గ్లోబల్‌ సౌత్‌ ఛాంపియన్‌ ఎవరు? | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ సౌత్‌ ఛాంపియన్‌ ఎవరు?

Published Thu, Feb 1 2024 12:02 AM

Sakshi Guest Column On Global South Champion

గ్లోబల్‌ సౌత్‌ అనే మాటను ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ పత్రిక 2023 సంవత్సరపు పదంగా ప్రకటించింది. గ్లోబల్‌ సౌత్‌ అంటే దక్షిణార్ధ భూగోళ దేశాలు అని స్థూలార్థం. ఇదే పరిగణిస్తే చైనా, ఇండియా రెండూ ఇందులోకి రావు. భౌగోళికత కన్నా... తక్కువ, మధ్యాదాయ దేశాల సమూహంగా దీన్ని చూస్తున్నారు. భారీ ఆర్థిక వ్యవస్థలు ఉన్నప్పటికీ చైనా, ఇండియా తమను ఎదుగుతున్న దేశాలుగానే భావిస్తున్నాయి. అలా గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు నాయకత్వ స్థానం కోసం పోటీపడుతున్నాయి. గ్లోబల్‌ సౌత్‌ కొన్నిసార్లు చైనా, భారత్‌ మద్దతును అంగీకరించడానికి సిద్ధంగా ఉంటూనే... ఈ రెండు దేశాల్లో దేన్నయినా నిరపాయకరమైన నాయకుడిగా లేదా ఛాంపియన్‌గా చూస్తున్నదా అనేది చెప్పడం కష్టం.

గత ఏడాది భారతదేశంలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘వాయిస్‌ ఆఫ్‌ ద గ్లోబల్‌ సౌత్‌ ఫర్‌ హ్యూమన్‌ సెంట్రిక్‌ డెవలప్‌మెంట్‌’ అనే వర్చువల్‌ సదస్సును నిర్వహించారు. భారతదేశం ‘గ్లోబల్‌ సౌత్‌’ వాణిగా ఉంటుందని ప్రకటించారు. 2023లో జీ20 అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్, ఈ సదస్సు ఎజెండాను వివరించడానికి తనకున్న ప్రత్యేక హక్కులో భాగంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్థిరమైన రుణాలు, ఆహార భద్రత, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, బహుపాక్షిక బ్యాంకు సంస్కరణలు, వాతావరణ ఫైనాన్‌ ్స వంటి ముఖ్యమైన సమస్యలను ముందుకు తెచ్చింది.

గ్లోబల్‌ సౌత్‌ ఛాంపియన్‌ గా భారతదేశానికి ఉన్న స్థానం లేదా ప్రాముఖ్యత అనేది అభివృద్ధి, పాలన సమస్యలకు మాత్రమే పరి మితం కాలేదు. తన పాశ్చాత్య వ్యూహాత్మక భాగస్వాములైన అమె రికా, ఫ్రాన్స్‌లకూ, అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికీ మధ్య వార ధిగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన పాత్రను పోషించాలనే స్పష్టమైన కోరిక భారత్‌కు ఉంది. పర్యవసానంగా, గ్లోబల్‌ సౌత్,  దానిలో భారతదేశ పాత్ర రెండింటిపై చాలా శ్రద్ధ చూపడం జరిగింది.

(గ్లోబల్‌ సౌత్‌ అనే పదబంధాన్ని ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ పత్రిక 2023 సంవత్సరపు పదంగా ప్రకటించింది.) అయితే గ్లోబల్‌ సౌత్‌ అనే భావన కొత్తది కానట్లే, దానికి నాయకత్వం వహించాలనే ఆకాంక్ష కూడా భారత్‌కు కొత్తదేమీ కాదు. ఈ పాత్రను చేపట్టడానికి భారత్‌ చాలా కాలంగా చైనాతో పోటీపడుతోంది. గ్లోబల్‌ సౌత్‌లో ఎవరెవరు ఉన్నారు, ఇది ఎందుకు ఏర్పడింది అనేది కూడా ముఖ్యమైన అంశమే. గ్లోబల్‌ సౌత్‌ దేశాలు భారతదేశాన్ని లేదా చైనాను తమ వాణిగా స్వాగ తిస్తాయా అనేది కూడా బహిరంగ ప్రశ్నే.

