలో మహిళలపట్ల ఉన్న ఆలోచనా ధోరణి మారు తుంది. దీన్ని అవగాహన చేసుకోవటానికీ, ఆచరించటానికీ ఇంత సుదీర్ఘ సమయం పట్టడం విచార కరం. మనకన్నా ఎంతో చిన్న దేశాలూ, బాగా వెనక బడిన దేశాలూ సైతం మహిళలకు చట్టసభల్లో పెద్ద పీట వేసిన వైనం గమనిస్తే మహిళల విషయంలో మనం ఎంత వెనకబాటుతనాన్ని ప్రదర్శిస్తు న్నామో అర్థమవుతుంది.
రువాండా పార్లమెంటులో మహిళలు 61 శాతం ఉంటే... క్యూబా(53), నిగ రాగువా(52), మెక్సికో, న్యూజిలాండ్ చట్ట సభల్లో 50 శాతం మహిళలుండి మన సమాజం తీరు తెన్నుల్ని ప్రశ్నిస్తున్నారు. ఆఖరికి దశాబ్దం క్రితం ప్రజాతంత్ర రిపబ్లిక్గా ఆవిర్భవించిన నేపాల్లో సైతం పార్లమెంటులో 33 శాతం మహిళలున్నారు.
అమలుకు ఇంకా సమయం పడుతుందంటు న్నారు గనుక ఈలోగా పార్లమెంటు చర్చలో వ్యక్తమైన అభిప్రాయాలకు అనుగుణంగా ఓబీసీ కోటా సంగతి తేల్చటం, చట్టం అమలుకు విధించిన పరిమితిని ఎత్తివేయటం అత్యంత కీలకమని కేంద్రం గుర్తించాలి. ఎన్నెన్నో అవాంతరాలను అధిగమించి సాకారం కాబోతున్న ఈ చట్టం భవిష్యత్తులో సమాజం మరింత పురోగతి సాధించటానికి నాంది కాగలదని ఆశించాలి.
Breadcrumb
Related news
-
Lok sabha elections 2024: నేడే రెండో దశ.. 13 రాష్ట్రాలో 88 స్థానాలకు ఎన్నికలు
-
Lok sabha elections 2024: పదేళ్ల అభివృద్ధి.. ట్రైలర్ మాత్రమే: మోదీ
త్రిసూర్/తిరువనంతపురం/తిరునల్వేలి: గత దశాబ్దాకాలంగా ఎన్డీఏ పాలనాకాలంలో దేశం చవిచూసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాకారంకానుందని ఆయన ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యతనిస్తూ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ‘సంకల్ప పత్రం’ విడుదల చేసిన మరుసటి రోజే ప్రధాని మోదీ ఆ హామీలను పునరుద్ఘాటించారు. కేరళలోని కున్నమ్కులమ్, కట్టకడ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభల్లో మోదీ ప్రసంగించారు. రాహుల్గాంధీపై పరోక్ష విమర్శలు చేశారు. ‘‘ కాంగ్రెస్ యువరాజుకు ఉత్తరప్రదేశ్లో దశాబ్దాలుగా తమ కుటుంబ గౌరవం(అమేథీ ఎంపీ స్థానం)ను కాపాడే సత్తాలేదుగానీ కేరళకు వచ్చి ఓట్లడుగుతారు. కేరళీయుల ఓట్లడిగే ఆయన సీపీఐ(ఎం) ఏలుబడిలో కరువన్నూర్ సహకార బ్యాంక్లో వెలుగుచూసిన కుంభకోణంపై నోరు మెదపరెందుకు? నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగం సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు కాంగ్రెస్కు ఉంది. ఈ రెండింటి మధ్య చీకటి ఒప్పందం కుదిరింది. కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్కు పాల్పడి ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఈ మోసంపై నేనే ఈడీ దర్యాప్తు నకు ఆదేశించా’’ అని అన్నారు. లెఫ్ట్ ఉంటే అంతా లెఫ్ట్ అయినట్లే ‘‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి, అధికార ఎల్డీఎఫ్ కూటములు కేరళలో అభివృద్ధికి ప్రతిబంధకాలుగా తయా రయ్యాయి. త్రిపుర, పశ్చిమబెంగాల్, కేరళ ఈ రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీ అధికారంలో ఉందీ అంటే అక్కడ అంతా పోయినట్లే(లెఫ్ట్ అయినట్లే). అక్కడ మంచి అనేదే జరగదు. పశ్చిమబెంగాల్, త్రిపురలో ఏం చేశారని, కొత్తగా కేరళకు చేయడానికి?’ అంటూ ధ్వజమెత్తారు. కచ్ఛతీవు ఉదంతాన్ని 4 దశాబ్దాలు దాచారు తమిళనాడులోని తిరునల్వేలిలో జరిగిన సభలోనూ మోదీ ప్రసంగించారు. కచ్ఛ తీవు ను శ్రీలంకకు ఇచ్చేసి కాంగ్రెస్, డీఎంకే ఈ ఉదంతాన్ని 40 ఏళ్లు దాచిపెట్టాయని మోదీ ఆరోపించారు. అక్కడ తమిళ మత్స్య కారులు తరచూ అరెస్ట్ అవుతున్నారని, ఈ పాపం ఆ పార్టీలదేనన్నారు. -
బీజేపీని బలోపేతం చేయమంటే.. నిండా ముంచారు!
కప్పుకునేది కాషాయం కండువా. చేసేది పసుపు రాజకీయం. ఇదీ ఏపీ బిజెపి చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహారశైలి. సంక్షోభంలో కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీని బతికించుకోడానికి.. చంద్రబాబుకు మద్దతుగా ఉండేందుకు పురందేశ్వరి పడని పాట్లు లేవు. ఏపీలో బిజెపిని బలోపేతం చేయవమ్మా అని అధ్యక్ష పదవి కట్టబెడితే.. బిజెపిని నిండా ముంచి మరిది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసం ఎందాకైనా వెళ్తానంటున్నారు పురందేశ్వరి. టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడవాలని డిసైడ్ అయినపుడు పురందేశ్వరి దంపతులే మంచి కత్తి ఒకటి చంద్రబాబుకు కానుకగా ఇచ్చారని అప్పట్లో వైస్రాయ్ కోళ్లు ఆగ్రహంగా కూశాయి. వైస్రాయ్ ఎపిసోడ్లో.. తన తండ్రిని ముఖ్యమంత్రి పీఠం నుండి నిర్దాక్షిణ్యంగా దించేసిన కుట్రలో ఎన్టీయార్ తనయ దగ్గుబాటి పురందేశ్వరి.. ఆమె భర్త వెంకటేశ్వరరావులు భాగస్వాములన్నది బహిరంగ రహస్యం. వెన్నుపోటులో తనకు అండగా ఉంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సిఎం పదవి ఇస్తానని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారని అంటారు. తీరా వెన్నుపోటు పొడిచేసి కత్తికంటిన నెత్తుటిని తుడిచేసి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తర్వాత దగ్గుబాటి విషయాన్ని పక్కన పెట్టేశారు చంద్రబాబు. ఇవాళో రేపో తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని దగ్గుబాటి కొద్ది రోజులు వెయిట్ చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆరో వేలు లాంటిదని దాని వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు మనసా వాచా కర్మేణా నమ్మడం వల్ల వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సిఎం పదవి రాలేదు. అప్పటికి కానీ తాము మోసపోయామని దగ్గుబాటి దంపతులు గ్రహించలేకపోయారు. తెలిసిన తర్వాత ఉక్రోషంతో టిడిపి నుండి బయటకు వచ్చి చంద్రబాబుపై కారాలూ మిరియాలను మిక్సీలో వేసి రుబ్బారు. కొంతకాలం బిజెపిలో మరి కొంతకాలం కాంగ్రెస్ లో కాలక్షేపం చేసిన వెంకటేశ్వరరావు ఖాళీ సమయంలో ఓ ఆత్మకథ రాసి అందులో చంద్రబాబును నిర్మా వాషింగ్ పౌడర్ తో ఉతికి ఆరేశారు. ఆ కోపం చాలా ఏళ్ల పాటు చంద్రబాబులో ఉండిపోయింది. అందుకే 2014లో టిడిపి-బిజెపిలు పొత్తు పెట్టుకున్నా.. రాజంపేట నుండి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన పురందేశ్వరిని దగ్గరుండి మరీ ఓడించారు చంద్రబాబు.ఎన్నికల ఫలితాల రోజున పురందేశ్వరి ఓడారని తెలిసిన తర్వాతనే చంద్రబాబు సంతృప్తిగా నవ్వారని టిడిపి వర్గాలంటాయి. రెండు దశాబ్దాలకు పైగా నారా-దగ్గుబాటి కుటుంబాల మధ్య వైరం అలానే కొనసాగింది. 2019 ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం చెందడం ఆ తర్వాత వరుసగా అన్ని స్థానిక ఎన్నికల్లోనూ టిడిపి అడ్రస్ గల్లంతు కావడం జరిగిపోయాయి. 2024 ఎన్నికల్లోనూ టిడిపి లేచి నిలబడే పరిస్థితి లేదని తేలిపోయింది. ఈ సమయంలోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండె సంబంధ సమస్య వచ్చి ఆసుపత్రిలో చేరితే పరామర్శ పేరిట చంద్రబాబు వెళ్లారు. అలా వెళ్లడానికి రామోజీ సలహాయే కారణమంటారు. విడిపోయిన నారా-దగ్గుబాటి కుటుంబాలు మళ్లీ కలవకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ను ఎదుర్కోలేమని రామోజీరావే రెండు కుటుంబాలకూ నూరిపోశారని కృష్ణా జిల్లా కోళ్లు మొహమాటంగా కూశాయి. అలా రాజగురువు ఇచ్చిన టిప్ తో ఆసుపత్రిలో దగ్గుబాటి దంపతలు కాళ్లమీద పడిపోయిన చంద్రబాబు వెన్నుపోటు ఘటన అనంతరం తాను చేసిన ద్రోహాన్ని ఒప్పుకుని క్షమించమన్నారట. దాంతో దగ్గుబాటి దంపతులు చంద్రబాబును క్షమించేసి ఇకనుంచి కలిసుందాం రా అన్నారట.