శుక్రవారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2023
ఎల్ఎల్బీ కోర్సుల బ్రోచర్ ఆవిష్కరణ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జగనన్న సురక్ష పథకం పవిత్ర దీక్షలా దిగ్విజయంగా సాగుతోంది. పేద రోగులకు అండగా నిలుస్తోంది. వైద్యులు ఎక్కడికక్కడ వైద్యశిబిరాలు నిర్వహించి స్క్రీనింగ్ టెస్టులతోపాటు ఖరీదైన పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. అవసరమైన వారిని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రిఫర్ చేసి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ వర్తించని కేసులు ఉంటే ఫ్యామిలీ డాక్టర్ పథకం ద్వారా ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పించి వైద్యం అందించేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది.
6,29,103 కుటుంబాల సర్వే పూర్తి
జిల్లాలో 6,94,386 కుటుంబాలు ఉండగా, 6,29,103 కుటుంబాల సర్వేను వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది పూర్తిచేశారు. మొత్తం 15,75,704 మంది జనాభాకు 19,61,789 ఖరీదైన పరీక్షలు ఉచితంగా ఇంటి వద్దనే చేశారు.
36,298 మందికి కంటి పరీక్షలు
జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా గ్రామీణ ప్రాంతాలలో 212, అర్బన్ ప్రాంతాలలో 223 కలిపి మొత్తం 435 వైద్యశిబిరాలు విజయవంతంగా పూర్తిచేశారు. గ్రామీణ ప్రాంతాలలో 82,743 మందిని, అర్బన్ ప్రాంతాలలో 79,676 మంది రోగులను డాక్టర్లు పరీక్షించారు. 36,298 మందికి కంటి పరీక్షలు చేశారు. 31 మందికి టీబీ పాజిటివ్ ఉన్నట్టు తేల్చారు. 457 మందికి లెప్రసీ ఉండచ్చన్న అవగాహనకు వచ్చారు. 8,160 కొత్త బీపీ, 4,986 కొత్త డయాబెటిక్ కేసులు గుర్తించారు. 2,543 మందికి కేటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని నిర్ధారించారు.
మెరుగైన చికిత్సకు సిఫార్సు
3,079 కేసులకు మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు గుర్తించారు. ఇందులో 2,229 కేసులను గుంటూరు జీజీహెచ్కు, 593 కేసులను జిల్లా ఆస్పత్రి తెనాలికి, మూడు కేసులు ఏరియా ఆస్పత్రులకు, 124 కేసులు సీహెచ్సీలకు, 116 కేసులు ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేశారు. ఇందులో ఇప్పటికి 466 మంది వివిధ ఆస్పత్రుల్లో చూపించుకోగా 33 మంది అడ్మిట్ అయ్యారు. 27 మంది వైద్యసేవల అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. రిఫరల్ కేసులకు సాయం అందించేందుకు ప్రత్యేక డెస్క్ను వైద్యాధికారులు ఏర్పాటు చేశారు. గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రిలో సమాచార కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. రోగులు ఆసుపత్రికి వచ్చినప్పుడు వారికి సాయం అందించేందుకు ప్రత్యేకంగా ఒక స్టూడెంట్ నర్స్ను కేటాయించారు.
రిఫరల్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ
రిఫరల్ కేసులపై వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. సాధారణంగా ఆసుపత్రుల్లో కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ వంటి సేవలు కొన్ని ప్రత్యేక రోజుల్లోనే అందుబాటులో ఉంటాయి. అయితే జగనన్న ఆరోగ్యసురక్ష రిఫరల్ రోగులకు ఈ సేవలను రోజూ అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. రోగులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ప్రతి పీహెచ్సీలో నూ రిఫరల్ పేషెంట్ల ఆరోగ్యస్థితిని పరిశీలించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రిఫరల్ కేసులపై ప్రతి గురువారం వైద్యాధికారులు జిల్లా అధికారులకు, కలెక్టర్ కార్యాలయానికి నివేదిక అందజేయాలి. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో రైతులు, రైతుకూలీలు ఆస్పత్రులకు వచ్చేందుకు కొంత జాప్యం చేస్తున్నారు. వీరినీ ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందేలా ఆరోగ్యసిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.
శరవేగంగా కంటి ఆపరేషన్లు
36,298 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 20,908 మందికి కళ్లజోళ్లు అవసరమని, 2,543 మందికి కేటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని, 440 మంది ఇతర కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. రెండు ప్రభుత్వ ఆస్పత్రులు, రెండు స్వచ్ఛంద సంస్థలు, 12 నెట్వర్క్ ఆస్పత్రులకు కంటి ఆపరేషన్లు చేయించడానికి రిఫర్ చేశారు.
న్యూస్రీల్
ఆరోగ్య సురక్ష.. అద్భుత దీక్ష ఇళ్ల వద్దకే ఉచిత కార్పొరేట్ వైద్యసేవలు పైసా ఖర్చులేకుండా మందులూ పంపిణీ వేలాదిమందికి కంటి ఆపరేషన్లు జీజీహెచ్లో ప్రత్యేక సమాచార కేంద్రం ఆరోగ్యశ్రీ జాబితాలో లేని రోగాలకూ చికిత్స
జిల్లాలో ఇలా..
మొత్తం కుటుంబాలు : 6,94,386
సర్వే పూర్తయినవి : 6,29,103
మొత్తం ఉచిత పరీక్షలు : 19,61,789
మెరుగైన చికిత్స అవసరమైన వారు : 3,079
ప్రత్యేక కార్యాచరణ
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులలో రిఫరల్ కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాము. దీని కోసం ఇప్పటికే గుంటూరు జీజీహెచ్లో ప్రత్యేక సమాచార కేంద్రం ఏర్పాటు చేశాం. వచ్చిన రోగులకు ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం లేకుండా వైద్య సేవలు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవసరమైన వారిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు పంపి వైద్యం అందిస్తున్నాం.
– ఎం.వేణుగోపాల్రెడ్డి, కలెక్టర్, గుంటూరు జిల్లా