గ్లోబల్‌ సౌత్‌ అనే పదం ఒక భౌగోళిక మార్మిక విషయంగా ఉంటోంది. ఎందుకంటే ఉత్తర ఆఫ్రికాతో పాటు చైనా, భారత్‌ వంటి దేశాలు నిజానికి ఉత్తరార్ధ గోళానికి చెందుతాయి. తక్కువ లేదా మధ్య–ఆదాయ దేశాలుగా ప్రపంచ బ్యాంకు వర్గీకరించిన దేశాల సమూహంగా గ్లోబల్‌ సౌత్‌ను నేడు ఎక్కువగా అర్థం చేసుకుంటు న్నారు. దీని భౌగోళిక మూలాలను 1926లో ఇటాలియన్‌ మార్క్సిస్ట్‌ తత్వవేత్త ఆంటోనియో గ్రామ్‌సీ రాసిన ‘ద సదరన్‌ క్వశ్చన్‌’ వ్యాసంలో గుర్తించవచ్చు. దీనిలో ఆయన తక్కువ అభివృద్ధి చెందిన, దక్షిణ ప్రాంత ఆలోచనను మొదటిసారిగా లేవనెత్తారు.

ఉత్తర ఇటలీ లోని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సంపన్న ప్రాంతాన్ని తక్కువ అభివృద్ధి చెందిన దక్షిణాదితో పోల్చారు. రెండోదాన్ని పూర్వం నుండి పెట్టుబడిదారులు వలసరాజ్యంగా మలిచారని గ్రామ్‌సీ నిర్ధారించారు. అంతర్జాతీయ సమాజాన్ని... ఆదాయం, భావజాలం రెండింటితో వేరు చేయబడిన భిన్న ప్రపంచాలుగా ఫ్రెంచ్‌ జనసంఖ్యాశాస్త్ర నిపు ణుడు ఆల్‌ఫ్రెడ్‌ సావీ 1952లో వర్గీకరించారు.

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో గ్రామ్‌సీ నిర్ధారణలు మరింతగా ముందుకొచ్చాయి. మొదటి ప్రపంచంలో పెట్టుబడిదారీ పశ్చిమదేశాలు ఉన్నాయి. సోవి యట్‌ యూనియన్, దాని సోషలిస్టు మిత్రులు రెండవ ప్రపంచంలో ఉన్నాయి. కొత్తగా వలసపాలనకు దూరమై, ఎక్కువగా పేదరికంలో ఉన్న దేశాలు మూడవ ప్రపంచంగా ఉంటున్నాయి. అమెరికన్‌ వామ పక్ష నేత కార్ల్‌ ఓగ్లెస్‌బీ 1969లో ఈ మూడవ ప్రపంచాన్ని ‘గ్లోబల్‌ సౌత్‌’ అని పిలిచాడు. ‘గ్లోబల్‌ సౌత్‌పై ఉత్తరాది ఆధిపత్యం’ గురించి కలత చెందాడు.

ఇండోనేషియాలోని బాండుంగ్‌లో 1955లో జరిగిన ఆసియా– ఆఫ్రికా కాన్ఫరెన్‌ ్స... తొలి గ్లోబల్‌ సౌత్‌ సమావేశాలలో ఒకటి. ఈ సదస్సుకు హాజరైన వాటిలో ఈ రోజు గ్లోబల్‌ సౌత్‌ అని భావించే దేశాలే కాకుండా సౌదీ అరేబియా, జోర్డాన్, టర్కీ వంటివి కూడా ఉన్నాయి. చాలావరకు కొత్తగా వలసపాలన నుంచి బయటపడిన ఈ దేశాలకు సదస్సు ఎజెండాలోని అతి ముఖ్యమైన అంశం... వలస వాదాన్ని, జాతి వివక్షను వ్యతిరేకించడమే. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఏ ఒక్క అగ్రరాజ్యం పక్షం వహించకుండా ఉండాలనే ఆలోచన కూడా బాండుంగ్‌ సదస్సులోనే పుట్టింది.

చైనా, భారత్‌ రెండూ ఈ ప్రపంచానికి చెందినవి. దీనికి నాయ కత్వం వహించాలని ఈ రెండూ ఆకాంక్షించాయి. ఈ సదస్సులో చైనా ప్రధానమంత్రి చౌ ఎన్‌  లై, భారత ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ తమ దేశాలకు ప్రాతినిధ్యం వహించారు. కొత్తగా వలసపాలన నుంచి బయటపడిన ప్రపంచానికి ఛాంపియన్లుగా నిలవగల తమ సామ ర్థ్యాన్ని ప్రదర్శించడానికి పోటీపడ్డారు.