ఆ క్రమంలోనే ఎన్టీయార్ నాణెం విడుదల చేసినపుడు పురందేశ్వరే ప్రణాళిక రచించి చంద్రబాబును ఎన్టీయార్ నాణెం విడుదల కార్యక్రమానికి కుటుంబ సభ్యుల ముసుగులో ఆహ్వానించారు. అక్కడ బిజెపి అధ్యక్షుడు నడ్డాతో వన్ టూ వన్ మాట్లాడుకునే వీలూ కల్పించారు. బిజెపితో తిరిగి పొత్తుకు ఆ క్షణానే చంద్రబాబు నడ్డాను మోహించినట్లు నటించారు. ఆ తర్వాత 371 కోట్ల రూపాయలు దోచుకు తిన్న స్కిల్ స్కాంలో చంద్రబాబు నాయుణ్ని కోర్టు ఆదేశాలతో అరెస్ట్ చేసి జైలుకు పంపగానే.. టిడిపి నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులకన్నా కూడా ముందుగా స్పందించింది పురందేశ్వరే. చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అక్రమం అని ఆమె ముందస్తుగా ఖండించేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు బెయిల్ రాకపోవడంతో ఆ ప్రయత్నాలకోసం నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతల అపాయింట్ మెంట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే పురందేశ్వరి ఏపీ బిజెపి నేతలకు కూడా చెప్పకుండా అర్జంట్ గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి హస్తినలో దిగి అక్కడ తన చెల్లెలి కొడుకు నారా లోకేష్ ను తీసుకుని పార్టీ అగ్రనేత కేంద్రమంత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో భేటీ కుదిర్చి తన వంతు సాయం అందించారు. ఇక ఎన్నికలు దగ్గర పడే సమయంలో టిడిపితో పొత్తు విషయంలో బిజెపి జాతీయ నాయకత్వం అనాసక్తిగా ఉండడంతో పురందేశ్వరే జోక్యం చేసుకుని టిడిపితో పొత్తు కుదిరేలా అగ్రనేతల దగ్గర మంత్రాంగం నడిపారని అంటారు. మొత్తం మీద టిడిపి-బిజెపిల మధ్య పొత్తు కుదిర్చారు. ఆ తర్వాత ఏపీ బిజెపిలో చంద్రబాబు అనుకూల నేతలకు టికెట్లు ఇప్పించారు. చంద్రబాబు అవినీతిని అను నిత్యం ఎండగట్టిన సోము వీర్రాజు, జి.వి.ఎల్. నరసింహారావులకు టికెట్ దక్కకుండా పక్కన పెట్టారు పురందేశ్వరి. అలా చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాలకోసం తాను ఏమైనా చేస్తానని చాటుకున్నారు. తాజాగా టిడిపి నేతల అవినీతి విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటూ స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తోన్న ఐపీఎస్ అధికారులపై వేటు వేయాలంటూ ఏకంగా ఈసీకే లేఖ రాసి బరితెగించేశారు పురందేశ్వరి.ఫలానా అధికారులు ఉంటే అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేయడం వేరు..వారిని తప్పిస్తే ఆ స్థానాల్లో ఎవరిని వేయాలో కూడా పురందేశ్వరే సిఫారసు చేస్తూ జాబితా పంపడం వివాదస్పదం అయ్యింది. ఈ ఎన్నికల్లో కూడా తన తండ్రి స్థాపించిన టిడిపి గెలిచి అధికారంలోకి రాలేకపోతే ఇక పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందని పురందేశ్వరి భయపడుతున్నారు. తన తండ్రి పెట్టిన పార్టీని గుంజుకుని..తన తండ్రి ఆశాయలకు తూట్లు పొడిచిన చంద్రబాబు నాయుడి రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి జారుకోకూడదని పాపం పురందేశ్వరి విపరీతంగా కష్టపడుతున్నారు. అయితే ఏవీ వర్కవువ్ కావంటున్నారు రాజకీయ పండితులు. -
Bihar politics: పాత కత్తులు.. కొత్త పొత్తులు
కులాల కుంపట్లు, పొత్తుల కత్తులు, కిచిడీ కూటములు, జంపింగ్ జపాంగ్లకు పెట్టింది పేరైన బిహార్లో రాజకీయాలు ఎప్పుడూ కాక పుట్టిస్తూనే ఉంటాయి. 40 సీట్లతో లోక్సభ నియోజకవర్గాల పరంగా దేశంలో నాలుగో స్థానంలో నిలుస్తున్న ఈ తూర్పు రాష్ట్రానిది జాతీయ రాజకీయాల్లో ఆది నుంచీ కీలక పాత్రే. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ మొదలు జగ్జీవన్రాం, నుంచి లాలూ ప్రసాద్, నితీశ్కుమార్ దాకా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉద్ధండ నేతలకు పుట్టిల్లు బిహార్. అధికారం కోసం ప్రాంతీయ, జాతీయ పార్టీల మధ్య కుమ్ములాటలు, వర్గ పోరు, పవర్ పాలిటిక్స్ ఇక్కడ సర్వసాధారణం. స్టేట్ స్కాన్ రాజకీయంగా చైతన్యవంతమైన బిహార్లో లోక్సభ ఎన్నికల ముంగిట కొత్త పొత్తులు పొడిచాయి. గత ఎన్నికల్లో బీజేపీ, జేడీ (యూ), లోక్ జనశక్తి పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఏకంగా 39 సీట్లను ఒడిసిపట్టింది. బీజేపీ 17 సీట్లలో పోటీ చేసి అన్నీ గెలుచుకుంది. జేడీ(యూ) 17 సీట్లకు 16 చోట్ల, ఎల్జేపీ ఆరింటికి ఆరూ కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ తదితర పార్టీల మహాకూటమి మహా ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ 9 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు గెల్చుకోగా ఆర్జేడీ 19 స్థానాల్లో తలపడినా సున్నా చుట్టింది. మిగతా పార్టీలదీ అదే పరిస్థితి. కేంద్రంలో మోదీ 2.0 బలమైన సర్కారు ఏర్పాటులో బిహార్ ఘనవిజయానిది ప్రధాన పాత్ర. ఈసారి పాత మిత్రులతో పూర్వ వైభవానికి కాంగ్రెస్ ప్రయతి్నస్తోంది. బిహార్లో 40 స్థానాల్లో ఆరింటిని ఎస్సీలకు కేటాయించారు. నితీశ్ పిల్లిమొగ్గలు... బిహార్ రాజకీయాల్లో వెలుగు వెలిగిన లాలు అవినీతి కేసుల్లో జైలుపాలైన నాటి నుంచీ రాష్ట్రంపై నితీశ్ కుమార్ పట్టుబిగించారు. ఏదో ఒక పార్టీతో పొత్తుతో 15 ఏళ్లుగా సీఎం పీఠాన్ని అంటిపెట్టుకున్నారు. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, సమాజ్వాదీ, జేడీ(ఎస్), కాంగ్రెస్ మహా కూటమిగా పోటీ చేశాయి. ఆర్ర్జేడీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించినా నితీశ్ సీఎం పదవి దక్కించుకున్నారు. రెండేళ్లు తిరిగేసరికి మహాకూటమికి గుడ్బై చెప్పి మళ్లీ బీజేపీతో జట్టుకట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో సీట్ల సర్దుబాటు చేసుకుని అత్యధిక ఎంపీ సీట్లను దక్కించుకున్నారు. అదే జోరులో 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ భాగస్వామిగా పోటీ చేసి సీఎం పీఠమెక్కారు. జేడీ(యూ) (43) కంటే బీజేపీ (74)కే ఎక్కువ సీట్లు దక్కినా నితీశ్ మళ్లీ సీఎం పదవి దక్కించుకోవడం విశేషం. రెండేళ్లలోనే ఆయన మళ్లీ ప్లేటు ఫిరాయించారు. లోక్సభ ఎన్నికల్లో మోదీని ఢీకొట్టడమే లక్ష్యంగా విపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తామంటూ ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చేశారు. మహాకూటమి దన్నుతో మళ్లీ సీఎం అయ్యారు! ఇండియా కూటమి ఏర్పాటు కీలక పాత్ర పోషించారు. తీరా గత జనవరిలో ఎన్డీఏలోకి గెంతి మహాకూటమికి, ఇండియా కూటమికీ కోలుకోలేని షాకిచ్చారు. బీజేపీ దన్నుతో సీఎం పదవిని కాపాడుకున్నారు. లోక్సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు. బీజేపీకి కలిసొస్తుందా...? నితీశ్తో కలిసి 2019 ఫలితాలను రిపీట్ చేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కానీ దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న నితీశ్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎన్డీఏ సీట్లకు గండి కొట్టవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టడాన్ని నితీశ్ సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. అది తమ ఘనతేనని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఆ హామీ ఇస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. బీజేపీ అయోధ్య రామ మందిరంతో హిందుత్వ నినాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంపై ఆశలు పెట్టుకుంది. ఈసారి బీజేపీ 17, జేడీయూ 16, చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జేపీ 5, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ ఆవామ్ మోర్చా, రా్రïÙ్టయ లోక్ సమతా పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. కులగణన ఎవరికి ప్లస్! బిహార్ రాజకీయాలు చిరకాలంగా కులాల చుట్టూనే తిరుగుతున్నాయి. నితీశ్ చేపట్టిన కులగణన మరోసారి రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. రాష్ట్రంలో 94 లక్షల కుటుంబాలు (34.13%) నెలకు రూ.6,000 సంపాదన కూడా లేక పేదరికంలో మగ్గుతున్నాయని కులగణనలో వెల్లడైంది. రాష్ట్రంలో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచాల్సిందేనని నితీశ్ పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 19.65 శాతం ఎస్సీలు, 1.68 శాతం ఎస్టీలున్నారు. వారిలో ఏకంగా 42.7 శాతం మంది నిరుపేదలని కులగణనలో తేలింది. 