Ayurvedic Tips: ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయుర్వేదంతో చెక్
Published
Tue, Jul 18 2023 11:35 AM
అనేక అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదం చక్కటి పరిష్కారం. చిన్న చిట్కాలతోనే కొన్ని వ్యాధులను నయం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఇంగువను నిమ్మరసంతో కలిపి నూరి కొద్దిగా వెచ్చచేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గిపోతుంది.
బిళ్లగనేరు ఆకుల్ని, జామ ఆకుల్ని సమతూకంలో తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం 3 రోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది.
వంద గ్రాముల వాము శుభ్రంచేసి ఎర్రగా వేయించి, మెత్తగా పొడిచేసి డబ్బాలో నిల్వ ఉంచుకొని గ్యాస్ట్రబుల్ ఉన్నప్పుడు ఒక చెంచా పొడిని నీళ్ళల్లోగాని, విడిగా గాని తీసుకుంటే ఎక్కువ త్రేన్పులు రాకుండా ఉంటుంది.
అల్లంముక్కలు తేనెతో గానీ, పంచదారతో గానీ కలుపుకుని తింటే యూనినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి.
పచ్చి మెంతులు ఒక అరచెంచా ఉదయం, సాయంత్రం మింగాలి. పచ్చివి తినలేకపోతే పెరుగులో నానబెట్టుకుని తింటే మూత్ర పిండాల నొప్పి తగ్గుతుంది.
నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకర కాయలు, నేలతంగేడు పూజ, పొడపత్రి, తిప్పతీగె, ఉసిరికాయ చూర్ణం చేసి రెండు పూటలా నోట్లో వేసుకొని, నీరు తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి చల్లార్చి తలకు పెట్టుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది.
గుంటగలగరాకు దంచి, రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెలో కలిపి నీరు మరిగే వరకు ఉడకబెట్టాలి. చిటపట శబ్దం పోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచాలి. సువాసనకి గంధకచ్చూరాలు కలుపుకుని వాడడంవల్ల జుట్టు రాలదు. నల్లబడుతుంది, పెరుగుతుంది.
అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అర కప్పు నీళ్ళల్లోగాని, పాలల్లోగాని కలుపుకుని తాగితే నడుం నొప్పి తగ్గుతుంది.
అశ్వగంధ ఆకుల్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక పచ్చి ఆకుని నమిలి మింగాలి. ఇది బరువును తగ్గిస్తుంది
ఎర్రమందారంపూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది.
ఆవుపాలు తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం కలిపి వెంటనే తీసుకుంటే అర్షమొలలు తగ్గుతాయి.
జిల్లేడు పువ్వు, పసుపు సమానంగా తీసుకుని నూరి అందులో కొంచెం ఆముదాన్ని వేసి మడమకి రాత్రిపూట కట్టి ఉదయం తీసేస్తే మడమ నొప్పి తగ్గుతుంది.
శొంఠి మిరియాలు సమానంగా తీసుకుని, రెండింటిని దోరగా వేయించి చూర్ణంచేసి పూటకి ఐదు గ్రాములు తేనెతో కలిపి రోజూ మూడు పూటలా 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి
సింహనాద గుగ్గిళ్ళు అనే టాబ్లెట్లను రోజుకు మూడు చొప్పున మూడునెలలు వాడితే మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది.