కాజీపేట: ఎన్నికలు సక్రమంగా జరగడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్లెవల్ అవేర్నెస్ గ్రూప్(బ్లాగ్)ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి, స్థానిక ఓటర్లతో పరిచయం ఉండి, ఆ ప్రాంతంలో ఓటు హక్కు కలిగి ఉన్న స్థానిక వ్యక్తులను, ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఉన్న వారిని బ్లాగ్లో సభ్యులుగా నియమిస్తారు. ప్రతి బ్లాగ్లో బీఎల్వో బృంద సభ్యుడు నాయకుడిగా ఉండగా ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు, ఆశావర్కర్, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్, మహిళా సంఘాల బుక్ కీపర్లను సభ్యులుగా నియమిస్తూ ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వారందరికీ నియామక ఉత్తర్వులు జారీ చేయడమేగాకుండా విధి నిర్వహణలో అవగాహన కల్పించారు.
బ్లాగ్ బాధ్యతలు ఇలా..
● ఓటర్లకు అవగాహన కల్పించి చైతన్యపర్చడం, ఓటింగ్లో పాల్గొనేలా చేయడం.
● ఓటు హక్కును కలిగి ఉన్నవారంతా తమ ఓటు ను వినియోగించుకునేలా ప్రోత్సహించడం.
● మద్యం, డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా వాల్పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేసి ఓటు ప్రాధాన్యత వివరించడం.
● ఎన్నికల్లో ఓటు ఆవశ్యకతపై పోలింగ్ బూత్ స్థాయిలోని పాఠశాలలో ఆటలు, క్విజ్ పోటీలు నిర్వహించడం వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం.
● గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు, వృద్ధులకు ఓటింగ్ కోసం ఎన్నికల కమిషన్ కల్పిస్తున్న సౌకర్యాలు వివరించడం.
● దివ్యాంగులకు ర్యాంపు, ఉచిత రవాణా సౌకర్యాలు కల్పించడం.
● వయోవృద్ధులు, పదవి విరమణ పొందిన అధికారులు ఓటింగ్ ఆవశ్యకతను తెలిపే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం వంటి పనులు ఉంటాయి.
ఎన్నికల నిర్వహణలో బ్లాగ్ విధులు
ఓటు హక్కుపై ఓటర్లకు అవగాహన
ప్రలోభాల కట్టడికి పకడ్బందీ చర్యలు