27.13 శాతం ఓబీసీలున్నారు. వీరిలో 14.26 శాతం యాదవులు. దాదాపు 17 శాతం మంది ముస్లింలున్నారు. మహాకూటమి యాదవులు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ గురిపెట్టింది. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరగాల ని డిమాండ్ చేస్తోంది. అగ్రవర్ణాలతో పాటు ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలనూ ఆకర్షించేలా బీజేపీ, జేడీయూ పావులు కదుపుతున్నాయి. ప్రధాని మోదీ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సర్వేల సంగతేంటి...? బిహార్లో ఎన్నికల సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నితీశ్ చేరికతో ఎన్డీఏకు 32 నుంచి 35 సీట్లు రావచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. ఇండియా కూటమికి 5–8 సీట్లే వస్తాయని చెప్పాయి. అయితే నితీశ్పై ప్రజా వ్యతిరేకత ఇండియా కూటమికి కలిసొస్తుందని ఇండియా కూటమి 15 నుంచి 20 పై చిలుకు దాకా చేజక్కించుకోవచ్చని మరికొన్ని సర్వేల అంచనా. ఇండియా కూటమి పైచేయి సాధిస్తుందా? ఎన్నికల వేళ వెన్నుపోటు పొడిచిన నితీశ్కు గుణపాఠం నేర్పాలని కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది. ఆయనది పచ్చి అవకాశవాదమంటూ కాంగ్రెస్, ఆర్జేడీ దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రంలో కులగణన తమ సంకీర్ణ సర్కారు ఘనతేనని ప్రచారం చేస్తున్నాయి. ఇది దేశానికి ఎక్స్రే వంటిదని, కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్నారు. మోదీ హయాంలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, కార్పొరేట్ దోపిడీ తదితరాలను ప్రచారా్రస్తాలుగా మలచుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వోద్యోగాలతో పాటు పలు సంక్షేమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 6 న్యాయాలు 25 గ్యారంటీలతో విడుదల చేసిన జాతీయ మ్యానిఫెస్టోను కాంగ్రెస్ ఊరూవాడా ప్రచారం చేస్తోంది. పొత్తులో భాగంగా ఆర్జేడీకి 26, కాంగ్రెస్ 9కి, లెఫ్ట్ పార్టీలకు 5 సీట్లు దక్కాయి. ఆర్జేడీ తమ 26 సీట్లలో మూడింటిని మాజీ మంత్రి ముకేశ్ సాహ్ని సారథ్యంలోని వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కి కేటాయించింది. అబ్బాయ్–బాబాయ్ పోరు బిహార్లో అబ్బాయ్–బాబాయ్ అమీతుమీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన వారసత్వం కోసం కుమారుడు చిరాగ్, సోదరుడు పశుపతి పరాస్ హోరాహోరీ తలపడ్డారు. చివరికి పార్టీని పరాస్ చేజిక్కించుకున్నారు. చిరాగ్కు ఎల్జేపీ (రాం విలాస్), పశుపతికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) పేర్లను ఎన్నికల సంఘం కేటాయించింది. పశుపతి పార్టీకి బీజేపీ ఒక్క సీటూ ఇవ్వకపోవడంతో ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగారు. సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించారు. చిరాగ్కు బీజేపీ ఐదు సీట్లు ఇవ్వగా పట్టుబట్టి పాశ్వాన్ల కంచుకోట అయిన హాజీపూర్ను సాధించుకున్నారు. అక్కడ బాబాయ్ పశుపతిపై చిరాగ్ నేరుగా తలపడుతుండటం విశేషం! సర్వేల సంగతేంటి...? బిహార్లో ఎన్నికల సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నితీశ్ చేరికతో ఎన్డీఏకు 32 నుంచి 35 సీట్లు రావచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. ఇండియా కూటమికి 5–8 సీట్లే వస్తాయని చెప్పాయి. అయితే నితీశ్పై ప్రజా వ్యతిరేకత ఇండియా కూటమికి కలిసొస్తుందని ఇండియా కూటమి 15 నుంచి 20 పై చిలుకు దాకా చేజక్కించుకోవచ్చని మరికొన్ని సర్వేల అంచనా. యూపీఏ హయాంలో భారత్ను బలహీన దేశంగా చూసేవారు. చిన్నాచితకా దేశాల నుంచి కూడా ఉగ్రవాదులు మనపై దాడులకు తెగబడేవారు. కాంగ్రెసేమో చేతకానితనంతో వేరే దేశాలకు ఫిర్యాదు చేస్తుండేది. నేటి భారత్ అలాకాదు, అవసరమైతే ఉగ్రవాదుల ఇళ్లలో దూరి మరీ అంతం చేస్తుంది. – బిహార్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ మహాకూటమి దెబ్బకు బీజేపీ, ఎన్డీఏ కంగుతిన్నాయి. అందుకే మోదీతో సహా అగ్ర నేతలంతా బిహార్లోనే తిరుగుతున్నారు. విపక్షాలపై కత్తిగట్టి ఈడీ, సీబీఐ కూడా ఇక్కడే మరింత ఫోకస్ చేస్తున్నాయి. పేదరికం, ఉపాధి, బిహార్ చిరకాల కోరికైన ప్రత్యేక హోదా గురించి మోదీ మాట్లాడాలి. – ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: ఆ మూడ్ స్వింగ్ ఎటో!
దేశంలో మోదీ మేనియా ఏమాత్రం తగ్గలేదని, ఫలితంగా వరుసగా మూడో ఘనవిజయంతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే కీలక రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, బిహార్, మహారాష్ట్రల్లో మాత్రం ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు. దాంతో వాటిని ఈసారి ఎన్నికల ఫలితాలను నిర్దేశించగల స్వింగ్ స్టేట్లుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఆ మూడు రాష్ట్రాలూ కలిపి ఏకంగా నాలుగో వంతు ఎంపీలను లోక్సభకు పంపుతున్నాయి! వాటిని నిర్ణాయక రాష్ట్రాలుగా మారుస్తున్న కారకాలేమిటి? అక్కడ ఫలితాలను ఊహించడం ఎందుకింత కష్టసాధ్యంగా మారింది...? అమెరికాలో 7 రాష్ట్రాలను స్వింగ్ స్టేట్స్గా పేర్కొంటారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రతిసారీ అవే నిర్ణయిస్తుంటాయి. ఎన్డీఏ 400 సీట్లు దాటాలన్న లక్ష్యాన్ని దాటుతుందో లేదో బెంగాల్, బిహార్, మహారాష్ట్ర ఫలితాలు నిర్ణయించనున్నాయి. బెంగాల్లో టీఎంసీ,బీజేపీ మధ్య పోరు నెలకొంది. బిహార్లో రాజకీయ పునరేకీకరణతో సమీకరణాలు మారాయి. మహారాష్ట్రలో రెండు పెద్ద పార్టీలు నిలువునా చీలి రెండో ఎన్డీఏలో, మరో రెండు విపక్ష ఇండియా కూటముల్లో చేరి ఎదురెదురుగా మోహరించాయి. దాంతో 130 ఎంపీ సీట్లున్న ఈ 3 రాష్ట్రాల్లో ఎవరికెన్ని సీట్లు వస్తాయన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. బెంగాల్లో బీజేపీ పాచిక పారేనా...? 2019 లోక్సభ ఎన్నికల్లో పశి్చమబెంగాల్లో బీజేపీ పాగా వేసిన తీరు ఆసక్తికరం. మోదీ మేనియాకు పౌరసత్వ అంశం తదితరాలు తోడవడంతో 42 లోక్సభ స్థానాల్లో ఏకంగా 18 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకోగలిగింది. 2014లో 17 శాతమున్న ఓటు శాతాన్ని 40 శాతానికి పెంచుకోగలిగింది. ఈసారి పరిస్థితి ఎలా ఉండనందన్నది అంచనాలకు అందడం లేదు. కాకపోతే ప్రతి స్థానంలోనూ హోరాహోరీ పోరు ఖాయంగా కన్పిస్తోంది. ప్రధాని మోదీ ఇంకా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టలేదు. ఆయన ఏయే అంశాలను ప్రచారాస్త్రాలుగా సంధిస్తారన్నది కూడా ఆసక్తికరం. వాటిని బట్టి రాష్ట్రంలో ఓటర్ల మూడ్ మారిపోయే ఆస్కారముంది. అయితే బెంగాల్లో ఈసారి బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెబుతుండటం ఆసక్తికరం. మిగతా విశ్లేషకులు మాత్రం బీజేపీకి ఈసారి ఓట్లశాతం మరింత పెరగవచ్చంటూనే, అది సీట్ల సంఖ్యలో ప్రతిఫలిస్తుందో లేదో చూడాలని చెబుతుండటం విశేషం. పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడం తదితరాల నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా ఉన్న ముస్లింల ఓట్లు పూర్తిగా టీఎంసీ వైపు మళ్లినట్టేనని వారంటున్నారు. ఇది మా పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి అతి పెద్ద సానుకూలాంశంగా కన్పిస్తోంది. ‘‘దీనికి తోడు యూపీ వంటి రాష్ట్రాల మాదిరిగా బెంగాల్లో బీజేపీకి పటిష్టమైన సంస్థాగత నిర్మాణం లేదు. పైగా రాష్ట్ర పార్టీలో సువేందు అధికారి, దిలీప్ ఘోష్, సుకాంతో మజుందార్ మధ్య ఆధిపత్య పోరు పుట్టి ముంచేలా కన్పిస్తోంది’’ అని సీనియర్ జర్నలిస్టు జయంత ఘోషా అభిప్రాయపడ్డారు. తృణమూల్ తన 22 స్థానాలను నిలుపుకుంటుందని, బీజేపీకి ఒక సీటు పెరుగుతుందని, కాంగ్రెస్ ఒక్క స్థానానికి పడిపోతుందని ఇండియాటుడే సర్వే పేర్కొంది. రసకందాయంలో బిహార్ 2019లో ఎన్డీఏ క్లీన్స్వీప్ చేసిన రాష్ట్రాల్లో బిహార్ ముఖ్యమైనది. 