బాండుంగ్‌ సమావేశం తర్వాత, భారతదేశం అలీనోద్యమ (నామ్‌) ప్రముఖ వాణిగా ఆవిర్భవించింది. తరచుగా నైతిక ఆధిపత్య స్థానాన్ని తీసుకుంటూ వచ్చింది. చైనా అలీనోద్యమంలో సహాయక పాత్రను పోషిస్తూనే, మావో హయాంలో అనేక ఆఫ్రికన్‌ దేశాలకు విదేశీ సహాయాన్ని అందించడం ప్రారంభించింది. చైనా తరచుగా తన కంటే తలసరి స్థూల జాతీయోత్పత్తి (జీఎన్‌ పీ) ఎక్కువగా ఉన్న దేశాలకు కూడా సహాయం చేసింది.

అయితే ప్రచ్ఛన్న యుద్ధానంతర ప్రపంచంలో వలసవాద వ్యతిరేకత, అలీనోద్యమం రెండూ... గ్లోబల్‌ సౌత్‌ దేశాల మధ్య సాధా రణ లింకుగా తమ ప్రాముఖ్యత కోల్పోయాయి. చమురు సంపన్న దేశమైన సౌదీ అరేబియా వర్గంలోని కొన్ని దేశాలను ఇందులో చేర్చడం కూడా అసంబద్ధంగా కనిపించింది. కానీ నయా – సామ్రాజ్య వాదమని చెబుతున్న పాశ్చాత్య ఆధిపత్యాన్నీ, దాని జోక్యాన్నీ వ్యతి రేకించాలనే భావన మాత్రం ఒక సాధారణ సూత్రంగా కొనసాగింది. ఇది చైనా, భారత్‌ రెండింటినీ ఆకర్షిస్తూనే ఉంది.

ఇప్పుడు భారీ ఆర్థిక వ్యవస్థలతో ఎదుగుతున్న శక్తులుగా వీటిని పరిగణిస్తున్నప్పటికీ, ఇప్పటికీ సహాయం అవసరమవుతున్న, పాశ్చాత్య జోక్యాన్ని వ్యతిరే కిస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లాగే ఉన్నామనీ, అందువల్ల మిగిలిన గ్లోబల్‌ సౌత్‌ పట్ల ఆసక్తులు కలిగి ఉన్నామనీ భారత్, చైనా నొక్కి చెబుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు సులభంగా రుణాలనూ, పెట్టుబడులనూ కల్పిస్తున్న చైనా... కఠిన మైన, ఏమాత్రం సానుభూతి లేని అమెరికన్‌ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా తనను తాను ప్రదర్శించుకుంటోంది. మరోవైపున చైనా పెట్టుబడులు, ఫైనాన్సింగ్‌తో సరితూగలేని భారత్‌... గ్లోబల్‌ సౌత్‌ ప్రయోజనాలను అర్థం చేసుకున్న దేశంగానూ, పశ్చిమ దేశాల, ముఖ్యంగా అమెరికా దగ్గర మన్నన ఉన్న దేశంగానూ తనను చూపుకుంటోంది.

కానీ గ్లోబల్‌ సౌత్‌ కొన్నిసార్లు చైనా, భారత్‌ మద్దతును అంగీకరించడానికి సిద్ధంగా ఉంటూనే, ఈ రెండు దేశాల్లో దేన్నయినా నిరపాయకరమైన నాయకుడిగా లేదా ఛాంపియన్‌గా చూస్తోందా అనే విషయం స్పష్టం కావడం లేదు. ప్రపంచ రుణ సంక్షోభం పట్ల చైనా విముఖత, పశ్చిమ ఆఫ్రికాలో సహజ వనరులను అది దుర్విని యోగపర్చడం ఘర్షణను సృష్టించింది. మరోవైపున, భారత్‌తో వ్యవహరించడం కష్టమన్న భావన ఏర్పడింది.

దీనికి ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలలో భారత్‌ అడ్డుకునే వాదం తోడ యింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రయోజనం కలిగించే అంశా లను, ఉదాహరణకు మత్స్య రాయితీల వంటి వాటిని వ్యతిరేకించి భారత్‌ కాస్త చెడ్డపేరు తెచ్చుకుంది. క్లుప్తంగా చెప్పాలంటే... చైనా, భారత్‌ దశాబ్దాలుగా గ్లోబల్‌ సౌత్‌లో ప్రముఖ పాత్ర పోషించాలని కోరుకుంటున్నాయి. ఆ ఆకాంక్షలు నెరవేరతాయో లేదో మాత్రం చూడాల్సి ఉంది.

మంజరీ ఛటర్జీ మిల్లర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ ఫెలో, కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్‌ ్స; అసోసియేట్‌ ప్రొఫెసర్, బోస్టన్‌ విశ్వవిద్యాలయం

(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

Advertisement
Advertisement