చైనాలో.. అదరగొట్టనున్న.. తెలంగాణ బిడ్డ! అరుదైన అవకాశం!!
Published
Sat, Sep 23 2023 1:22 AM
సాక్షి, మహబూబాబాద్:చైనాలోని హాంగ్జౌ వేదికగా శనివారం నుంచి ఆసియా గేమ్స్ ప్రారంభం కానున్నాయి. బ్యాడ్మింటన్ విభాగంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారిణి సిక్కిరెడ్డి ప్రతిభ కనబర్చనున్నారు. పతకం సాధించి తెలంగాణకు పేరు తేవాలని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, జిల్లాకు చెందిన ప్రముఖులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన నెలకుర్తి కృష్ణారెడ్డి, మాధవి దంపతుల కుమార్తె సిక్కిరెడ్డి.
బాల్యంలో ఇక్కడే ఆటలో ఓనమాలు దిద్దారు. తండ్రి ఉద్యోగరీత్యా ఖమ్మం, హైదరాబాద్లో పని చేయడంతో అక్కడ బ్యాడ్మింటన్లో పూర్తి మెలకువలు నేర్చుకున్నారు. ఎడమ చేతివాటంతో చిన్నతనం నుంచి ప్రతిభ కనబర్చిన సిక్కిరెడ్డి 2014 మే నెలలో ఢిల్లీ ఉబర్ కప్లో కాంస్యం, 2015లో నేషనల్ గేమ్స్లో బంగారు పతకం, కామన్వెల్త్లో కాంస్యం.. ఇలా అనేక పతకాలు కైవసం చేసుకున్నారు.
అరుదైన అవకాశం..
ఆసియా గేమ్స్లో 40 దేశాలకు పైగా.. 41 క్రీడాంశాల్లో 655 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఇందులో తెలంగాణ నుంచి 16 మంది పాల్గొంటున్నారు. వీరిలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన సిక్కిరెడ్డి ఉండడం గర్వకారణం.