40కి ఏకంగా 39 స్థానాలు అధికార కూటమి వశమయ్యాయి. కానీ ఇక్కడ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం ఎప్పుడూ కత్తిమీద సామే. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నల్లేరుపై నడకేనని అంతా భావించారు. తీరా చూస్తే ఆ అంచనాలన్నీ తప్పి జేడీ(ఎస్), ఆర్జేడీల మహాఘట్బంధన్ ఘనవిజయం సాధించింది. కానీ పల్టూ రామ్గా పేరుపడ్డ జేడీ(యూ) సారథి, సీఎం నితీశ్కుమార్ 2020 అసెంబ్లీ ఎన్నికల నుంచి వేస్తున్న పిల్లిమొగ్గలతో ఓటర్లలో తీవ్ర అయోమయం నెలకొన్నట్టు కన్పిస్తోందని పటా్నకు చెందిన సీనియర్ జర్నలిస్టు రోహిత్సింగ్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టిన నితీశ్ 2022లో దానికి కటీఫ్ చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమితో స్నేహం చేశారు. తాజాగా గత జనవరిలో మళ్లీ ఎన్డీఏ గూటికి చేరారు. దీన్ని జనం జీరి్ణంచుకోలేకపోతున్నారన్నది రోహిత్ విశ్లేషణ. అయితే కుల సమీకణాల కోణంలో బీజేపీ–జేడీ(యూ) భాగస్వామ్యం బలమైన జోడీగా కన్పిస్తుండటం విశేషం. కుర్మీ సామాజికవర్గానికి చెందిన నితీశ్కు రాష్ట్రంలో ఏకంగా 36 శాతమున్న అత్యంత వెనకబడ్డ వర్గాల్లో విశేష ఆదరణ ఉంది. పైగా గతేడాది బిహార్లో జరిపించిన కులగణన ఆయనకు మరిన్ని ఓట్లు కురిపించేలా కన్పిస్తోంది. 2005, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–జేడీ(యూ) జోడీ సూపర్హిట్టయింది. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ ఏకంగా 39 సీట్లు కొల్లగొట్టింది. దీనికి తోడు ఎన్నికల వేళ ఇంటి పోరు ఆర్జేడీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో మోదీ–నితీశ్ జోడీ దూకుడును తేజస్వీ యాదవ్ ఏ మేరకు నిలువరిస్తారన్నది ఆసక్తికరం. ‘మహా’ గందరగోళం... 48 సీట్లున్న మహారాష్ట్ర యూపీ తర్వాత లోక్సభకు అత్యధిక ఎంపీలను పంపుతోంది. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. 2019లోనైతే బీజేపీ, శివసేన సంయుక్తంగా ఏకంగా 41 స్థానాలు ఒడిసిపట్టాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో రాజకీయాలతో పాటు ఏకంగా పార్టీలే మారిపోయాయి! తర్వాత ఏక్నాథ్ షిండే సారథ్యంలో శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలో మరో కీలక పార్టీ ఎన్సీపీ నిలువునా చీలిపోయాయి. చీలిక వర్గాలే అసలైన పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఎన్డీఏలో చేరి బీజేపీతో జట్టు కట్టి ఎన్నికల బరిలో దిగాయి. దీన్ని ప్రజలు పెద్దగా జీర్ణించుకోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతో ఈసారి కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కూడిన విపక్ష ఇండియా కూటమిదే పైచేయి కావచ్చంటున్నారు. సర్వేలు కూడా ఇండియా కూటమి ఏకంగా 26 స్థానాలు గెలుస్తుందంటున్నాయి. అదే నిజమైతే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి 20 సీట్లకు పైగా గండి పడుతుంది! అదే సమయంలో ఎన్నికల వేళ ఎంఎన్ఎస్ నేత రాజ్ ఠాక్రే మద్దతు ఎన్డీఏకు కాస్త కలిసొచ్చేలా కన్పిస్తోంది. మరాఠా రిజర్వేషన్లది కూడా ఈసారి రాష్ట్రంలో కీలక పాత్ర కానుంది. విద్య, ఉద్యోగాల్లో వారికి అదనంగా 10 శాతం కోటా కలి్పస్తూ శివసేన చీఫ్, సీఎం ఏక్నాథ్ షిండే ఇటీవలే అసెంబ్లీలో బిల్లు పెట్టారు. సాంప్రదాయికంగా బీజేపీ ఓటర్లయిన ఇతర వెనకబడ్డ వర్గాలు దీనిపై గుర్రుగా ఉన్నారు. మరాఠా కోటా తమ వాటాకే ఎసరు పెడుతుందన్న భయం వారిలో పెరుగుతోంది. ఇన్ని సమీకరణాల మధ్య మహారాష్ట్రలో ఎవరికెన్ని సీట్లొస్తాయో అంచనా వేయడం కష్టంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్
Related News by category
-
ఆ పేరే... ఒక నమ్మకం!
నలభై రెండు డిగ్రీలు దాటిన ఎండల్లో నడిరోడ్లపై గంటల తరబడి వేలాదిమంది ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారంటే అర్థం ఏమిటి? వయోభేదం లేదు. కులమతాల పరిధులు లేవు. ఆడామగా తేడా లేదు. ఆబాల గోపాల జన తరంగం ఆ నాయకుడు కనిపించగానే కేరింతలు కొట్టడం దేనికి సంకేతం? ఆ నిరీక్షణలకు అర్థం అక్కడో ప్రభంజనం వీస్తున్న దని! ఒక వేవ్ పుట్టిందనడానికి సంకేతాలే అక్కడ కనిపించే పరవశాల కేరింతలు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 27 రోజులపాటు సాగించిన బస్సు యాత్ర సందర్భంగా అటువంటి ఒక ప్రభంజనం పెల్లుబికింది.నాన్నల భుజాల మీద నిలబడి నాయకుడు కనిపించగానే సంభ్రమంతో ‘జగన్ మామా’ అని ఎలుగెత్తే చిన్నారులు. ఓ చేత్తో చంటిబిడ్డనెత్తుకొని మరో చేత్తో మొబైల్ ఫోన్ ఎక్కుపెట్టి దగ్గరగా జగనన్న ఫోటోను తీసుకోవడానికి ఆరాటపడుతున్న ఆడపడుచులు. దూరంగా బస్సు కనిపించగానే ‘అదిగో నా కొడుకొస్తున్నాడ’ని బోసినవ్వుతో భావప్రకటన చేసే అవ్వా తాతలు. నాయకుని వాహనం ముందూవెనుకా ఉరకలెత్తుతున్న యవ్వనోత్తేజాలు. రోడ్డు పక్కనున్న స్తంభాలను అధిరోహించి, చెట్ల కొమ్మలనాక్రమించి జయ జయధ్వానాలు చేసే చిట్టి తమ్ముళ్లు. ముఖాల మీద భద్రతా భావాన్ని, భరోసాను వేలాడ దీసుకొని రోడ్డు పక్క భవనాల మీద నిలబడి ఎదురు చూస్తున్న నడివయసు అన్నలూ అక్కలూ!ఆనందోద్వేగాల వ్యక్తీకరణలో ఎన్ని ఛాయలుంటాయి? అభినందనాభివ్యక్తిని ఎన్ని రంగుల్లో ప్రకటించవచ్చును? కృత జ్ఞతాపూర్వక అరుపుల్లో, కంటి మెరుపుల్లో కనిపించే సందేశ కావ్యాల్లో ఎన్ని రకాలుంటాయి? బస్సు యాత్రలో పాల్గొన్న జనప్రవాహం దృశ్యాలను ఫ్రేములుగా విడదీసి ఒక్కొక్కటే గమనించండి. లెక్కించలేనన్ని ఛాయలు. ఊహలకందని రంగులు. చదవలేనన్ని సందేశాలు కనిపిస్తాయి. ఒక నాయకుడు లక్షలాది మంది ప్రజలతో విడివిడిగా ముఖాముఖి సంబంధం ఏర్పరుచుకుంటే తప్ప ఇన్ని భావోద్వేగాలు ఉదయించవు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడిగా కనిపిస్తాడట! జన సమ్మోహన నాయకుడు కూడా అంతే! నాయకుడి మీద ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడినప్పుడే ఈ ఆత్మీయ బంధం అల్లుకుంటుంది. డెబ్బయ్యో దశకంలో ఇందిరాగాంధీ దగ్గర ఈ మ్యాజిక్ ఉండేది. కోట్లాదిమంది భారతీయులు ఆమెను ‘అమ్మ’గా పిలుచుకునేవారు. ఎనభయ్యో దశకంలో ఎమ్జీ రామచంద్రన్, ఎన్టీరామారావు వారి రాష్ట్రాల్లోని ప్రజలతో ఆత్మీయ స్పర్శను అనుభవించగలిగారు. పేదల జీవితాల్లో మార్పులు తెస్తాడన్న నమ్మకంతో ఎమ్జీఆర్ను ‘పురట్చి తలైవర్’ (విప్లవ నాయకుడు)గా తమిళ ప్రజలు పిలుచుకున్నారు. పేదవాడి అన్నం గిన్నెగా మారిన ఎన్టీఆర్ను తెలుగు ప్రజలు ‘అన్న’గా సంబోధించారు. ఐదు పదుల వయసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి తన ఐదేళ్ల పదవీ కాలంలో పేదల బతుకుల్లో విప్లవాత్మక మార్పులకు పునాదులు వేయడంతోపాటు కోట్లాది మంది నోట ఆప్యాయంగా ‘అన్నా’ అని పిలుచుకోగలుగు తున్నారు.ఎమ్జీఆర్, ఎన్టీఆర్ల సంగతి వేరు. వారు రాజకీయాల్లోకి రాకముందే అఖండ ప్రజాదరణ కలిగిన సినీ హీరోలు. సినిమాల్లో వారు ఎక్కువగా పోషించినవి కూడా ఉదాత్తమైన పాత్రలు. అందువల్ల వారి రాజకీయ ప్రవేశం తమకు మేలు చేస్తుందని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వారు కూడా వమ్ము చేయలేదు. వారి సంగతి సరే! మరి జగన్మోహన్రెడ్డికి ఇంతటి జనాకర్షణ ఏర్పడటానికి కారణ మేమిటి? ప్రజలు ఆయన్ను ఇంతగా గుండెల్లో ఎందుకు పెట్టుకున్నారు? ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఆరేళ్లు పనిచేసిన అనంతరం 1989లో ఎన్నికలకు వెళ్లినప్పుడు పూర్వపు ఆదరణ కనిపించలేదు. ఆయన ప్రచార రథం వెంట జనం పరుగులు తీయలేదు. ఆయన రాక కోసం గంటల తరబడి నిరీక్షించడం కనిపించలేదు.జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పరిపాలన తర్వాత మొన్నటి బస్సు యాత్ర సందర్భంగా కనిపించిన దృశ్యాలు వేరు. ఎన్టీఆర్ తొలిరోజుల్లో సభావేదిక నెక్కి ‘నేల ఈనిందా... ఆకాశం చిల్లులు పడిందా’ అనగానే జన సముద్ర ఘోష దద్దరిల్లేది. ‘నా రక్తంలో రక్తమైన నా సోదరులారా’ అని ఎమ్జీఆర్ ప్రసంగం ప్రారంభించగానే జంఝామారుతంలా హర్షధ్వానాలు మార్మోగేవి. కానీ ఐదేళ్ల పాలన తర్వాత కూడా జగన్మోహన్రెడ్డికి అదే స్పందన. ప్రసంగానికి ముందు చేతిలోకి మైకు తీసుకుని వేళ్లతో దాని మీద తాళం వేయగానే వేల గొంతుకల్లో ఆ ప్రతిధ్వని మార్మోగుతున్నది. మాట మాటకూ చప్పట్ల కోరస్. మంత్రం వేసినట్టుగా ఆయన మాటతో మాట కలుపుతున్నారు. జనానికీ, జగన్కూ మధ్య ఏర్పడిన ఈ కమ్యూ నికేషన్ ఓ అధ్యయనాంశం.జగన్మోహన్రెడ్డి సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించు కొని పదమూడేళ్లయింది. ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా, ఐదేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసి మరోసారి అధికారం కోసం జనం ముందుకు వెళ్తున్నారు. మళ్లీ భారీ ఆధిక్యతతో అధికారంలోకి వస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రజలతో ఆయన సంబంధం రోజురోజుకూ బలపడుతున్నది. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన సీనియర్ మోస్ట్ రాజ కీయవేత్త ప్రజాదరణలో జగన్మోహన్రెడ్డి దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. కారణం ఏమై ఉంటుంది?కారణం... ఆయన క్యారెక్టర్. మాట తప్పని, మడమ తిప్పని నైజం. ఎట్టి పరిస్థితుల్లో నోటి వెంట ఒక్క అబద్ధం కూడా చెప్పని తత్వం. పేదలకు, అసహాయులకు, రోగగ్రస్థులకు ప్రేమను పంచే స్వభావం. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలన్న పొలిటికల్ ఫిలాసఫీ. అంబేడ్కర్, అబ్రహాం లింకన్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ లక్షణాలన్నీ ఆయన్ను వర్తమాన రాజకీయ నేతల మధ్య ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆయన స్వభావానికీ, ఫిలాసఫీకీ పూర్తి భిన్నమైన చిత్రీకరణతో ఆయన ఎదుర్కొన్నంత దుష్ప్రచారాన్ని దేశ రాజకీయ నాయకుల్లో ఎవరూ ఎదుర్కోలేదు. ఆయన మీద జరిగినన్ని కుట్రలు ఎవరి మీదా జరగలేదు. అయినా శిలాసదృశంగా నిలబడగలిగారంటే అందుకు కారణం ఆయన క్యారెక్టర్. నిజాయితీ. ఇదిగో ఈ నిజాయితీ జనంలోకి డైరెక్ట్గా కమ్యూని కేట్ అయింది. గోబెల్స్ గొలుసుల్ని తెంచుకొని, మీడియా గోడల్ని బద్దలు కొట్టుకొని మరీ ఆయన క్యారెక్టర్ జనం గుండె ల్లోకి వెళ్లిపోయింది.జగన్మోహన్రెడ్డి మీద జరిగిన కుట్రల కమామిషు, ఆయన నాయకుడుగా ఎదిగిన కథాక్రమం తెలుగు ప్రజలు ఎరిగిన సంగతులే. చర్విత చర్వణం అనవసరం. ప్రజలిచ్చిన అధికారాన్ని అయిదేళ్లపాటు ప్రజా సాధికారత కోసమే ఆయన ఖర్చు చేశారు. అంతకు ముందు పది శాతమున్న పేదరికాన్ని నవరత్న పథకాల సాయంతో నాలుగు శాతానికి తగ్గించ గలిగారు. వచ్చే ఐదేళ్ల లోపల పేదరికాన్ని నిశ్శేషం చేయడం కోసం ఆ రత్నాలకు మరింత మెరుగుదిద్దినట్టు శనివారం ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో వెల్లడైంది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చేసిన ప్రసంగం జగన్మోహన్రెడ్డి నిజాయితీకి అద్దం పట్టింది. ఆయన విజన్ను, తాత్వికతను మేనిఫెస్టో ఆవిష్కరించింది. ఒకపక్క ఆయన ప్రత్యర్థి అలవికాని వాగ్దానాలతో చెలరేగిపోతున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపెడుతున్నారు. బొందితో కైలాసానికి తీసుకెళ్తానన్న స్థాయిలో వాగ్దానాలు కురిపిస్తున్నారు. సూపర్ సిక్స్లు కొడతా నంటున్నారు. ప్రత్యర్థి చేస్తున్న ఈ ఊకదంపుడు... ముఖ్యమంత్రిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎందుకంటే, ఆయన పేరే ఒక నమ్మకంగా ప్రజల గుండెల్లో స్థిరపడిపోయింది.చంద్రబాబు బోగస్ హామీలను పూర్వపక్షం చేస్తూ జగన్మోహన్రెడ్డి మాట్లాడిన తీరు లైవ్లో చూస్తున్న లక్షలాది మంది టీవీ వీక్షకులను ఆకట్టుకున్నది. సంపద సృష్టించి హామీలు అమలుచేస్తానని చెబుతున్న చంద్రబాబు వాదనలోని డొల్లతనాన్ని ఆయన బయటపెట్టారు. చంద్ర బాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన పధ్నాలుగేళ్లూ ప్రతిపాదించిన బడ్జెట్లన్నీ రెవెన్యూ లోటునే చూపెట్టాయనీ, ఇక సంపద సృష్టించిందెక్కడనీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పేదల సంక్షేమం సాధికారతల పట్ల తనకంటే చిత్తశుద్ధి ఉన్న వారెవరూ లేరని చెబుతూ ప్రజలకు ఎంత గరిష్ఠంగా మేలు చేయగలమో ఆ మేరకే హామీలివ్వగలం తప్ప అబద్ధాలు చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పు లకు బాటలు పరుస్తూ, బలహీనవర్గాలు – మహిళల సాధికారత కోసం అడుగులు వేస్తూ సాగిన ఐదేళ్ల పాలన కొనసాగింపుగానే మరో ఐదేళ్ల పాలనకు సంబంధించిన మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఇది విప్లవ కర్తవ్యాల కొనసాగింపు. విద్యారంగంలో తాను ప్రవేశపెడుతున్న మార్పులు మరో పదిహేనేళ్లు కొనసాగితే పేదరికం ఆనవాళ్లు కూడా రాష్ట్రంలో కనిపించవని ఆయన నమ్ముతున్నారు. పేద విద్యార్థులందరూ సంపన్నుల బిడ్డలతో సమానంగా నాణ్యమైన విద్యను అభ్యసించగల పరిస్థితులను ప్రజలంతా స్వాగతించాలి. ప్రతి ఇంటినీ ఓ ఫ్యామిలీ డాక్టర్ సందర్శించగల అత్యున్నత స్థాయి వైద్య సేవల సమాజాన్ని నిండు మనసుతో ఆహ్వానించాలి. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో తరతరాలుగా వెనుకబడిన సమూహా లను, మహిళలను ముందడుగు వేయించే ప్రయత్నాలకు ప్రజ లందరూ భుజం కాయాలి. ఉన్నతస్థాయి సమాజ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాల వెన్నంటి నడవాలి. పేదల విముక్తికి అడ్డుగోడలా నిలబడుతున్న పెత్తందారీ శక్తులనూ, వారి రాజకీయ శిబిరాలనూ ఓడించాలి. లాంగ్ లివ్ ది రివల్యూషన్! ఇంక్విలాబ్ జిందాబాద్!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఈవీఎం వివాదం చల్లారేనా!
సార్వత్రిక ఎన్నికల రెండో దశ కూడా పూర్తికావస్తుండగా శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం ఈవీఎంల వినియోగంపై వచ్చిన వ్యాజ్యాలను తోసిపుచ్చింది. విపక్షాలను విమర్శించటానికీ, ఆరోప ణలు సంధించటానికీ వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోని ప్రధాని నరేంద్ర మోదీ... ఇంకా అయిదు దశల పోలింగ్ జరగాల్సిన తరుణంలో మౌనంగా ఎందుకుంటారు? అందుకే కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్షాలకు ఈ తీర్పు చెంపపెట్టన్నారు. ఈవీఎంలపై సందేహాలు రేకెత్తించిన పాపానికి క్షమాపణలు చెప్పాలని కూడా మోదీ డిమాండ్ చేశారు. దేన్నయినా సందేహించటం దానికదే పాపం కాదు. పాపమే అనుకుంటే బీజేపీ, కాంగ్రెస్ సహా దాదాపు అందరికందరూ ఆ పాపం చేసినవారే. ఒకటి రెండు పార్టీలు మినహాయిస్తే పరాజితుల ప్రథమ కోపం ఎప్పుడూ ఈవీఎంలపైనే. వరసగా 2004, 2009 ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడు బీజేపీ ఈవీఎంలనే తప్పుబట్టింది. 2012 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పుడు కాంగ్రెస్ కూడా ఆ పనే చేసింది. హ్యాకర్ల ద్వారా ఈవీఎంల సోర్స్ కోడ్ మార్చి అకాలీదళ్ తమ విజయాన్ని దొంగిలించిందని ఆరోపించింది. ఇక యూటర్న్ల సిద్ధ హస్తుడైన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకైతే ఇలాంటి ఆరోపణలు మంచినీళ్లప్రాయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పుడు ఈవీఎంలపైనే ఆయన ఆగ్రహం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గినప్పుడు మాత్రం చప్పుడు చేయలేదు. మళ్లీ 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చాక ఈవీఎంలపై వీరంగం వేశారు. మధ్యలో ఈవీఎంలు దొంగిలించిన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో మీడియా సమావేశం ఏర్పాటు చేయించి వాటిని తారుమారు చేయొచ్చని చూపించే ప్రయత్నం చేసింది కూడా చంద్రబాబే. మళ్లీ ఎన్డీఏ పంచన చేరినందువల్ల ఈవీఎంల వివాదంపై ఇప్పుడాయన కిక్కురుమనటం లేదు. ఇతరుల మాటెలావున్నా ప్రస్తుతం ఈవీఎంల వినియోగాన్ని సవాలు చేసిన సంస్థల్లో విశ్వసనీయతగల అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ కూడా వుంది. కనుక ఈవీఎంలను సందేహించటం స్వప్రయోజనాల కోసమేనని భావించలేం. అదో పెద్ద నేరంగా పరిగ ణించలేం. అలాగని పేపర్ బ్యాలెట్ విధానం సవ్యంగా సాగిందా? పోలింగ్ బూత్లు చేజిక్కించు కుని, బ్యాలెట్ పేపర్లు గుంజుకుని తమ గుర్తుపై ముద్రలు వేసుకుని పెత్తందారులు చెలరేగిపోలేదా? రిగ్గింగ్ ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఎన్నిసార్లు రీపోలింగ్ జరపక తప్పలేదు! ఈవీఎంల వల్ల ఈ జాడ్యం ఎంతో కొంత కట్టడి అయింది. నిమిషానికి కేవలం అయిదు ఓట్లు మాత్రమే వాటిల్లో నమో దయ్యే అవకాశం వుండటం వల్ల పోలింగ్ కేంద్రాలు ఆక్రమించిన దుండగులకు గతంలోని వెసులు బాటు పోయింది.వెనువెంటనే బలగాలు ఆ పోలింగ్ కేంద్రాన్ని చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే అవ కాశం వుండటం వల్ల వారి ఆటలు సాగటం లేదు. 1982లో తొలిసారి ఈవీఎంలతో కేరళలో ఒక ఉప ఎన్నిక నిర్వహించారు. అయితే తగిన చట్టం లేకుండా ఈవీఎంల వినియోగం చెల్లదంటూ సుప్రీంకోర్టు ఆ ఎన్నికను రద్దు చేసింది. 1998లో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో కేవలం కొన్ని నియోజక వర్గాల్లో 45 ఈవీఎంలను ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఈవీఎంలపై తరచు ఫిర్యాదులు వస్తున్నందువల్ల వాటికి ప్రింటర్లను అనుసంధానించాలని 2013లో సుప్రీంకోర్టు ఆదేశించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పరిమితంగా దాన్ని అమలు చేసినా... ఆ తర్వాత కాలంలో వీవీ ప్యాట్ల పూర్తిస్థాయి వినియోగం మొదలైంది. ఓటరు తనకు నచ్చిన గుర్తుకు ఓటేసిన వెంటనే ప్రింటర్పై ఆ పార్టీ పేరు, గుర్తు ఏడు సెకన్లపాటు కనబడే ఏర్పాటుచేశారు. ఆ వెంటనే ఒక స్లిప్పై అది ప్రింటయి దానికి అనుసంధానించిన బాక్స్లో పడుతుంది. పోలింగ్ సమయంలోనైనా, కౌంటింగ్ సమయంలోనైనా ఈవీఎంలను దేనితోనూ అనుసంధానించటం సాధ్యంకాదని... రిమోట్ కంట్రోల్, బ్లూటూత్, వైఫైలతో నియంత్రించటం కూడా అసాధ్యమని ఎన్నికల సంఘం పదే పదే చెబుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలైన బెంగళూరు బెల్, హైదరాబాద్ ఈసీఐఎల్ వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. పోలింగ్కు ముందు ఈవీఎంల తనిఖీకి అభ్యర్థులకు అవకాశం ఇస్తున్నారు. చిత్రమేమంటే ఈ ప్రక్రియపై ఓటర్లనుంచి ఎప్పుడూ ఫిర్యాదులు లేవు. ఇప్పుడు మళ్లీ బ్యాలెట్ పేపర్కు మళ్లాలన్న వినతిని తోసిపుచ్చటంతోపాటు వీవీ ప్యాట్ స్లిప్ లను ఓటర్లే తీసుకునేలా, పరిశీలించుకున్నాక వారే బ్యాలెట్ బాక్స్లో వేసేలా చూడాలన్న కోరికను సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. ఈవీఎంల ద్వారా వెల్లడయ్యే ఓట్ల సంఖ్యనూ, వీవీప్యాట్ స్లిప్లనూ లెక్కించి రెండూ సరిపోలినప్పుడే ఫలితం ప్రకటించాలన్న పిటిషనర్ల వినతిని కూడా తిరస్కరించింది. అయితే పార్టీల గుర్తులను కంప్యూటర్ ద్వారా ఈవీఎంలలో లోడ్ చేయటానికి ఉప యోగించే సింబల్ లోడింగ్ యూనిట్ (ఎస్ఎల్యూ)లను ఎన్నికల పిటిషన్లు పడిన సందర్భాల్లో పరిశీలించేందుకు అనువుగా 45 రోజులు భద్రపరచాలని ఆదేశించింది. అంటే ఇకపై ఈవీఎంలతో పాటు ఎస్ఎల్యూలు కూడా సీల్ చేసివుంచటం తప్పనిసరి. అలాగే రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు ఫిర్యాదుచేస్తే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ 5 శాతం ఈవీఎంలనూ, ఎస్ఎల్యూలనూ ఇంజనీర్ల, ఉత్పత్తిదారుల సమక్షంలో తనిఖీకి అనుమతించవచ్చు. అయితే ఫలితాలొచ్చిన ఏడు రోజుల్లో ఫిర్యాదులు చేయాలి. అలాగే వీవీ ప్యాట్ స్లిప్లు లెక్కించే యంత్రాలు సమకూర్చుకునే ఆలోచన చేయాలని ఈసీని కోరింది. ఏదేమైనా బాహాటంగా బయట పడిన సంద ర్భాలుంటే తప్ప ఈవీఎంలపై అనవసర రాద్ధాంతానికి ముగింపు పలకటం అవసరం. ఇందుకు బదులు ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోవటం ఎలా అన్న అంశంపై పార్టీలు దృష్టి సారించాలి. -
వృద్ధులకు ఆరోగ్య ధీమా!
అరవై అయిదేళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఇది అక్షరాలా ఆనందం కలిగించే వార్త. పిల్లలు, విద్యార్థులు, గర్భిణులు, సీనియర్ సిటిజన్లతో సహా అన్ని వర్గాలకూ ఆరోగ్య బీమా పాలసీలు అందివ్వాలనే కొత్త నిర్ణయం వచ్చింది. దేశంలోని బీమా పాలసీలకు సంబంధించి అత్యున్నత నియంత్రణ సంస్థ అయిన ‘భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ’ (ఐఆర్డీఏఐ) ఆ మేరకు బీమా సంస్థలన్నిటికీ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై క్యాన్సర్, హృద్రోగం, మూత్రపిండాల వైఫల్యం, ఎయిడ్స్ లాంటి వ్యాధులున్నాయని ఆరోగ్య బీమా పాలసీలు నిరాకరించడానికి వీల్లేదని తేల్చింది. అదే సమయంలో, నియమ నిబంధనలు పాటిస్తూ ఆ యా వయసుల వారికి తగ్గట్టుగా ప్రత్యేకమైన బీమా పాలసీలు రూపొందించుకొనే స్వేచ్ఛ సంస్థలకు ఇచ్చింది. దీంతో, ఇప్పుడిక 65 ఏళ్ళు, ఆపై బడిన తర్వాత కూడా కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకొనే వీలు చిక్కింది. 70 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరినీ కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం కిందకు తెస్తామని అధికార పక్షం పేర్కొన్న కొద్ది రోజులకే ఈ నిర్ణయం రావడం గమనార్హం. అలాగే, సీనియర్ సిటిజన్ల సమస్యలు, ఆరోగ్య బీమా క్లెయిమ్ల సత్వర పరిష్కారానికై ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని బీమా సంస్థలకు ప్రాధికార సంస్థ సూచించింది. పాలసీ కొనడానికి ముందే ఆరోగ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ వారికి తగిన ఆరోగ్య బీమా పాలసీలు తప్పక ఇవ్వాలని పేర్కొంది. ముందుగానే ఉన్న వ్యాధుల (పీఈడీ) విషయంలో బీమా రక్షణకు నిరీక్షించే కాలాన్ని మునుపటి 48 నెలల నుంచి 36 నెలలకే తగ్గించింది. బీమా అంశంలో ఈ సరికొత్త సంస్కరణలు అటు ఊహించని ఆరోగ్య ఖర్చులు ఎదురైన వృద్ధులకే కాక, వయసు మీద పడ్డ తల్లితండ్రుల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న ఉద్యోగులకూ పెద్ద ఊరట. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, వ్యాధుల బారి నుంచి తమకు ప్రేమాస్పదులైన వ్యక్తులకు రక్షణనిచ్చేందుకు కొండంత అండ. వయోవృద్ధులకు పరిమిత ప్రయోజనాలే అందిస్తున్న ప్రస్తుత ధోరణి నుంచి బీమా సంస్థలు బయటకొచ్చి, తల్లితండ్రులతో సహా పాలసీదారు కుటుంబం మొత్తానికీ సమగ్ర బీమా వసతి కల్పించేలా కొత్త పాలసీలు తేగలుగుతాయి. ఇప్పటికే ఉన్న పాలసీలను సైతం మార్చగలుగుతాయి.నిజానికి, వయసు మీద పడ్డాకనే ఎవరికైనా ఆరోగ్య బీమా మరింత అవసరం, ఉపయోగం. ఇప్పటి దాకా నిర్ణీత వయసు దాటాక వ్యక్తిగత ఆరోగ్య బీమాకు వీలుండేది కాదు. కానీ, కొత్త సంస్క రణలతో ఆ అడ్డంకి తొలగింది. ప్రత్యేకించి రానున్న రోజుల్లో మన దేశ జనాభాకు ఇది కీలకం. 2011 తర్వాత దేశంలో జనగణన జరగలేదన్న మాటే కానీ, ఐరాస జనాభా నిధి, ఇతర నిపుణుల లెక్క ప్రకారం భారత జనాభా చైనాకు సమానంగా ఉంది. 2023లో ఒక దశలో మనం చైనాను దాటినట్టు కూడా అంచనా. ఈ ఐరాస అంచనాల ఆధారంగా నిరుడు ‘భారత వార్ధక్య నివేదిక – 2023’ను సిద్ధం చేశారు. దాని ప్రకారం దేశంలో 10 శాతమున్న సీనియర్ సిటిజన్ల జనాభా వచ్చే 2050 నాటికి ఏకంగా 30 శాతానికి పెరగనుంది. మరోమాటలో అరవై ఏళ్ళ పైబడిన వారి సంఖ్య 2022 నాటి 14.9 కోట్ల నుంచి 34.7 కోట్లకు చేరుతుంది. అది అమెరికా ప్రస్తుత జనాభా కన్నా ఎక్కువ. ఒక్క భారత్లోనే కాదు... అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో వయోవృద్ధులు దాదాపు 16 నుంచి 28 శాతం దాకా ఉన్నారు. మెరుగైన ఆరోగ్య వసతులు, పెరిగిన ఆయుఃప్రమాణం వల్ల ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సీనియర్ సిటిజన్ల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వ నిధులతో ప్రజారోగ్య వ్యవస్థలున్నా, ఇతర దేశాల్లో మాత్రం ఖరీదైన ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణే దిక్కు. అలాంటి చోట్ల ఖర్చెక్కువ, వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య బీమాకు చెల్లించాల్సిన ప్రీమియమ్లూ ఎక్కువన్నది నిజమే. కానీ, 65 ఏళ్ళు దాటితే కొత్తగా ఆరోగ్య బీమా తీసుకోవడానికి వీలు కాదనే నిబంధన చాలా దేశాల్లో లేదని గమనించాలి. ఇప్పుడు మన దేశమూ ఆ మార్గంలోకి వచ్చి, గరిష్ఠ వయఃపరిమితి షరతు లేకుండా, అన్ని వయసుల వారికీ ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులోకి తెచ్చిందన్న మాట. దానికి తోడు పీఈడీ నిరీక్షణ కాలాన్ని తగ్గించడం, తీవ్ర వ్యాధులున్నా సరే బీమా ఇవ్వాలనడం ప్రజానుకూల, ప్రశంసాత్మక నిర్ణయాలు. ప్రాధికార సంస్థ ఆ మధ్య జీవిత బీమా పథకాల సరెండర్ ఛార్జీల విషయంలో సంస్కరణలు తెచ్చింది. మళ్ళీ ఇప్పుడిలా వినియోగదారుల పక్షాన మరోసారి మరికొన్ని నిబంధనల్ని సవరించడం విశేషం. అయితే, అదే సమయంలో బీమా సంస్థలు తమ ఉత్పత్తులను వినియోగదారులకు స్నేహపూర్వకంగా ఉండేలా చూడడం అవసరం. ప్రాధికార సంస్థ ఆదేశాల స్ఫూర్తిని విస్మరించి, అందుబాటులో లేని అతి ఖరీదైన పాలసీలను సంస్థలు తీసుకొస్తే నిష్ప్రయోజనం. అర్థం కాని సాంకేతిక పదజాలం, సంక్లిష్టతలతో పాలసీలు తీసుకొచ్చినా కస్టమర్లు విముఖత చూపుతారు. పాలసీలలో పారదర్శకత పాటిస్తూ, ఇబ్బంది లేకుండా సులభంగా క్లెయిమ్లు పరిష్కారమయ్యే మార్గాన్ని బీమా సంస్థలు అనుసరిస్తే మంచిది. అప్పుడే వినియోగదారులు ఉత్సాహంగా ముందుకు వస్తారు. తాజా బీమా సంస్కరణల తాలూకు ఫలితమూ సమాజానికి అందివస్తుంది. దేశంలోని సీనియర్ సిటి జన్లలో నూటికి 98 మందికి ఇవాళ్టికీ ఆరోగ్య బీమా లేకపోవడం సిగ్గుచేటు. అంతకంతకూ పెరుగు తున్న వైద్య, ఆరోగ్యసేవల ఖర్చు రీత్యా బీమా ఆపత్కాలంలో బలమైన భరోసా. జీవితం పొడు గునా కుటుంబానికీ, సమాజానికీ తమ వంతు సేవ చేసి, ప్రకృతి సహజపరిణామంగా వయసుపై పడ్డ ఈ పండుటాకుల గురించి పాలకులు లోతుగా ఆలోచించాలి. బీమా పాలసీలొక్కటే సరిపోవు. ఆర్థికంగానే కాక ఆరోగ్యపరంగానూ వారి బాగు కోసం ఇతర ప్రత్యామ్నాయాలనూ అన్వేషించాలి. -
మానవతకు 200 రోజుల మచ్చ
ఒకటీ, రెండూ కాదు... ఆరు నెలలు దాటింది. మంగళవారంతో ఏకంగా రెండు వందల రోజులు గడిచిపోయాయి. అయినా, పాలెస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. సంక్షోభానికి పరిష్కా రమూ కనిపించడం లేదు. సామూహిక సమాధులు, కూలిన ఆస్పత్రులు, శిథిలాల కుప్పగా మారిన భవనాలు, ప్రాణాలు పోయిన వేలాది జనం, ప్రాథమిక వసతులు పూర్తి విధ్వంసంతో పాలెస్తీనా బావురుమంటోంది.తీవ్రవాద హమాస్ బృందం తమపై ఆకస్మికంగా దాడి చేసి, 250 మందిని బందీలుగా చేసుకొని, 1200 మంది ప్రాణాలు తీసినందుకు బదులుగా గత అక్టోబర్ 7న సైనిక చర్యకు దిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. గాజాలోని 23 లక్షల జనాభాలో దాదాపు 85 శాతం మంది ఇళ్ళు వదిలి పారిపోయారు. హమాస్ ఏరివేతకని చెబుతూ మొదలుపెట్టిన ఈ పాశవిక, ప్రతీకార దాడిలో ఇప్పటికి 14 వేల పైచిలుకు పసిపిల్లలతో సహా 34 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని లెక్క. నిజానికి, ఆ సంఖ్య ఇంకా ఎక్కువేనని సహాయక సంస్థల అంచనా. గాజా భూఖండపు ఉత్తర ప్రాంతంపై ఇటీవల ఎన్నడూ లేనంతగా శతఘ్నుల వర్షం కురిపిస్తూ, అక్కడ నుంచి జనాల్ని ఖాళీ చేయమంటున్న ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంత ప్రధాన నగరమైన రాఫాపై దాడికి సర్వసన్నద్ధమవుతుండడం తాజా విషాద పరిణామం. పశ్చిమాసియాలోని ఈ సంక్షోభం అంతకంతకూ పెద్దదవుతూ వచ్చింది. ఇరాన్ సైతం ఇటీవల ఇజ్రాయెల్తో ఢీ అనడం పర్యవసానాలపై ప్రపంచం భయపడాల్సిన పరిస్థితి తెచ్చింది. పాలెస్తీనా శరణార్థులకు ఉద్దేశించిన ఐరాస సహాయ సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) ఉన్నా దానికిప్పుడు నిధులు లేని దుఃస్థితి.ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడికి ఆ సంస్థ సిబ్బంది కొందరు సహకరించారని ఇజ్రాయెల్ ఆరోపించింది. దాంతో ఆ సంస్థకు సహాయం అందిస్తున్న 16 దాతృత్వ దేశాలు నిధులు నిలిపివేశాయి. పర్యవసానంగా 45 కోట్ల డాలర్ల మేర నిధుల లోటు ఏర్పడి, వేలాది పాలెస్తీనియన్లు ఈ యుద్ధకాలంలో ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్వి నిరాధార ఆరోపణలని స్వతంత్ర పరిశీలనలో ఈ వారమే తేలింది. అమెరికా సహా ఇతర దేశాలు మానవతా అవసరంగా గుర్తించి, నైతిక బాధ్యతతో యూఎన్ ఆర్డబ్ల్యూఏకు ఆర్థిక సాయం పునరుద్ధరించాలని అరబ్ లీగ్ తాజాగా డిమాండ్ చేస్తున్నది అందుకే. ఇజ్రాయెల్ భీకర దాడుల అనంతరం గాజాలోని ప్రధాన ఆస్పత్రుల వద్ద 300కు పైగా మృతదేహాలతో బయటపడ్డ సామూహిక భారీ సమాధుల దృశ్యాలు సహజంగానే అంతర్జాతీయ ప్రపంచాన్ని కుదిపివేస్తున్నాయి. ఇజ్రాయెలీ సైనికుల దాడుల్లో అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగిందడానికి సమాధుల్లో కట్టేసిన చేతులతో, వివస్త్రంగా కనిపిస్తున్న శవాలే ప్రత్యక్ష సాక్ష్యం. అనుమానాలకు తావిస్తున్న ఈ సమాధులపై పారదర్శకంగా, స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఐరాస ఇప్పటికే డిమాండ్ చేసింది.యూరోపియన్ యూనియన్ సైతం బుధవారం అదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఆగని ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో బాధిత పక్షం వైపు అంతర్జాతీయంగానూ క్రమంగా మొగ్గు కనబడుతోంది. పాలెస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడమే ప్రస్తుత సమస్యకు సత్వర పరిష్కారమని భావిస్తున్నవారి సంఖ్యా పెరుగుతోంది. గాజా సమస్య అంతకంతకూ మానవతా సంక్షోభంగా పరిణమిస్తుండడంతో తాజాగా జమైకా ప్రభుత్వం పాలెస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించడం విశేషం. పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనమనే ఐరాస నియమావళి పట్ల నిబద్ధతే ఈ నిర్ణయానికి ప్రేరణ అని జమైకా పేర్కొంది. ప్రతి 10 నిమిషాలకూ ఓ పసివాడు చనిపోవడమో, గాయపడడమో జరుగుతున్న పాలెస్తీనాలో, ఇప్పటికి కనీసం 75 వేల టన్నుల పేలుడు పదార్థాల తాకిడికి గురై 62 శాతం ఇళ్ళు ధ్వంసమైన భూభాగంలో, ఆహార కరవుతో 11 లక్షల మంది అన్నమో రామచంద్రా అని అలమటిస్తూ రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్న ప్రాంతంలో... సత్వరమే సంక్షోభాన్ని పరిష్కరించి, శాంతి స్థాపన జరపకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. ఒకప్పటి కీలకపాత్రధారి ఐరాస ప్రస్తుతం మాటలే తప్ప చేతలు లేక చేష్టలుడిగి చూస్తోంది.కాల్పుల విరమణకై ఈ ఆరునెలల్లో ఐరాస 4సార్లు తీర్మా నాలు చేసినా, అవన్నీ అగ్రరాజ్యాలు మోకాలడ్డడంతో వీగిపోవడం దురదృష్టం. ఐరాసలో అండగా నిలవడమే కాక, ఇజ్రాయెల్కు ఆయుధాలిస్తున్న అమెరికా ఆ దేశానికి ఇటీవలే 2600 కోట్ల డాలర్ల సాయం మంజూరు చేసి, శరణార్థులకేమో మొండిచేయి చూపడం పెద్దన్న ద్వంద్వనీతికి దర్పణం. గాజా పోరులో అమెరికా అధ్యక్షుడి విధానాలపై స్వదేశంలోనే నిరసనలు పెరిగాయి. పాలెస్తీనాకు అనుకూలంగా అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాల్లో వేలాది విద్యార్థులు వీధికెక్కడం విశేషం.పశ్చిమాసియాలో సమస్య పరిష్కారానికి అమెరికా, దాని భాగస్వాములు పాత కథ వదిలి, మళ్ళీ మథనం చేయాలి. భద్రత పరంగా ఇజ్రాయెల్కు ఉన్న ఆందోళనల్ని పోగొడుతూనే, పాలెస్తీనా ప్రజల ప్రత్యేక రాజ్య ఆకాంక్షను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాలు సఫలమయ్యేలా అటు ఇరాన్నూ భాగస్వామిని చేసి, శాశ్వత పరిష్కారానికై పాశ్చాత్య ప్రపంచం కృషి చేయాలి.ఇరాన్ సైతం పశ్చిమాసియాలో తన ప్రభావాన్ని విస్తరించుకోవడం కోసం లెబనాన్, గాజా, సిరియా, యెమన్లలో పరోక్ష శక్తులకు ఆయుధాలు సమకూర్చి, అండగా నిలిచే పని మానుకోవాలి. ఇలా పాముల్ని పాలుపోసి పెంచడం ఉద్రిక్తతల్ని పెంచే పాపమని గుర్తించాలి. ఈ ప్రాంతంలో 90 లక్షల మంది మన ప్రవాసులున్నందు భారత్ సైతం ఇజ్రాయెల్, అరబ్ దేశాలతో సత్సంబంధాల రీత్యా కీలక భాగస్వాముల్ని ఒక దగ్గరకు చేర్చి, పరిష్కారానికి యత్నించాలి. వాణిజ్యంలో, ఇంధన సరఫరాలో కీలకమైన పశ్చిమాసియాలో శాంతి నెలకొంటేనే... ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. -
ఛాంపియన్ దేశం
భారత చదరంగ క్రీడావనికి ఇది మరో శుభవార్త. మన దేశం నుంచి మరో చిచ్చరపిడుగు వచ్చాడు. తెలుగు కుటుంబానికి చెందిన దొమ్మరాజు గుకేశ్ పట్టుమని 17 ఏళ్ళ వయసులో ప్రపంచస్థాయిలో సత్తా చాటాడు. అరంగేట్రంలోనే ప్రపంచ చదరంగ క్రీడా పర్యవేక్షక సంస్థ (ఫిడే) వారి ‘క్యాండిడేట్స్ 2024’లో గెలిచాడు. అదీ... చదరంగపుటెత్తుల్లో చలాకీతనం చూపుతూ, చులాగ్గా గెలిచాడు. కొద్ది నెలల్లో జరిగే ప్రపంచ ఛాంపియన్ పోటీలకు ఎన్నికయ్యాడు. 138 సంవత్సరాల ప్రపంచ ఛాంపి యన్షిప్ చరిత్రలోనే చిన్న వయసువాడిగా వరల్డ్ టైటిల్ కోసం పోటీపడనున్నాడు. ఒకవేళ ఆ విశ్వవేదిక పైనా గెలిస్తే, అతి పిన్నవయస్కుడైన వరల్డ్ ఛాంపియన్గా కొత్త చరిత్ర సృష్టించనున్నాడు. ఒక్క గుకేశ్ విజయమే కాక భవిష్యత్ ఆశాకిరణాలూ అనేకం ఉండడం గమనార్హం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళు పాల్గొనే ‘క్యాండిడేట్స్’లో ఉన్నదే 16 మంది. అందులో ముగ్గురు మగ వాళ్ళు (గుకేశ్, విదిత్, ఆర్. ప్రజ్ఞానంద), ఇద్దరు ఆడవారు (కోనేరు హంపీ, ఆర్. వైశాలి)తో మొత్తం అయిదుగురి అతి పెద్ద బృందం భారత్దే. ఇంతమంది ఆటగాళ్ళు ఈ క్లిష్టమైన అలాగే, 2024 ఏప్రిల్ నాటి ‘ఫిడే’ ర్యాంకింగ్స్లో టాప్ 25లో అయిదుగురు భారతీయ పురుషులే. ఇక, మహిళల ర్యాకింగ్స్లో టాప్ 15లో ముగ్గురు మనవాళ్ళే. జూనియర్ ర్యాకింగ్స్కు వస్తే టాప్ 20లో ఏడుగురు భార తీయులే. అదే టాప్ 30 జూనియర్స్ని గనక లెక్క తీస్తే మూడింట ఒక వంతు మన దేశీయులే.ప్రపంచ చదరంగ వేదికపై అంతకంతకూ విస్తరిస్తున్న భారతదేశ స్థాయికీ, స్థానానికీ ఇదే సాక్ష్యం. ‘చదరంగంలో భారత్ విశేష కృషి చేస్తోంది. అనతికాలంలో ప్రపంచంలో అగ్రశ్రేణి చదరంగ దేశమవుతుంది’ అని ప్రపంచ మాజీ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సెన్ గత ఏడాది వ్యాఖ్యానించారు. ఇప్పుడదే నిజమవుతోంది. నిజానికి, మన దేశంలో చదరంగ క్రీడ ఇంత శరవేగంతో విస్తరించడానికీ, విస్ఫోటనం చెందడానికీ అనేక కారణాలున్నాయి. ఇంటర్నెట్ డేటా ప్యాక్లు చౌక కావడం, మొబైల్ ఫోన్లలో సైతం సులభంగా అందుబాటులో ఉన్న చెస్ యాప్లు వగైరా వల్ల జనసామాన్యంలో ఈ క్రీడ వేగంగా, బలమైన పునాది వేసుకుంటోందని నిపుణుల విశ్లేషణ. ఇంటర్నెట్ వ్యాప్తి వల్ల ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని పిల్లలు సైతం మెట్రో నగరాల్లోని అత్యుత్తమ కోచ్ల నుంచి ఆన్ లైన్ చెస్ పాఠాలు నేర్చే వీలొచ్చింది. కరోనా అనంతరం ఆన్లైన్ టోర్నమెంట్లు పెరగడం కూడా భారతీయ యువకిశోరాలకు కలిసొచ్చింది. సూపర్ గ్రాండ్ మాస్టర్ల తోనూ, చివరకు ప్రపంచ మాజీ ఛాంపియన్లతోనూ తలపడి అనుభవం, ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించే అవకాశం దక్కింది. అగ్రశ్రేణి క్రీడాకారులు ఆట మానేశాక, కోచ్లుగా మారడమూ కొత్త తరానికి వరమైంది.గ్రాండ్ మాస్టర్లు ఆర్బీ రమేశ్ (ప్రజ్ఞానంద, వైశాలికి కోచ్), విష్ణుప్రసన్న (గుకేశ్కు కోచ్), శ్రీనాథ్ నారాయణన్ (అర్జున్, నిహాల్ సరీన్ల ట్రైనర్), సూర్యశేఖర్ గంగూలీ (విదిత్కు కోచ్) లాంటి వారు, వారి శిక్షణలో ఆరితేరిన ఆటగాళ్ళే అందుకు నిదర్శనం. గ్రాండ్ మాస్టర్లు కాకపోయినప్పటికీ, మంచి చదరంగం ఆటగాళ్ళు దాదాపు 50 వేల మందికి పైగా భారత్లో ఉన్నారని సాక్షాత్తూ ప్రపంచ చదరంగ క్రీడా పర్యవేక్షక సంస్థ (ఫిడే) డైరెక్టర్ జనరల్ ఎమిల్ సుతోవ్స్కీ అనడం విశేషం. ఇవన్నీ కలసి దేశంలో చదరంగ క్రీడకు సంబంధించిన సువ్యవస్థిత వాతావరణ కల్పనకు దోహదం చేశాయి. ‘ఫిడే’ సహకారంతో టెక్ మహీంద్రా ధనసాయంతో నడుస్తున్న గ్లోబల్ చెస్ లీగ్ లాంటి టోర్నమెంట్లు సైతం ఆటకూ, ఆటగాళ్ళకూ కొత్త ఉత్సాహం, ఉత్తేజం తెచ్చాయి. వీటన్నిటి ఫలితంగా ఇవాళ 64 చదరపు గడుల ఆటలో భారత్ అపూర్వంగా ముందుకు దూసుకుపోతోంది. ‘ఈ ప్రపంచంలో ఈ క్షణంలో అత్యంత అస్థిరమైనది ఏమిటంటే, చదరంగంలో భారత నంబర్ 1 స్థానం’ అని అజర్బైజాన్కు చెందిన ఓ గ్రాండ్ మాస్టర్ ఈ ఏడాది జనవరిలో ట్వీట్ చేశారు. ఛలోక్తిగా చెప్పినా, చెస్లో నిత్యం కొత్త ప్రతిభావంతులు రంగంలోకి దూసుకువస్తున్న మన దేశంలో ఇప్పుడది అక్షరసత్యం. ఈ ఏడాదిలో ఈ నాలుగు నెలల్లోనే ఆ నంబర్1 కిరీటం మన ఆటగాళ్ళు అయిదుగురి (విశ్వనాథన్ ఆనంద్, గుకేశ్, ప్రజ్ఞానంద, అర్జున్, విదిత్) మధ్య ఎప్పటికప్పుడు మారుతూ వచ్చిందంటే మనవాళ్ళలో పెల్లుబుకుతున్న ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. యువజన – క్రీడాశాఖ సమకూరుస్తున్న నిధులు, ఆటగాళ్ళ శిక్షణకు అఖిల భారత చదరంగ సమాఖ్య అందిస్తున్న సహకారం, ప్రైవేట్ సంస్థల సహాయం ప్రతిభను పెంచి పోషించడంలో ప్రధానపాత్ర వహించాయి. ఇవాళ దేశంలో 84 మంది గ్రాండ్ మాస్టర్లు, 124 మంది ఇంటర్నేషనల్ మాస్టర్లు, 23 మంది మహిళా గ్రాండ్ మాస్టర్లు, 42 మంది మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్లు ఉన్నారంటే కారణం అదే! దేశవ్యాప్తంగా 30 వేల మందికి పైగా రేటింగ్ పొందిన రెగ్యులర్ టోర్నమెంట్ చెస్ ఆటగాళ్ళు న్నారని ఒక లెక్క. ప్రపంచమంతటిలో ఇందరు ప్రతిభావంతులున్నది మన దేశంలోనే! ప్రపంచ మాజీ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ లాంటివారు చిరకాలంగా ఆదర్శంగా నిలవడంతో, ఎంతో మంది చెస్ వైపు ఆకర్షితులయ్యారన్నది నిజం. సమాజంలోని ఆ ధోరణుల్ని గమనించి, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో తగినంత సహాయ సహకారాలు అందించి, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే ఏ క్రీడలోనైనా ఎంతటి అద్భుతాలు చేయవచ్చో భారతీయ చదరంగావని చాటిచెబుతోంది. కఠోర పరిశ్రమతో, కాలగతిలో ఆ ఆటలో ఛాంపియన్ దేశంగా ఆవిర్భవించిన మనం ఈ పాఠాలను ఇతర క్రీడలకూ అనువర్తింపజేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమూ, ఇతర క్రీడా సంస్థలూ ఆ దిశగా అడుగులు వేస్తే మన క్రీడాలోకం మరిన్ని శుభవార్తలు అందించడానికి సదా సిద్ధంగా ఉంటుంది!
Advertisement
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement